
“నెచ్చెలి”మాట
కరోనా కామెడీ కాదిక-
-డా|| కె.గీత
అసలే ఒక పక్కన కరోనా బారిన పడి ప్రపంచం గిలగిలా కొట్టుకుంటూంటే
ఎన్నికలోయ్, ఓట్లోయ్ అని అమెరికా అధ్యక్ష ఎన్నికల గోల ఒకవైపు-
అందునా ప్రత్యక్ష పెసిడెన్షియల్ డిబేట్లు , ప్రచారాలు!
పోనీ అక్కడైనా
కుటుంబ దూషణలు
వ్యక్తి”గతాలు”
కాకుండా
నిల్వ నీడలేని సగటు అమెరికన్లని
మూతబడ్డ చిన్న దుకాణాల్ని
ఉద్ధరించడం
గురించి మాట్లాడితే బావుణ్ణు –
“పదినెల్ల నించి కరోనా” – కామెడీ కాదని ఎవరైనా
కాస్త ప్రస్తుత/ కాబోయే అధ్యక్షులవార్లకి చెప్తే బావుణ్ణు –
ఇక
ప్రపంచ వ్యాప్తంగా
వెబినార్లోయ్, ఉపన్యాసాలోయ్ అని సందడొకవైపు
అయినా
అదేవిటో
మాస్కు మెడకు తగిలించుకుని మరీ
రాజకీయ ప్రత్యక్ష సభలు, సమావేశాలూ
పూలదండలు, కౌగిలింతలు !!
అసలే
కరోనా పుణ్యమా అని
ఉపాధులు కోల్పోయి జేబులో రూపాయి లేక గిలగిల్లాడుతున్న జనాన్ని
రెగ్యులరైజేషన్లని
ప్లాట్లు , ఫ్లాట్ల మీద పాట్లు పెడుతూ
రెవెన్యూ ఆఫీసుల చుట్టూ హడలెత్తి పరుగెత్తించడం
నీళ్లు నీకా, నాకా అని
రాష్త్ర ప్రభుత్వాలు వాడీవేడిగా కొట్టుకోవడం
కంటే
కేబుల్ టీవీలు, ఫ్లిక్స్ లు, ప్రైమ్ లు, ట్యూబ్ లు సరిపోక
50% సీటింగ్ తో
మాస్కులేసుకుని మరీ
సినిమా హాళ్లలో సినిమాలు చూపించడం కంటే
కరోనా కట్టడో
వైద్యమో
సౌకర్యాలో
కనీసం-
తగిన పోషకాహారం లేక కోలుకోలేనివారికి
తిండీతిప్పలో
పట్టించుకుంటే బావుణ్ణు-
అసలే కరోనా వల్ల పోతున్న ప్రాణాలు చాలక
కులాంతర వివాహం చేసుకున్నా
చివరికి బహిర్భూమికి వెళ్లినా
భద్రత లేని బతుకులొక వైపు-
మానవ తప్పిదాలతో బాటూ
ప్రకృతి వైపరీత్యాలూ తోడయ్యి
అయితే
కొండలు, ఊళ్లు తగలబడడం-
లేదా
తుఫానులు, వరదలు ముంచెత్తడం-
ఇన్ని అల్లకల్లోలాల్లో
కరోనా గురించి మర్చిపోదామనుకున్నా
మరవనివ్వని బాలూ హఠాన్మరణ విషాద జ్ఞాపకమొకటి-
అయినా
పాజిటివ్ వచ్చిన అధ్యక్షుడు
మూడోరోజుకే మిలిటరీ ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చేసినట్టు
కరోనా ఆలోచన కూడా చెరిగిపోతే బావుణ్ణు!
కాదు కాదు
జీవితం 2019 వరకు ఉన్నట్టే ఉంటే బావుణ్ణు!!
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.

వాస్తవాలను ఎంతందంగా…అంతే సూటిగా… చాలా చక్కగా వ్రాశారు గీతగారు