‘రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికినా దొరకదు’ అన్న శ్రీ శ్రీ మాటలకు నిదర్శనం ఈ కవితా సంపుటి. అస్పష్టతకు జడిసి కవితలకు దూరంగా ఉండే నన్ను కూడా చదివించాయి ఈ కవితలు. ప్రపంచంలో ఏ మూల చూసినా బలవంతుల దౌర్జన్యాలూ, బలహీనుల ఆక్రందనలూ, అబలలపై అత్యాచారాలే ఉన్నాయనీ, ‘నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధి కెక్కారనీ వీటిద్వారా మనం
తెలుసుకుంటాం.
19 దేశాల, 24 భాషల, 84 మంది కవుల, 90 కవితలను సరళంగా తెలుగు చేశారు ఎన్. వేణుగోపాల్.
“అనువాదకుడిగా నాకు మాత్రం కవితానువాదం ఒక అద్భుతమైన, సంతృప్తి కరమైన, సార్థకమైనదనిపించే అనుభవం. అనువాదం ద్వారా పరభాషా కవిత్వంతో, కవితో, ఆ నేపథ్యంతో కలిగిన సంబంధం, సంభాషణ, సంవాదం, కొత్త ఎరుక ఒక గొప్ప అనుభవం” అని ఆయనే చెప్పుకున్న మాటలకు అక్షరదర్పణం ఈ కవితా సంపుటి.
దేశం మారవచ్చు, భాష మారవచ్చు, వ్యక్తీకరణ కూడా మారవచ్చు. కానీ బాధాసర్పదష్టుల భావం మాత్రం ఒకటే అని ఈ కవితలు చదివితే అర్ధమవుతుంది.
దేశానికి వెన్నెముక అంటూనే రైతుని వెన్నుపోటు పొడిచే చట్టాలను తెస్తున్నా రని ఆవేదన వ్యక్టం చేశారు మళయాళకవి కె. సచ్చిదానందన్ “ ముక్త కంఠం’ లో
“భూమిని దున్నేది మేంమేమే భూమి/విత్తనాలు నాటేది మేం/విత్తనాలమూ మేమే/మా నాగేటిచాళ్ల లోనే/ అనాది దేవత ఉదయించింది/మా కనుబొమల చెమట చుక్కలోనే తొలి గీతం ఫలించింది/ వంగిపోయిన మా వీపుల మీదనే/ మొట్టమొదటి శిల్పం ఆకృతి పొందింది/ ఆకలికి మాడిన మా కడుపుల మీదా/ ఎముకల మీదా మొట్టమొదటి రాజభవనం నిర్మితమైంది/ లోకం ఆకలిని తీర్చిన మా చేతుల్ని ఇవాళ ఆకలి మొద్దుబార్చింది/ తమ సంపద దాచుకునేందుకు/ ఎలుకలు మా గాదెల్ని స్వంతం చేసుకున్నాయి. ప్రపంచానికి వెచ్చదనం అందించిన మా హృదయాల్ని/ పేదరికపు కాటు నిరుత్సాహంలో ముంచేసింది’ అంటారు.
‘హస్తభూషణం’ అనిపించుకున్న పుస్తకం ఈనాడు అల్మరాలలో బందీ అయిందని, పఠనాన్ని ఆస్వాదిస్తూ గడిపిన క్షణాలను ఇప్పుడు కంప్యూటర్లు ఆక్రమించాయని చెబుతూ గుల్జార్ ఉర్దూ కవిత ‘పుస్తకాలు’ లో
‘తాళాలేసిన బీరువా అద్దాలలోంచి ఎన్నెన్నో కోర్కెలతో
ఆశలతో తొంగిచూస్తుంటాయి
పుస్తకాలు కలయికలు లేక చాలా కాలమయిందని
కలిసి గడిపిన ఆ సాయంకాలాలు అరుదై
జారిపోయి ఇప్పుడు కంప్యూటర్ తెరలకు అతుక్కుపోయాయి’
అంటారు.
