
“నెచ్చెలి”మాట
ఒరులేయవి యొనరించిన
-డా|| కె.గీత
ఒరులేయవి యొనరించిన
యప్రియము తన మనంబున కగు
తానొరులకు నవి సేయకునికి ……
అంటే
దెబ్బకు దెబ్బ
చెల్లుకు చెల్లు
టిట్ ఫర్ టాట్
అన్నీ
గంగలో కలిపి
ఎవరేం చేసినా
తిరిగి
ఏమీ చెయ్యకూడదన్నమాట!
అంటే
గాంధీ గారిలా
ఓ చెంప మీద
ఎవరైనా కొడితే
మరో చెంప కూడా
వాయగొట్టమని
చూపించడమన్నమాట!
సరే-
చెప్పడానికి
నీతులు బానే ఉన్నాయండీ-
కానీ
మళ్ళీ మళ్ళీ
లోకువకట్టే వాళ్ళనీ
మళ్ళీ మళ్ళీ
చెంప వాయగొట్టేవాళ్ళనీ
ఏమనాలి?
ఏం చెయ్యాలి?
అయ్యో
మీరు సరిగా
విన్నట్టు లేరు
ఎప్పుడో
కవిత్రయం వారి కాలం
ఇప్పుడు కూడా
ఉందంటే
ఎట్లా?!
ఇప్పటి
నీతి
న్యాయం
పద్ధతీ
ఏవిటంటే
ఒరులేయవి యొనరించిన
యప్రియము తన మనంబున కగు
తానొరులకు నవే సేయువానికి ……
అంటే
దెబ్బకు దెబ్బ
చెల్లుకు చెల్లు
టిట్ ఫర్ టాట్
…….
…….
అంటే
ఎవరేం చేసినా
తిరిగి వారికే
అదే చేయుటన్నమాట!
బాగు బాగు-
ఆగండాగండి…
కానీ
మనమేం
చెయ్యకపోయినా
మళ్ళీ మళ్ళీ
లోకువకట్టే వాళ్ళనీ
మళ్ళీ మళ్ళీ
చెంప వాయగొట్టేవాళ్ళనీ
మళ్ళీ మళ్ళీ
వాడుకునేవాళ్ళనీ
ఏమనాలి?
ఏం చెయ్యాలి?
అయినా
పిచ్చిగా ఎవరినైనా
నమ్మడం కాకపోతే
దేనినైనా
ఎవరినైనా
మార్చగలిగింది
ఉందా?
మనల్ని మనం
మార్చుకోవడం తప్ప!!
****
నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం:
ప్రతినెలా నెచ్చెలి పత్రికలో వచ్చే రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.
మరింకెందుకు ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.
వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన “నెచ్చెలి”లో వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!
*****
నవంబరు, 2024 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: గోపరాజు వెంకట సూర్యనారాయణ
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: గంజాయి వనం-కథ (నెల్లుట్ల రమాదేవి)
ఇరువురికీ అభినందనలు!
****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
