
యద్భావం – తద్భవతి
-ఆదూరి హైమావతి
గోవిందపురంలో గోపయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఐదెక రాల మంచి భూమి ఉండేది.దాన్లో అతను తండ్రి వద్ద నేర్చుకున్న వ్యాపారమెళకువలను పాటిస్తూ వ్యవసాయం చేసి మంచి దిగుబడి, దానికి తగిన ప్రతిఫలమూ పొందే వాడు.
ప్రతి ఏడాది అంతా ఏ పంటలు వేస్తున్నారో బాగా పరిశీలించి తాను వారికి భిన్నంగా ఎంపికచేసు కున్న పంట వేసేవాడు. అంతా వేలం వెర్రిగా వరి పంటో, గోధుమపంటో, రెండో కాపుకు పొగాకో, కంది పంటోవేసే వారు. ఐతే గోపన్నమాత్రం అంతా విత్తాక అందరినీ గమ నించి వేరే పంట వేసే వాడు.దాంతో ఆపంటకు గిరాకి లభించేది. అంతా పోలం పనులు మొదలెట్టాక తానూ భూమికి పదునుపెట్టి, ఎరువువేసి ,తయారు చేసుకుని, అంతా విత్తులునాటాక తాను అంద రూవేసిన పంటకాక వేరేది వేసేవాడు.ఇది అతడు తండ్రి వద్దనేర్చు కున్న వ్యవసాయ నేర్పరితనం. అందువల్లే అతని వ్యవసాయం బాగాలాభసాటిగా ఉండేది.అంతేకాక గోపన్న మంచి మనసున్న వాడు. ఇతరులకు సాయం చేయడంలో తాను నష్టపోయినా లెక్కిం చేవాడుకాదు. అదికూడ అతనికి అందరిలో మంచి గుర్తింపు నిచ్చింది.
ఒకఏడాది అంతా ప్రతి సంవత్సరం వేసినట్లే తొలి కాపుగా వరివేశారు.ఐతే గోపన్న మాత్రం తన పొలంలో ఈమారు పత్తి వేశాడు. బాగా పేడ ఎరువుతో పొలాన్ని పదునుపెట్టి నందున పత్తి మొక్కలు ఏపుగా పెరగసాగాయి. పైగా గోపన్న వేసిన పత్తి విత్తనాలు చాలా నాణ్యమైనవి.
చక్కగా ఎదిగి పచ్చని పూలతో పొలం కళకళ లాడ సాగింది. చూస్తుండగానే పూలు కాయలుగా మారి, విచ్చుకోసాగాయి. గట్లెమ్మట వున్న మొక్కలు ముందుగా కాయలు పగలసాగాయి. జగదీష్ చంద్ర బోస్ అనేమన శాస్త్రవేత్త మొకక్లకూ ప్రాణముంటుందనీ మనసుంటుందనీ ఋజువు చేశాడుకదా! ఒకరోజున పత్తిమొక్కల్లో ఏపుగాపెరిగిన పొలంగట్లమ్మట ఉండే మొక్కలు ‘మేము భగవంతు నికి వస్త్రాలుగా మారి మాజీవనాన్ని పవిత్రం చేసుకోవాలని కోరు కుంటున్నాం.ఇదిమాఆశ, మరి భగవంతుడు మాపై దయచూపుతా డో లేదో!” అన్నాయి.
పొలం మధ్యగా ఉన్న వాటికంటే కాస్త ఎత్తు తక్కువగా ఉన్న మొక్క లు “మేము మీలాకాకపోయినా భగవంతుని అర్చించేపూజారి వస్త్రాలుగా నన్నా రూపు దాల్చాలని కోరుకుంటున్నాము. మరి మా కోరిక తీరుతుందోలేదో ” అన్నాయి.
పొలంలో మిగతా వాటికంటే ఎత్తు తక్కువగా ఉన్న మొక్కలు “మీలా కాకపోయినా మేమూ భగవంతుని రోజూ అభిషేకాల అనం తరం తుడిచే వస్త్రాలుగా నైనా మారాలని కోరుకుంటున్నాము. మాగతి ఎలా అవుతుందో తెలీదు అంతా ఆపరమాత్మదయ ” అన్నాయి.
పత్తి పంట బాగా పెరిగి కోతకొచ్చింది . గోపన్న పత్తిపంటకోయను రోజు నిర్ణయించుకోసాగాడు.
