
ప్రమద
లేడి సింగం – కిరణ్ బేడీ
-నీరజ వింజామరం
1970లోనే ఢిల్లీ ట్రాఫిక్ మానవ సహనానికి పరీక్ష. కానాట్ ప్లేస్ లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తన ట్రాఫిక్ ఆఫీసర్ తో రేడియోలో మాట్లాడుతూ, “మేడం! ఓ వాహనం నిషేధిత ప్రదేశంలో పార్క్ అయింది. కాని ఇది ప్రభుత్వ నంబర్ ప్లేట్ ఉన్న ప్రత్యేక కారు. ఇది ప్రధాన మంత్రి గారి వాహనం అని డ్రైవర్ అంటున్నాడు.” అని చెప్పాడు .
ట్రాఫిక్ ఆఫీసర్ వెంటనే అతని వద్దకు వచ్చి గంభీరంగా “ఎవరి కారు అయినా సరే, చట్టం అందరికీ ఒకటే. క్రేన్ కు కాల్ చేయండి.” అని ఆదేశించింది.
ఈ సంఘటన ఒక చిన్న నిబంధనను ఉల్లంఘించినట్టు అనిపించవచ్చు. కానీ దేశ ప్రధానమంత్రికి చెందిన వాహనంపై చర్య తీసుకోవడం చిన్న విషయం కాదు. ఆ ఘటన కొద్ది గంటల్లోనే అధికార వర్గాల దృష్టికి వెళ్లింది. కొంతమంది పోలీస్ ఉన్నతాధి కారులు, రాజకీయ నాయకులు కూడా ట్రాఫిక్ ఆఫీసర్ పై ఒత్తిడి తెచ్చారు.
“ఇది ప్రధాని వాహనం అని తెలియదా?”
“మీరు ఇది చేయడం కరెక్టేనా?”
“ఇందుకు మీరు క్షమాపణ చెప్పాలి.” – ఇలాంటి మాటలు వినిపించాయి.
కానీ ఆ ట్రాఫిక్ ఆఫీసర్ తలవంచలేదు. ఆమె స్పష్టంగా చెప్పారు: “ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించేలా చేయడం అనేది నా డ్యూటి . నేను నా డ్యూటి చేశాను. అది ఎవరి కారు అన్నది ముఖ్యం కాదు.”
ఆ ట్రాఫిక్ ఆఫీసర్ మరెవరో కాదు, క్రేన్ బేడీ అని ముద్దు పేరుతో పిలవబడిన కిరణ్ బేడీ. భారతదేశంలోమొట్టమొదటి మహిళా IPS. భారతదేశంలో మహిళా పోలీసు అధికారిణుల గురించి ప్రస్తావించినప్పుడు, చాలా మందికి వెంటనే గుర్తుకు వచ్చే పేరు కిరణ్ బేడి. కేవలం పోలీసు అధికారే కాకుండా, ఆమె ఒక విప్లవాత్మక ఆలోచనా పరురాలు, సమాజసేవకురాలు,రచయిత్రి, ,ఎంతో మందికి ప్రేరణ. ఆమెను “భారత ఉక్కు మహిళ” (India ‘Iron Lady’) , “లేడీ సింగం” అని కూడా పిలుస్తారు.
1949 జూన్ 9న పంజాబ్ లోని అమృత్ సర్ లో కిరణ్ బేడి (కిరణ్ పేశ్వారియా) జన్మించారు. వ్యాపార కుటుంబంలో జన్మించిన ఆమె తండ్రి ప్రకాష్ లాల్ పేశ్వారియా టెన్నిస్ ప్రియుడు. చిన్ననాటి నుంచే కష్టపడే తత్వాన్ని అలవరచుకున్న కిరణ్, 9 ఏళ్ల వయసు నుంచే టెన్నిస్ ఆడటం ప్రారంభించారు. తన తండ్రి ప్రోత్సాహంతో ఆమె ఈ క్రీడలో రాణించారు. జాతీయ స్థాయిలో 17 ఏళ్ల వయసులో నేషనల్ జూనియర్
లాన్ టెన్నిస్ ఛాంపియన్ గా నిలిచారు. 1972లో ఏషియన్ లాన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ తో సహా అనేక ట్రోఫీలు గెలుచుకున్నారు. 1976లో నేషనల్ ఉమెన్స్ లాన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకోవడం ఆమె అతిపెద్ద విజయం. ఆమె 30 ఏళ్ల వయసు వరకు టెన్నిస్ ఆడటం కొనసాగించారు.
