
సస్య-10
– రావుల కిరణ్మయి
సంతోషం
(జరిగిన కథ : సస్య శ్రావణ్ ప్రోత్సాహంతో ప్రిపరేషన్ మొదలు పెట్టింది. ఆ తర్వాత…)
***
కాలం గాయాలను మార్చుతుంది అనడానికి నిదర్శనంలా సస్య , భార్గవ్ సార్ పట్ల ఏర్పరుచుకున్న అభిప్రాయాన్ని మార్చుకుంది. అపార్థాలకు తావులేని స్వచ్ఛమైన స్నేహ బంధానికి పునాది చేసింది. కానీ అనూహ్యంగా సస్య డిప్యుటేషన్ రద్దు చేయబడి తన ఒరిజినల్ స్కూల్ కి వచ్చేసింది. ఇప్పుడు భార్గవ్ సర్ తో ఫోన్లో తప్ప మాట్లాడే అవకాశం లేకుండా అయింది.
సస్య స్నేహం పెంచుకుంటున్న వారు ఇలా దూరమవడం కొంత బాధను కలిగించింది. రేపు శ్రావణ్ కూడా ఇంతేనా? మొదట విదుషీ…ఇప్పుడు భార్గవ్ ? రేపు శ్రావణేనా? ఈ ఆలోచనకు కొంత కలవరపడింది.
వీరిద్దరు వేరు శ్రావణ్ వేరు అనే భావన ఏదో మనసులో ఒక మూల తిష్ఠ వేసింది.
స్కూల్లో ప్రధానోపాధ్యాయురాలితో ఇన్ని రోజుల వ్యవధిలో జరిగిన సంగతులన్నీ పూసగుచ్చినట్టుగా చెప్పుకుంది.
విదుషి ఇంతవరకు ఫోన్ చేయకపోవడం జీర్ణించుకోలేక పోతున్నానని ఏడ్చింది.
ప్రధానోపాధ్యాయులు “ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరూ అంతే దూరం “అన్నట్టు తను కూడా నీలాంటి స్థితులనే ఎదుర్కుంటున్నదేమో! ఒక్కసారి అలా కూడా ఆలోచించచమ్మా ! అంది.
మేడమ్ ! అలా అనకండి. తనకు నా లాంటి ఇబ్బందులు ఏవి రాకూడదు. తను ఎక్కడున్నా ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి.
నాకు ఇవేమి కొత్తకాదు. కానీ తను తట్టుకోలేదు అని ఇక నుండి ఎవరితోనూ చెప్పకూడదనుకున్నది.
***
స్కూలుకు వెళ్ళిరావడం. శ్రావణ్ చెప్పే క్లాసులు వినడం బాగా అలవాటు చేసుకుంది. వేరే ఆలోచనలేవీ లేకుండా లెక్చరర్ కావాలనే లక్ష్యంపై దృష్టి పెట్టింది.
చుక్క చుక్క కలిసి సముద్రమైనట్టు ఒక్క గంట ఒక్కగంట అధ్యయనం కోసం పెంచుకుంటూ సముద్ర మంత ఆత్మవిశ్వాసంను కూడగట్టుకున్నది.
ఒకప్పుడు ఉన్న బేలతనం పోయింది.
ఖచ్చితంగా నెల రోజులు నిద్రలేని రాత్రులతో ప్రిపరేషన్ సాగించింది.
***
ఆరోజు ఎగ్జామ్ సెంటర్ కి శ్రావణ్, భార్గవ్ ఇద్దరూ వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి పంపడం కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఉదయం పేపర్ ఐస్క్రీం తిన్నంత ఈజీగా చేయగలిగింది. 2.30 గం॥ల సమయం ఎక్కువనిపించింది. గంటన్నర సమయం లోనే పూర్తి చేసింది. ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడం ఇన్విజిలేటర్ అనుమానంగా చూశాడు. కొంపదీసి ఏదైనా మాల్ ప్రాక్టీసింగ్ కేసా? అని మహిళా ఆఫీసర్లతో మరీ మరీ తనిఖీ చేయించాడు.
సస్య ఆవేశపడలేదు.
వారిని అర్థం చేసుకుంది. ఈ మధ్య కాలంలో జరిగిన లీకేజీ వ్యవహారం వారిని అలా చేయిస్తున్నదని, తనను ఇంత చురుకుగా చేసినందుకు, శ్రావణ్ ను మెచ్చుకో లేకుండా ఉండలేకపోయింది.
