దేవి చౌధురాణి

(రెండవ భాగం)

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

          వర్ష ఋతువు. రాత్రి వేళ. అయితే ఈ రాత్రి వర్షం లేదు. పౌర్ణమి వెన్నెల, మరీ అంత ప్రకాశవంతమైన వెన్నెల కాదు. సన్నని పొగ మంచుతో కూడిన స్వప్నలోకాన్ని తలపించే ఒక చక్కని చల్లని వెన్నెల రాత్రి.

          దూరాన వున్న కొండల పైన కురిసిన వర్షంతో నది వరద స్థాయికి చేరుకుని నిండుగా ప్రవహిస్తోంది. ఆ నదీ తరంగాల మీద చంద్రికలు నాట్యమాడుతూ మెరిపిస్తు న్నాయి. నది ఒడ్డున పెరుగుతున్న చెట్ల నీడలు చిమ్మ చీకట్లతో నింపుతున్నాయి. నది ఒడ్డును ఒరుసుకుంటు తరంగాలు కిలకిలలాడుతూ నవ్వులతో నింపుతున్నాయి. నది మాత్రం తన గమ్యం సాగరుడే అన్నట్లు వడిగా, నిండుగా ప్రవహిస్తున్నది.

          ఒడ్డుకి దగ్గరగా ఒక నావకు లంగరు వేసి వున్నది. ఒడ్డున వున్న చెట్ల నీడలలో, చీకట్లో ఒక నాగతరి వున్నది. ఇది నాగముఖంతో, సన్నగా పొడవుగా ఒక అరవై మంది యోధులు ఒక్కసారిగా తెడ్డు వేస్తుంటే వేగంగా దాడి చేయగల పడవ. ఆ నాగతరి మీదా, ఒడ్డు పైనా, యోధులు కొంత మంది నిద్రపోతున్నారు. ఈ పడవ గురించి తరువాత చెప్పుకుందాము, ముందు ఆ నావ గురించి చెబుతాను.

          నావ చుట్టూ చక్కని బొమ్మలు వేసి వున్నాయి. ముందు భాగాన ఒక సొర చేప నోరు తెరుచుకుని వేటకు సిద్ధమవుతున్నట్లుగా వున్న బొమ్మ గిల్టు రంగుల కోరలతో మెరుస్తున్నది వుంది. తెడ్డు వెసేటప్పుడు జారిపోకుండా పట్టుకునే ఇత్తడి ఒరుసు కొక్కీలు ఆ వెన్నలలో నిగ నిగలాడుతున్నవి. నావ ఉపరితలం (deck) శుభ్రంగా వున్నది. ఓ ప్రక్క దించిన తెరచాప ఒక గట్టి వెదురుబొంగుకు వేలాడుతున్నది. దాని క్రింద కూడా బలిష్టమైన యువకలు కొంత మంది నిద్రపోతున్నారు. నావ ఉపరితలం పై చెక్కతో చేసిన డాబా కట్టడము వుంది. ఆ కట్టడము పైకప్పు సమతలంగా చెక్కలతో చేసి, చక్కగా అలంకరించి వుంది. ఆ కప్పు పైన ఓ స్త్రీ మూర్తి కనబడుతున్నది.

          మంచె మీద ఒక తివాచి పరచి వుంది. ఆ పైన ఒక మెత్తని బాలీసు. ఆ బాలీసు మీద కూర్చుని ఒక లలిత సుందర స్త్రీ మూర్తి వీణ మీటుతున్నది. అంత వయసు మీద పడిన స్త్రీ కాదు, అలాగని యువతి కూడా కాదు. సన్నగానూ లేదూ, అంత లావుగానూ లేదు. ఆ నది వలె నిండుగా, సంపూర్ణంగా వున్నది. పొడవరే, కానీ ముఖము లో ప్రశాంతత వున్నది, లాలిత్యం కూడా వున్నది. గాంభీర్యత కూడా వున్నది.

