
కంప్యూటర్ భాషగా తెలుగు
-డా|| కె. గీత
ప్రపంచ భాషల్లో కంప్యూటర్ పరంగా గొప్ప వృద్ధిని సాధించిన భాషల దిక్కుగా తెలుగు భాష గత దశాబ్ది కాలంగా వేగంగా ప్రయాణం సాగించడం చెప్పుకోదగిన విషయమే కాదు, తెలీనివారందరూ తెలుసుకోదగిన విషయం కూడా. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని తెలుగులో కమ్యూనికేషను అందరికీ అవసరమైన యుగంలో ఉన్న మనకు తెలుగు భాష ని కంప్యూటరీకరించడం వెనుక దాగున్న అనేక ఆసక్తికర అంశాల్ని పరిచయం చేస్తే బావుణ్ణన్న చిన్న సంకల్పమే ఇది.
ఇక నా గురించి చెప్పాలంటే విజ్ఞానం అత్యంత పరిణతి సాధించిన, ముఖ్యంగా కంప్యూటర్ రంగం దినదినాభివృద్ధి పొంది, అందరికీ అందుబాటులోకి వచ్చిన 21 వ శతాబ్దం లో పుట్టడం నా అదృష్టం గా భావిస్తాను. అంతే కాదు నేను పాత , కొత్త తరాల ప్రతినిధిని కూడా. అంటే రాత ప్రతులు, టైపు మిషన్లు , కంప్యూటర్ల వరకూ తెలుగు భాష చేసిన సుదీర్ఘమైన ప్రయాణంలో నేనూ భాగస్వామురాలిగా ప్రయాణించే అరుదైన అవకాశం నాకు లభించింది. భాషా శాస్త్రం పట్ల నాకు మక్కువ కలగడానికి కారణం చిన్నతనం నించీ ఇతర భాషల పట్ల, లిపుల పట్లా ఉన్నా ఆసక్తీ, అభినివేశం అంకురార్పణ కాగా, తొంభైల దశకం నుండీ తెలుగు సాహిత్యం, భాషా శాస్త్రం రెండు కళ్లుగా సాగిన నా విద్యాభ్యాసం దోహదపడింది. భాషా శాస్త్రంలో పరమ పట్ట భద్రురాలిగా, నిత్య విద్యార్థినిగా, కంప్యూటర్ రంగంలో ప్రపంచంలోనే మొదటి స్థానాల్లో ఉన్న కార్పొరేట్ కంపెనీలకు తెలుగు భాషా నిపుణురాలిగా నా ప్రస్థానం, నిత్య జీవితం “తెలుగు భాష- కంప్యూటరీకరణ” కు సంబంధించిన వ్యాసాలు రాయడానికి బలం, ప్రోద్బలం కలిగిస్తున్నాయి.
వచ్చే నెల నుండీ నెచ్చెలిలో నెల నెలా ఒక్కొక్క విభాగాన్ని వీలైనంత విశదంగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. భాషా శాస్త్ర ప్రేమికులకు, తెలుగు కంప్యూటరు రంగంలో పనిచేస్తున్న వారికే కాకుండా, తెలుగు భాషలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్న ఎందరికో ఈ ప్రయత్నం ఉపయోగపడగలదని ఆశిస్తూ-
-మీ
కె.గీత
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.



తెలుసు కోవాలని ఆసక్తిగా ఉందండి.
రామ్ గారూ! మీరు ఆసక్తి చూపుతున్నందుకు అనేక నెనర్లు.
చాల బాగుంది
నేను మెంబర్ షిప్ తీసుకోవచ్చా??
ద్రోణం రాజు గారూ ! నెచ్చెలి పత్రిక మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మెంబర్ షిప్ వంటివి ఏమీ లేవండీ. ఎప్పుడంటే అప్పుడు ఫ్రీగా చదువుకోవచ్చు.
మీరు చేస్తున్న సాహిత్య సేవలు వర్థమాన తరాలకు స్ఫూర్తిదాయకంగా ప్రయోగాత్మకంగా నిలుస్తాయని అనడంలో అతిశయోక్తి లేదు. ఆ దేవదేవుడు మీకు సంకల్పబలాన్ని ఆయురారోగ్య యశోభాగ్యాలతో తెలుగు భాషకు వెలుగులు అద్దే శక్తి ఇవ్వాలి అని భాషాభివందనములతో మీ ముఖపుస్తక మిత్రుడు పి.శ్రీహరిరావు.కవిటి,సాక్షి విలేఖరి.శ్రీకాకుళం
శ్రీహరి రావు గారూ! మీ అభిమానానికి, శుభాకాంక్షలకు ధన్యవాదాలు.
చాలా సంతోషం. ఎదురుచూస్తుంటామమ్మా..
చాలా థాంక్స్ లక్ష్మి గారూ!
Good efforts.
Congratulations
Thank you so much Anil garu!