
“నెచ్చెలి”మాట
స్త్రీల పత్రికలు ఎందుకు?
-డా|| కె.గీత
ఆహా…
ఎంత గొప్ప సందేహమూ!
స్త్రీల పత్రికలు ఎందుకు?
ఇది
సందేహమా?
ప్రశ్నయా?
స్త్రీల పత్రికలు ఎందుకు?
అసలు
స్త్రీలకి పత్రికలు ఎందుకు?
అవును
స్త్రీలకి ప్రత్యేకించి పత్రికలు ఎందుకు?
అన్ని పత్రికల్లో
ఓ పేజీయో
అరపేజీయో
ఓ మూలనో
వంటలకి –
ముగ్గులకి –
అందచందాలకి –
అప్పుడప్పుడూ
గుర్తుకొచ్చే
మహిళా సాధికారతకి –
ఎక్కడో
కాస్త మేర
పాపం
కేటాయిస్తూనే ఉన్నారుగా!
అసలు
స్త్రీలకి
పుట్టిల్లు
మెట్టినిల్లు
వంటిల్లు
ఉన్నాయిగా!
మరి
సొంతిల్లు
ఎందుకు?
స్త్రీలకి
ప్రత్యేకించి
రాజ్యాంగ హక్కులు
ఎందుకు?
స్త్రీల
వాక్కుల్ని
కుటుంబం
రాజ్యం
మతం
కాపలా కాస్తున్నపుడు-
అబార్షన్ హక్కులు
ఎందుకు?
స్త్రీల
శరీరాల్ని
రాజకీయాలు
శాసిస్తున్నపుడు-
స్త్రీలకి
ఒక
వేదిక
కావాలనీ-
పత్రిక
వేదిక
అవసరమని-
అసలు
స్త్రీల పత్రిక అంటే
స్త్రీల
ఉనికి
అస్తిత్వం
వ్యక్తిత్వం
ప్రశ్నించే గొంతుక
ఒక తప్పనిసరి అవసరం
అని
సందేహించేవారికి
ప్రశ్నించేవారికి
తెలిస్తే
ఎంత బావుణ్ణు!
****
నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం:
ప్రతినెలా నెచ్చెలి పత్రికలో వచ్చే రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి ప్రకటిస్తాం. పాతరచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.
మరింకెందుకు ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.
వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!
*****
అక్టోబరు 2022 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: అక్షర
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: లక్ష్మీ సుహాసిని కథ ‘మూతపడని రెప్పలు’
ఇరువురికీ అభినందనలు!
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
