శతక కవయిత్రులు

-ఐ.చిదానందం

      ప్రాంతం ఏదైనా సరే శతకం లేని దేవుడు లేడు  అనేక ప్రతీకలు గా ; అనేక రీతులు గా ; భక్తి గా ; రక్తి గా ; వ్యంగం గా ; వాజ్యస్తుతి తో ; సమాజ హితం కోరి ఎన్నో శతకాలు వచ్చాయి. తెలుగు సాహిత్యం లో శతకాలు రాసిన వారిని పరిశీలన చేస్తే అందులో దాదాపు గా 99% శాతం మనకు పురుషులు రాసిన శతకాలే కలవు. స్త్రీలు రాసిన శతకాలు అతి తక్కువ సంఖ్యలో కలవు. అలాంటి తక్కువ కవయిత్రుల శతకాలను రేఖా మాత్రం గా పరిచయం చేయడమే ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం……

                     17 వ శతాబ్ది కి చేందిన తెలంగాణ ప్ర్రాంత కవయిత్రీ రూప్ఖాను పేట రత్నాంబ. వీరు వెంకట రమణ శతకం ను రచించారు. ఇదే శతాబ్దం కు చెందిన చెలికాని చెల్లయమ్మ 2- శతకములు రాసినట్లు తెలుస్తుంది. అవి జానకీ శతకము ; పార్ధ సారధి శతకము. 17వ శతాబ్దం లోనే మరో కవయిత్రీ బండి బాపమ్మ. వీరు బంధ కవిత్వం లో పద్యాలు రాసిన కవయిత్రీ. అలాగే వీరు మీనాక్షీ శతకం ను రచించినారు. వేంకటేశ్వర స్వామి పాదపద్మములకు అంకితమైన సాధ్విమణి తరిగోండ వెంగమాంబ (1730). వీరు శ్రీకృష్ణ మంజరి ; నృసింహ శతకం వంటి రచనలు చేసారు. ఇవన్నీ భక్తి వేదాంత ప్రధానమైనవే.శతకములు రాసిన వారిలో అగ్రగణ్యులు అనీ కందుకూరి వీరేశలింగం పంతులు గారిచే ప్రశంసలు పోందిన కవయిత్రీ మదిన సుభద్రమ్మ . వీరు తరిగోండ వెంగమాంబ కు సమకాలికురాలు. మరొకరు మదిన సుభద్రమ్మ  రఘు నాయక శతకము ; కేశవ శతకం ; కృష్ణ శతకం ; రాఘవ రామ శతకం ; శ్రీ వేంకటేశ్వర శతకం ; శ్రీ కేశవ శతకం ; శ్రీకృష్ణ శతకం వంటి భక్తి వేదాంత పరమైన శతకములు రాసి గోప్ప కవయిత్రీ గా గుర్తింపు పోందారు.

                     శ్రీకాకుళం లో 19వ శతాబ్దం లో జన్మించిన కవయిత్రీ బుర్రా సూరమాంబ. వీరు నందినార ; హరినాధ శతకములు రచించారు. పోతులూరి వీరబ్రహ్మం గారి శిష్యకోటి లో ఒకరు దార్ల సుందరీమణి (1829). వీరు వేమన వలే ఆటవెలది చంధస్సులో పాప భయ విభంగ భావలింగ అనే మకుటం తో భావలింగ శతకం అనే తత్వ్త శతకం ను రాసారు. గిరిజా కళ్యాణం ; తెలుగు తల్లీ వంటి రచనలతో తెలుగు నాట ఖ్యాతి పోందిన వారు గంటి కృష్ణవేణమ్మ. వీరు గృహలక్ష్మి స్వర్ణ కంకణం పోందిన వారు. వీరు జ్ఞాన ప్రసూంబాంబిక శతకం ను రచించారు. ఇదే కాదు కామాక్షి శతకం ; రాజ రాజేశ్వరి శతకములు రాసి పండితురాలు గా పేరుపోందారు. వీరేశలింగం గారికి స్త్రీ విద్య లో తోడ్పడిన వ్యక్తీ కోటికలపూడి సీతమ్మ (1874-1931). వీరు సాధు రక్షక శతకం ను రచించారు. గుంటూరు లో జన్మించిన గూడిపూడి ఇందుమతి దేవి (1890) బోమ్మిదేవర జమీందారుల ఆస్థానంలో కవయిత్రి. వీరు దాదాపుగా 15 రచనలు చేశారు. అందులో తరుణీ శతకం ఒక్కటి. గుంటూరు లోనే జన్మించిన మరో కవయిత్రి కాంచనపల్లి కనకమ్మ (1893) సంస్కృతాంధ్ర లో ప్రసిద్ది పోందిన వీరు కవితా విశారద ; కవి తిలక వంటి బిరుదులు పోందినవారు. కనకమ్మ తన 12 వ యేటనే 1905 లో రంగ శతకం అనే రచనను చేసి పండితుల ప్రశంసలను పోందినది. తన పేరునే మకుటం గా పేట్టుకుని శతకం రాసిన కవయిత్రి జ్ఞానమాంబ (1895) కృష్ణ జిల్లా కు చేందిన వీరు భక్తి వేదాంత విషయాలను తెలుపుతూ విజ్ఞానమృతం అనే శతకం ను రాశారు. ఇది ఆటవెలది పద్యాలతో లలిత పద శోభితం గా సాగుతుంది.  జ్ఞానమాంబ గారే రాసిన మరో శతకం కాళి ప్రసాదిని శతకం. ఇది ఆధ్యాత్మపరమైన శతకం.

