
తల్లివేరు- నెల్లుట్ల రమాదేవి కథల పై సమీక్ష
-కె.వరలక్ష్మి
‘నాగరిక సమాజంలో మానవుల సంసారాన్ని పెంచడమే సాహిత్య ప్రయోజనమైతే అది రమాదేవి గారి కథల వల్ల తప్పక నెరవేరుతుంది’ అన్నారు ఓల్గా ఈపుస్తకం ముందు మాటలో. అది అక్షర సత్యం అనేమాట ఈపుస్తకంలోని కథలు చదివితే తెలుస్తుంది. తెలంగాణా పల్లె వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమాదేవి ఆంధ్రాబేంక్ లో బ్రాంచి మేనేజర్ గా, మార్కెటింగ్, కష్టమర్ రిలేషన్స్, ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సీనియర్ మేనేజర్ గా పని చెయ్యడం వల్ల కలిగిన ఆర్థికపరమైన సమస్యల అవగాహన ఈ కథల రచనకు మార్గం సుగమం చేసింది.
రమాదేవి ఏ వాదాల జోలికీ పోకుండా అలవోకగా రాసిన వేరువేరు కథాంశాలతో వైవిధ్య భరితమైన కథలివి.
పాత కొత్త తరాల మధ్య ఆర్థిక సంబంధాల గురించి, భార్యలతో మొరటుగా ప్రవర్తించే భర్తల నైజం గురించి, ప్రేమించిన వ్యక్తినీ- తన భవిష్యత్ జీవితానికి తోడునీ వదులుకునేలా చేసే స్త్రీల మాతృత్వ భావనల బలహీనత గురించి, సంపాదిస్తున్నా, ఆర్థిక స్వేచ్ఛను పొందలేని స్త్రీల గురించీ, ప్రపంచీకరణ నేపథ్యంలో భూమి సంబంధాల మార్పుల గురించీ, అత్తగారిని అపురూపంగా చూసుకునేలా చేసిన ఆర్థిక అవసరం గురించీ, కరోనా కాలంలో బైటపడిన మనుషుల స్వభావాల గురించీ, పెళ్లి తర్వాత మారే ఆడపిల్లల ఇంటి పేరు గురించీ, స్త్రీల చీరల పిచ్చి గురించీ కథలు ఉన్నాయి ఈ పుస్తకంలో. రచనకు ముఖ్యమైనది చదివించే లక్షణం. అది పుష్కలంగా ఉన్నపుస్తకం తల్లివేరు.
రచయిత్రి కథారచయితే కాకుండా గుర్తింపు పొందిన కవి, కార్టూనిస్ట్ కూడా కావడం వలన హాస్య, వ్యంగ్య కథలు కూడా చక్కగా పండేయి. బహుమతి పొందిన, వివిధ పత్రికలలో ప్రచురణ పొందిన కథల సమాహారమైన ఈ పుస్తకం తప్పక కొని చదవాల్సిన పుస్తకం.
వెల – 200/-
*****

కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 200 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. అజో విభో విశిష్ట సాహితీ మూర్తి, ఆంధ్రప్రదేశ్ 2025 ఉగాది గౌరవ పురస్కారం, చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం , రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్డులు. శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి కవితలకు అవార్డులు. శాస్త్రీయ సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.
