
వెనుతిరగని వెన్నెల(భాగం-71)
–డా||కె.గీత
(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)
***
జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి”కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకో మని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ల అనుమతితో పెళ్లిజరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీలో ఎమ్మే పాసయ్యి, పీ.హెచ్.డీ లో జాయినవుతుంది. శేఖర్ తో ఎన్నో రోజులు పోరాడి, చివరికి తన్మయి విడిపోతుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభుతో మళ్లీ పెళ్లి జరుగుతుంది. ప్రభుతో బాటూ అతని కుటుంబం కూడా వచ్చి చేరి, హింస మొదలవుతుంది.
***
తన్మయి కాన్వొకేషను కోసం సెలవు పెట్టేడు ప్రభు.
ప్రభుతో, పిల్లల్తో కలిసి స్నాతకోత్సవానికి వెళ్లడం ఎంతో సంతోషంగా అనిపించింది తన్మయికి.
రైలు రిజర్వేషన్లు కాగానే ఎందుకు వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో ఈ సారి ఇంట్లో తనే చెప్పింది తన్మయి.
అంతే కాదు, తనెక్కడికి వెళ్లినా బాబు తన వెంటే ఉంటాడన్న విషయమూ స్పష్టం చేసింది.
“అసలు వీళ్లందరికీ జవాబు చెప్పుకోవల్సిన అవసరం తనకేంటి? ఈ ఇంట్లో ప్రభుతో బాటూ తను కూడా సంపాదనపరురాలే. తన భర్త, పిల్లలతో తను తనకి నచ్చిన చోటికి, నచ్చిన పని మీద వెళ్లే హక్కు లేదా? అసలు తన జీవితమ్మీద, బాబు జీవితమ్మీద వీళ్ల పెత్తనం ఏవిటి?”
ఎంత వద్దనుకున్నా తలుచుకుంటుంటే గొప్ప విచారం కలుగుతూంది.
ఈ పెళ్లి అనే తప్పిదం వల్ల అప్పటిదాకా సాఫీగా సాగుతున్నవెన్నో విషయాలు తారుమారయ్యేయి.
ఒక విధంగా ఆలోచిస్తే మొదట్నించి మౌనంగా ఉండాలన్న ప్రభు అభ్యర్థనని మన్నించి తన జీవితమ్మీద, తనకి సంబంధించిన విషయాల మీద ప్రభు తరఫు వాళ్లు కలగజేసుకునే అవకాశం తనే ఇచ్చింది. మొదట్లోనే పరిధులు నిర్ణయించి ఉంటే తన విషయాలలో జోక్యం చేసుకునేవారు కాదు.
“అయినా ఇప్పటికీ మించిపోయింది లేదు. బెటర్ లేట్ దేన్ నెవ్వర్.
తనకి సంబంధించిన విషయాలు వాళ్లకు నచ్చుతాయా, నచ్చవా అన్నది తనకి ముఖ్యం కాదు. అయినా కుటుంబ విషయాలకి, తనకే సంబంధించిన విషయాలకి ఉన్న తేడా వాళ్లు అర్థం చేసుకోలేనప్పుడు విడమర్చి చెప్పాల్సిన బాధ్యత తనదే. అందుకే చెప్పింది. అయినా వింటారన్న నమ్మకం లేదు. కానీ ఎక్కడా తన ప్రయత్న లోపం ఉండకూడదు.” స్థిరంగా అనుకుని గట్టిగా ఊపిరి తీసుకుంది తన్మయి.
కానీ ఒకటి మాత్రం బాగా అర్థమైంది. ప్రభు తన వాళ్ల ముందు జవాబుదారీగా నిలబడుతున్నంత కాలం తనకీ పీడన తప్పదు. అతనిలో “వాళ్లకు తెలీకుండా పెళ్లి చేసుకోవడమన్నది ఒక ఘోర అపరాధం” అనే భావన, గిల్టీ కాన్షస్ నెస్సే వీటన్నిటికీ కారణం. దానిని మాపుకోవడం కోసమే ప్రభు వీళ్లేదడిగినా చేస్తూ వస్తున్నాడనేది స్పష్టం అవుతూంది.
