నిర్భయ నుంచి దిశ దాకా

సి.వనజ 

అత్యాచారాల గురించి మరొకసారి దేశవ్యాప్త చర్చకు దారితీసిన దిశపై అత్యాచారం, నిందితుల బూటకపు ఎన్ కౌంటర్ నేపథ్యంలో అత్యాచార సంస్కృతి అసలు మూలాల గురించి విశ్లేషిస్తున్నారు సి వనజ-

***

నిర్భయకి ముందు కానీ ఆ తరవాత కానీ భారత దేశంలో ఇటువంటి దారుణాలు జరగలేదని కాదు గాని ఈ రెండు సంఘటనలకి ఒక ప్రాధాన్యత ఉంది. హక్కులే కాదు బాధ్యతలు కూడా చెప్పకుండా పెంచిన, సహకారం బదులుగా పోటీ, తృప్తికి బదులుగా విజయం, త్యాగానికి బదులుగా స్వార్ధం విలువలుగా నేర్చుకుంటున్న మిల్లీనియమ్ తరాన్ని, సంపద ఎలా వచ్చినా ఫర్వాలేదు దాన్ని పోగెయ్యటాన్ని మాత్రమే విజయంగా భావిస్తూ, నేను బాగుంటే చాలు ప్రపంచం ఏమైనా ఫర్వాలేదని భావిస్తూ భద్రలోకాల్లో విహరిస్తున్న మధ్యతరగతిని చెళ్లున కొట్టిలేపిన సంఘటనలివి. రెండు సంఘటనల్లోనూ అత్యాచారానికి గురయిన వాళ్లు మధ్యతరగతికి చెందిన వాళ్లు కావటంతో అత్యంత దారుణంగా జరిగిన ఈ సంఘటనలతో ఈ రెండు వర్గాలు సహానుభూతి చెందాయి. అప్పటిదాకా దళితుల మీద, మైనారిటీల మీద జరిగిన అత్యాచారాలకి, పోలీసు స్టేషన్లలో, మిలిటరీ ఉన్న ప్రాంతాల్లో ఇంతే దారుణంగానో ఇంతకన్నా దారుణంగానో జరిగిన సంఘటనల మీద ఎప్పుడూ గొంతెత్తని వాళ్లు కూడా ఇప్పుడు రోడ్డున పడ్డారు.

కోపం, ఆవేశం, నిస్సహాయతలతో పాటు తాము ఉందనుకున్న భద్రత లేదన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయిన ఈ రెండు వర్గాలు, హింసకు ప్రతిహింస తప్పుడు విలువగా మాట్లాడే వర్గాలు కూడా ఇక్కడ మాత్రం పరిష్కారంగా ప్రతిహింసనే కోరాయి. నిర్భయ సంఘటన సమయంలో నిందితులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేసిన వాళ్లు దిశ సంఘటన సమయానికి వాళ్లను కాళ్లు, చేతులు విరిచి, వాళ్లు చేసిన హింసకు పదిరెట్లు హింసించి చంపాలని డిమాండ్ చేశారు. బహుశా దేశంలో పెరిగిపోయిన లించింగ్ సంస్కృతికి ఈ వర్గాల నుంచి ఉన్న ఒక నిశ్శబ్ద ఆమోదానికి ఇది సూచిక కావచ్చు.

ముందుగా ‘చంపెయ్యండి విరిచెయ్యండి’ అని మధ్యతరగతి అడుగుతున్న పేదల విషయం తీసుకుందాం. ఇటువంటి నేరాలకు పాలడుతున్నవాళ్లు చదువురాని పేద కుటుంబాల పిల్లలే అన్న అభిప్రాయం సమాజంలో ఉంది. దానికి తగ్గట్టే అటు నిర్భయ కేసులో, ఇటు దిశ సంఘటనలో పట్టుపడిన నిందితులు కూడా చిన్న వయసులో ఉన్న చదువు లేని పేద వర్గాల వాళ్లే. కేవలం పేద పిల్లలే ఇలాంటి నేరాలు చేస్తున్నారా? మిగిలిన పిల్లలు చెయ్యట్లేదా? అసలు ఏ పిల్లలు అయినా ఈ నేరాలు ఎందుకు చేస్తున్నారు? ఇవి అలోచించాల్సిన, అర్థం చేసుకోవాల్సిన ప్రశ్నలు.

భారత దేశంలో అధికారిక లెక్కల ప్రకారం ప్రైమరీ స్కూళ్లలో 90 శాతం మంది చేరితే (వచ్చినా రాకపోయినా ఊళ్లో ఉన్న పిల్లలనందరినీ హాజరు పట్టీలో చేర్చే ప్రాథమిక పాఠశాలల్లో) అందులో సెకండరీ స్కూలుకి చేరేసరికి అందులో దాదాపు సగం మంది బడి మానేస్తున్నారు. ఇలా బడి మానేసే పిల్లలంతా పేద పిల్లలే. సరైన బళ్లు లేక, బళ్లు ఉన్నా ఈ పిల్లల కోసం కన్సర్న్ తో పాఠాలు చెప్పే వాళ్లు లేక, ఇంట్లో పేదరికంతో గడవక, ఆడపిల్లలయితే వీటన్నిటికి తోడు బయట భద్రత లేక సరిగ్గా టీనేజ్ వచ్చేసరికి వీళ్లంతా బడి బయట ఉంటారు.

అదే సమయంలో భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి ఎవరు ఎంత డబ్బా కొట్టుకున్నా భారతీయ కుటుంబాల్లో విపరీతంగా గృహ హింస పెరిగిందన్నది ఒక వాస్తవం. ముఖ్యంగా సరళీకరణ విధానాల తర్వాత కుటుంబాల మీద విపరీతంగా ఆర్థిక పరమైన ఒత్తిడి, వలసలు పెరిగాయి. మద్యం మీద ఆధారపడి నడిచే ప్రభుత్వాలవల్ల విపరీతంగా మద్యం వాడకం, దానితో పాటు కుటుంబాల్లో హింస కూడా పెరిగింది. అయితే బ్రోకెన్ కుటుంబాలు లేదా సింగిల్ పేరెంట్ కుటుంబాలు కూడా ఎక్కువయ్యాయి.

