
భావన
-ఆదూరి హైమావతి
అనగా అనగా మైసూరు రాజ్యాన్ని మేధవర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆయన మంచి పాలకుడు. వివేకవంతుడు.ప్రఙ్ఞాశాలి. అతడు ప్రజల క్షేమం కోసం నిరంతరం శ్రమించే వాడు.
ప్రతి రాత్రీ రెండోఝాములో తన ఆంతరంగిక మంత్రులతోనూ, విద్యా వేత్తలతోనూ సమావేశాలు జరిపి ప్రజల బాగోగులు చర్చించేవాడు.
ఒకరోజున ఆంతరంగిక సమావేశంలో “మనకు ఇతరులపై ఏర్పడే అభిప్రాయాలు వారిని మొదటిమారు చూడగానే మన మనస్సులో కలిగే అభిప్రాయాన్నిబట్టి ఉండవచ్చు, లేదా తాము దేనిగురించీ ఆలోచిస్తు న్నామో దానికి అనుగుణంగా కూడా వుండవచ్చని మా అభిప్రాయం. ” అని మహారాజు చెపప్సాగాడు.
ఒక చారుడు ప్రవేశించి “జయము మహారాజా! మన ప్రధాన రహదారి పక్కనే ఒక త్రాగుబోతు పడి ఉన్నాడు. తమరు అతడిని ఏమిచేయమంటారో సెలవివ్వండి” అని అడిగాడు.
ఇంతలో మరో చారుడు ప్రవేశించి ” జయము మహారాజా! నేను నా వేగు వ్యాపారము ముంగించుకుని వస్తుండగా ప్రధాన రహదారి వెంట ఒక వ్యక్తి స్ప్రహ తప్పి పడి ఉన్నాడు ప్రభూ ! బహుశా ఏదో తీవ్ర అనారోగ్యం కారణం కావచ్చు. తమరి అనుమతి మేరకు చర్య చేపడతాను” అనిచెప్పాడు.
ఇంకకొంతసేపటికి మరో వేగు ప్రవేశించి “మహారాజా!మన ప్రధాన రహదారి పక్కనే ఒక మహానుభావుడు తపోదీక్షలో, నిశ్చల సమాధి అవస్థలో ఉన్నాడు,ఎంత పిలిచినా పలుకనే లేదు.తమకు విన్నవించుకోను వచ్చాను. సెలవి వ్వండి ప్రభూ! ఏమి చేయమంటారో!”అన్నాడు.
మరో చారుడు హడావిడిగా వచ్చి” ప్రభూ ! ఎవ్వరో చోరుడై ఉండవచ్చు మన ప్రధాన రహదారి పక్కనే పడి ఉన్నాడు, బహుశా వాడు ప్రవేసించిన ఆ ఇంటివారు వెంబడించి తరిమి ,కొట్టి ఉండవచ్చు, ఒళ్ళు తెలీక పడి ఉన్నాడు. శలవివ్వండి ప్రభూ! కట్టి తెచ్చి తమ ముందు పడేస్తాను. నా కర్తవ్యం మీకు తెలియ పరచడమే ఐనందున నేను బంధించి తేలేదు” అన్నాడు.
మరో వేగు వేగంగావచ్చి ” ప్రభూ! మన ప్రధాన రహదారి పక్కనే ఒక అనాధపడి ఉన్నాడు ప్రభూ! అన్నం లేక నీరసించి ,నడిచే ఓపికలేక పడి ఉండవచ్చు. అతడిని చూడగానే నాకు అనాధ నిపించింది.అకలికి తాళలేక పడిపోయినట్లున్నాడు.నేను చేయాల్సిన ధర్మం సెలవివ్వండి మహారాజా!” అని చెప్పాడు.
ఆసమావేశంలో ఉన్న ఉద్యోగులంతా ఆశ్చర్యపడ్దారు.’ ఒకేమారు ఐదుగురు వ్యక్తులు ప్రధాన రహదారి వెంటపడి ఉండటమేంటీ! చిత్రంగా ఉందే, వీరు పరాయి దేశాల వేగులు కాదుగదా! తమరాజ్యంలో ప్రవేశించను ఇదో పధకమై ఉండదు కదా! ‘ అని భావించిన మహామంత్రి ,
” మహారాజా! వెంటనే వెళ్ళి ఈ వ్యక్తులంతా ఎవరో విచారించి అవసరాన్ని బట్టి చర్య చేపట్టడం ఉత్తమం అని పిస్తున్నది.” అన్నాడు.