ఇదిజరిగిన కొన్నాళ్ళకు రాజుగారి పరివారం ఆగ్రామానికి వచ్చి “ఇక్కడ గోపన్న ఎవరూ! అతడు ప్రత్తిపంట వేశాడనీ, పత్తి బాగా నాణ్యంగా పట్టులాగా ఉందనీ తెలిసింది. నిన్న మీ ఊరినుంచీ నగరానికి వచ్చిన వ్యాపారులు చెప్పారు.ఆపొలాన్ని మేము చూడా లి. రాజుగారు తన పితృదేవులు కట్టించిన శివాలయంలో స్వామి వారికి కొత్త పత్తితో వస్త్రాలు నేయించాలని అను కుంటూ నాణ్యమైన పత్తికోసం వెతికి రమ్మని మమ్ము పంపారు ” అని ఆగ్రామ పెద్దను అడిగారు .
గ్రామపెద్ద గోపన్నకు కబురంపి , విషయం చెప్పి పొలం చూపమని చెప్పాడు. రాజాజ్ఞ ప్రకారం గోపన్న తన పొలం లోని పత్తి పంటను చూపాడు. వారు నేతగాళ్ళతో వచ్చినందున , ముందుగా గట్లమ్మట ఉండే బాగా పెద్దగా ఉన్న పత్తిని వేరుగా తామే కోతగాళ్లను పెట్టి కోయించి, మధ్యలో పత్తి కాయ లను వేరుగానూ, మిగతా వాటిని వేరు గానూ కోయించి, మంచి వెల గోపన్నకు ఇచ్చి మూడు వేరు వేరు బండ్లలో పత్తిని తీసుకెళ్లారు. ఆమొక్కల ప్రార్ధన భగవంతుడు విన్న ట్లే జరిగింది.
భగవంతుని వస్త్రాలు కావాలనుకున్న ఆపత్తి కాయలు శివునికి వస్త్రాలుగా నేతగాళ్ళ చేతుల్లో రూపు దిద్దుకున్నాయి.మిగతా రెండు విధాలుగా కోరుకు న్న పత్తి మొక్కల కోరికలూ తీరాయి. ఐతే కొన్ని మాసాలకు భగవంతునికి కట్టే వస్త్రాలు మారిపోయి కొత్తవి వచ్చా యి. పూజారి వస్త్రాలూ మారిపో యా యి. శివలింగానికి అభిషేకం చేశాక తుడిచే వస్త్రం మాత్రం బహుకాలం ఆయన సేవలో ఉండి పోయింది.
అందుకే యద్భావం ఆలోచనమేరకు తధ్బవతి జరుగుతుందని అంటారు పెద్దలు.
*****

నేను 40 సం. [యం.ఏ. బియెడ్] ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యా యినిగా పనిచేసి 2004 లో వృత్తి విరమణపొందినాను.
ఆరోజుల్లో ఆకాశవాణి విజయ వాడ కేంద్రం నుండి వ్యాసాలు, నాటకాలు, టాక్స్ ప్రసారమయ్యాయి. ఎక్కువగా బాలవిహార్లో వచ్చాయి.
4 మార్లు జిల్లా స్థాయిలోనూ , 1992లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యా య అవార్డు , 1994 లో జాతీయస్థాయిలో ఉత్తమ జాతీయ స్థాయి ప్రధానోపాధ్యాయినిఅవార్డు, 2003లో కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామీజీచే జాతీయ స్థాయి అవార్డు [ ఇన్నో వేటివ్ టెక్నిక్స్ ఇన్ క్లాస్ రూం టీచింగ్ అనే రిసెర్ఛ్ అంశానికి] గోల్డ్ మెడల్ భగవంతుని కృపతో అందాయి.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు మానవతా విలువలను . భారతీయ సంస్కృతినీ లేతవయస్సులో పిల్లల మమనస్సుల్లో నింపాలనే ప్రయత్నంతో, 1969లో స్థాపించిన బాలవికాస్ అనే ఉచిత మానవతా విలువల బోధనా తరగతులు నిర్వహిస్తూ ,ఒక సేవకురాలిగా 1978 నుండీ వుంటూ, స్టేట్ రిసోర్స్ పర్సెన్గా 1985నుండి రాష్ట్రస్థాయి పర్యటనలు సంస్థ తరఫున సాగిస్తూ ఈ రోజువరకూ జీవిస్తున్నాను. ప్రస్తుతం పుట్టపర్తి ఆశ్రమ ఐఛ్ఛిక సేవలో జీవనం కొనసాగుతున్నది.