ఈ కుటుంబాల నుంచి వచ్చి 13, 14 ఏళ్లకు బడి బయట ఉన్న పిల్లల పరిస్థితి ఏమిటి? పనిచెయ్యటానికి అవసరమైన నైపుణ్యం ఉండదు. పని చేసినా పిల్లలు కనుక అందులోనూ విపరీతమైన అధిపత్యం, దెబ్బలు, హింస ఉంటాయి. ప్రేమ, భద్రత, గౌరవం అన్నీ కరువైన ఈ పిల్లలకు తేలిగ్గా దొరికేది వెయ్యి రూపాయల స్మార్ట్ ఫోను, దాంట్లో 100 రూపాయలకి అపరిమితమైన డేటా. కాబట్టి ఇటు జెండర్ ఎడ్యుకేషన్ కానీ అటు సెక్స్ ఎడ్యుకేషన్ కానీ ఎప్పుడూ అందని వీరికి, 140 కోట్ల మందిని 4జి పేరుతో తమ స్నేహితులకు పళ్లెంలో పెట్టి ఇచ్చిన ప్రభుత్వాల పుణ్యమా అని, అతి తేలిగ్గా దొరికేది విచ్చలవిడి పోర్న్. అందులోనూ కావలసినన్ని రేప్ వీడియోలు. చిన్నప్పటినుంచీ రకరకాల హింస (అసలు పేదరికమే హింస అనుకోండి) చూసి అనుభవించిన పిల్లల్లో కొందరికి  హింస పట్ల నిర్లిప్తతతో కూడిన ఆమోదం కలిగితే, మరికొంత మందికి దూకుడుతో కూడిన హింసాతత్వం అలవడుతుంది. వాటికి తోడు, సినిమాల్లో విపరీతంగా గ్లామరైజ్ అయిన హింస, అరచేతిలో ఎప్పుడంటే అప్పుడు కనిపించే అసహజ హింసాత్మక అత్యాచార దృశ్యాలు. ఇక కావలసిందల్లా ఒక విక్టిమ్ మాత్రమే.

ఇక ఒక బిడ్డ తనకు రాజ్యాంగం ఇచ్చిన గౌరవంగా జీవించే హక్కు పొందటానికి అవసరమైన ఏ పనీ చెయ్యని ప్రభుత్వాలు ఈ పిల్లలు తప్పు చేస్తే మాత్రం మరింత కఠినంగా శిక్షించటానికి కొత్త కొత్త చట్టాలు తెస్తాయి. ఒకసారి తప్పు మీద పడితే అది నిజమో కాదో చెప్పుకునే అవకాశం కూడా దొరకని వాళ్లను ‘చంపెయ్యండి, నరికెయ్యండి’ అని అరవటం కూడా తేలిక.

అయితే కేవలం ఒక వర్గంలోనే ఇలాంటి ధోరణులున్నాయనుకుంటే పొరపాటు. ఇక మధ్యతరగతికి వద్దాం. మధ్య తరగతి కుటుంబాలు కూడా హింసాత్మక ప్రవృత్తికి ఏమీ దూరంగా లేవు. కుటుంబ వ్యవస్థ నిలబడటానికి భార్యను ఒక దెబ్బ వెయ్యటం తప్పు కాదని 90 శాతం మంది పురుషులు, 50 శాతం మంది స్త్రీలు కూడా నమ్మే దేశమిది. సమానత్వం, గౌరవం, ప్రేమ ఆధారంగా కాక, కులం, కట్నం, జాతకం ఆధారంగా ఏర్పడే కుటుంబ వ్యవస్థలో ప్రధానంగా ఉండేవి ఆధిక్యత, విధేయత. ఇందులో ఆధిపత్య ధోరణికి, అవసరమైతే దాన్ని నిలబెట్టుకోవటానికి ఏదో ఒక మోతాదులో హింసను ప్రయోగించటానికి ఆమోదం ఉంటుంది. భార్యాభర్తల మధ్యనే కాదు, తల్లితండ్రులకు పిల్లలకు మధ్య కూడా అదేరకమైన సంబంధాలు ఉంటాయి. చెప్పేవాళ్లు – వినేవాళ్లు, నిర్ణయించేవాళ్లు – ఆమోదించేవాళ్లు ఇలా పాత్రలు నిర్ణయమైన అసమాన కుటంబాల నుంచి సమానత్వ భావనను పిల్లలు నేర్చుకోవటం సాధ్యం కాదు. ఒక వేళ స్త్రీ పురుష సమానత్వం గురించి పిల్లలకు చెప్పినా ఆ కుటుంబం కుల పరమైన, ఆర్థిక పరమైన సమానత్వాన్ని పాటించకపోతే వాళ్లు సమానత్వ భావం నేర్చుకోరు సరికదా అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దాన్ని ఎలా మానిప్యులేట్ చెయ్యొచ్చో నేర్చుకుంటారు.