వెంటనే మహారాజు ” పదండి! మహా మంత్రీ! అందరమూ వెళ్ళి చూద్దాం, ఇది తేలికగా వదిలేయాల్సిన విషయంలా లేదు” అని ఆంతరంగికు లందరితో కలసి వెళ్ళిచూశాడు.
అక్కడ ప్రధాన ద్వారం వద్ద పడి ఉన్న వ్యక్తి వంటిమీద ఒక చిన్న అంగవస్త్రం తప్ప మరేమీ లేదు.ఐదురుగు వున్నా రని ఐదుమంది వేగులు వేగులు చెప్పగా అక్కడ ఒక్కడే వుండటాన మహారాజూ, మహామంత్రీ మిగతా వారు లేచి ఎటో వెళ్ళలేదుకదా అనికూడ అనుకున్నారు.
మహారాజు ఆజ్ఙతో ,సేవకులు అతడి ముఖం మీద నీళ్ళు చల్లి లేపి కూర్చుండ బెట్టి,అతడికి కాస్త వేడి పాలు తెప్పించి త్రాగించాక , అతడు కళ్ళుతెరచి చూశాడు .
“ఓ అపరిచితుడా! నీవెవరు? ఏదేశం వాడివి? ఏ ఉద్దేశంతో మా రాజ్యంలో ప్రవేశించదలచావు? ఏరాజు నిన్ను పంపా డు? ప్రాణంమీద తీపిఉంటే యదార్ధం చెప్పు, బ్రతుకు తావు. లేనిచో ప్రాణాలపై ఆశవదులుకో.” అన్నాడు మహామంత్రి తీవ్రస్వరంతో .
అతడు చుట్టూ చూసి ఆశ్చర్యంగా ” నమస్కారం! మన్నించండి!నేను పరదేశినే ,కానీ ప్రమాదకారిని కాను. మీ రాజ్యానికి హాని చేయను వచ్చినవాడినీ కాను.వేగునూ కాను. వారణాశి లోని మా గురుదేవులైన బృహస్పతుల వారి ఆశ్రమం లో విద్యాభ్యాసం పూర్తి చేశాను. మా గురుదేవులు ఈదేశపు మహారాజు గురించీ చెప్పి ,వారిని ఆశ్రయించి జీవించమని ఆదేశించారు. దారిలో తిండిలేక ,బాహుదా నదిలో స్నానం చేసి ఆరేసు కున్న బట్టలన్నీ, సుడి గాలికి కొట్టుకు పోగా ఈ ఒక్క అంగవస్త్రంతో మిగిలాను.నన్ను ఎవ్వరూ లోనికి అనుమతించ లేదు నా వస్త్రధారణ చూసి, భిక్షువుగా భావించారు. మన్నించండి.సకల శాస్త్రాలూ బృహస్పతులవారి వద్ద అభ్యసించాను.” అన్నాడు నీరసంగా.
మహామంత్రి వేగులకేసి చూసి ” మీరు చెప్పిన మిగతా వారు ఎవరు?ఎక్కడ చూసారు?”అని అడిగాడు. దానికివారు తాము చూసింది ఇతడినే అని చెప్పారు.
మహారాజు చిరునవ్వుతో అతడిని విడిదికి పంపాడు.ఆ వేగులగురించీ విచారించగా వారిలో మొదటివాడు తన తండ్రి తాగుబోతై రోజూ త్రాగివచ్చి ఇంట్లో చేసే గలాటా గురించీ తన వేగు పని ముగించుకుని వెళుతూ ఆలోచిస్తూ ఆ పడివున్న వ్యక్తిని చూసాడు. అందుకని ఆవేగుకు అతడు త్రాగుబోతై వుండవచ్చనే భావన కలిగింది.
రెండవ వేగు తల్లి దీర్ఘ అనారోగ్యంతో తీసుకుంటూ వుండగా ఇంటికెళ్ళేముందు ఆమె గుర్తువచ్చి అతడూ ఒక రోగైవుండవచ్చని భావించాడు.
