
లక్ష్మణశాస్త్రీయం
ప్రాప్తం (కథ)
రచన: నిడదవోలు మాలతి
గళం: లక్ష్మణశాస్త్రి
నూకాలుకు ఉత్తరంవచ్చింది. అదెక్కడి నుంచో దానికి తెలుసు. కాని అందులో ఏముందో తెలుసుకోవాలి. మేడమీద గదిలో అమ్మాయి ఒక్కతే ఉండే సమయం చూసుకుని నూకాలు చీపురు తీసుకుని అక్కడికి వెళ్ళింది.
“నీకో వందమార్లు చెప్పేను ఆలా చీపురు కట్ట పుచ్చుకుని నామీదకి దండెత్తొద్దని. నేను లేనప్పుడొచ్చి తుడిచి వెళ్ళిపోలేవూ?” కసురుకుందా అమ్మాయి.
నూకాలుకు అమ్మాయిగారి కసుర్లూ, విసుర్తూ అలవాటే. అందుకే అది “పోన్లెండమ్మా. రేపట్నుంచి అనాగే మీర్లేనపుడే తుడిసేసెల్లి పోతాను” అంది కుర్చీ, బెంచీ, మంచం అటూ ఇటూ లాగేస్తూ పనిమంతురాలైన ఇల్లాలి ఒడుపుతో.
“నీ మొహం కాదూ, రోజూ యిలాగే అంటావు” అంది అమ్మాయి కోపంగా. “ఆ కుర్చీయిటువేపు వెయ్యి. ఎక్కడి వక్కడ ఉంచవు కదా!”
అమ్మాయికి అందుకే కోపం. నూకలు గది తుడవడానికొచ్చిందంటే అది వెళ్ళే వేళకు దక్షయజ్ఞ వాటికలా చేసి పెడుతుంది.
“అమ్మాయ్ గోరూ!” మొహం అంతా నిండుగా నవ్వుతూ “ఇది సదివి సెప్పరూ?” అంది కొంగు ముడి విప్పుతూ.
“ఏవిటది?”
ఉసిరికాయంత కొంగుముడి జాగ్రత్తగా విప్పి ఉండగా అయిపోయిన కార్డు అమ్మాయి చేతిలో పెట్టింది.
“అఘోరించినట్టే ఉంది. దీనికేవైనా ఆకారఁవూ, అర్ధవూ ఉంచేవా?” అందా ఆమ్మాయి ఆ కార్డు ఉండ విప్పి సాపు చెయ్యడానికి ప్రయత్నిస్తూ.
నూకాలు నాలుక్కొరుక్కుంది.
“తొమ్మిదో తారీకు సింహాద్రి యింటికొస్తున్నాడుట. రెండు రోజులుంటాడుట.”
“తొమ్మిదా?” అంది నూకాలు ఒక నిమిషం ఆలోచించి.
‘‘ఊఁ’’
“ఏవోరవైందండి?”
“సోమవారం”
“సోంవోరఁవా? ఇయాల సుక్కురోరం గదండీ. సుక్కురోరం, శనివారం, ఆదోరం. మూడ్రోజులున్నాయన్నమాట మద్దిన” అంది నూకాలు లెక్క పెట్టుకుంటూ, బుగ్గన చూపుడు వేలుంచి.
చెక్కిన రాతిబొమ్మలా ఉంటుంది అనుకుంది అమ్మాయి దాన్ని చూసి.
“రెండేళ్ళయింది. వాడు మిలిటరీలో చేరిపోయి. రెండేళ్ళు ఉన్నదానివి మూడు రోజులు ఉండలేవుటే?” అంది ఆమ్మాయి నవ్వి.
ఆ అమ్మాయి నవ్వితే బాగుంటుంది, రాణీలాగుంటుంది అనుకుంది నూకాలు. “ఎన్ని గంటలకి వస్తాడండీ?” అంది మాట మార్చి.
“సాయంత్రం మెయిల్లో స్టేషన్ కి వెళ్తావా?”
