
వెనుకటి వెండితెర-2
-ఇంద్రగంటి జానకీబాల
స్ఫూర్తి పొందాల్సిన అవసరం
నిజమైన మేధావులు-సంఘం పట్ల అవగాహన, సానునభూతి వున్నవారూ – తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చి పనిచేయడం మొదలుపెట్టిన కాలం 1950 నుంచి 1960. అప్పుడు వున్న సినిమా చరిత్రను పరిశీలిస్తే –
ఎల్.వి. ప్రసాద్- పి. పుల్లయ్య- సి. పుల్లయ్య- కె.వి. రెడ్డి, బి.ఎన్. రెడ్డి లాంటి సుప్రసిద్ధ దర్శకులు కనిపిస్తారు. వారెప్పుడూ మంచి కథల కోసం వేట సాగించేవారు. కథలు ఇతర భాషలవైనా, అది సినిమాగా వేరే భాషలో రూపొందిచబడి వున్నా, దానిని తెలుగు సమాజానికి, తెలుగు సంస్కృతికి మనుషుల మనస్తత్వాలకీ – ఆదర్శాలకీ అనుగుణంగా మలచేవారు. అలా రూపొందించబడిన చిత్రమే ‘అర్థాంగి’- ఇది స్వయంసిద్ధ అనే ఒరియా చిత్రం ఆధారాం తీసినట్టు చరిత్ర చెప్తూ వుంది. ‘అర్థాంగి’ అనే టైటిల్ కిందనే స్వయంసిద్ధ కథ ఆధారంగా అని వుంటుంది.
ఈనాడు మనం మహిళ సాధికారత గురించి, చదువు గురించి, స్వయం నిర్ణయాధికారం గురించి, ఆమె ఆత్మాభిమానం గురించి, ధైర్యసాహసాల గురించి, తెలివి గురించి, అన్నింటికీ ఆమెకుండే సామాజిక బాధ్యత, కుటుంబ బాధ్యత గురించి మాట్లాడుకుంటూ వుంటాము. ఇప్పటికీ వీటిలో కొన్నింటినైనా నేటి తెలుగు మహిళ సాధించగలిగిందా? అంటే అదొక ప్రశ్నగానే మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
1965లో రాగిణీ పిక్చర్స్ బ్యానర్ పైన దర్శకులు పి. పుల్లయ్యగారు నిర్మించిన చిత్రమిది. దీనికి పూర్తిగా రచన చేసినవారు ఆచార్య ఆత్రేయ (టైటిల్ లో ఆత్రేయ అని మాత్రమే ఉంటుంది) ఇందులో ప్రధాన భూమికలు పోషించినవారు అక్కినేని నాగేశ్వరరావు-సావిత్రి- మిగిలిన పాత్రలలో పి. శాంతకుమారి – జగ్గయ్య-గుమ్మడి మొదలైనవారు కనిపిస్తారు.
కథ మనం నటుల పేర్లతో చెప్పుకుంటే అర్థం చేసుకోవడానికి, ముందుకు సాగడానికి అనుకూలంగా వుంటుంది.
అదొక సామాన్యమైన పల్లెటూరు. అందరూ వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికేవారే – ఆ ఊరి భూస్వామి గుమ్మడి. అతని మొదటి భార్య చిపోతే, మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు. ఆ చనిపోయిన భార్య కొడుకు మేదకుడుగా, బుద్దిమాంద్యంతో పెరుగుతాడు. రెండో భార్య శాంతకుమారి – గడసరిది కాస్త దుర్మార్గురాలు – తెలివితక్కువ పిల్లాడు నాగేశ్వరరావు. ఆ పిల్లాడి ఆలనాపాలనా ఒక ఆయా మీద వదిలేస్తుంది. (సినిమా పేరు రాజేశ్వరి). జమిందారు రెండో కొడుకు జగ్గయ్య- గర్విష్టి – పొగరుబోతు – అతనికున్న వ్యసనాల్లో ఈ మతిలేనివాడ్ని (నాగేశ్వరరావుని) హింసించటం. తీరు కూర్చుని ఆ పిల్లాడ్ని చావకొడుతూ వుంటాడు. అతన్నెవరూ ఆపలేరు. పిచ్చివాడినే, కాపాడుతూ, రక్షిస్తూ వుంటారు.
