
క్రిమి సమ్మారం
-డా||కె.గీత
క్రిమి సమ్మారవంటన్నారు ఏటి బాబయ్యా!
ఈగలకి ఇసనకర్రలు
దోవలకి కిరసనాయిలు
ఎలకలకి ఎలకలమందు
పందికొక్కుకి ఎండిసేప ఎరా
సీవలకి సీనా
సెదలకి పొగ
వాపుకి సున్నం
పుండుకి కారం
తేలు కుట్టినా, పాం కుట్టినా
సెరువు కాపరి మంత్రం
జొరవొచ్చినా, జబ్బు సేసినా
పీరుసాయెబు తాయెత్తూనండి
పూనకానికి యేపమండా
దెయ్యానికి దెబ్బలూనండి
పొద్దల్లా సేలో
కాళ్లని ఏళ్లాడే జెలగలకి పొగాకు ఉమ్ము
మేకల్ని తరివే తోడేలుకి ఉండేలు దెబ్బ
పిట్టలకి వొడిసి రాళ్లు
పందులుకి ఈటె పోట్లు
పొగులూ, మాపులూ
క్రిమి సమ్మారవేనండి-
ఇప్పుడు ఆరడుగుల దూరవంటన్నారు
ఊరూరూ తిరిగేవోళ్లం
ఎప్పుడూ ఊరికీ మాకూ
ఆరు కోసుల దూరవేనండి
ముక్కుకి గుడ్డలంటన్నారు
వొంటి నిండా గుడ్డలేయి బాబయ్యా
ఓ సబ్బు ముక్కుంటే
సేతులేం కర్మ ఒళ్లంతా తోంకుంటాం
రకతాలు కారతన్న పాదాలకి
సెప్పుల జతుంటే
పేణాలు ఈడ్సుకుంటా గూడేనికి సేరుతాం
ఇంతెందుకు
మడిసిని మడిసిగా సూడని
“క్రిమి”ని సమ్మారం సేసే
మందేవైనా ఉంటే
అందరికీ ఇప్పించండి బాబయ్యా!
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