“ఎందుకండీ ఆడికేటి యిల్లు తెల్దనా? నేకపోతే టేసినుకాడి కొచ్చినోడు యింటికి రాడనా?” అంది నూకాలు మొహం పక్కకు తిప్పుకుని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ. అబ్బాయి గారు అదెక్కడ్నుంచో విమానంలో వచ్చినప్పుడు స్నేహితురాళ్ళకు కాఫీ ఇప్పించడం, అమ్మాయి గారు బొంబాయి వెళ్ళడం దానికి తెలుసు.
అమ్మాయిక్కోపం వచ్చింది. “కబుర్లు కట్టిపెట్టి పని చూసుకో. వేగిరం వెళ్ళు ఫో” అంది.
నూకాలు నిప్పులమీద నడుస్తున్నట్టు పరుగెడుతూ ఇల్లు చేరింది, వీధి కొసనుంచే “అత్తా…. అత్తా !……” అని కేకలేస్తూ..
ఎల్లమ్మ నులక మంచమ్మీద పడుకుని కునుకుతూంది. ఎల్లమ్మ పని చెయ్యదు. అది పెద్ద మేస్త్రీ భార్య. మిలిట్రీలో ఉద్యోగం కొడుక్కి. “నానెందుకు పని సెయ్యాలా?” అంటుంది దర్జాగా.
“అత్తా! నీ కొడుకొస్తాడంట” అంది నూకాలు పొంగిపోతూ.
“నిజఁవే? ఎప్పుడు? ఎప్పుడొస్తాడు?
ఎప్పుడు ……..” ముసలిదాని ఆనందానికి హద్దుల్లేవు.
“సోఁవారం. సోఁవారం వొస్తాడంట. ఇంకా మూడ్రోజులుంది…..”
ఎల్లమ్మ గబా గబా అవతలికి వెళ్ళిపోయింది ఎమర్జెన్సీ న్యూస్ బులెటిన్ లో ప్రసారం చెయ్యడానికీ వార్త. నూకాలొక్కర్తీ మిగిలిపోయింది ఆ చుట్టు గుడిసెలో.
‘రెండేళ్ళమట్టి నానొక్కదాన్నే గందా!’ అనుకుంది ఆలోచనగా. సోంవారం వస్తాడట. అమ్మగారు పండుక్కిచ్చిన చిలకాకు పచ్చకోకున్నాది. అమ్మాయిగారు కుట్టు సరిగ్గా లేదని యిచ్చీసిన ఎర్ర జాకట్టున్నాది. పచ్చకోక కట్టుకుని, ఎర్ర జాకిట్టు యేసుకుంటే “సిలక నాగున్నావే” అన్నాడోపాలి. ఆడి మనసుకి నచ్చినట్టు సెయ్యాల. రెండు రోజులే ఉంటాడంట. ఆ రెండ్రోజులు సేసినయి మల్లీ సెలవొచ్చీ వరకూ గేపకం ఉండాల. అమ్మగార్ని జీతంలో యిరగ్గోసుకోమని బతిఁవలాడితే ఓ రూపాయిత్తారు. సెజ్జ బూర్లొండుతా. సెజ్జ బూర్లంటే పడిసత్తాడు. రాఁవుడుగోరి అప్పమ్మ నడగాల ఓ పోటేసి పెట్టమని. రొండు రోకల్లాడితే గాని నలిగి సావవ్….
“అట్టా సూత్తూండిపోయినావేటి? నీల్లొట్రా” అని ఎల్లమ్మ అరిచేవరకు నూకాలు ఈ లోకంలో లేదు. ఉలిక్కిపడి బిందె తీసుకుని వీధి కొళాయివేపు నడిచింది. ఎల్లమ్మచేసిన ప్రసారం అందరికీ అందిందేమో దారి పొడుగునా అందరూ అడుగుతూనే ఉన్నారు “సిఁవాద్రి వొస్తాడంట?” అని. నూకాలు గంగ డోలులా తలూపుతూనే ఉంది. దానికి నోట మాట రావడం లేదు!