జగ్గయ్య పొలం చేసే రైతులతో గొడవ పెట్టుకుని వాళ్ళ భములు కౌలుకి చేస్తున్న వాళ్ళని, ఎక్కడ పని అక్కడ వదిలేసి పొమ్మని పొట్లాడుతాడు. అసలు సంగతి ఆ భూములు అమ్మివేయాలని అతని ఉద్దేశం.
సావిత్రి ఒక రైతు కూతురు. సినిమాలో పేరు పద్మ. ఆమె ధైర్యంగా అతన్నీ, అతను తీసుకొచ్చిన రౌడీ గ్యుంనీ అడ్డుకుంటుంది. ఆమె వెనుక రైతాం నిలబడుతుంది. చేసేది లేక జగ్గయ్య వెనుతిరుగుతాడు – ఈ గొడవ జమిందారు గుమ్మడికి తెలిసి, అలాంటి తెలివి, ధైర్యం, న్యాయం వున్న ఒక పిల్లని కోడలుగా (జగ్గయ్యకి)చేసుకుంటే బాగుంటుందని భావించి రైతు యింటికి వెళ్ళి అడుగుతాడు పిల్లని. అందరూ ఆనందంతో అంగీకరిస్తారు – కానీ శాంతకుమారి (రాజేశ్వరి) ఈ దరిద్రగొట్టు సంబంధం చచ్చినా చేసుకోనని మొండికేస్తుంది. ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం కొంత లౌక్యం మోసం కలిపి సావిత్రిని- వెర్రివాడికిచ్చి పెళ్ళి చేస్తాడు – పెళ్ళిలో విషయం బయటపడినా, పేదవారైన రైతులు ఆయన్ని ఎదిరించలేకపోతారు –
సావిత్రి (పద్మ) తన ధైర్యంతో, నిజాయితీతో, తెలివితో మంచితనంతో భర్తని మామూలు మనిషిని చేసి, ఏవిధంగా జీవితాన్ని చక్కదిద్దుకున్నదీ అనేది మిలిన సినిమా-
ఇందులో సావిత్రి, నాగేశ్వరరావు నటనా అత్యంత అద్భుతంగా వుంటాయి – సినిమా చివరి భాగంలో నాగేశ్వరరావు ఎంతో అందంగా (handsome) కనిపించటం సినిమాకి లాభం చేకూర్చింది-
ఈ ‘అర్థాంగి’ సినిమా ఈనాటి వాతావరణం పరిస్థితి కాకపోవచ్చు. కానీ ఇందులో ఆడపిల్ల కుండాల్సిన ధైర్యం, విజ్ఞత, నిజాయితీ, ఈనాటికీ అన్వయించబడతాయి. ఆడపిల్లల వివాహ సందర్భంలో ఎన్ని మోసాలు – ఎన్ని ద్రోహాలు జరుగుతున్నాయి. ఈనాటి అమ్మాయిలకు చదువుకుంటోంది. కొంతలో కొంత పుట్టింటి ఆసరా (సపోర్ట్) వుంటోంది. మోసాన్ని తిప్పి కొట్టగలిగే అనేక వసతులున్నాయి. సమాజం ఆడపిల్లని చూసే దృష్టితో ఎంతో మార్పు వచ్చింది. తమ జీవితాల్ని సరిదిద్దుకోగలశక్తియుక్తులు ఇప్పటి ఆడపిల్లలకి వున్నాయి. కానీ ఎంతమంది అమ్మాయిలు తమ జీవితాన్ని సరిదిద్దుకోగలుగుతున్నారు?
ఈ సినిమాలోని పద్మ (సావిత్రి) పాత్ర ద్వారా నేటి యువతరంలోని ఆడపిల్లలు అర్థం చేసుకోవాల్సినవి, ఆచరించవలసినవీ వున్నాయి –
‘‘మమ్మల్ని పిచ్చివాళ్ళతో, కుటుంబం పేరుతో జీవితం నాశనం చేసుకోమంటారా’’ అని ప్రశ్నించవచ్చు.