                  ఆంధ్ర రాష్ర్టం లో తిరువూరు మండలం పెనుగోలను లో జన్మించిన బచ్చు కనక దుర్గాంబ (1934). కనకదుర్గాంబ శతకం ను రచించారు. భక్తగ్రేసర రచయిత్రి గా పేరోందిన కవయిత్రి ముదిగోండ రాజరాజేశ్వరి దేవి (1938). వీరు విజయవాడ లో జన్మించారు. రాజరాజేశ్వరి దేవి శ్రీలలితేశ్వర శతకం; యువ శతకం ; సత్యసాయి శతకం రాసి ఆ మూడింటిని కలిపి శతకత్రిశతిగా ప్రచురితం చేశారు. అంతేకాదు వీరు సంస్కృతం లో శ్రీరామ వల్లభ శతకం కూడా రాసారు. పరిశోధకురాలు ; వ్యాస రచయిత్రి అయినటువంటి ములుకుదటి మీనాకుమారి (1952) గుంటూరు జిల్లా వాసీ. కరుణశ్రీ రచనలపై పరిశోధన చేసిన మీనాకుమారి ఆటవెలది పద్యాలతో చేన్న కేశవ శతకం ను రచించారు.

                    భారతంలోని కథను తీసుకుని శతకం ను రాసిన వారు భువనగిరి లక్ష్మి కాంతమ్మ. వీరు భారతకృష్ణ శతకం రాసారు. అలాగే మరో కవయిత్రీ జూలూరి తులశమ్మ. వీరు భాగవత కథ అధారంగా సూర్యుని వివాహ కథ తో మార్తాండ శతకంను రాశారు.. వీరే మధుర మీనాక్షుల వివాహ గాథ తో మీనాక్షీ శతకం అనే మరో రచన కూడా చేసారు. త్రిమూర్తులలో ఒకరు బ్రహ్మ. వీరిని గురించిన గాథలు చాలా తక్కువ. అలాగే బ్రహ్మ కు పురాణాల ప్రకారం పూజలు కూడ నిషిధ్ధం. అలాంటి బ్రహ్మ ను గురించి జోన్నలగడ్డ శారదాంబ గారు శారదాపతి అనే శతకం ను రచించినారు. నాగ్నజితి పరిణయం అనే ప్రబంధం ను రాసిన వేమూరి శారదాంబ గారు మాధవ శతకం అనే ఒక రచన కూడా చేశారు. సీరము సుభద్రయాంబ వీరు ఉత్తర రామ చరిత్రం తో పాటు గా శ్రీ వేంకటేశ్వర శతకం ; శ్రీ రామ శతకం;  సత్ప్రభు శతకాలను రాసినట్లు తెలుస్తుంది. గిరిజా కళ్యాణం ; తెలుగు తల్లీ వంటి రచనలతో తెలుగు నాట ఖ్యాతి పోందిన వారు గంటి కృష్ణవేణమ్మ. వీరు గృహలక్ష్మి స్వర్ణ కంకణం పోందిన వారు. వీరు జ్ఞాన ప్రసూంబాంబిక శతకం ను రచించారు. ఇదే కాదు కామాక్షి శతకం ; రాజ రాజేశ్వరి శతకములు రాసి పండితురాలు గా పేరుపోందారు.మచిలిపట్నం లో జన్మించిన ముదిగోండ సీతారామమ్మ గారు ఆంజనేయ స్వామి తల్లి సువర్చలా దేవి పేరిట సువర్చలాంజనేయ స్వామి శతకం రాసారు. ఇది చంపక మాల పద్యాలతో కూడి వుంది. అలాగే వీరు కంద పద్యాలతో శివ శతకం పేరిట మరో శతకం కూడా రచించారు.