ఏదేమైనా అధైర్యపడకుండా ఒక్కొక్కటీ చక్కబెట్టుకు రావాలి.
తన దురదృష్టం ఏవిటంటే ఇటువంటి విషయాలు పంచుకోవడానికి, సలహా తీసుకోవడానికి ఎవరూ లేరు. అన్నీ స్వంతంగా చక్కబరచుకోవలసిందే.
వాళ్లు ప్రభు బాధ్యతే అయినా ప్రభు సంతోషం కోసమే వాళ్ల కోసం ఏదైనా చేస్తూ వస్తోంది. వాళ్లకు తన మీద ఉన్నట్టు , తనకు వాళ్ల పట్ల వ్యతిరేకతేమీ లేదు. నిజానికి వాళ్లు తన పరిస్థితిని అర్థం చేసుకుని, మంచిగా ప్రవర్తిస్తూ ఉండి ఉంటే తాను నెత్తిన పెట్టుకుని పూజించేది వాళ్లని. తనని బాధించడం ద్వారా చేజేతులా వాళ్లే తనని దూరం చేసుకుంటున్నారు. తనకి ‘ఇల్లొక నరకం‘ అని అనిపించే పరిస్థితిని సృష్టిస్తు న్నారు.
‘జీవిత కాలంలో వాళ్ళు ఎప్పుడూ నాకు ఏమీ కారు‘ అనే భావన తనకి, విపరీత మైన ఏహ్యభావన బాబుకి మనస్సుల్లో ముద్రపడిపోయేయి ఇప్పటికే. నిజానికి వాళ్ల వల్ల తాత్కాలికంగా తనకి కలిగే మనస్తాపం వల్ల తనకి వచ్చే నష్టం కన్నా, తన మనసులోనూ, పిల్లల మనస్సుల్లోనూ వాళ్ళ పట్ల పెరిగిపోతున్న దూరం వల్ల వాళ్లకు కలిగే నష్టమే ఎక్కువ.
***
స్నాతకోత్సవానికి ప్రసిద్ధిగాంచిన సినిమా హీరోని పిలవడంతో కాన్వొకేషను హాలు బయటంతా జనం ఇసకేస్తే రాలకుండా ఉన్నారు.
స్నాతకోత్సవంలో పాల్గొని పట్టా అందుకోబోయే వారు స్టేజీకి దగ్గర్లో కూర్చోవాలి కాబట్టి తన్మయి ప్రభుని, పిల్లలని వదిలి వెళ్లక తప్పలేదు. ఇక విపరీతమైన జనం తొక్కిసలాడుకుంటూ ఉండడంతో ఇలా తమతో వచ్చిన కుటుంబ సభ్యులకు గ్యాలరీ లో కూచోవడానికి కూడా ఆహ్వాన పత్రిక ఉంటేనే లోపలికి పంపించసాగేరు.
తను లోపలికి వెళ్లకముందే విషయం గ్రహించి తన్మయి అప్పటికప్పుడు తెలుగు డిపార్టుమెంటుకి పరుగెత్తింది. అదృష్టం కొద్దీ డిపార్టుమెంటు కాన్వొకేషను హాలుకి పక్కనే ఉండడం వల్ల సరిపోయింది.
అప్పుడే బయటికి రాబోతున్న చిదంబరం మాస్టారు అప్పటికప్పుడు తన ఆహ్వాన పత్రికను తన్మయి చేతిలో పెట్టి, “అమ్మా! ఇదిగో నా ఇన్విటేషను పట్టుకెళ్లు. నేను కాన్వొకేషనుకి అటెండ్ కాకపోయినా వచ్చే నష్టం ఏవీ లేదు. దీనితో మీ వారిని, పిల్లలని తీసుకెళ్లు.” అన్నారు.
తన్మయికి ఆలోచించే వ్యవధి కూడా లేదు.
అప్రయత్నంగా ఆయన కాళ్లకి నమస్కరించింది.
తన పట్ల అత్యంత దయగల చిదంబరం మాస్టారు తన జీవితంలో తనకి లభించిన ఒక గొప్ప వరం. ఆ ఋణం తీర్చుకునే అవకాశం తనకెప్పటికైనా లభిస్తుందో లేదో.