మరోవైపు పిల్లలకు ఉగ్గుపాలతో పాటు చూపించే హింసా దృశ్యాలు. చాలామంది పిల్లలు ఏడాది రెండేళ్లు వచ్చేసరికి టామ్ అండ్ జెర్రీ లాంటి కార్టూన్లు చూస్తుంటారు. ఈ కార్టూన్లలో అదేపనిగా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. కొట్టుకోవటం కూడా చాలా దారుణంగా. కానీ ఆ దారుణమైన కొట్టుకోవటం ఒక ఆటగా, వినోదంగా చూపిస్తారు. అది చూసీ చూసీ, పిల్లలు కొట్టుకోవటం ఒక ఆటగా భావించటం మాత్రమే కాదు దాని వల్ల వచ్చే బాధ లేదా పరిణామాల పట్ల సున్నితత్వాన్ని పోగొట్టుకుంటారు. అందుకే చాలా తరచుగా స్కూళ్లలో పెరిగిపోతున్న దుడుకు పిల్లల గురించి వింటున్నాం. టామ్ అండ్ జెర్రీలతో ప్రారంభించి చోటా భీమ్ లు కూడా చూసేశాక వాళ్లిక ఫోన్లలో, టాబ్ లలో ఆటలు మొదలు పెడతారు. ఇందులో మూడేళ్ల పై వయసు పిల్లల ఆటల్లో విల్లంబులు ఉంటే ఆ పై వయసు పిల్లల ఆటల్లో తుపాకులు ఉంటాయి. పెరిగే కొద్దీ మరింత రక్తపాతం ఉండే పబ్జీ లాంటి ఆటలు మొదలవుతాయి. ఆయుధాలను అత్యంత అలవోకగా వాడే తత్వం పిల్లలు టీనేజ్ కు వచ్చేసరికి అలవాటు అవుతుంది. అవతలి వాళ్లను చంపటం, ఆ చంపటం విజయ సూచకం కావటం తప్పు కాదని నేర్చుకుంటారు. పబ్జీ లాంటి ఆటల్లో అయితే నలుగురు జట్టుగా కలిసి అవతలి వాళ్లను చంపేస్తే సరిపోదు. తన జట్టులోనే ఉన్న మిగిలిన ముగ్గురిని కూడా చంపినప్పుడే విజేతగా మారతాడు. చంపటం మాత్రమే కాదు విజేతగా నిలవాలంటే తనతోనే ఉన్నవాళ్లను ద్రోహబుద్ధితో చంపెయ్యటం కూడా తప్పు కాదన్న విలువను నేర్చుకుంటారు.

ఇక 12, 13 ఏళ్లు వచ్చేసరికి వాళ్లకు లైంగికత పట్ల కుతూహలం మొదలవుతుంది. సెక్స్ ఎడ్యుకేషన్ ను మమ అనిపించే, జెండర్ ఎడ్యుకేషన్ ఆలోచనే లేని స్కూళ్లలో వాళ్లకు ఆ కుతూహలానికి సమాధానాలు దొరకవు. ఇళ్లలో ఎవరూ మాట్లాడరు. ఇక ఈ పిల్లలు కూడా స్కూలు బయట ఉన్న పిల్లలు ఫోన్లలో ఏం చూస్తారో అవే చూడటం మొదలుపెడతారు. కాకపోతే ఇంకొంచెం మంచి ఫోన్లలో మరింత నాణ్యమైన వీడియోల్లో. దిశ సంఘటన జరిగాక ఆమె అత్యాచార వీడియో కోసం ఇంటర్నెట్ లో వెతికిన పిల్లల్లో అన్ని వర్గాల పిల్లలూ ఉన్నారు.

ఇక ఇళ్లలో మరోవైపు ద్వేషం, పగ, కన్నీళ్లు మాత్రమే ఆధారంగా నడిచే సీరియళ్లు నిరంతరం నడుస్తుంటాయి. లేదా హింసను సెన్సేషనలైజ్ చేసే వార్తలు వస్తుంటాయి. ఇవన్నీ కాకపోతే విపరీతమైన హింసను, జెండర్ ఇన్సెన్సిటివిటీ ని గ్లామరైజ్ చేసే సినిమాలు. ఒకవేళ థియేటర్ కి వెళ్లకపోయినా అవి ‘ఎ యు’ సర్టిఫికెట్ తీసుకుని ఇంట్లో టివిలో వస్తాయి. కుటుంబాలకు కుటుంబాలు ఆ హింసను కళ్లార్పకుండా భయంతో కూడిన ఆరాధనతో చూస్తుంటాయి.

వీటిల్లో కొన్ని డైలాగులుంటాయి. ‘వాడు మగాడ్రా బుజ్జీ’, ‘నువ్వు మగాడివేనా?’, ‘మగాడంటే అలా ఉండాలి’ లాంటివి. దాదాపు ఈ డైలాగులన్నీ ఏదో ఒక హింసాత్మక సంఘటనకు లేదా ఆధిపత్య ప్రవర్తనకు ఆమోదం తెలుపుతూ ఆయా సందర్భాల్లో వచ్చేవే. ఏ మాత్రం విమర్శ లేకుండా కుటుంబాలు ఆ సినిమాలు చూస్తూ ఆ డైలాగులు వింటున్నపుడు కుటుంబం అంతటిలోనూ ఆ ప్రవర్తన పట్ల, ఆ ధోరణుల పట్ల ఆమోదం ఏర్పడుతుంది. అంతే కాదు, ఆ డైలాగులు ఇళ్లలోనూ, ఇతర సామాజిక సందర్భాల్లోనూ, చివరికి రాజకీయాలకు సంబంధించిన చర్చల్లోనూ చాలా సాధారణంగా వినపడుతుంటాయి. ‘పాకిస్తాన్ మీద యుద్ధం చేసాడు, వాడు మొగాడు’, ‘ఫలానా రాష్ట్రంలో ఫలానా పని చేసాడు, ఇరగ దీసాడు, వాడు మొగాడు’ – ఇలా ఉంటాయి సంభాషణలు. ఈ మాట అన్న ప్రతిసారీ తాము ఒక హింసను ఆరాధిస్తున్నమని కానీ, ఆహ్వానిస్తున్నామని కానీ జ్ఞానం ఉండదు చాల మందికి.