వస్తుందొస్తుందనుకున్న సోమవారం రానే వచ్చింది. నూకాలూ, ఎల్లమ్మా నూర్పిళ్ళప్పుడు చేసేంత హడావిడి చేస్తున్నారు. ఆదివారం సంతలో సజ్జలూ, బెల్లం కొనుక్కొచ్చింది నూకాలు అమ్మగారి దగ్గర అప్పు పుచ్చుకుని.
“ముంతలో మూడు రూపాయిలు దాచినాను. సన్నబియ్యం వొట్రా. నా కొడుకు ఆ దబ్బనాల్లాటి బియ్యం తిన్నేడు” అంది ఎల్లమ్మ.
“మరేఁ! మిలట్రీలో ఆడికి సన్నబియ్యం కూడూ ఆవుపాలూ యేసి యెడతారు?” అంది నూకాలు ఎత్తి పొడుపుగా.
‘‘నీ పెడసరం బుద్ది ఆడొచ్చే అణచాల అంది ఎల్లమ్మ కసిగా’’.
‘‘రానీ’’ అంది నూకాలు. అంతలోనే ఎదలో ముల్లయి తగిలింది ఏదో. “రానీ….రానీ….” అంది మెల్లిగా తనలో తను గొణుక్కుంటున్నట్టు.
“సువ్వీ సువ్వీ పోటేత్తే ఏనాటికి నలిగేను! యెయ్ దబదబ నాలుగు పోట్లు.” కసురుకుంది అప్పమ్మ, వీధి వేపు దృష్టి ఉంచి రోకలాడిస్తున్న నూకాల్ని.
“అదిగాదే ఆడొచ్చినట్టుంటేనూ…” అంది నూకాలు క్షమార్పణ చెప్పుకుంటూ.
“తోటకూరగాదూ! సాయంతరేఁల బండికి మజ్జానవే వచ్చేసినట్టుందా?” అరిచింది అప్పమ్మ.
నూకాలు ఊపిరి తెచ్చుకుని “ఉస్….ఉస్” అంటూ పోటయ్య సాగింది, ఒక్కొక్క పోటూ సోలర్ బూటులా వినిపిస్తుంటే. లోపల ఎల్లమ్మ పొయ్యి రాజేసి మూకుడు పొయ్యిమీద పెట్టింది. నూకాలికి జ్ఞానం తెలిసేక అత్తని పొయ్యిదగ్గర చూడడం దానికిదే మొదలు. ‘మరి కొడుకు…..’ అనుకుంది. ఈపాటి అదృష్టానికి మాఁవెప్పుడూ నోచుకోలేదు మరి. దానికి సన్నగా నవ్వొచ్చింది.
“నువ్వలా ముసి ముసి నవ్వు నవ్ కుంటా కూసో నేఁ పోతా” అంది. అప్పమ్మ అస్త్ర సన్యాసం చేస్తూ.
“నేదులే. రా, రా. రెండు పోట్లేస్తే అయి పోతాది” అంది వెనక్కుంచిన బెల్లపుముక్క కూడా పడేస్తూ. బూరెలపిండి అత్తకిచ్చేసి మళ్ళీ అమ్మగారింటికి పరుగెత్తింది నూకాలు. అమ్మగారు చిటపట లాడేరు “ఇంకా ఒంటిగంటేనా కాలేదు. అంట్లు తోమేసి వెళ్ళిపోతే మళ్ళీ కాఫీ గిన్నెలుండిపోవూ? అవి నేను కూచుని కడుక్కోనా?” అంటూ.
నూకాలు పరిదీన వదనయై నిలుచుండిపోయింది. “కాదమ్మగోరూ! ఇంటికాడ సిన్న పనుంది యియాల” అంది.
“ఇవాళ సింహాద్రి వస్తాడమ్మా” అంది వాళ్ళమ్మాయి, ఆ ఒక్క ముక్కలోనూ పూర్వాపరాలు విశదం చేస్తూ.
“సరేలే. ఏదో వేళప్పుడొచ్చి ఆ కాఫీ గిన్నెలు కడిగేసి పో” అందావిడ దయదలిచి.