మనిషి తన స్వభావానికి తగినట్టుగా జీవించలేకపోతున్నాడు. తను తయారు చేసిన పనిముట్లకు తానే బానిస అవుతున్నాడు. ఈ పరాయీకరణ గురించి ప్రస్తావిస్తూ
“మనిషి “పనిముట్టుగానో, సంఖ్యగానో, గొలుసుగానో కాక
మనిషిగా బతకాలని
నువు ప్రకటిస్తావు తక్షణమే వాళ్లు నీ చేతులకు సంకెళ్లు బిగిస్తారు
నీకు నిర్బంధించబడే స్వేచ్ఛ ఉంది
నీకు జైల్లో పెట్టబడే స్వేచ్ఛ ఉంది
నీకు ఉరి తీయబడడానికి కూడ స్వేచ్ఛ ఉంది”
అంటాడు ‘ విషాద స్వేచ్ఛ’ కవితలో టర్కిష్ మహాకవి నాజిమ్ హిక్మత్
ఈ సంపుటిలోని చాలా కవితలకు వ్యాఖ్యానం అవసరం లేదు. వర్తమానంలో స్త్రీలపై జరిగే పైశాచిక దాడిని సీమా ఆజాద్ ప్రతిభావంతంగా వ్యక్తం చేశాడు.
“నువ్వొక కశ్మీరీ స్త్రీవైతే దేశభక్తి కోసం నీ మీద అత్యాచారం జరగవచ్చు/ బలాత్కరించినవారి సమర్థనలో త్రివర్ణ పతాకమూ ఎగరవచ్చు/నువ్వొక మణిపురి స్త్రీవైతే/ ఏడుగురు అక్కచెల్లెళ్ల దేశపు కూతురివైతే/ నిన్ను బంధించి పెట్టొచ్చు/ నీ యోనిలోకి/ తుపాకి గుండ్లు కాల్చవచ్చు/నువ్వొక ఆదివాసి స్త్రీవైతే/ నీ యోనిలో
రాళ్లు కుక్కవచ్చు/ నీ స్తనాలను కోసిపారెయ్యొచ్చు/ నలిపి పారెయ్యొచ్చు నువ్వొక ముస్లిం స్త్రీవైతే/ అప్పుడిక శ్మశానంలో కూడ నీకు రక్షణ లేదు/ అత్యాచారం జరపడం కోసం/ ఎప్పుడైనా/ నీ మృతదేహాన్ని తవ్వి తీయవచ్చు. ..
నువ్వెవరివైనా కానీ స్త్రీవైతే చాలు/ వ్యవస్థ గురిచూసే లక్ష్యానివై పోతావుఅంటారు హిందీ కవి సీమా ఆజాద్ ‘ నువ్వు స్త్రీవైతే’ అనే కవితలో.
‘బందూకుతో భావాలను అణిచేయగలమనే అజ్ఞానులను హెచ్చరిస్తూ
‘ నీ తుపాకీ కన్న బలమైనవి నా ఆశయాలు/ ‘ పిరికిపంద హంతకుడా/ నేను, గౌరీ లంకేష్ ను. అంటారు విమల్ భాయి. ‘ఇంకా బతికే ఉన్నాను’ లో
‘ఎవరి చాయ్ అమ్మేవాడివి నువ్వు?’ అంటూ బ్రజ్ రంజన్ మణి రాసిన కవిత ముంజేతి కంకణం లాంటిది. వ్యాఖ్యాన దర్పణం ఎదుకు?
ఆదివాసీల విషయంలో నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే మనస్తత్వాన్ని తెలిపే కవిత గోరఖ్ పూర్ కవి కృష్ణ పల్లవి కవిత ‘ నియంత చేసేదేమిటి?’
లక్షలాది మంది మనుషులను అడవి నుంచి వెళ్లగొట్టి/ ‘వేలాది మందిని బలిపీఠం ఎక్కించి గురిచూసి/ అపుడిక నియంత/ కొందరు ఆదివాసులను రాజధానికి ఆహ్వానిస్తాడు/ కొమ్ముల శిరస్త్రాణాలూ, నిలువెత్తు ఆదివాసి దుస్తులూ ధరించి/ వారితో కలిసి నాట్యమాడతాడు నగారా మోగిస్తాడు. …..లక్షలాది మంది పిల్లలను అనాథలను చేశాక/ కొందరు పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగరేస్తాడు
మనుషుల స్వేచ్చకు సంకెళ్ళు వేయడంపై ఉర్దూ కవి జావేద్ అఖ్తర్ ‘కొత్త శాసనాలు’ అనే కవితలో ఇలా వ్యక్తీకరించారు.