విద్యారంగంలో కూడా కిరణ్ బేడి అద్భుత ప్రతిభ కనబరిచారు. అమృత్ సర్ లోని సేక్రేడ్ హార్ట్ కాన్వెంట్ స్కూల్ లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత అమృత్ సర్ లోని ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి ఇంగ్లీష్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ,,పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. పోలీసు సర్వీస్ లో చేరడానికి ముందు, ఆమె అమృత్ సర్ లో ని ఖల్సా మహిళా
కళాశాలలో లెక్చరర్ గా పనిచేశారు. మానవ హక్కులపై పీహెచ్ డీ కూడా పూర్తి చేశారు.
అమృత్ సర్ లోని సర్వీస్ క్లబ్ లో సీనియర్ సివిల్ సర్వెంట్లతో తరచూ సంభాషించడం ద్వారా ప్రభుత్వ సేవలో చేరాలనే ఆకాంక్ష ఆమెలో బలపడింది. 1972 జులై 16న, ఆమె ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) లో చేరి చరిత్ర సృష్టించారు. భారతదేశంలో ఈ ప్రతిష్టాత్మక సర్వీస్ లో చేరిన మొట్టమొదటి మహిళగా ఆమె
నిలిచారు. ముస్సోరీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో శిక్షణ పొందిన ఆమె, 80 మంది పురుషుల బ్యాచ్ లో ఏకైక మహిళ. 1975లో అసిస్టెంట్ సూపరింటెం డెంట్ ఆఫ్ పోలీస్ (ASP) గా ఆమె తన కెరీర్ ను ప్రారంభించారు. అప్పుడే ఇందిరా గాంధీ కాన్వాయ్ లోని కారును ట్రాఫిక్ ఉల్లంఘన కింద క్రేన్ తో తొలగించి దేశవ్యాప్తంగా అందరి దృష్టి లో పడ్డారు.
1978 నవంబర్ 15న ఢిల్లీలో నిరంకారీలు, అకాలీల మధ్య జరిగిన ఘర్షణల సందర్భంగా, ఆమె డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ గా నిరసనకారులను అదుపు చేయడంలో ధైర్యం ప్రదర్శించారు. వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉన్నప్పటికీ, లాఠీఛార్జ్ చేసి శాంతిని నెలకొల్పారు. ఈ వీరోచిత ప్రదర్శనకుగాను ఆమెకు 1979లో రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ లభించింది.
1979లో ఢిల్లీలోని వెస్ట్ డిస్ట్రిక్ట్ కు బదిలీ అయినప్పుడు, ఆ ప్రాంతం అధిక నేర కార్యకలాపాలు, మహిళలపై లైంగిక వేధింపులతో అట్టుడికిపోతోంది. పోలీసు అధికారు లు తక్కువగా ఉండటంతో, ఆమె పౌరుల సహకారాన్ని తీసుకున్నారు. ప్రతి గ్రామంలో ఆరుగురు వాలంటీర్లతో కూడిన బృందాన్ని ఒక సాయుధ పోలీసు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆమె ఓపెన్ డోర్ పాలసీని అమలు చేసి, నేరాల గురించి అజ్ఞాతంగా
నివేదించడాన్ని ప్రోత్సహించారు. మూడు నెలల్లోనే నేరాల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కనిపించింది.
1986లో నార్త్ ఢిల్లీ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ గా, ఆమె డ్రగ్ దుర్వినియోగం సమస్యను ఎదుర్కొన్నారు. దీనిపై పోరాడటానికి, ఆమె 16 మంది ఇతర పోలీసు అధికారులతో కలిసి నవజ్యోతి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. పోలీసు ప్రాంగణాల్లో డి-అడిక్షన్ కేంద్రాలను ప్రారంభించి, డ్రగ్ బానిసల పునరావాసం, వీధి బాలల విద్య, మహిళా డ్రగ్ పెడ్లర్లకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా విస్తరించింది. 2007లో దీనిని నవజ్యోతి ఇండియా ఫౌండేషన్ గా పేరు మార్చారు.
