
ఒంటరి (కవిత)
-ములుగు లక్ష్మీ మైథిలి
రాతిరి
కొన్ని బాధలు కరిగిస్తుంది
అర్థరాత్రి నిశ్శబ్దం
వెలుతురు నాహ్వానిస్తూ
గడిచిన వెతలకు
జవాబు చెపుతుంది
రాతిరి
నా అక్షరాలు
నల్లని చీకటిని చీల్చే
కాంతి పుంజాలవుతాయి
చెదిరిన ఆశల తునకలను
కవిత్వం గా అల్లుకుంటాను
రాతిరి
వెన్నెల లో
ఊసులు చెప్పుకొని
ఎన్నాళ్ళయిందో?
ఆ నిశీధి మౌనంలో
హృదయాల సవ్వడులు
మూగగా మాట్లాడుకుంటాయి
రాతిరి
నిదురలేని రాత్రులు
ఈ దేహపు ఆకాశం లో
ఉదయాస్తమయాలు ఒక్కటే
కన్నీటి నక్షత్రాలు
సందె దీపాలై
మిణుకు మిణుకు మంటాయి
ప్రతీ రాత్రి
నాలోని నేనుకు
ఓదార్పునవుతాను..
*****

ములుగు లక్ష్మీ మైథిలి జన్మస్థలం ఒంగోలు. కవితలు , కథలు రాయటం, చదవడం ఇష్టాలు. అనేక దిన, మాస , పక్ష , వార పత్రిక లలో కవితలు ప్రచురించబడ్డాయి. మానస సాంస్కృతిక ( విజయవాడ ) , సృజన సాహితి సంస్థ (నెల్లూరు ) ,చెలిమి సాంస్కృతిక సంస్థ వారిచే దేవులపల్లి స్మారక అవార్డు (హైదరాబాద్ ) ,పెన్నా రచయితల సంఘం (నెల్లూరు ) వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. చినుకులు, ఊహలు గుసగులాడే కవితాసంపుటాలు, 50 కథలు ప్రచురణ అయ్యేయి.