ఉదయంలాగే మధ్యాహ్నం సబ్జెక్ట్ పేపరు తెలుగు కూడా కదలీపాకము అయింది. సాయంత్రం ఎలా రాశావని అడిగిన శ్రావణ్ కు భార్గవ్కు కూడా ఇలాగే చెప్పింది.
మరి అందరేమిటి? నారికేళపాకం లా ఉందన్నారు అని చమత్కరించారు. ఇన్ని రోజుల శ్రమ వృధా కాదనే గట్టి నమ్మకం ఇస్తున్న ఈ సాయంత్రం నేను ఎప్పుడూ మరువబోను అని ఆనందభాష్పాలు రాల్చింది సస్య.
***
ఉదయం 4 గం॥లకే శ్రావణ్ నుండి ఫోన్ రావడం, సస్య భయపడింది. శ్రావణ్ వాళ్ళ అమ్మకు ఏమైనా సమస్యనా? అని సందేహిస్తూనే ఫోన్ ఎత్తింది.
సస్య! నేను ఒక ముఖ్యమైన పని మీద ఊరెళుతున్నాను. రావడానికి రెండు మూడు రోజులు పట్టవచ్చు. అమ్మకు తోడుగా పనమ్మాయి ఉంది. కానీ నువ్వు కూడా కాస్త తోడుగా ఉంటే నేను నా పని విజయ వంతంగాపూర్తి చేసుకొని వస్తానన్నాడు.
సరే ! అని మాత్రమే అన్నది. ఎక్కడికి, ఎందుకు లాంటి వివరాలు అడగలేదు. చెప్పే విషయాలే అయితే తనే చెప్తాడు కదా ! ఆ పూర్తి నమ్మకం వల్ల కూడా అడగ లేదు.
మూడు రోజులు అన్నవాడు వారం రోజులకు వచ్చాడు. విషయాలు చెప్పలేదు. కానీ మునుపటి కంటే కొంత ఉత్సాహం ఏదో సాధించాననే విజయగర్వం ముఖంలో స్పష్టమయింది.
కొద్దిరోజుల్లోనే జూనియర్ లెక్చరర్ రిజల్ట్స్ వచ్చాయి. టాప్ వన్ లో సస్య కొలువు కొట్టేసింది.
సస్య తన లక్ష్యం చేరిన సంతోషంతో గుండె లయ తప్పుతున్న ఉరకలు వేసే ఉత్సాహంతో గుడికి బయల్దేరుతుండగా శ్రావణ్ తను కూడా గుడికి వస్తానన్నాడు.
మీతో ఏడడుగులు నడవాలంటే అర్హత గ్రీన్ పెన్ను అన్నారు కదా ఇప్పుడు నేను ఓకేనా ? ఈ తోడు జీవితాంతం అవుతారా ?
ఏమడుగుతున్నానో తెలియని అయోమయంలోనే అడిగింది అసందర్భంగా.
ముందు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. మీరు ప్రతిదానికి దేవుని దయ అంటుంటారు కదా! అన్నాడు.
దానికి జవాబు రాకపోయినా నిరాశ చెందక ప్రశాంతంగా గుడిలో పూజాకార్య క్రమాలు ముగించింది.
శ్రావణ్ ,వెళ్ళే దారిలో కావలసినన్ని మిఠాయిలు తీసుకున్నాడు.
ముందు ఎవరికిస్తారు? అడిగాడు. శ్రావణ్.
ఇంకెవరికి ? మీకే “. గురుదేవోభవ కదా! అన్నది.
ఆహా! అంతకంటే ముందు మాతృదేవో భవ కదా ! అని అన్నారు అని నవ్వాడు.
ఇద్దరూ ఇంటికి చేరుకొని సస్య వాళ్ళ అమ్మకు తినిపించింది.
ఆమె చాలా పొంగిపోయింది. ఇంటిల్లి పాదికి కళ్ళలో దీపావళి వెలుగులు కనిపించాయి.
ఇక ఇప్పుడైనా మీకు.. అని తినిపించబోయింది. ఆ… ఆ… ఆగండాగండి. ఇంకా ముఖ్యమైన వ్యక్తి, ఉన్నారు. పదండీ ..!అని విదుషీ ఇంటికి తీసుకెళ్ళాడు..