నూకాలు సంతోషంగా “సరేనండీ” అనేసి మళ్ళీ పాపుగంటలో ఇంటిదారి పట్టింది. సగం దారి వెళ్ళేసరికి దానికి జ్ఞాపకం వచ్చిందేమో మళ్ళీ వెనక్కొచ్చింది.
“అమ్మాయ్ గారూ!” అంది. తలుపు చాటునుంచి.
చదువుకుంటున్న అమ్మాయిగారు తలెత్తి చూశారు, “ఏం?” అని.
“రొండు సంపెంగ పూలు కోస్కుంటానండి” అంది ఆశగా. అమ్మాయి చిరాకు ప్రదర్శించింది. “నీ కెప్పుడూ నా సంపెంగ చెట్టు మీదే కళ్ళు. కావలిస్తే కొనుక్కో కూడదూ?”
“ఒక్క రోజేనండి. బజార్లో ఐతే వోడి పోయుంటాయండి” అంది దీనంగా.
“సరేలే” అంటూ తను పొద్దున్నే కోసి సాయంత్రం పెట్టుకోడానికని దాచుకున్న దండ దానిమీదికి విసిరింది. నూకాలు మురిసిపోతూ ఆ దండ అందుకుని మళ్ళీ ఇంటివేపు పరుగు పెట్టింది. దాని మనసు ఇవాళ దాట్ల గుర్రంలా ఉరకలు పెడుతూంది.
ఇంటిదగ్గర చాలామటుకు ఎల్లమ్మ వంట పూర్తి చేసింది. కాని నూకాలుకు సంతృప్తి కలగలేదు. మళ్ళీ మళ్ళీ చూడసాగింది ఒక్కొక్కటే. అరకోడి కూర చేసింది. చేపలపులుసు చేసింది. అమ్మగారు రెండు రోజుల క్రిందట ఇచ్చిన ఊరగాయ ముక్క జాగ్రత్తగా దాచి పెట్టింది. సన్నబియ్యం అన్నం మల్లె పువ్వులా వార్చింది.
‘మూడు రోజులు రెయిల్లోనే అవుతాదంట. ఎప్పుడు తిని ఉంటాడో? రెయిల్లో ఏటి దొరుకుతాది. సాంబారు అన్నం పొట్లాలు ఆల్లే కలిపి కడతారంట. నేకపోతే కారేజీ పుచ్చుకుంటే రూపాయీ ముప్పైయైదు పైసలు పుచ్చుకుని రొండు మెతుకు లెడతార్ట అని బాధ పడింది. “పోనీ, ఇంకేదేనా చేదునా? అని మనసు పీకింది. దండు జజారులో ఓ బేడ బంగాళదుంపలు తీసుకొచ్చి వేపుడు చేస్తేనో? అని మనసు ఉవ్విళ్ళూరింది. చూరులో పెట్టిన డబ్బీలోంచి ఓ బేడ తీసుకుని, ‘‘నే నిప్పుడే వొస్తా. వొంట సూస్తుండు” అంటూ అత్తకు పురమాయించి నూకాలు దండు బజారువేపు మాయమైంది.
“ఎక్కడికే యిప్పుడు?” అంటున్న ఎల్లమ్మ మాటకు అది జవాబు చెప్పనేలేదు.
పది నిమిషాల్లో నూకాలు బజార్నుంచి బంగాళాదుంపలు తేవడం, కూర చెయ్యడం అన్నీ ముగించింది. పెద్దాసుపత్రి గంట స్తంభంలో మూడు చూపించేవేళకు కనీసం ఆరు మార్లైనా వీధి చివరదాకా వెళ్ళి వచ్చివుంటుంది. రైళ్ళు రోజూ ఆలస్యంగా వస్తాయిగదా, ఒక్క రోజు ఓ గంటముందు రాకూడదూ అనిపించింది. కాలు కాలిన పిల్లిలా అది రంగులరాట్నంలా తిరుగుతుంటే ఎల్లమ్మ నవ్వుకుంది. “యీది సివర్దాకా వొచ్చినోడు యింటికి రాడంటే? అట్టా తిరుగు తున్నావు?” అంది.