“ ఎవరో కొత్త శాసనం విధించారు
వీచే గాలులన్నీ
ఇక నుంచి మొట్టమొదట
తమ దిశ ఏమిటో తెలియజేయాలట!
అంతేకాదు, తమ పయనం
ఎంత వేగంతోనో కూడ చెప్పాలట!
ఏమంటే, ఇక తుపానులకు అనుమతి లేదట!
మేం నిర్మించిన ఇసుకభవంతులనూ
కట్టుకున్న ఈ పేకమేడలనూ కాపాడుకోవడమే ముఖ్యం గదా
తుపానులకూ పేకమేడలకూ చుక్కెదురని అందరికీ తెలుసు
ఎవరో కొత్త ఆజ్ఞలు ప్రకటించారు
నదిలోపలి అలలన్నీ తమ తిరుగుబాటును అణచుకోవాలట!
హద్దులలోపలే తిరుగాడాలట!
ఇకనుంచి పూలన్నీ ఒకే ఒక్క రంగులో పూయాలట!
రేపటి తోటలు ఎలా వికసించాలో ఇక
అధికారులే నిర్ణయిస్తారట!
……………………………
గాలులూ అలలూ ఎవరి మాటా ఎప్పుడూ వినవని వారికెట్లా చెప్పాలి?” అంటాడు
కాషాయీకరణ గురించి మనీష్ ఆజాద్ ‘చీమల దండు’ కవితలో
‘ఒకరోజు రాజుగారు ఒక ప్రకటన చేశారు
ఆయనకు ఒకే ఒక్క రంగు ఇష్టమట
మిగిలిన రంగులన్నీ దేశం వదిలి వెళ్లిపోవాలట
లేదా ఊదా రంగు పులుముకోవాలట” అంటాడు.
మంగ్లేష్ డబ్రాల్ హిందీ కవిత ‘ వర్ణమాల’ లో
ఒక భాషలో అ అక్షరం రాద్దామనుకుంటాను
అ నుంచి అమ్మ అ నుంచి అందం
కాని రాయడం మొదలు పెట్టేసరికి
అ నుంచి అనర్థం, అత్యాచారం’ వచ్చాయంటాడు.
లాల్టూ హర్జిందర్ ‘ ఇది ఆ ఫాసిజం కాదు’ అనే హిందీ కవితలో
‘ రాజ్యాంగం మరోసారి మార్చే బాధ్యతను
అదానీ అంబానీలకు ప్రజలే అప్పగిస్తారు
ఐ టి సెల్ లో కోకా కోలా మాదక ద్రవ్యాలు అధికారం చలాయిస్తాయి’
ఇంకా ‘వర్ణమాల’ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘ ఆ గుడిలో దేవుడు లేడు’ మళయాళ కవి అజ్మల్ ‘ నా పేరు రాసుకో, నేను భారతీయుడిని’ ఉరుగ్వే కవి ఎదువార్డో గలియనో ‘ ప్రపంచభయం’ నికరాగువన్ కవి
‘ నేను కోరేది శాంతి గనుకనే ఈ యుద్ధం’ అనే కవితల సమకాలీన ప్రాపంచిక సమస్యలకు దర్పణాలే. వివిధ భాషల కవితలు కాబట్టి పాఠకులకు సందేహాలకు తావులేకుండా 17 ఫుట్ నోట్లు ఇచ్చారు.
సమాజ ప్రగతిని కాంక్షిచే కవితా ప్రియులు చదవాల్సిన కవితాసంపుటి ‘ నా ఆయుధం కవిత్వమే’
ప్రచురణ:
స్వేచ్ఛా సాహితి
హైదరాబాద్.
*****