ఇంకో వైపు జండర్ వయొలెన్స్. ఇది కేవలం కొట్టటం, తిట్టటానికి సంబంధించింది మాత్రమే కాదు. ఆడపిల్లను చూస్తే “ఆమె కావాలని” అనిపిస్తే, “ఆమె నాది” అని చెప్పటం, ఆమెను “స్వంతం” చేసుకోవటం హీరోయిజంగా చూపించే సినిమాలు. అలాంటి సినిమాలు ఇవాళ అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్లే. వీటిని సినిమా హాల్లోనో లేకపోతే ఎయు సర్టిఫికేటు ముసుగులో టీవీలో వచ్చినప్పుడో, లేదంటే పెద్దవాళ్లు టీవీలో చూస్తే, చిన్నవాళ్ళు ఫోన్ లోనో అందరూ చూసేస్తారు. మొత్తంగా ఎవరూ ఏమీ మాట్లాడుకోకుండానే ఒక టాక్సిక్ మాస్క్యులినిటీ (ప్రమాదకర, విషపూరిత పురుషత్వం) కి పట్టం కట్టే సంస్కృతికి ఆమోదం తయారవుతూ ఉంటంది.

ప్రతి మనిషికి ఒక వ్యక్తిగా తృప్తినిచ్చేవి రెండు అంశాలు. ఒకటి, బయట తనకు గుర్తింపునిచ్చే పని. రెండు, వ్యక్తిగత జీవితంలో ప్రేమ. యుక్త వయసులో అయితే ఈ రెండూ పొందటమే చాలా కీలకం. నిరుద్యోగంలో 40 ఏళ్ల రికార్డు స్థాయికి చేరిన దేశంలో చదువుకున్నా కూడా (చదువు, నైపుణ్యం లేకపొతే ఎలాగూ లేదు) గౌరవప్రదమైన జీవితం దొరికే అవకాశం లేని నిస్పృహలో మగాడిగా నిరూపించుకునే ఒకే ఒక్క అవకాశం లైంగిక ఆధిపత్యం లేదా లైంగిక హింస. అలాంటప్పుడు కావలిసింది కూడా తేలిగ్గా దొరికే ఒక విక్టిమ్ మాత్రమే. తరచుగా మనం వినే సంఘటనల్లో తమ క్లాస్ మేట్ మీద అత్యాచారం చేసిన ఇంజనీరింగ్ విద్యార్ధి లాంటి వార్తలు ఉంటాయి.

ఇంకొంచెం పైకి వెళ్దాం. ఆమధ్య ముంబాయిలో చాలా పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు చదివే స్కూలులో పెద్ద తరగతి పిల్లల వాట్సప్ సంభాషణలు బయటికి వచ్చాయి. అందులో 15 ఏళ్లు కూడా నిండని మగపిల్లలు తమ క్లాసులో ఉన్న ఆడపిల్లలపై ఎవరెవరు ఎవరెవర్ని ఎలా రేప్ చెయ్యాలనుకుంటున్నారో చర్చించుకున్నారు. ఫాం హౌస్ లలో ఇచ్చే రేప్, డ్రగ్స్ రేవ్ పార్టీలలో ఉండే విశృంఖలత్వాల గురించి తెలియనిది కాదు. కాని అక్కడ బయటికి రాకుండా ఉంచటానికి, వస్తే మానేజ్ చెయ్యటానికి అవసరమైన అన్ని అండదండలు ఉంటాయి. అందుకే ఇప్పటివరకూ ఇన్ని జరుగుతున్నా ఈ దేశంలో ఏ సంపన్న వర్గాల వ్యక్తులు అత్యాచార నేరంలో బోనెక్కడం చాలా అరుదు.

ఇక బాధితులు ఎవరు? ‘బేటీ పడావో బేటీ బచావో’ అని నినదించే రాజ్యం స్కూలుకి వెళ్లటానికి కనీసం బస్సు కూడా ఏర్పాటు చేయకపోతే నాలుగైదు మైళ్లు డొంకదారుల్లో నడిచిపోయే హాజీపూర్ పిల్లలు కావచ్చు, అమ్మ పక్కన ఆదమరిచి నిద్రపోయే నెలలపాప కావచ్చు, ఇంతమంది తిరిగే చోట భద్రమే అనుకుని స్కూటర్ పార్కు చేసుకున్న దిశ కావచ్చు, స్నేహితుడే కదా అని నమ్మిన మానస కావచ్చు, రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని ఇల్లు చేరుకునే తొందరలో ఉన్న టేకు లక్ష్మి కావచ్చు, హాస్టల్ లో ప్రశాంతంగా ఉన్నాననుకున్న ఆయేషా మీరా కావచ్చు, సినిమా తార అయి కూడ (బహుశా అయినందువల్లనే) రక్షణ లేని ప్రత్యూష కావచ్చు, మనకు తెలియని మరెవరో కావచ్చు. నేర స్వభావం అనేది పేద ధనిక భేధం లేకుండా పెరుగుతూ ఉందన్నది ఒక వాస్తవం. కాని నేరస్తులు పేద వారో లేదా భాదితులు మధ్యతరగతి లేదా ఆ పైవర్గం వాళ్లో అయినప్పుడు మాత్రమే అవి వార్తలు కావడం, లేదా అందులో నేరస్తులకి శిక్షలు పడటం ఈ దేశపు వాస్తవం. నేరస్తులు పైవర్గం వాళ్లయితే, వాళ్లకు రాజకీయ అండదండలు ఉంటే ప్రత్యూష కేసులోలాగా వాస్తవాలు బయటికి రావు, ఆయేషా మీరా కేసులో లాగా నిందితులు దొరకరు. అవసరమైతే ఒక అర్భకుడిని లోపల వేసి ఏళ్ల తరబడి బయటకు రాకుండా చూడొచ్చు.