పరుగులాంటి నడకతో కాన్వొకేషను హాలుకి చేరుకుని ముందు ప్రభుని, పిల్లల్ని లోపలికి పంపించింది. చీర పైన వేసుకున్న కాన్వొకేషను ప్రత్యేక గౌనుని సరిచేసు కుంటూ లోపలికి అడుగుపెట్టింది. విశాలమైన హాల్లో కిక్కిరిసి ఉన్న వందలాది మంది జనాన్ని చూడగానే గుండె దడదడా కొట్టుకుంది.
అదే హాల్లో జే.ఆర్.ఎఫ్ రాసింది తను. అప్పుడెప్పుడూ అసలు గమనించలేదు ఆ హాలు అంత పెద్దదని.
పట్టా పుచ్చుకోబోతున్న తన వంటి విద్యార్థులు కూచున్న వరసల్లోకి నడిచి ఖాళీగా ఉన్న చోట కూచుంది. చుట్టూ విపరీతమైన గందరగోళంగా ఉంది.
వెనక్కి తిరిగి వరసల వైపు, పైన గాలరీ వైపు చూసింది, కానీ అంత మంది జనంలో ప్రభుని, పిల్లల్ని పోల్చుకోలేకపోయింది.
జీవితంలో ఎన్నో కష్ట నష్టాలకోర్చి చేరుకున్న అత్త్యుత్తమ స్థానమది. అయినా గర్వంగా కంటే సంతృప్తి అధికంగా కలుగుతూ ఉంది. తను జీవితంలో సాధించాలను కున్నది దక్కించుకున్న గొప్ప సంతృప్తి అది.
నెరవేరిన చిరకాలపు కల! ఆ క్షణంలో గుండెల్లో పట్టరాని సంతోషం కళ్లల్లోంచి ఉబుకుతూంది. తన చుట్టూ ఇందరు పీ.హెచ్.డీ పట్టాలు పుచ్చుకునే వారి మధ్య తను కూర్చోవడమే ఎంతో గర్వకారణంగా ఉంది.
నిజానికి తల్లిని కూడా తమతో రమ్మని పిల్చింది. కానీ జ్యోతికి ప్రభుతో మాట్లాడ డమే ఇష్టం ఉండదు. ఇక తమతో రమ్మన్నా రానని చెప్పింది. తల్లిని మించిన ఆప్యాయతని కురిపించే ప్రభు తనతోనే ఉన్నా, కానీ ఆ క్షణం తల్లి తన పక్కనుంటే బావుణ్ణని ఎంతగానో అనిపించింది తన్మయికి.
ప్రభు, పిల్లలు మరెక్కడో కూర్చోవడం మనసుకి బాధ అనిపిస్తున్నా, యూనివర్సిటీ నిబంధనలకి తలవంచక తప్పలేదు.
స్టేజీ మీద ఒకరి తర్వాత ఒకరు ఇచ్చిన పది ప్రసంగాల తర్వాత డిపార్టుమెంటు ల వారీగా అసలు స్నాతకోత్సవం మొదలయ్యింది.
మొదటి పది మందికి పట్టా ప్రదానం కాగానే ప్రధాన అతిథిగా వచ్చిన హీరో గారు షూటింగు సమయం అవుతుందని నిష్క్రమించడంతో హాలు సగానికి ఖాళీ అయ్యింది.
జనం గందరగోళం తప్పడంతో అన్ని డిపార్టుమెంట్ల నించి ప్రొఫెసర్లు కూడా మెల్లగా రావడం గమనించింది తన్మయి.
మాస్టారు కూడా వస్తే బావుణ్ణని మనసారా కోరుకుంది.
తమకిచ్చిన లిస్టులోని పేరు ప్రకారం తన వంతుకి పదిహేను నిమిషాల ముందే స్టేజీ వెనక్కి చేరుకుంది.
గోల్డు మెడలిస్టు కావడం వల్ల తమ డిపార్టుమెంటు లిస్టులో తన పేరే ముందు ఉంది.
స్టేజీ మీదికి అడుగుపెడుతూనే ముందు వరసల్లోనే ఉన్న మాస్టారిని చూసి సంతోషంగా నమస్కరించింది.
