
“నెచ్చెలి”మాట
2020 నేర్పిన పాఠం
-డా|| కె.గీత
వచ్చినంత వేగంగానూ వెళ్లిపోయే వాటిల్లో మొట్టమొదటిది సంవత్సరం!
కానీ వెళ్ళిపోతూ చేదు జ్ఞాపకాల్ని మాత్రమే మిగిల్చేవి కొన్ని మాత్రమే-
అందులో మొట్టమొదటిది 2020 వ సంవత్సరం!
చేదు జ్ఞాపకాలు ఎవరో ఒకరిద్దరికి కాదండోయ్
భూమ్మీద అందరికీ సమానంగా పంచడంలోనూ
మొట్టమొదటిది 2020 వ సంవత్సరం!
అందమైన సంఖ్య-
ఆనందదాయకమైన రోజులు-
ఎన్నో గొప్ప కొత్త ఉత్సాహాలు-
అంటూ ప్రారంభమైన జనవరి 1, 2020 నాడు
ఎవరమైనా కలనైనా ఊహించామా?
అసలు ఈ ఏడాది ఇలా జరుగుతుందని?
అసలు ఇటువంటిదొక సంవత్సరం ఉంటుందని?
ఎన్ని మరణాలు…
ఎన్ని ఆసుపత్రి బాధలు….
ఎన్నెన్ని దుఃఖాలు…..
అయినా బాధ వద్దు-
ఉద్యోగాల్లేవు
వ్యాపారాల్లేవు
అయినా నిరాశపడొద్దు-
కనీ వినీ ఎరగని వరదలు
కమ్ముకున్న కార్చిచ్చులు
పగిలిన బతుకు పాదాల వలస వెతలు
రగిలిన నల్లగుండెల నినాదాలు
ఎన్ని దుఃఖాలు.…
ఎన్ని వేదనలు….
ఎన్నెన్ని ఘోరాలు….
కొన్నిసార్లు జీవితం కఠినాతికఠినమైన కాలాన్ని చవిచూపిస్తుంది
కొన్నిసార్లు జీవితమే తల్లక్రిందులవుతుంది
అయినా ఓడిపోవద్దు-
ఎందుకంటే
కొందరు అదృష్టవంతులు కూడా ఉన్నారండోయ్!
భవిష్యత్తరాలు కథలుగా చెప్పుకునే 2020లో
కరోనా బారిన పడకుండా
జనవరి1, 2021ని సజీవంగా చూసే వారంతా అదృష్టవంతులే!
ప్రాణాలతో ఉండడమే ఇప్పటి ధ్యేయం!
అన్నివిధాలా
జాగ్రత్తగా మసలుకోవడమే
ఈ సంవత్సరం నేర్పిన పాఠం!
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.

గీతగారూ, చక్కగా consolidate చేసారు 2020 గురించి. Nice.
Thank you so much Gautami garu!