గోవాలో పనిచేస్తున్నప్పుడు, జువారీ వంతెన నిర్మాణం పూర్తయినప్పటికీ, ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభోత్సవం కోసం ఎదురుచూడాల్సి రావడంతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. సమస్యను తెలుసుకున్న బేడి, స్వయంగా వెళ్లి అడ్డంకు లను తొలగించి, ప్రజల రాకపోకల కోసం వంతెనను తెరిచారు.
ఈ చర్య రాజకీయ నాయకులకు నచ్చలేదు. లాయర్ల సమ్మె సందర్భంగా జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించి ఆమె కొన్ని ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారు, వీటిపై విచారణలు జరిగాయి.
1993 మేలో కిరణ్ బేడిని తిహార్ జైలు ఇన్ స్పెక్టర్ జనరల్ (IG) గా నియమిం చారు. ఇది భారతదేశంలోనే అత్యంత అపఖ్యాతి గాంచిన జైలు. ఇక్కడ 2500 మంది ఖైదీలకు బదులుగా దాదాపు 9000 మంది ఉన్నారు. సరైన వసతులు, నిధులు లేక, హింసాత్మక సంఘటనలతో అస్తవ్యస్తంగా ఉన్న తిహార్ ను ఆదర్శ జైలుగా మార్చాలని ఆమె సంకల్పించారు. తిహార్ లో ఆమె అనేక విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఖైదీలకు వృత్తి శిక్షణ, విద్య, యోగా, ధ్యానం నేర్పించారు . క్రీడలు, ప్రార్థనలు, పండుగలు అందరూ కలిసి జరుపుకునేలా ప్రోత్సహించారు. డి- అడిక్షన్ కేంద్రం స్థాపించారు. జైలు ప్రాంగణంలో బేకరీ, వడ్రంగి, నేత యూనిట్లు వంటి చిన్న పరిశ్రమలు స్థాపించి, వాటి ద్వారా వచ్చిన లాభాలను ఖైదీల సంక్షేమ నిధికి జమ చేశారు. NGOలు, పాఠశాలలు, పౌరులు, మాజీ ఖైదీలతో సహా బయటి వారి భాగస్వా మ్యాన్ని ప్రోత్సహించారు. ఖైదీల ఫిర్యాదులను నేరుగా తెలుసుకోవడానికి పిటిషన్ బాక్సులు ఏర్పాటు చేశారు. ఈ సంస్కరణల ఫలితంగా జైలులో గొడవలు, అల్లర్లు తగ్గాయి. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది. తిహార్ జైలు చరిత్రలో ఈ కాలాన్ని స్వర్ణ యుగంగా అభివర్ణిస్తారు. ఈ కృషికిగాను ఆమెకు 1994లో రామన్ మెగసెసే అవార్డు (ఆసియా నోబెల్) లభించింది . ఈ అవార్డు సొమ్ముతో ఆమె ఇండియా విజన్ ఫౌండేషన్ స్థాపించారు.