                         మోరను వినదగోయి ముద్దుకృష్ణ అనే మకుటం తో ముద్దుకృష్ణ శతకం రాసిన కవయిత్రి కటికల వాణి (అవనిగడ్డ- కృష్ణ జిల్లా). వీరే వాణి భాషణంబు వాస్తవంబు అనే మకుటం తో మరో రచన చేసినట్లు తెలుస్తుంది.సమాజ హితం గా రచనలు చేస్తున్న రచయిత్రి లక్క రాజు వాణి సరోజిని (గుంటూరు). వీరు సమాజ దర్పణం అనే పద్య శతకం ను రాసారు.వాణి సింహాద్రి (కృష్ణ జిల్లా)  అనే కవయిత్రి 2 శతకాలు రాసినట్లు తేలుస్తుంది.శ్రీపాద కృష్ణమూర్తి గారి పుత్రిక కల్లూరి విశాలక్షమ్మ. తండ్రి గారి లాగే తనయ బహు గ్రంధ రచన చేశారు. విశాలక్షమ్మ గోపాల శతకం ; ప్రభాకర శతకం వంటి రచనలు చేశారు.వేమూరి శారదాంబ (కృష్ణ జిల్లా) వీరు మాధవ శతకం అనే రచన చేసారు.సంఘ సేవ లో విస్తృతం గా కృషి చేసిన వారు చేబ్రోలు సరస్వతి దేవి. వీరికి కలహంసి అనే బిరుదు కలదు. వీరు సరస్వతి రామాయణం తో పాటు గా శారదా శతకం అనే రచన కూడా చేసారు.మరో కవయిత్రి బుర్రా సూరమాంబ మాధవ శతకం ను రాసారు. నెల్లూరు లో జన్మించిన చిలకపాటి సీతాంబ. నవల నాటకములతో పాటు పద్య కవిత్వం రాసి కవి రాణి అనే బిరుదు ను పోందిన వారు. వీరు సీతారామయణ శతకం ను రాసారు. కాని ఇది అలభ్యం. నాగ్నజితి పరిణయం అనే ప్రబంధం ను రాసిన వేమూరి శారదాంబ మాధవ శతకం అనే ఒక రచన చేశారు. మోదవరపు లక్ష్మి నరసమాంబ గారు భద్రాచలాధీశ్వర శతకం రాసారు. పద్యం ; గేయం ; వచనం ; పేరడీ లాంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేసిన రచయిత్రి జంగం జ్యోతిర్మయి. వీరు శ్రీవిష్ణు కందం ; భజ గోవిందం వంటి రచనలతో పాటు గా రాజశేఖర శతకం ను కూడా రచించారు.ఉపాధ్యాయిని ; పద్య రచయిత్రి అయిన కవయిత్రి గుమ్మా నాగమంజరి. వీరు విశ్వనాథ శతకం అనే రచన చేసారు.

                  పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లో జన్మించిన భావ రాజు ప్రియదర్శిని పద్మిని గారు అనేక ప్రక్రియలలో రచనలు చేస్తున్న కవయిత్రి. వీరు ప్రస్తుతం తెలంగాణ లోని సికింద్రాబాద్ లో నివసిస్తున్నారు. ప్రియదర్శిని గారు అచ్చం గా తెలుగు అనే వెబ్ పత్రిక కు సంపాదకత్వం వహిస్తున్నవారు. అలాగే వీరు అహోబిల నృసింహ శతకం అనే రచన చేసారు. మినీ కవితలను విశేషం గా వెలువరించిన ముదిగోండ సీతారావమ్మ మల్లికార్జున ; మారుతీ ; పార్వతీశ్వర శతకాలు వంటి రచనలు చేసారు.మరో కవయిత్రి తోట సులోచన.వీరు గేయ రూపం లో పద్యాలు రాసిన వారు. అలా వీరు గేయ రూపం లోనే పసిడి బాల శతకం ను రాసారు. వరంగల్లు జిల్లా కు చేందిన కవయిత్రి పైడిమల్లె త్రివేణి. వీరు ఆటవెలది పద్యాలతో అంజు శతకం అనే రచన చేసారు.అలాగే ప్రస్తుతం వీరు పైడిమల్లె శతకం రాస్తున్నారు.

                    చివరగా నేటి వరకు తెలుగు సాహిత్య వృక్షం ఎన్నో శాఖోపశాఖలు గా వర్ఢిలుతున్నది. పత్రి ప్రక్రియ లో కవయిత్రుల రచయిత్రుల పాత్ర విస్మరణ చేయలేనిది. కాని శతక ప్రక్రియ లో స్త్రీలు రాసిన శతకాలు మరుగున పడిపోవడం మన దురదృష్టం. స్త్రీలు రాసిన పద్యాలలో కూడా ఆణిముత్యాలలాంటి నీతులెన్నో కలవు. కాని ఏవీ కూడా ప్రచారం కు నోచుకోలేదు. అమూల్యమైన కోన్ని రచనలు అలభ్యం కాగా ; కోన్ని అముద్రితాలు గా ఉన్నాయి. లభ్యమైన వాటికి సాహిత్య చరిత్ర లో చోటు కరువైంది. స్త్రీలు రాసిన శతకం లోని పద్యాలు మనకు మచ్చుకు కోన్ని కూడా మనం చదువుకునే పుస్తకాలలో లేవు. ఈ విషయం పై పరిశోధకులు ; సాహిత్య అకాడమీలు ; ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందనీ తెలుపుకుంటూ……..

                                                                       *****

Please follow and like us:

One thought on “శతక కవయిత్రులు”

Leave a Reply to Dr. Ramakrishna Rao Muthyala Cancel reply

Your email address will not be published.