ఒకసారి నిర్భయ సంఘటనకు వెళ్తే, అప్పుడు కూడా తక్షణ న్యాయం గురించి ఎంత డిమాండ్ వచ్చినప్పటికీ దేశంలో మానవ హక్కుల కోసం పనిచేస్తున్న, రమీజాబీ సంఘటన నుంచి మధుర, భన్వారీ దేవీల దాకా అత్యాచార ఘటనల మీద పనిచేస్తున్న స్త్రీల హక్కుల ఉద్యమకారుల వల్ల, అప్పటికి ఇంకా ఈ స్థాయిలో ప్రభుత్వాలే హింసను ప్రోత్సహించే సంస్కృతి రాకపోవటం వల్ల వీటికి పరిష్కారం కనుక్కునే ప్రయత్నం కొంతైనా జరిగింది. ఫలితంగా వచ్చిందే జస్టిస్ వర్మ కమిషన్.

కొన్ని వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఇచ్చిన నివేదికలో జస్టిస్ వర్మ ప్రజల నుంచి వచ్చిన మరణ శిక్ష డిమాండ్ ను సమర్థించలేదు. ప్రతి పది నిమిషాలకి ఒక అత్యాచార సంఘటన నమోదు అయ్యే (అసలు పది సంఘటనలు జరిగితే ఒకటే నమోదు అవుతుందనేది ఒక అంచనా) దేశంలో అత్యాచారానికి మరణశిక్ష విధించడం మొదలుపెడితే, సాక్ష్యాలు లేకుండా చేయటానికి బాధితులను చంపేసే అవకాశం పెరుగుతుందన్న వాదన సుప్రీం కోర్టు న్యాయమూర్తికి తెలియనిది కాదు. కఠిన శిక్షలతో పాటు సత్వర న్యాయం, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. శిక్షాస్మృతిలో అనేక మార్పులు సూచించారు. ప్రధానంగా చిన్నచిన్నవిగా ఇటు సమాజం, అటు వ్యవస్థలు చూసీచూడనట్లు పోయే రకరకాల వేధింపులకు కూడ శిక్షలు కఠినం చేయాలన్నారు.

వర్మ కమిషన్ చేసిన మరో మంచి పని ఏమిటంటే ఆయన సమస్యను కేవలం నేరం – శిక్ష కి మాత్రమే పరిమితం చేయకుండా మొత్తంగా లైంగిక నేరాల నిరోధానికి కీలక వ్యవస్థల్లో రావల్సిన మార్పులు, సంస్కరణల గురించి చెప్పారు. అందులో మొదటిది, చాలా వివరంగా చెప్పింది పోలీసు సంస్కరణలు. పోలీసులకు జెండర్ సెన్సిటివిటీ పెంచటంతో పాటుగా లైంగిక నేరాలను సరిగా డీల్ చెయ్యటానికి అవసరమైన శిక్షణ కూడా ఇవ్వాలని సూచించారు. బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు జూరిస్ డిక్షన్ తో సంబంధం లేకుండా ఫిర్యాదులు తీసుకోవాలని, ఫిర్యాదు తీసుకోవటానికి నిరాకరించిన పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇంకా రాష్ట్రస్ఠాయిలో భద్రతా కమిషన్లు ఏర్పాటు చేయాలని, అత్యాచారాలను విచారించటానికి అవసరమైన మద్దతు అందించటానికి రేప్ క్రైసిస్ సెల్లులను ఏర్పాటు చేయాలని, ఎక్కడ అత్యాచార ఘటన జరిగి ఫిర్యాదు అందినా వెంటనే ఆ సెల్ కి సమాచారం అందించాలని సూచనలు చేసారు.

సంస్కరణలు చేయాల్సిన రెండవ సమూహం రాజకీయ నాయకులన్నది జస్టిస్ వర్మ అభిప్రాయం. లైంగిక నేరాలకు పాల్పడినవారే అసెంబ్లీలలో పార్లమెంట్ లో కూర్చునే పరిస్థితి ఉండకూడదని అన్నారు. అందుకోసం చట్టం సవరించి వాళ్లు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేకుండా చెయ్యాలని కూడా చెప్పారు.

మూడవది, విద్యా సంస్కరణలు. అన్ని విద్యా సంస్ఠలలో స్కూలు స్థాయి నుంచి జెండర్, సెక్స్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చెయ్యటంతోపాటు స్కూలు బయట ఉన్నవాళ్లకు వయోజన విద్య ద్వారా స్త్రీ పురుష సమానత్వం బోధించాలన్నారు.

అప్పటికి ముగుస్తున్న యుపిఎ 2 ప్రభుత్వం వర్మ కమిషన్ సిఫారసు చేసినట్లుగా లైంగిక వేధింపులకు, దాడులకు సంబంధించిన చట్టపరమైన మార్పులతోపాటు కమిషన్ వద్దన్నప్పటికీ సామూహిక అత్యాచారాలకు మరణశిక్షను కూడా జోడించింది.

దేశంలో పెరిగిపోయిన అత్యాచార సంస్కృతికి అప్పటిదాకా ఉన్న ప్రభుత్వాలదే బాధ్యత అని తిట్టిపోసినవాళ్లు అధికారంలోకి వచ్చారు. వర్మ కమిషన్ చేసిన మిగిలిన సిఫారసులను బుట్ట దాఖలు చేసిన కొత్త ప్రభుత్వం నిర్భయ సంఘటనలో లాగా నేరస్తులు మైనర్లు అయితే తప్పించుకు పోకుండా హీనమైన నేరాలకు పెద్దవాళ్లను విచారించినట్లే విచారించే విధంగా, నిందితుల వయసును 16 కి తగ్గిస్తూ పోక్సో చట్టానికి సవరణలు చేసింది. మరింత మందికి మరణశిక్షలు విధించే అవకాశం కల్పించింది. ఈ సవరణలు పార్లమెంట్ లో ప్రవేశపెడుతూ మంత్రి మనేకా గాంధీ ఒక వ్యాఖ్య కూడా చేసారు, “పేదరికం నేరాలు చెయ్యటానికి సాకు కారాదు” అని. అంటే ఇటువంటి నేరాలు చదువు సంధ్య లేని పేదలే చేస్తారని, కాబట్టి వాళ్లను శిక్షించటానికి వాళ్ల పేదరికం కాని, వాళ్ల వయసు కాని అడ్డంకి కాకూడదన్నది ఆమె అభిప్రాయం.

