
“నెచ్చెలి”మాట
హేపీ న్యూ ఇయర్-2021
-డా|| కె.గీత
మరొక కొత్త సంవత్సరం అడుగుపెట్టింది…
ఎప్పటిలా
ముందు రోజే ఇంటి ముందు అందమైన “హేపీ న్యూ ఇయర్” ముగ్గులు తీర్చి దిద్దుకుంటూ
“హేపీ న్యూ ఇయర్” అని వీథుల్లో అరుచుకుంటూ
“హేపీ న్యూ ఇయర్” గ్రీటింగు కార్డులు ఇచ్చిపుచ్చుకుంటూ
“హేపీ న్యూ ఇయర్” చాకొలెట్లు పంచుకుంటూ
కాకపోయినా
ఇప్పటిలా
“హేపీ న్యూ ఇయర్” స్టిక్కర్లో, జిఫ్ లో-
ఎవరో పంపిన
పువ్వుల బొమ్మలో, నవ్వుల బొమ్మలో –
వాట్సాపులోనో
ఫేస్ బుక్కు లోనో
ఒకరికొకరు
ఫార్వార్డు చేసుకుంటూ
“హేపీ న్యూ ఇయర్”
“థాంక్యూ, సేమ్ టు యు”
అవే అవే
విసుగొచ్చే అక్షరాల్ని
వేళ్ళు నొప్పెట్టేలా టైపు కొట్టే బాధ లేకుండా
ఇంచక్కా
కాపీ, పేస్టు చేసుకుంటూ
సంతోషించాల్సిన
కొత్త సంవత్సరం కానప్పటికీ-
ఓడినా గద్దె దిగనని పేచీ పెట్టే అమెరికా అధ్యక్షుడి గోలలా
కామెడీగా జరుపుకోవాల్సిన రోజు కానప్పటికీ
విలయతాండవం తగ్గని
కరోనా గుబులుతో
ఏ కోశానా
ఆనందాగమనం కానప్పటికీ-
ఏకంగా చట్టసభ మీదికే దండెత్తిన అధ్యక్షుడి మూకల
సిగ్గు సిగ్గు సంవత్సరంగా
గడ్డకట్టే చలిలో నిరసన రోడ్లపైనే
నిద్రించాల్సిన రైతు బతుక్కి కారణభూతమైన
నిస్సిగ్గు ప్రభుత్వాల
నిరంకుశ సంవత్సరంగా
అడుగుపెట్టినప్పటికీ-
సరికొత్త కరోనా టీకాలా
ఏదొక మంచి జరగకపోదా అని
ఆశావహంగా ఆహ్వానించాల్సిందే!
“హేపీ న్యూ ఇయర్- 2021”
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
