
ఆకాశమంత శ్వాస
-డా||కె.గీత
నా చిట్టితల్లీ!
ప్రాపంచిక బాధలర్థం కాని
నువ్వు యావత్ప్రపంచానికే యువరాణివి-
లేకపోతే
ఐచ్ఛిక పనులకూ
నువ్వు పనికిరావని
మట్టిబెడ్డలా
విసిరేస్తున్న సమాజాన్ని
నీ జ్ఞానం సరిపోదని
వంకరగా తలతిప్పుతున్న లోకాన్ని
ముద్దబంతి నవ్వుతో
ఎలా అర్థం చేసుకోగలవు?
సెల్ ఫోను నంబరు కంఠతా రాదనో
ఈ-మెయిల్ ఐడీ రాయలేవనో
అమ్మ తోడున్నా
నీకు పనివ్వనన్న
గొప్ప ప్రపంచానికి సమాధానంగా
వెన్నెల విరబూసిన జాబిలమ్మలా
‘థాంక్యూ’ అన్నావు చూడు
నీ లోకాన్ని అర్థం చేసుకోలేని
ఈ లోకపు పనులు నీకక్కరలేదు
అన్నట్టు
గంభీర మార్తాండునిలా
‘మరేం ఫర్వాలేదు’ అని
మర్యాద పూర్వకంగా
వెనక్కి మరలేవు చూడు
అక్కడే నువ్వు గెలిచేవు-
ఏ సిండ్రోమూ
లేదనుకున్న
లోకపు కఠినత్వం
నీకు లేదు
నిన్ను మందబుద్ధిగా
ముద్రవేసిన
బుద్ధిమాలిన్యం
నీకు లేదు
నీకున్న వెన్నలాంటి
ప్రేమ ఈ లోకంలోనే లేదు
నీలా నిజం తప్ప
అబద్ధం చేతకాని
స్వచ్ఛత ఎక్కడా లేదు
ఏ ప్రత్యేకతా లేని
ఈ పాడులోకానికి
అమ్మతోడుగా చెప్పు
చిట్టితల్లీ!
పదిహేనేళ్లొచ్చినా
పసి రెక్కల చిన్నారి తూనీగవి
నీకు పని చెయ్యాలనిపించడమే
ఒక గొప్ప పని అని-
నువ్వు పనిచెయ్యడానికి
ముందుకు రావడమే
ఒక విప్లవమని-
నువ్వు అర్థం చేసుకున్నంత
సులభంగా
నిన్నర్థం చేసుకోని
లోకాన్ని చూసి
నీలాకాశమంత శ్వాసతో
గుండె నిండా స్వచ్ఛంగా
పగలబడి
నవ్వాలని ఉందిరా నాన్నా!
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023), అనగనగా అమెరికా (కాలమ్స్)(2025) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.