కానీ అది సమస్య కాదు. పిచ్చివాళ్ళు- మనసు (బుద్ధి) ఎదగనివాళ్ళూ- పొగరబోతులు, మోసగాళ్ళూ అప్పుడూ యిప్పుడూ వున్నారు… వుంటారు.
వాళ్ళ నుంచి మనం ఎలా తప్పించుకోవాలి. మన జీవితాల్ని ఎలా బంగారు బతుకులు చేసుకోవాలి అనేవి ఆలోచించాలి.
నిజాయితీ – ధైర్యం- సమస్యని తిప్పి కొట్టగలిగే విజ్ఞత వుండాలి – ఇవన్నీ చదువు వల్ల వస్తాయి. ఒకనాటి ‘అర్థాంగి’లో పద్మ కాదు ఈనాటి అమ్మాయి. ఎలాంటి సమస్యనైనా తెలివిగా పరిష్కరించుకోగదు నేటియువత.
ఈ ‘అర్థాంగి’ సినిమాకి అత్యంత అపురూపంగా అమిరింది బి. నరసింగరావు గారు కూర్చిన సంగీతం –పాటల్లో ఆత్రేయ గారి రచన – పాడిన జిక్కీ (పి.జి. కృష్ణవేణి)గారి గళం సావిత్రి నటన – అన్నీ కలిపి ఇదొక కళారూపంగా మారింది.
కళ సమాజానికి ఉపయోగపడాలి – సామాన్యుల సమస్యలకి అద్దం పట్టాలి- సంఘానికి ఉపయోగపడని, ఏ కళారూపమూ, వృద్ధా అనే మాటలు వినిపిస్తూ వున్న ఈ రోజుల్లో, ఇలాంటి పాత సినిమాలు సి, అందులోని ఆంతర్యం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందనిపిస్తుంది. ముఖ్యంగా ఈనాటి యువతరానికి.
*****

ఇంద్రగంటి జానకీబాల గారు ప్రముఖ రచయిత్రి, గాయని. వీరు ఆరు కథాసంపుటాలు, పన్నెండు నవలలు, ఒక కవితా సంపుటి ప్రచురించారు. సినీనేపథ్య గాయనుల జీవిత విశేషాలతో కూడిన పరిశోధన గ్రంథం “కొమ్మా కొమ్మా కోయిలమ్మా” వంటివెన్నో వెలువరించారు. జానకీబాల గారు డిసెంబరు 4, 1945న రాజమండ్రిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీ సూరి రామచంద్రశర్మ, శ్రీమతి లక్ష్మీనరసమాంబ. వీరు తణుకులోని సీతామహాలక్ష్మి జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. 1966లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగంలో చేరారు. సాహితీ ప్రముఖులైన శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారి మూడో కుమారులు ప్రముఖ కవి, విమర్శకులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు వీరి భర్త. వీరి కుమారులు శ్రీ ఇంద్రగంటి మోహనకృష్ణ, కుమార్తె శ్రీమతి ఇంద్రగంటి కిరణ్మయి ప్రముఖ సినీదర్శకులు. ఉద్యోగరీత్యా విజయవాడలో పాతికేళ్లపాటు నివసించారు. 1991లో ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీరు ప్రముఖ ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణి. లలితగీతమాలిక , శివాక్షరమాల కేసెట్లు విడుదల చేశారు. ఈటీవీ-2లో “పాటలపాలవెల్లి” కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు సినిమా పాటలపై పదలహరి సంగీతకార్యక్రమాన్ని రేడియోస్పందనలో నిర్వహించారు. సంగీత, సాహిత్యరంగాల్లో విశేష కృషిచేసిన జానకీబాల గారిని పలు పురస్కారాలు వరించాయి. “కనిపించే గతం” నవలకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం, కథారచయిత్రిగా రంగా-జ్యోతి పురస్కారం, జ్యోత్స్నా పీఠం సంస్థ నుంచి కథారచయిత్రిగా జ్యోత్స్నాపీఠం పురస్కారం మొ.వి