నేరస్తులని, బాధితులని తయారు చేసే సమాజాలు, రాజ్యాలు ఏమాత్రం దాన్ని మార్చే లేదా సంస్కరించే బాధ్యత తీసుకోకపోగా అత్యంత హీనమైన నేరం జరిగిన ప్రతిసారీ కఠిన శిక్షలు వేస్తామంటూ రంకెలు వేస్తాయి. విగ్రహాలకి వేల కోట్ల రూపాయలు కేటాయించే ప్రభుత్వాలకు అత్యాచార బాధితులను ఆదుకోవటానికి చెయ్యి రాదు. ఇచ్చిన అర కొర కూడా ఏ స్వచ్ఛ భారత్ కో తరలిపోతాయి. మాట్లాడితే భారతీయ సంస్కృతి గురించి ఘనంగా చెప్పుకునే వాళ్లు అత్యాచార సంస్కృతిని మార్చటానికి మాత్రం ఏమీ చెయ్యరు. ప్రతి ఊరికీ పోలియో చుక్కలు వెయ్యాలన్న సందేశాన్ని తీసుకుపోగలిగిన ప్రభుత్వాలు తలచుకుంటే ఆడపిల్ల ఆమోదం లేకుండా ఆమెపై చెయ్యి వెయ్యకూడదన్న సందేశం కూడా తీసుకుపోగలవన్న స్పృహ ఉండదు. ఆడపిల్లను చూస్తే కళ్లు పీకేస్తామని ప్రగల్భాలు పలికే చోట ఆడపిల్లకు సమస్య వస్తే చెప్పుకోవటానికి ఒక వ్యవస్థ ఉండదు. సమాజంలో, పాలనలో ఉన్న లోపాల వైపు చూసే బదులు ప్రభుత్వం నేరస్తుడి వైపు చూపిస్తుంది. నేరాన్ని చంపటం కాక నేరస్తుడిని చంపటం మీద శ్రద్ధ పెడుతుంది. నేరస్తులే రాజకీయ నాయకులుగా, నేరమే అధికారమై రాజ్యమేలే చోట చిన్న చేపను తినే పెద్ద చేప లాగా చంపటానికి చిన్న నేరస్తులు కావాలి. సత్వర న్యాయం కోసం చెయ్యవల్సిన దీర్ఘకాలిక చర్యలు వదిలేసి తక్షణ న్యాయం పేరుతో మాయ చేస్తారు.

ఇక ఈ మొత్తం నేరపూర్వక వాతావరణంలో నేరము-శిక్ష లో ప్రధాన పాత్ర వహించే పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. అత్యాచార సంస్కృతిని అరికట్టడానికి తొలి సంస్కరణలు ఇక్కడినుంచే ప్రారంభించాలని జస్టిస్ వర్మ అన్నారంటేనే ఇక్కడ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధం అవుతుంది. పురుషాధిక్య భావజాలానికి, టాక్సిక్ మాస్క్యులినిటీకి ప్రతిరూపంగా ఉండే ఈ వ్యవస్థలో స్త్రీలపై జరిగే నేరాల పట్ల ఆమోదంతో కూడిన తృణీకారం ఉంటుంది. 10 ఏళ్ల పాప నుంచి 70 ఏళ్ల పెద్దమనిషి దాకా ఒక స్త్రీ కనిపించటం లేదంటే ఆమె లేచిపోయి ఉంటుందని అనే నిర్లక్ష్యంతో మొదలుకొని, గృహహింస పడలేక వచ్చిన మనిషి పట్ల ఇంటి పరువు తీసిన తప్పుడు మనిషిలా భావించటం నుంచి, అత్యాచార బాధితురాలు వస్తే న్యూసెన్సుగా చూడటం దాకా, స్త్రీలపై జరిగే నేరాలన్నిటి పట్ల పోలీసులలో నేరపూరితమైన నిర్లక్ష్యం కనిపిస్తుంది. కేసులు కట్టటంలో నిర్లక్ష్యం మొదలుకొని అసలు కేసుల్లో చార్జి షీటు వెయ్యకపోవటం, చార్జిషీటు వేస్తే తప్పులతడకగా, కొట్టుడుపోయేలా తయారు చేసే దాకా అనేక వైఫల్యాలు. అనేక కేసుల్లో శిక్షలు పడకపోవటానికి కారణాలు ఇవే. ఇక రేప్ కేసుల్లో సంధి కుదిర్చి పెళ్లిళ్లు చెయ్యటానికి ఊళ్లల్లో కుల పంచాయితీల నుంచి మొదలుకుంటే, పోలీసు స్టేషన్లు, చివరికి కోర్టులు కూడా ఉత్సాహం ప్రదర్శిస్తాయి. ఆ మధ్య చెన్నై హైకోర్టు కూడా అలాంటి ఉత్సాహం చూపించి, సుప్రీంకోర్టుతో అక్షింతలు వేయించుకుని వెనక్కి తగ్గిందంటే అత్యాచారాల పట్ల ఎంత ఆమోదంతో కూడిన నిర్లక్ష్యం ఉందో అర్థమవుతుంది.

