వీక్షణం- 83

-రూపారాణి బుస్సా

 
జూలై నెల 14వ తారీఖున బే ఏరియాలో శర్మిల గారి ఇంట్లో వీక్షణం 83వ సమావేశం అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. సాయి బాబ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశాన్ని శర్మిలగారు స్వయంగా రచించిన  “బెజవాడ నుంచి బెంగాల్ సరిహద్దు దాక” అన్న ఆసక్తికరమైన కథతో ప్రారంభించారు. నాయనమ్మ చిట్టెమ్మని తీసుకుని బెంగాల్ లో ఉంటున్న వాళ్ళ అబ్బాయి ఉంటున్న బెంగాల్ సరిహద్దు దాక ఎలా ప్రయాణం చేసి క్షేమంగా చేరారన్నది కథా విశేషం.
తరువాత కార్యక్రమం అబ్బూరి ఛాయాదేవి గారు గురించి. వీరు  స్త్రీల సాహిత్యానికి ద్రోణాచార్యులవంటి వారు ఇటీవలే స్వర్గస్తులైయ్యారు. వీరికి నివాళులు తెలుపుతూ ఆమె వ్రాసిన “వుడ్ రోజ్ ” అన్న చిన్న కథను  డా|| కె గీత గారు వాచించారు. ప్రతి ఇంటా జరిగే సహజమైన కథావస్తువు తీసుకుని అందరి కళ్ళల్లో కథా చిత్రం కనిపించేలా రాసారు. సభలోని వారంతా కథ గురించి తమ తమ అభిప్రాయాలను తెలిపారు.
 
తదుపరి కె. వరలక్ష్మిగారిచే రచింపబడ్డ కథను పఠించారు గీత గారు. ఈ కథ గురించి సభలోని వారంతా వివరంగా చర్చలు జరిపాక విరామంలో కూడా చర్చ కొనసాగింది.
విరామానంతరం డా|| కె గీత గారు జూలై 10 వ తారీఖున తాము మొదలు పెట్టిన “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక (https://www.neccheli.com/) ను స్త్రీలందరితో కలిసి సభాముఖంగా ఆవిష్కరణ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో స్త్రీలకు సంబంధించిన  సాహిత్యాన్నీ, అభ్యున్నతిని, స్ఫూర్తిదాయకమైన అనేక అంశాల్ని “నెచ్చెలి” పరిచయం చేస్తుందని, ‘నెచ్చెలి’ కి స్త్రీలూ, పురుషులూ అందరూ రాయవచ్చునని, ఇంగ్లీషు భాషలో రచనలు చేసేవారికి ప్రత్యేకంగా “Neccheli-English” శీర్షిక అవకాశం కల్పిస్తుందని చెపుతూ, ‘నెచ్చెలి’ రచనలకు ఆహ్వానం పలుకుతోందని, నేరుగా editor.neccheli@gmail.com  కు ఈ -మెయిల్ లో పంపవచ్చని తెలియజేసారు.
 
ఉమర్ షరీఫ్ గారు తమ పరిచయాన్ని అందిస్తూ తమ కావ్య ప్రవేశం గురించి సభకు తెలిపారు. సాయిబాబ గారు చల్తే చల్తే అను పాత హిందీ పాట బాణి లో తాము లిఖించిన హిందీ పాటను పాడి అందరిని ఉత్సాహ పరిచారు. ఆ తరువాత రూపా రాణి బుస్సా గారు ఓ చెలియా నా ప్రియ సఖియ బాణి లో తామే లిఖించిన ఓ మనసా నా ప్రియ మనసా అన్న పాటను పాడి సభలో
అందరి మనసును ఆకట్టుకున్నారు. అనంతరం గీతగారు “అమ్మ చేతి పసుపు బొమ్మ” అను పాటను పాడి  ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరికీ అందించారు. తదుపరి లెనిన్ గారు “నా పేరేంటి” అన్న పద్యం చదివారు. అలాగే పేరు ఎవరిది మరియు ఎవరి కొరకు ఈ పద్యం వ్రాసారో ప్రసంగించారు. అంతరాత్మ పేరు అదని ఓం తత్ సత్ వివేక విచారంతో కొన్ని వెలకట్టలేని ఆణిముత్యమని తెలిపారు. అనంతరం ఇక్బాల్ గారు కొన్ని మాటలు పలికారు. తాము టెక్సాస్ రాష్ట్రానికి తరలి వెళుతున్న విషయాన్ని వ్యక్త పరచారు. వీక్షణంలో  అందరూ ఇక్బాల్ గారికి శుభాకాంక్షలు అందజేస్తూ తాము వారిని ఇక  మీదట  ఇక్కడ కలుసుకోలేనందుకు విచారం వ్యక్తం చేశారు.
 
తరువాత మాట్లాడిన దమయంతిగారు సహితం నార్త్ కారోలీనా రాష్ట్రానికి బదిలీ అవడం వీక్షణ మిత్రులు వీడ్కోలు శుభాకాంక్షలు  అందజేశారు. ఆ తరువాత దమయంతి గారు జయదేవ కృతి చందన చర్చిత పాటను పాడి మంత్రముగ్దుల్ని చేసారు.
 
తదనంతరం శారదగారి క్విజ్ కార్యక్రమం అందరిని అలరించింది.
 
ఇక చివరగా అధ్యక్షులు సాయిబాబ గారు చక్కని మాటలతో సభను ముగించారు.
ఈ సమావేశానికి శ్రీ సాయిబాబాగారు, శ్రీ లెనిన్ గారు, శ్రీ ఇక్బాల్ గారు, శ్రీ ఉషర్ షరీఫ్ గారు, శ్రీమతి గీత గారు, శ్రీమతి దమయంతి గారు, శ్రీమతి రూపారాణి బుస్సాగారు, శ్రీమతి శారదగారు, శ్రీమతి షర్మిల గారు, శ్రీమతి మొ.న వారు హాజరైయ్యారు.
 
*****
 
Please follow and like us:

One thought on “వీక్షణం 83 సమావేశంలో – “నెచ్చెలి” ఆవిష్కరణ”

Leave a Reply to జ్యోతిర్మయి మళ్ళ Cancel reply

Your email address will not be published.