2003 జనవరిలో, కిరణ్ బేడిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కు సివిలియన్ పోలీస్ అడ్వైజర్ గా నియమించారు. ప్రపంచంలో ఈ పదవిని అలంకరించిన మొట్టమొదటి మహిళ కిరణ్ బేడీ. అంతర్జాతీయ స్థాయిలో అనుభవం పొందడానికి ఆమె ఈ అవకాశాన్ని అంగీకరించారు. శాంతి పరిరక్షణ విభాగంలో ఆమె సేవలందిం చారు. 2005లో ఐరాసలో తన పనిని ముగించుకొని ఢిల్లీకి తిరిగి వచ్చారు. 35 ఏళ్ల నిబద్ధతతో కూడిన సేవ తర్వాత, కిరణ్ బేడి 2007 నవంబర్ 27న పోలీసు సర్వీస్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. విద్యా , సామాజిక సేవపై దృష్టి సారించడానికి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
పదవీ విరమణ తర్వాత, ఆమె సమాజ సేవలో మరింతగా నిమగ్నమయ్యారు. ఇండియా విజన్ ఫౌండేషన్ (1994) , నవజ్యోతి ఇండియా ఫౌండేషన్ (2007) ద్వారా ఆమె జైలు సంస్కరణలు, మహిళా సాధికారత, విద్య, డ్రగ్ బానిసల పునరావాసం వంటి అనేక రంగాలలో పనిచేశారు. ఇండియా విజన్ ఫౌండేషన్ ద్వారా వందలాది జైళ్లలో సంస్కరణ కార్యక్రమాలు చేపట్టి, ఖైదీలకు విద్య, వృత్తి నైపుణ్యాలు, కౌన్సిలింగ్, పునరావాసం అందిస్తున్నారు. వారి లక్ష్యం “తదుపరి బాధితుడిని కాపాడటం”
2011లో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ (IAC) గ్రూప్ లో భాగమయ్యారు. జన లోక్ పాల్ బిల్లు అమలు కోసం ఆందోళనలు నిర్వహించారు. ఉద్యమ సమయంలో ఆమె కూడా అరెస్ట్ అయ్యారు, కానీ అదే రోజు విడుదలయ్యారు. అయితే, రాజకీయ పార్టీ స్థాపనపై విభేదాలతో అరవింద్ కేజ్రీవాల్ వర్గం ఆమ్ ఆద్మీ
పార్టీని స్థాపించిన తర్వాత ఆమె IAC నుంచి విడిపోయారు.
2015లో భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. 2016 మే 22న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితుల య్యారు. లెఫ్టినెంట్ గవర్నర్ గా, ఆమె రాజ్ నివాస్ ను ప్రజలకు తెరిచి “ప్రజల నివాసం”గా మార్చారు. “మిషన్ వాటర్ రిచ్ పుదుచ్చేరి”,”మిషన్ గ్రీన్ పుదుచ్చేరి” వంటి ప్రాజెక్టులు చేపట్టి, కమ్యూనిటీ భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టారు
2021 ఫిబ్రవరి 16న ఆమె లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఆమెపై కొన్ని వివాదాలు, ఆరోపణలు కూడా ఉన్నాయి, వీటిలో “కిరణ్ బేడి టేపులు” అని పిలువబడే ఒక సంఘటన కూడా ఉంది, దీనిలో ఆమె తన కుమార్తె పై నిఘా కోసం పోలీసు అధికారులను ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి . అయితే, ఆమె తన చర్య సరైనదేనని సమర్థించుకున్నారు.
కిరణ్ బేడి భారతదేశ ప్రజలకు ఎప్పటికీ ఒక ఐకాన్ , స్ఫూర్తి. ఆమెను “ఇండియాస్ మోస్ట్ అడ్మైర్డ్”, “మోస్ట్ ట్రస్టెడ్ ఉమన్ ఇన్ ఇండియా” వంటి అనేక సర్వేలలో పేర్కొన్నారు. రామన్ మెగసెసే అవార్డుతో పాటు, ఆమెకు ఇంటర్నేషనల్ ఉమన్ అవార్డు (1992), ఐక్యరాజ్యసమితి మెడల్ (2004) వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. ఆమె పన్నెండుకు పైగా పుస్తకాలు రచించారు. “బాధ్యత వహించు, భయపడకు , మార్పు కావాలి అంటే మొదట నీవు మారాలి!” అనే పాఠం ఆమె జీవితం మనకు నేర్పుతుంది. ఆమె ధైర్యం, నిజాయితీ, సేవ , నిబద్ధత ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయి. ఆమె లాంటి “ఉక్కుమనుషులు” మన సమాజానికి ఎంతో అవసరం. ఆమె జీవితం నిజంగానే ధైర్యం, నిబద్ధతకు బ్రాండ్ అంబాసడర్ . ఆమె వంటి నాయకుల వారసత్వం భారతదేశ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.
*****

నీరజ వింజామరం సెయింట్ పీటర్స్ ప్రభుత్వ ప్రాథమిక స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాను. పాటలు వినడం పుస్తకాలు చదవడం నా హాబీలు . పిల్లలంటే చాలా ఇష్టం . వంటింట్లో ప్రయోగాలు చేస్తుంటాను .