ఇక మూడో వేగు ఆరోజు ఉదయాన్నే ఒక సాధువును కలిసి ఆయన ముందు బోధ వింటున్న వారినంతా గమ నిస్తూ కూర్చున్నందున ఇంటికెళ్లేముందు చూసిన ఆ పడివున్న వ్యక్తి ఒక సాధువుగా అనిపించాడు.
నాల్గవ వేగు దొంగలను గుర్తించడంలోనూ , వారిని పట్టడంలోనూ మెళకువలు బాగా తెలిసిన వ్యక్తి కావటాన అతడి ఆలోచనలు ఎల్లప్పుడూ దొంగలమీదే వుండటాన, ఆపడివున్న వ్యక్తి చోరుడు కావచ్చని ఊహించాడు.
ఐదవ వేగు తాను పసితనం నుండీ అనాధగా బతికి ఒక విద్యావేత్త ఆకలికి పడివున్న తనను చూసి జాలిపడి ఇంటికి తీసుకెళ్ళి చదువు నేర్చినందున ఆయన సలహాతో ఈ వేగు వృత్తి తనకు దొరకటాన తన బాల్యం గుర్తుకు వచ్చి అతడు అనాధ ఐవుంటాడని ఆవేగు తలంచాడు.
ఇవన్ని మహా మంత్రి సేకరించి క్షణాల్లో మహారాజుకు చెప్పాడు.అంతా విని మహారాజు.
“చూశారా మహామంత్రీ! మన దృష్టిని బట్టీ, మన ఆలోచనలను బట్టి మనం ఎదుటి వారిని అంచనా వేస్తా మని ఈ సంఘటనతో నిరూపణైంది కదా! మన దృష్టిని బట్టేమన ఆలోచనలు పరులపై ఏర్పడతాయి.” అని చెప్పి అందరితో కలిసి సమావేశం ముగించి, తన శయన మందిరానికి సాగాడు మహారాజు..
ఆ విద్యావేత్తను , తగిన విశ్రాంతి మందిరంలో అలసట తీరేవరకూ విశ్రమించ మనికోరి ఉచిత రీతిన సత్క రించి,తన రాజ్యంలో ఒక విద్యాలయం స్థాపించి అర్హత , ఆసక్తి గల వారందరికీ విద్యాబోధ చేయమని నియ మించారు.
ఇతరులపై ముందుగానే ఒక భావన ఏర్పర్చుకోడం అనుచితం.
*****

నేను 40 సం. [యం.ఏ. బియెడ్] ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యా యినిగా పనిచేసి 2004 లో వృత్తి విరమణపొందినాను.
ఆరోజుల్లో ఆకాశవాణి విజయ వాడ కేంద్రం నుండి వ్యాసాలు, నాటకాలు, టాక్స్ ప్రసారమయ్యాయి. ఎక్కువగా బాలవిహార్లో వచ్చాయి.
4 మార్లు జిల్లా స్థాయిలోనూ , 1992లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యా య అవార్డు , 1994 లో జాతీయస్థాయిలో ఉత్తమ జాతీయ స్థాయి ప్రధానోపాధ్యాయినిఅవార్డు, 2003లో కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామీజీచే జాతీయ స్థాయి అవార్డు [ ఇన్నో వేటివ్ టెక్నిక్స్ ఇన్ క్లాస్ రూం టీచింగ్ అనే రిసెర్ఛ్ అంశానికి] గోల్డ్ మెడల్ భగవంతుని కృపతో అందాయి.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు మానవతా విలువలను . భారతీయ సంస్కృతినీ లేతవయస్సులో పిల్లల మమనస్సుల్లో నింపాలనే ప్రయత్నంతో, 1969లో స్థాపించిన బాలవికాస్ అనే ఉచిత మానవతా విలువల బోధనా తరగతులు నిర్వహిస్తూ ,ఒక సేవకురాలిగా 1978 నుండీ వుంటూ, స్టేట్ రిసోర్స్ పర్సెన్గా 1985నుండి రాష్ట్రస్థాయి పర్యటనలు సంస్థ తరఫున సాగిస్తూ ఈ రోజువరకూ జీవిస్తున్నాను. ప్రస్తుతం పుట్టపర్తి ఆశ్రమ ఐఛ్ఛిక సేవలో జీవనం కొనసాగుతున్నది.