నూకాలు కోపోద్దృతంచేత మాటాడలేదు. మళ్ళీ వీధి చివరిదాకా వెళ్ళి అక్కడున్న రిక్షావాణ్ణి అడిగింది — “అన్నా, మేలుబండి ఇంకా రానేదా?” అని.
“నేదప్పా! గంటన్నర నేటంట” అన్నాడు రిక్షావాడు దిక్కులు చూస్తూ.
‘‘శ ఎదవ బల్లు” అని తిట్టుకుంది కసిగా. గంటన్నర తరవాత అదే చోట మరో రిక్షావాడు మేలుబండి వచ్చి వెళ్ళిపోయిందని చెప్పాడు నూకాలికి. సింహాద్రి వచ్చిన జాడమటుకు లేదు.
మేనకోడల్ని వేళాకోళం చేసిన ఎల్లమ్మ కూడా కొడుక్కోసం వీధి చివరిదాకా వెళ్ళి చూసి రాకుండా ఉండలేకపోయింది. ఉస్సురనుకుంటూ ఎందుకు రాలేదో ఊహించడానికి ప్రయత్నిస్తూ గుడిసె ప్రవేశించిన వాళ్ళిద్దరికీ ఓర ఒంపుగా ఉన్న తడిక తోసుకుని లోపలికి వెళ్ళి సుష్టుగా విందు ఆరగించి వస్తున్న ఓ గ్రామసింహం ఎదురైంది. నూకాలికి గానీ, ఎల్లమ్మకి గానీ ఆ ఊర కుక్కను కొట్టాలనిపించ లేదు. తడిగుడ్డలో చుట్టిన సంపెంగ పూవులు వాడిపోయి మొహం వేలవేసేయి. నూకాలు కొత్త చీరె నలిగిపోయింది. “
మర్నాడు దాని మొహం చూసి, “రాలేదేమిటే?” అంది ఇంటి వాళ్ళమ్మాయి.
“నేదండి” అంది నూకాలు నిరామయంగా. ఆ రోజు కూడా మధ్యాహ్నం ఊర కుక్క విందు కొచ్చింది. వాళ్ళ గుడిసెకు. తన కోసం కాచుకొన్న గంజి దానికి పోసి చూస్తూ, కూచుండిపోయింది నూకాలు.
ఆ రాత్రి ఎవరో పిలిచినట్టయి ఉలిక్కిపడి లేచింది నూకాలు. “ఎవురేఁ?” అంది ఆ పిలుపుకే మేల్కొన్న ఎల్లమ్మ.
“ఎవురది?” అంది. నూకాలు అత్తమాట యాంత్రికంగా ప్రతిధ్వనిస్తూ.
“నే నేనే” అన్నాడు సింహాద్రి లోపలికొస్తూ.
“వుప్పుడేడ్నుంచి? ఇంత రేత్తిరి?” అంది నూకాలు ప్రముత్తురాలై , అప్పుడు రాత్రి రెండున్నర అయింది.
సింహాద్రి ఎల్లమ్మ మంచం దండెమీద కూచుని బూట్లు విప్పుతూ, “పాసింజర్లో వొచ్చినా. లేటయింది. ఎదవ బండి. నాటుబండి నయం దానికన్నా” అన్నాడు.
“అవ్ తే నిన్ననెందు కొచ్చినావు కావు?” అనడిగింది ఎల్లమ్మ, అంతవరకు ఆనందాతిరేకం చేత మూగవోయిన మనసు మెల్లిగా తేరుకోగా.
“నిన్నే వచ్చినా. అనకాపల్లి కాడ మావోడే ఓడు దిగాడు. ఆడితో నన్నూ దింపాడు. ‘ఒద్దురా! తరవాత వొస్తా’ అంటే యింటేనా?” అన్నాడు. తనకు అంతటి ఉదాత్తుడైన స్నేహితుడు దొరికినందుకు కించిత్ గర్వం వెలిబుచ్చుతూ.
మర్నాడు పొద్దున్న పనిలోకి వెళ్ళబోతున్న నూకాల్ని ఆపి “మా సెడ్డ ఆక లేసేస్తంది. తినడానికేటేనా పెట్టెల్లు. ఏ మజ్జాన్నం వొస్తావో?” అన్నాడు సింహాద్రి.