యూనివర్శిటీ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్ మొ.న వారు కొలువున్న స్టేజీ మీద గవర్నర్ చేతుల మీదుగా పట్టా, గోల్డు మెడలు అందుకుంది తన్మయి.
మరపురాని ఆ ఒక్క క్షణం ప్రపంచాన్ని గెలిచిన అద్వితీయమైన క్షణం! జీవితం తో అనుక్షణం పోరాడి గెలిచిన క్షణం!!
“మిత్రమా! నాతో నిరంతరం ఉండి నన్ను గెలిపించినందుకు మన:పూర్వక ధన్యవాదాలు” అని మనస్సులోనే అజ్ఞాత మిత్రునికి ధన్యవాదాలు చెప్పుకుంది.
బయటికి రాగానే ప్రొఫెసర్లతో బాటూ, పరిచయస్తులు అనేకులు కంగ్రాట్యు లేషన్సు చెప్పసాగేరు.
తనని ఒకప్పుడు పట్టించుకోని వాళ్లు, నిరుత్సాహపరిచిన వాళ్లు కూడా దగ్గిరికి వచ్చి కంగ్రాట్యులేషన్స్ చెప్పడం గమనించింది తన్మయి.
ఒక్కసారిగా గతమంతా గిర్రున కళ్ళముందు తిరిగింది.
చదువుకుంటే ఎక్కడ తనని అధిగమిస్తుందో అని అణగదొక్కడానికి అనుక్షణం ప్రయత్నించి, చదువు మానిపించడానికి విఫలయత్నాలు చేసి, అన్ని విధాలుగా వేధించి, నిందలు మోపి, చివరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా నడిరోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన శేఖర్ దుష్టత్వం జ్ఞాపకం వచ్చింది.
ఎక్కడో చదివింది తను “సక్సెస్ ఈజ్ ది ఓన్లీ రివెంజ్” అని.
“విజయం సాధించడం అనేది పగ సాధించడంతో సమానమవునో కాదో గానీ విజయం సాధించడం వల్ల వచ్చే ఆత్మస్థయిర్యంతో పగ వల్ల మనసుని అనుక్షణం దహించి వేసే మానసిక వేదనని మాత్రం విజయవంతంగా దూరం చేసుకోవచ్చు!” అని ఆ క్షణాన అనిపించింది.
అంతలోనే మేరీ ఎదురుగా పూలగుత్తితో నడిచొస్తూ కనిపిస్తే అటుగా అడుగులు వేసింది తన్మయి.
మేరీ తన్మయిని అమాంతంగా కౌగిలించుకుని ఆత్మీయంగా తల నిమురుతూ
” అయామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ తన్మయీ! కంగ్రాట్యులేషన్స్. నీ గెలుపు ఎందరో యువతులకు స్ఫూర్తిదాయకం” అంటూ అభినందించసాగింది.
మరోవైపు నుంచి దివాకర్, అనంత, రాజులు చేతిలో స్వీటు బాక్సుతో తన వైపుగా రావడం చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. చుట్టూ ఎన్ని కష్టాలున్నా తనని అన్నిటినించి ఆదుకుని మానసిక ధైర్యాన్నిచ్చిన ఇటువంటి మిత్రులే లేకపోతే తనేమైపోయేదో!
అనంత, రాజుల్ని ప్రభుకి పరిచయం చేసింది.
అనంత ప్రభు వైపు అభినందనపూర్వకంగా చూస్తూ “చాలా సంతోషంగా ఉంది తన్మయీ! మిమ్మల్ని, మీ పిల్లల్ని చూస్తూంటే” అంటూ పాప వైపు చెయ్యి చాచగానే మీదికి దుమికిన పాపని ముద్దాడుతూ “అమ్మో అమ్మో.. ఎంత హుషారుగా ఉందో. అచ్చు నీ పోలికలే” అంది.
“అందర్నీ భోజనానికి దసపల్లాకి తీసుకువెళ్దాం” అంది తన్మయి ప్రభు దగ్గిరికి వచ్చి.