నిర్భయ తీవ్రమైన గాయాలతో చావు బతుకుల మధ్య నడిరోడ్డు మీద విలవిలలాడుతున్నప్పుడు కూడా గంట సేపు ఎవరి జూరిస్ డిక్షన్ లోకి వస్తుందో చర్చించగలిగే వెసులుబాటును ఆ నిర్లక్ష్యమే ఇస్తుంది. హాజీపూర్ లో ఒకరి తర్వాత ఒకరు 13,14 ఏళ్ల పిల్లలు మాయమవుతున్నా లేచిపోయి ఉంటుందన్న నిర్ల క్ష్యపు సమాధానం చెప్పటం సాధ్యమవుతుంది. జూరిస్ డిక్షన్ పేరుతో కాలయాపన చెయ్యకూడదన్న విషయం నిర్భయ సంఘటన తర్వాత దేశం అంతటికీ తెలిసినా తెలియాల్సిన పోలీసులకు మాత్రం తెలియకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే జస్టిస్ వర్మ చెప్పిన జండర్ సెన్సిటివిటీ కానీ, స్త్రీలపై జరిగే నేరాల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై శిక్షణ కానీ ఐదు సంవత్సరాలు గడిచినా పట్టించుకోనేలేదన్నమాట. చివరికి దిశ సంఘటనలో కూడా కనిపించింది అటువంటి నేరపూరిత నిర్లక్ష్యమే. కూతురు ప్రమాదంలో ఉందని ఫోన్ చేస్తే మా జూరిస్ డిక్షన్ కాదంటే మా జూరిస్ డిక్షన్ కాదని ఒక గంట ఆలస్యం చెయ్యటమే కాక చివరికి ఏ పోలీస్ స్టేషనో కూడా కనుక్కుని వెళ్తే ఎవరితోనో లేచిపోయి ఉంటుందని బాధితురాలి తల్లితండ్రులతో వెకిలిగా మాట్లాడగలిగే ధైర్యం కూడా ఆ నిర్లక్ష్యం నుంచే వస్తుంది.

వెంటనే స్పందించి ఉంటే కనీసం దిశ బతికి ఉండేదన్నది ఒక వాస్తవం. తమ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టానికి సమాధానం ఇవ్వలేని వ్యవస్థ తన తప్పు నుంచి బయటపడటానికి నిందితులను ఎన్ కౌంటర్ చేసి ఇమేజ్ మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఇదే తప్పుచేసి హాజీపూర్ లో ముగ్గురు ఆడపిల్లలను బలి ఇచ్చిన తర్వాతైనా వ్యవస్థ తన పద్ధతి మార్చుకుంటే దిశ బతికి ఉండేది. అక్కడ అట్లా మాట్లాడిన అధికారి మీద ఒక చర్య తీసుకుని ఉంటే మిగిలినవాళ్లు నేర్చుకునే వాళ్లు. నేరము-శిక్ష లో అంత నమ్మకం ఉన్న వ్యవస్థ ఆ పని మాత్రం చెయ్యదు.

ఇప్పటికైనా మార్చుకుంటుదన్న నమ్మకం లేదు. ఎందుకంటే మారాలన్నా, మార్చాలన్నా చాల  పెద్ద ప్రయత్నం చేయాలి. పని చేయాలి. జండర్ సెన్సిటివిటీ పెంచాలి. ఈ నేరాల పట్ల వ్యవహరించే పద్ధతి మీద శిక్షణ ఇవ్వాలి. అవన్నీ చెయ్యటానికి రాజ్యానికి తీరిక లేదు. నేరస్తులుగా మారిన తమకు రక్షకులుగా మాత్రమే పనిచేస్తూ ఉంటే ప్రతిఫలంగా మంచి మంచి వాహనాలు, వసతులు, నిధులు విసురుతూ ఉంటారు. ఇదేంటి అని ప్రశ్నించే వాళ్ల మీద తప్పుడు కేసులు పెట్టి బయటకు రాకుండా చూస్తే చాలు, అదనంగా. ఎప్పుడో ఐదేళ్లకో,  ఏడేళ్లకో ఒకసారి ప్రజాగ్రహం వచ్చినప్పుడు వాళ్ల మొహాన పడెయ్యటానికి ఒక ఎన్ కౌంటర్ చేస్తే సరిపోతుంది. బహుశా ఇప్పటి ఎన్ కౌంటర్ కి వచ్చిన స్పందన చూశాక ఇక నుంచి ఆయేషా మీరా కేసులో లాగా ఎవరో ఒకరిని తప్పుడు కేసు పెట్టి లోపల పడెయ్యటం కాకుండా ఇలాంటి నేరం జరిగిన ప్రతిసారీ ఎవరో ఒకరిని ఎన్ కౌంటర్ చేసేస్తారేమో కూడా. ఆత్యాచారం చేసి సాక్ష్యం లేకుండా చంపేసినట్లు. జనానికి న్యాయం జరిగినట్లు ఉంటుంది. తమకు కావల్సిన వాళ్లను రక్షించుకోనూ వచ్చు.

ఇలాంటి దారుణ సంఘటన జరిగిన ప్రతిసారీ ప్రజలలో ఇంకో రెందు రకాల వాదనలు వస్తాయి. ఒకటి ఆడపిల్లల ప్రవర్తన వల్లనే లేదా ధరించిన దుస్తుల వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని. ఇది విక్టిమ్ బ్లేమింగ్. బాధితుల మీదనే నెపం వెయ్యటం. సమస్యను గుర్తించటానికి నిరాకరించటం. లేదా తమలో ఉన్న అత్యాచార మనస్తత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించటం. రెండవది. పిల్లల పెంపకం లేదా కుటుంబ బాధ్యత చర్చ. ఒక బిడ్డను గ్రామమంతా కలిసి పెంచుతుంది అని ఒక సామెత. కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కొందరు తల్లితండ్రులకు బతుకే ఒక పోరాటం అయితే కొందరికి గెలవటం కోసం, సంపాదన కోసం ఆరాటం. పిల్లలు మూసిపెట్టిన ఇళ్లలో లేదా మూసిపెట్టిన స్కూళ్లలో పెరుగుతున్నారు. తల్లితండ్రులకు పిల్లలను పట్టించుకునే సమయం లేదు. స్కూళ్లకు ఆ భాధ్యత లేదు. పిల్లల ఎమోషన్లకు విలువ లేదు. ఆటలు లేవు. పాటలు లేవు. ఇప్పుడున్నంత ఒత్తిడి పిల్లల మీద ఎప్పుడూ లేదు. వాళ్ల కోసం ఏమీ చెయ్యని సమాజం, ప్రభుత్వాలు వాళ్లు చేసే తప్పులను దండించడానికి మాత్రం ముందుకు పరుగెత్తుకు వస్తాయి.