ఇళ్ళంతా పండుగ వాతావరణం నెలకొని ఉంది. సస్య అడుగు పెట్టగానే ‘కంగ్రాచ్యులేషన్స్” అంటూ పూల వర్షం కురిసింది.
సస్య ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ స్నేహితురాలిని గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేసింది. ప్రశ్నల వర్షం కురిపిస్తూ సస్య మామూలు స్థితికి రావడానికి చాలా సమయం పట్టింది.
విదుషి , అన్నిటికీ జవాబుగా తన తల్లి గదిలోకి తీసుకువెళ్ళింది.
చాలా కాలం తరువాత అనారోగ్యం నుండి కోలుకున్న దానిలా కనిపించింది.
సస్య దగ్గరగా వెళ్ళింది.
ఆమె సైగ చేసింది.
విదుషి అందంగా ముస్తాబు చేయబడిన డబ్బా తెచ్చి కానుకగా ఇచ్చింది. తెరిచి చూసింది.
లోపల గ్రీన్ పెన్,
థాంక్యూ అంటీ ! అని మిఠాయి తినిపించిచబోయింది. ముందు నీ ఫ్రెండ్ కి తినిపించు అంది.
సస్య అయోమయంగా చూస్తుండగా…
చిన్నప్పుడు నువ్వు తాగవలసిన పాలన్నీ తాగి పెరిగిన విదుషిని ,
నేను పెట్టిన “సస్య ” అనే పేరు సార్థకమయ్యేలా మంచి భవిష్యత్తును ఇవ్వమని అడిగాను. ఎంతో ఆత్మాభిమానం గల నీవు తేరగా ఏది అంగీకరించవని తెలిసి విదుషి ఇలా నీ జీవితాశయాన్ని నిజం చేయాలని తలచింది. అందుకోసం + నా అనారోగ్యం వల్ల ఇన్నాళ్ళూ నీకు దూరంగా ఉండడం. అని చెప్పడంతో సస్య విదుషిని పొగడ కుండా ఉండలేకపోయింది.
సస్య! ఇందులో కొంత నా స్వార్ధం కూడా ఉంది. నేను సివిల్స్ ప్రిపేర్ కావాలనుకున్నాను. ఈ శ్రావణ్ నేనూ ఇద్దరం సివిల్స్ సాధించాం. అమ్మ అనారోగ్యం వల్ల నువ్వు డిస్ట్రబ్ అవుతావని చెప్పలేదు. అమ్మ కోరిక తీరాలంటే నీకు తెలియక పోవడమే మంచిదని ఇలా చేశాం. అని చెప్పడంతో సన్య మనసు తేలికయింది.
శ్రావణ్ వైపు ఆరాధనగా చూసింది, సస్య.
శ్రావణ్ కూడా. సస్యా! నిన్ను తొలిసారి చూసినప్పుడే ఫిదా అయ్యాను కానీ, అప్పుడే చెప్తే నువ్వనుకున్నది సాధించలేవని చెప్పలేదు. అంటుండగా భవిష్యత్తు అంతా సంతోషపు రంగవల్లిని దిద్దిన సంక్రాంతి ముందుగానే కనిపించింది.
కృష్ణ కుచేలుర మైత్రికి , రాధాకృష్ణుల ప్రేమకు, పరోపకారానికి ఆ జీవితాలు నిదర్శనం అయ్యాయి.
*****
(సమాప్తం)

రావుల కిరణ్మయి .తల్లిదండ్రులు అనసుర్య పుల్లచారి గార్లు.జననం హుజురాబాద్ ,తెలంగాణ.తెలుగు భాషోపధ్యాయిని.70 వరకు కథలు.100కు పైగా కవితలు.చైతన్య గీతాలు,బాలగేయాలు,వ్యాసాలు,వివిధ పత్రికలలో ప్రచురితాలు.ఔధార్యం కథా సంపుటి.జీవశ్వాస నవల.వివిధ సాహితి సంస్థల తో బహుమానాలు.ప్రశంసలు.సమాజాన్ని చైతన్య పరిచేవిధంగా రచనలు చేయడం పట్ల చదవడం పట్ల ఆసక్తి.