ప్రియ మిత్రులారా! అందరికీ శుభాకాంక్షలు.
ఈ నెల మనము ఘనరాగ పుష్ప గుచ్చములోని మరొక ప్రత్యేకమైన రాగం వరాళి గురించిన వివరాలు తెలుసుకుందాము. ఈ రాగం గురించిన ఒక (మూఢ?)నమ్మకం ప్రచారంలో ఉంది. ఆ వివరాలు కూడా తెలుసుకుందాం.
1300 సంవత్సరాలకు ముందే ఈ రాగం ఉండేదనీ, వరటి అనే పేరుతో సంగీత మకరందం, సంగీత రత్నాకరం, సంగీత సమయ సారం వంటి ఉద్గ్రంధాలలో లిఖించబడినదనీ, కాలక్రమేణా వరాళిగా మార్పు చెందిందనీ అభిప్రాయము. వరటి అనే ప్రదేశం ఉండేదనీ, ఆ ప్రాంతంలో పుట్టిన రాగంగా వరటి ఏర్పడిందని మరొక అభిప్రాయము. వరాళి అంటే తుమ్మెదల ఝంకారమని అర్థం కూడా ఉంది. ఈ రాగ ఆలాపన తుమ్మెదల ఝంకారం వలె ఉండటం వలన వరాళి అని పేరు వచ్చి ఉండవచ్చు. కటపయాది సూత్రానికి అనుగుణంగా గోవిందాచార్యుల వారు ఝాల అనే అక్షరాలను కలిపి 39 వ మేళకర్త ఝాలవరాళిగా మార్చారు.
ఈ రాగం ఆరోహణ అవరోహణలలో సప్త స్వరాలు కలిగి ఉండటం వలన సంపూర్ణ రాగం, 39వ మేళకర్త గా భావించబడుతుంది. ఇందులో వివాది స్వరం శుద్ధ గాంధారం ఉండటం వలన, ఆ దోష నివారణ కోసం ఆరోహణని “సగరిగమ” గా తీసుకోవటం వలన కొందరు వక్ర రాగంగా 39 వ మేళకర్త జన్యం గా భావించటం కద్దు.
ఈ రాగం ఆరోహణ అవరోహణలు ఈ కింది విధంగా ఉన్నాయి.
స గ రి గ మ ప ద ని స
స ని ద ప మ గ రి స
ఇందులో స్వరాలు షడ్జం, శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, ప్రతి మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం. గాంధారం వివాది స్వరం. ఘన రాగాలలో ఏకైక ప్రతి మధ్యమ రాగం. వక్ర సంపూర్ణ రాగం. జంట గమకాలు శోభనిస్తాయి. గమక ప్రధాన రాగం. ఈ రాగంలో ప్రతి మధ్యమం, కాకలి నిషాదం తమ స్థాయి కన్నా కొంచం హెచ్చుగా ఉండటం వలన, చ్యుత పంచమ మధ్యమం, చ్యుత షడ్జమ నిషాదంగా పేర్కొంటారు. వెంకటమఖీ ఈ మధ్యమాన్ని వరాళి మధ్యమంగా పేర్కొని, ఈ వరాళి రాగాన్ని 19 ప్రసిద్ధ రాగాలలో ఒకటిగా చేర్చారు.
ఈ రాగం కరుణ, శృంగార రసాలను చక్కగా పోషించగలదు. ఒక దివ్యమైన అనుభూతిని, వైరాగ్య భావాలను కూడా ప్రతిఫలించగలదు. గుండె, గాత్ర, చర్మ సంబంధ బాధలకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అన్ని వేళలా పాడదగినది.
సంగీత త్రిమూర్తుల రచనలు ఈ రాగానికి చక్కని పాఠాలు. ప్రత్యేకించి త్యాగయ్య గారి “కనకన రుచిరా” వరాళి రాగానికి సంగీత శాస్త్ర విద్యార్థులకు చక్కని పాఠం. త్యాగయ్యగారు వరాళి రాగంలో 17 కీర్తనలు రచించారు. వరాళి రాగంలో వివిధ వాగ్గేయకారుల రచనలు మొత్తం 434 కీర్తనలు కనుగొన్నారు.
ఈ రాగం పవర్ గూర్చి ఒక కథనం ఉంది. 15-6-1941 నాడు చిదంబర క్షేత్రం లోని సంగీత సభలో ఒక గాయకుడు వరాళి రాగంలో “ఆద్య పాదం” అనే కీర్తనని గానం చేశారట. కీర్తన పూర్తి అయ్యే సమయానికి శ్రోతలందరికీ నటరాజ స్వామియొక్క ఎత్తిపెట్టిన పాదం కదిలినట్టు కనిపించిందట. ఆ సమయంలో స్వల్ప భూప్రకంప నలు వచ్చినట్టు నిర్ధారణ అయింది. అది వరాళి రాగ ప్రభావంగా అందరూ భావించారు.
ఈ రాగాన్ని గురించిన ఒక నమ్మకము ప్రచారంలో ఉంది. గురువు శిష్యులకు ఈ రాగాన్ని నేర్పితే వారి మధ్య పొరపొచ్చాలు వస్తాయిని ఒక నమ్మకము బలంగా ఉంది. అందువలన గురువులు ఎవరు శిష్యులకు ఈ రాగం నేర్పరు. శిష్యులు తాము స్వంతముగానే నేర్చుకోవలసిన ఉంటుంది.
ఈ రాగంలో లలిత సంగీతం కానీ, సినిమా సంగీతం కానీ ఉన్నట్లు తోచలేదు. కానీ విప్రనారాయణ అనే రేడియో నాటిక కోసం బాలాంత్రపు రజనీ కాంత రావు గారు ఒక అద్భుతమైన పాటను వరాళి రాగంలో కూర్చారు. ఆ పాటను మీకోసం లింక్ ఇస్తున్నాను. ఈ పాటను అంతే అద్భుతంగా బాల మురళి గారు గానం చేసారు. అలాగే తిరుప్పావై లో ” ఆజి మజాయ్ కన్నా” అనే 4వ పాశురం కూడా వరాళి రాగంలో కూర్చబడింది.
https://youtu.be/kVsorqxVd1w?si=b8QKgnazBb-D8uOX
ఇప్పుడు కొన్ని శాస్త్రీయ రచనలు పరికిద్దాము.
శాస్త్రీయ రచనలు
- వర్ణం వనజాక్షి అట ఆర్. శ్రీనివాస్ అయ్యాంగారు
- కీర్తన కనకన రుచిరా ఆది త్యాగయ్య
3.కీర్తన భవ సన్నుతా ఆది త్యాగయ్య
- కీర్తన మామవ మీనాక్షి మిశ్రాచాపు దీక్షితులు
- కీర్తన శేషాచాలానాయకం ఆది దీక్షితులు
- కీర్తన కావావా ఆది పాపనాశనం శివన్
7 పదవర్ణం వాగధీశ్వరి ఆది మూర్తి నల్లాన్ చక్రవర్తి
కనకన రుచిరా: https://youtu.be/8BuNCqITgBs?si=iL-4o3MPWbxALyao
కావావా: https://youtu.be/Lr072Fe93vcM?si=c-8JLVgYz5FUcU0o
అన్నమాచార్య కీర్తన
- పదియారు వన్నెల సన్నిధానం శ్రీనివాస రావు
https://youtu.be/kVsorqxVd1w?si=b8QKgnazBb-D8uOX
ఇవండీ వివాది రాగం, ప్రతి మధ్యమరాగం వరాళి రాగ విశేషాలు. వచ్చేనెల మరొక ఘన రాగ విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవా మరి?