“అలాగే. నన్నడగాలా..” అని స్వయంగా తనే అందర్నీ ఆహ్వానిస్తున్న ప్రభుని, అతని వైపు మురిపెంగా చూస్తున్న తన్మయిని చూస్తూ
“నా దిష్టే తగిలేలా ఉంది. ఇద్దరూ ఇంటికెళ్ళగానే దిష్టి తీయించుకోండి. ఎంతో సంతోషంగా ఉంది తన్మయీ. అందుకే ఏది జరిగినా మన మంచికే అంటారు. ప్రభు లాంటి ఉత్తముడు నీ జీవితంలో అడుగుపెట్టడానికే ఎన్నో మలుపులు తిరిగింది నీ జీవితం. అయినా కష్టకాలంలో నిలదొక్కుకున్న నీ ధైర్యం మాత్రం అద్వితీయం. ఎందరో నిన్ను చూసి నేర్చుకోవాలి” అంది అనంత తన్మయి భుజం తడుతూ .
“నా సంగతి సరే గానీ ముందు మీ ఇద్దరికీ గవర్న్ మెంటు ఉద్యోగాలొచ్చి నందుకు మన:పూర్వక అభినందనలు” అంది తన్మయి అనంత, రాజులని అభినందిస్తూ.
అంతసేపూ బుద్ధిగా తల్లి చెయ్యి పట్టుకుని నిలబడ్డ బాబుని, అటూ ఇటూ పరుగులెడుతున్న పాపాయిని శ్రద్ధగా చూసుకుంటున్న ప్రభుని చూస్తూ మేరీ “తన్మయీ! బంగారమంటి భర్త, రత్నాల్లాంటి పిల్లలు. ప్రభువు మిమ్మల్నెప్పుడూ కాపాడతాడు. మీరంతా చల్లగా పదికాలాల పాటు ఉండాలని రోజూ నేను ప్రార్థన చేస్తూ ఉంటాను” అంది.
తన్మయి కృతజ్ఞతా పూర్వకంగా రెండు చేతులతో స్నేహితురాళ్ళిద్దరి చేతులూ పట్టుకుంది.
“అ …అంతా కలిసి కబుర్లతోనే క్క కడుపు నింపేసుకునేలా ఉన్నారు. నాకు ఆకలేస్తోంది” దివాకర్ మాటలకి నవ్వుతూ ఆటోలెక్కేరు.
ఆటోలో బాబుని ఒళ్ళో కూచోబెట్టుకుని స్నేహితురాళ్ళిద్దరి మధ్యా కూర్చుంది తన్మయి.
మగవాళ్ళందరూ మరో ఆటో ఎక్కేరు. పాపాయి ప్రభు ఒళ్ళో కూర్చుంది.
దారిలో అనంత “కరుణ ఎంత మారిపోయేడో తెలుసా నిజంగా! ఆ మధ్య భార్యా, పిల్లలతో బీచ్ రోడ్డులో కనిపించేడు. కానీ మమ్మల్ని చూసి కూడా గుర్తుపట్టనట్టు తల తిప్పుకున్నాడు. రాజు దగ్గిరికెళ్ళి పలకరించబోతే మొహం తిప్పుకుని వెళ్ళి పోయేడు. మాకు గవర్నమెంటు ఉద్యోగాలొచ్చేయని ఏడ్చే వాళ్లలో ఇతనూ చేరేడని తిట్టుకుని ఊరుకున్నాం.” అంది అనంత.
తన్మయి వినీ విననట్టు మౌనంగా ఉండిపోయింది.
“అందుకే కరుణ లాంటి కుసంస్కారులకు ఎక్కడా ఎదుగూ బొదుగూ ఉండదు. ఏదో ప్రైవేటు కాలేజీలో ఉద్యోగం వెలగబెడుతున్నాడట. అంతెందుకు దివాకర్ మమ్మల్ని పిలిచినట్టే అతన్నీ ఇవేళ రమ్మని పిలిస్తే రాను పొమ్మన్నాడట. ఏం చూసుకునే అంత పొగరు..” అని ఇంకేదో అంటున్న అనంతతో
“ఇంతకీ మీ పిల్లల గురించి చెప్పనే లేదు అనంతా” అంది మాటమారుస్తూ తన్మయి.
***
మరో రెణ్ణెల్లలో తన్మయికి డిగ్రీ కాలేజీ ప్రమోషన్ కి ఆర్డర్లు వచ్చేయి.