కానీ సామాజిక జీవితం ఇంత ఒత్తిడిగా మారటానికి ఎవరు కారణం? జీవితమే ఒక ప్రెజర్ కుక్కర్ గా మారటానికి మన విధానాలు కారణం కాదా? ఎందుకు దేశం దేశమే ఎప్పుడూ ఆనంద సూచిక (హాప్పినెస్ ఇండెక్స్) లో వెనకబడి ఉంటుంది? ఎందుకు ఎప్పుడూ ప్రతి మనిషికీ చుట్టూ ఒక ఉద్రేకపూరిత వాతావరణం ఉంటుంది? ఎందుకు అందరికీ అన్ని వ్యవస్థల మీదా నమ్మకం పోయింది? న్యాయం జరగని చోట ప్రతీకారమే సరైనదని ఎందుకు నమ్ముతున్నారు? గొడ్డు మాంసం తింటే కూడా మనుషుల్ని నరికెయ్యటం న్యాయంగా మారినప్పుడు అత్యాచారానికి కూడా విరిచెయ్యటం న్యాయంగా మారకుండా ఎలా ఉంటుంది? ఒక దేశ సంస్కృతి మారాలంటే దేశ పాలనా సంస్కృతి, పాలకుల సంస్కృతి మారాలన్న సంగతి గుర్తు పెట్తుకోవాలి. పార్లమెంట్ లో, అసెంబ్లీలలో కూర్చునే ఎంపీలు ఎమ్మెల్యేల మీదనే అత్యాచార నేరాలు ఉంటే వాళ్లు ఈ సంస్కృతిని ఎట్లా మారుస్తారు?

ఈ ప్రశ్నలకు వెతికే సమాధానాల్లోనే ఆ సమస్యకు పరిష్కరాలు ఉంటాయి. లేదంటే మరో దారుణ సంఘటన జరిగే దాకా వేచి చూడొచ్చు. ఈసారి ప్రజలు కోరుకున్నట్లుగా ఒక ఆర్థిక, రాజకీయ బలం, బలగం లేని నిందితుడిని ప్రజల చేతికి అందించవచ్చు విరిచెయ్యటానికి వీలుగా. ఈలోగా యాభై, వందేళ్లలో ఆడపిల్లలకి అందివచ్చిన కాస్త చదువు, కాసిని ఉద్యోగాలు కూడా ఈ కొత్త అభద్రతతో వెనక్కి పోతాయి. అప్పుడిక స్త్రీపురుష సమానత్వ సమన్యాయం ఉన్న సమాజం, జండర్ జస్ట్ సమాజం అనేది కలగా కూడా మిగలదు.

(రచయిత స్వతంత్ర పాత్రికేయులు)

*****

వీక్షణం, జనవరి 2020 సౌజన్యంతో-

వీక్షణం హైదరాబాద్ కేంద్రంగా 2003 నుంచి నిరంతరాయంగా వెలువడుతున్న రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక.

Please follow and like us:

6 thoughts on “నిర్భయ నుంచి దిశ దాకా”

  1. చాలా విస్తృతంగా పరిశీలించి వ్రాశారు.
    ఇక పై ఎలాంటి సమస్యా లేని సమాజం కోసం పాటు పడవలసిన అవసరం చాలా ఉంది.
    విసికి పోయిన సమాజం, స్త్రీ కి సమాజ భద్రత లేదు అని తీర్మానించుకునే లోపే నిద్రలేవాలి.

    అలాగే, మధ్య తరగతి ఆలోచనా దృక్పథం లో మార్పు చాలా అవసరం.
    రచయితకు నా ధన్యవాదాలు.

  2. నెచ్చెలి శీర్షికలోనే ఉంది ఓ భరోసా. ఏంభయంలేదు, నీకు నేనున్నానంటూ చేదోడు వాదోడుగా ఉండగల ప్రియనేస్తం. ఇంకేంకావాలి! నాకేంఫర్వాలేదనే ధీమా!
    విశ్లేషణ సదవగాహనను , ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేలా ఉంది.

  3. విపులంగా చర్చించారు. ధన్యవాదాలు.

  4. సమగ్రంగా వివరించారు.
    1. సెన్సార్ బోర్డు పాత్ర
    2. Continuous channels Streaming కు రాత్రి బ్రేక్
    3. బాలిక కు పుట్టగానే ఒక యునీక్ ఐ డీ ఇచ్చి రక్షణ కల్పించడం
    4.కళాశాల స్థాయిలో పాస్ గ్యారెంటీ పరీక్ష విధానం రద్దు వంటివి కూడా సూచించవచ్చు.
    ప్రతి పంచాయితీ/ వార్డు స్థాయి యంగ్ ఇండియా ఫోర్స్ ఉండి పారా పోలీసింగ్ ఉంటే మంచిది.
    పారా మెడికల్ లాగ.
    మీ వ్యాసం చాలా అవసరం.
    పంచుకుంటున్నాను.

Leave a Reply to Kallakuri Sailaja Cancel reply

Your email address will not be published.