నూకాలు నిస్సహాయంగా చూసి పొయ్వి వెలిగించింది. నూకాలు గంజి కాచి ఉప్పేసి సింహాద్రి కందిస్తుంటే దాని కళ్ళ నీళ్ళు తిరిగేయి.
“నిన్న నువ్వొస్తావని ఏటేటో సేసింది. ‘నువ్ రానేలేదు” అంది ఎల్లమ్మ.
ఏటిస్తే ఏటుందే, అంతా నీ సేతిలో ఉందిగానీ” అన్నాడు నూకాల్తో మెల్లిగా.
“నీ మొకంలే” అన్న నూకాలు మాటలో తీవ్రతకు సింహాద్రి త్రుళ్ళిపడ్డాడు. వాడిది మిలిటరీ డిసిప్లిన్. ‘కమనీయ భూమి భాగములు లేవె పడి యుండుటకు దూది పరుపులేల’ అని పోతన్నగారు చెప్పారని వాడికి తెలీదు. కానీ వాడి అభిప్రాయం అదే!
*****
రచయిత్రి పరిచయం:
నిడదవోలు మాలతి ఏడు దశాబ్దాలుగా కథలు రాస్తున్నారు. 2001లో తూలిక.నెట్ ప్రారంభించి, మంచి కథలు ఇంగ్లీషులోకి అనువాదాలు చేసేరు.. ప్రధానంగా తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను విదేశీయులకి కథలద్వారా తెలియజేయాలన్న ఆశయంతో మొదలుపెట్టిన సైట్ అది.
2009లో తెలుగు తూలిక బ్లాగు ప్రారంభించి తమ కథలు, వ్యాసాలు, సమీక్షలు, కవితలు ప్రచురిస్తున్నారు. ఆమెసాహిత్యం ఆమెబ్లాగు www.tethulika.wordpress.comలో చూడవచ్చు. కథాసంకలనాలు, వ్యాససంకలనాలు అన్నీ తెలుగు తూలిక బ్లాగులో e-Book formatలో ఉచితంగా లభ్యం. .
స్వాతంత్ర్యానంతరం, తెలుగు రచయిత్రులు అసామాన్యమైన ప్రాముఖ్యం సంపాదించుకున్నారు. ఆ ప్రాముఖ్యతకి వెనుక గల సాహిత్య, సామాజిక, ఆర్థిక, కౌటుంబిక పరిస్థితులను విశ్లేషిస్తూ రాసిన పుస్తకం. Women writers, 1950-1975. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ.
*****

పేరు లక్ష్మణశాస్త్రి, పుట్టింది పెరిగింది కాకినాడ.
చదివింది గురుకుల పాఠశాల తాడికొండ, తరువాత కొన్ని యూజీలు, పీజీలు, ఇంకా వేలకొద్దీ పేజీలూ.
వృత్తి LIC of india లో అధికారిగా.
చక్కటి సంగీతమూ, సాహిత్యమూ బలమూ, బలహీనతానూ.
సహజంగా హృద్యంగా వుంది కథ. రచయిత మాలతి గారికి వినిపించిన లక్ష్మణ శాస్త్రి గారికి అభినందనలు.
మంచి కథను రాసిన మాలతి గారికి, చక్కగా చదివిన లక్ష్మణ శాస్త్రి గారికి అభినందనలు
ధన్వవాదాలు వరలక్ష్మి గారూ
ముగింపు ఈ కధని ఎన్నో మెట్ల పైకి చేర్చింది మాలతిగారు. నూకాలూ, ఎల్లమ్మ, సింహాద్రి స్వచ్చమైన మనసున్న పాత్రలు. అభినందనలతో.. డా. సిహెచ్.సుశీల.
ధన్యవాదాలు సుశీలగారూ
హృద్యంగమంగా నాకథ వినిపించిన లక్ష్మశాస్త్రిగారికీ, ప్రచురించిన గీతా మాధవి కళగారికి కృతజ్ఞతలు.