యూజీసీ నెట్ పాసయ్యిన వారికి డిగ్రీ కాలేజీ ప్రమోషన్ వస్తే అప్పటి వరకు ఉన్న స్టేట్ గవర్నమెంటు స్కేలు కాక యూజీసీ స్కేలు వర్తిస్తుంది. అంటే అప్పటి వరకు వస్తున్న జీతంలో రెట్టింపు వస్తుంది.
తన్మయి ఆనందానికి అవధి లేదు.
కానీ కవరు విప్పి పోస్టింగు ఇచ్చిన ఊరి పేరు చూసేసరికి ఆ ఆనందం అట్టే సేపు నిలవలేదు.
610 జీవో ప్రకారం ఆంధ్ర ప్రాంతంలో వచ్చింది పోస్టింగు. అది కూడా ఒరిస్సా బోర్డర్సులో.
“అయ్యో! నేనెలాగూ బెంగుళూరులో కొన్నాళ్లు పనిచెయ్యాల్సి వస్తూ ఉంది కాబట్టి అదేదో కర్నాటక బోర్డర్సులో వచ్చినా బావుణ్ణు.” అన్నాడు ప్రభు.
అయినా “ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిద్దాంలే. ఇప్పుడా విషయం గురించి వర్రీ కాకు. వచ్చిన మంచి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. హార్టీ కంగ్రాట్యులేషన్స్ రా” అన్నాడు.
“తనని నిరుత్సాహపరచడం ఇష్టం లేనట్లు ప్రభు పైకి అలా అంటున్నా తను దూరమైతే ఎంత బాధపడతాడో తెలుసు.” ఆలోచనలో పడింది తన్మయి.
“కానీ ఇదీ ఒకందుకు మంచిదే. అనుకోనిచోటికి మళ్లీ జీవితం మారడం వల్ల ఎన్నో విషయాలు మళ్లీ చక్కబెట్టుకోవాల్సి వచ్చినా తనకి మళ్లీ మన:శాంతిగా బతికే అవకాశం వస్తుంది. పిల్లల్ని తనకి నచ్చినట్లు పెంచుకునే అవకాశమూ కలుగుతుంది. ఒక్క ప్రభు నించి దూరంగా ఉండాల్సి వసుందన్న బాధ తప్ప మరే బాధా ఉండదు. అదీగాక ఇప్పుడు ప్రమోషన్ వదులుకున్నా 610 జీవో పూర్తిగా అమలుకాగానే తను ఎలాగూ ఆంధ్ర ప్రాంతానికి వెళ్లిపోవాల్సిందే. కాకపోతే అందుకు మరికొన్నాళ్లు సమయం పట్టొచ్చు. కానీ ఈ విషయంలో జాప్యం చెయ్యడం కుదరదు.
ప్రభు కొన్నాళ్లు హైదరాబాదులో, కొన్నాళ్లు బెంగుళూర్లో పనిచేస్తూ వారాంతాల్లోనో, సెలవుల్లోనో తన దగ్గిరికి రావాల్సి ఉంటుంది.
పిల్లల్ని చూసుకోవడానికి నాగ ఉంది కాబట్టి తనకి ఆ విషయంలో పెద్దగా ప్రాబ్లం లేదు.” ఆలోచన్లు బుర్రని దొలిచేస్తున్నాయి.
కొలీగ్స్ సలహాతో బెంగుళూరికి దగ్గరి ఆంధ్ర బోర్డర్ లో తనకు కావలసిన మరొక ప్లేస్ కు రిక్వెస్టు కోరుతూ అప్లికేషను పెట్టింది.
లెక్చరర్స్ యూనియన్ లో తెలిసిన వారితో మాట్లాడి ప్రయత్నం చెయ్యసాగింది.
ఈ విషయం ఇంట్లో చెప్పగానే అంతా పాపాయిని వొదిలి ఉండడానికి బాధపడ డం మొదలుపెట్టేరు.
తను, బాబు మాత్రమే ఉండి ఉంటే ఈ విషయం విని సంతోషించే వాళ్లేమో. కనీసం ఈ విధంగానైనా తననించి దూరంగా ఉండగలిగినందుకు.
*****
(ఇంకా ఉంది)

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.