          నదిలాగానే ఆ స్త్రీ కూడా వెన్నెలలో మెరుస్తూ వున్నది. బంగారపు జరీ, ముత్యాల బుటా పూలు అల్లిన ఢాకా సిల్కు చీర కట్టుకున్నది. ఆమె కురులు నది వడ్డును తాకుతున్న చిక్కని చీకటి ఛాయలు పడుతున్న తరంగములవలె తరళుతూ ఆమె నడుముని చేరుతున్నాయి. తలకొప్పుపై ఒక మల్లె దండ కిరీటమై సువాసనలతో విరాజిల్లుతున్నది. 

          ఆ రమణీయ మూర్తి తివాచి మీద కూర్చుని వీణ మీటుతున్నది. సాక్షాత్తూ సరస్వతీ దేవిని తలపిస్తున్నది. ఏ రాగమో నేను చెప్పలేను. ఒకసారి ఆలాపనగా,  ఇంకొకసారి మృదుమధురంగా,  మరొకసారి కఠోరంగా, వేరొకసారి అలజడిగా, కొనసారిగా ఆ వీణే నాట్యమాడుతున్నట్లుగా వున్నది. అది ఏ రాగం? మధురంగా వుండే కాంభోజి రాగమా, లేక సింధు రాగమా? వ్యధతో కూడిన కేదారమా, హంబీరమా, బేహగ రాగమా? లేక గంభీరమైన కానడ రాగమా, సహనా లేక భాగేశ్వరినా? చెప్పలేను. కానీ, ఆ స్త్రీ మూర్తి మృదువుగా వీణ మీటుతూనే వున్నది.

          ఉన్నట్లుండి ఆ స్త్రీ మూర్తి కర్ణ కుండలాలు కంపించాయి, ఆవిడ కురులు నాగినిలవలె నాట్యమాడాయి. నటరాగిణి రాగం వీణపై పలికింది, తాళ తంత్రులు వడిగా, వాడిగ వినబడుతున్నాయి. ఆ తాళం పోరుకు పరిగెడుతున్న సైనికుల అడుగుల చప్పుడులాగా వున్నది.

          ఆ రాగానికి చుక్కాని కర్ర దగ్గర ప్రశాంతముగా నిద్రపోతున్న ఒక యోధుడు మేల్కొని పైకి వచ్చాడు. దృఢంగా వున్నాడు, గడ్డము పెరిగి రెండు వంపులతో వున్నది. జంధ్యం వేసుకుని వున్నాడు, కావున బ్రాహ్మణుడే.

          “కనబడినదా?” అడిగింది ఆ స్త్రీ.

          “లేదు, వాళ్లు వస్తున్నారా?” అన్నాడు ఆ యువకుడు.

          తన ప్రక్కన తివాచీ పై వున్న దూరదర్శినిని తీసి ఆ యోధుడికి ఇచ్చింది. అతను ఒక కంటికి పెట్టుకుని దూరాన నదిని పరిశీలించి “కనపడుతున్నారు” అన్నాడు.

          “ఈ సమయంలో నావలు రావటం గురించి మనకు కబురు చేరలేదు.”

          ఆ యోధుడు నదినీ, ఆ నావనూ పరిశిలిస్తూనే వున్నాడు.

          ఆ స్త్రీ వీణ మృదువుగా మీటుతూనే వున్నది.

          “రంగరాజూ …”

          “మీ ఆజ్ఞ?”

          “ఏమి చూస్తున్నావు?”

          “నావపై ఎంత మంది వున్నారో లెక్కపెడుతున్నాను.”

          “ఎంతమంది?”

          “ఖచ్చితంగా తెలవటం లేదు, ఎక్కువ మంది లేరు. నాగతరికి కట్టిన త్రాళ్లను విడదీయమంటారా?”

          “అవును, శబ్దం చెయ్యకుండా వెళ్లండి.”

          రంగరాజు నాగతరిని వదలమని నెమ్మదిగా ఆదేశించాడు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.