
జ్ఞాపకాల ఊయలలో-9
-చాగంటి కృష్ణకుమారి
కల్లేపల్లి హైస్కూల్ నేను అక్కడ చదువుకొన్న రోజులలో ఒక తాటాకు పాక. కొంత మధ్య నున్న భాగం పైన బంగాళా పెంకులుండేవి ఆభాగానికే గోడలూ గుమ్మం . అది హెడ్ మాస్ఠారుగారి గది, ఆఫీసు కలసి వున్న భాగం . దానికిరువైపుల భాగాలూ తాటాకులతో నేసిన ఒక షేడ్ అన్నమాట .తరగతి గదులమధ్యన గోడలుండేవి కానీ వాటి చుట్టూతా సగం గోడ ఆపైన వెదురుతో తయారైన కటకటాలు.గుమ్మాలు లేవు. హెడ్మాస్టారు గదికి ఇవతల 6.7. 8, తరగతులూ , అవతలవైపుకి 9,10,11 తరగతులనూ నిర్వహించేవారు. నేల మట్టి నేలే! నాకు ఒక చిన్న బెంచీ మీద కూర్చున్న జ్ఞాపకం వుంది 6వతరగతిలో రెండు చిన్న బెంచీలున్నగుర్తు. కానీ చిన్నాడు… అదే అతని చేతిలోంచీ నాకరియర్ గిన్నె నేల బావిలోకి జారిపోయిందే .. అతనే.. పేరు.. చాగంటి వీరేశ లింగం .. అతనంటాడూ కిందమట్టిలోనే కూర్చున్నామంటాడు.అందరూ కిందనే మట్టిలోనే కూర్చునేవారటమరి !
కల్లేపల్లి లో నా స్నేహితురాలి పేరు పార్వతి. అది ఒకసారి పారిజాతం పువ్వులు స్కూల్ కి తీసుకొచ్చింది. ఎంతబాగున్నాయో ! ఎంత సువాసనో! నేనంతవరకూ అటువంటి పువ్వులను చూడలేదు. అది పారిజాతం చెట్టనీ అది పూలను రాలుస్తుందనీ ఎంత బాగా వర్ణించి చెప్పిందంటే నాకా చెట్టును చూడాలనిపించింది. స్కూల్ అయిపోయాకా రావే మాఇంటికి పారిజాతం చెట్టును చూపిస్తానూ అంది. ఇంకేముంది , మరో ఆలోచనే లేకుండా పుస్తకాలసంచీ పట్టుకొని దానితో వెళ్ళిపోయా. మరుసటి రోజు ఆదివారం. ఆరోజు రాత్రి వారింటిలో చింతపండును నీళ్ళల్లో పిసికి తయారు చేసిన పచ్చి చారూ నీళ్ళలో వేసి వుంచిన అన్నం తిన్నాను . మర్నాడుదయం అది నన్ను పారిజాతం చెట్టుదగ్గరికి తీసికెళ్ళింది. చాలావిశాలంగా వున్న ప్రదేశంలో ఏఆటంకాలూ లేకుండా గుండ్రంగా కొమ్మలు విస్తరించి వున్న చెట్టు. ఆచెట్టుకింద ఎంత సేపు ఆడుకొన్నామో చెప్పలేను. గౌను ఎత్తి బుట్టలా పట్టుకొని నాగౌనులో పూలు పడ్డా యి చూడంటే నాగౌనులో కూడా పడ్డాయంటూ తెగ ఆనందపడిపోయాము. ఆరోజు అక్కడ వీచిన గాలే గాలి! ఆ అనందమే ఆనందము! అప్పటి నా సహాధ్యాయి పార్వతి కేరింతలు రాలి పడుతున్న పారిజాతం పూలంత స్వచ్చమైన ధవళ రాగంలో తీసిన రాగాలు కాదూ ! बहरो फूल बरसाओ मेरा महबूब आया है…… హసరత్ జయపూరిగారు పాటను రాసి వుండవచ్చు గాక! శంకర్ జైకిషన్ గారు కట్టిన రాగానికి మహమద్ రఫి గారు పాట పాడి వుండవచ్చుగాక !ఆనాటి మాఇద్దరి కేరింతాల ముందు ఆపాట తీసికట్టుకాదూ! ఆచెట్టు కింద మా కేరింతల దృశ్యం ముందు సూరజ్ సినీమాలో హస్రత్ జయపూరీ గారి పాట దృశ్యీకరణ ఎందుకు పనికొ స్తుందీ! నటన ! నటన! నటన! అంతానటనే గా! నేను లెక్చరర్ ఉద్యోగం వెలగబెట్టినఊర్లో ఒకావిడ కిరసనాయలు పోసుకొని అంటించుకొని ఆత్మహత్య చేసుకొంది. నా కొలీగ్ “ “పెచ్చి మొద్దు! జీవితం సినిమాలో చూపించినట్టు వుటుందనుకొంది!” అంది!
ఆతరువాత కాస్త పొద్దీఎక్కేసరికి పార్వతి నన్ను చిట్టెమ్మ గారింటికి కూడా తీసికెళ్ళింది . ఆమె మాఇద్దరికీ మరమరాలు పెట్టింది. ఈ లోగా కందాళ పఠాభి మాస్టారు ఒక పాలికాపును పార్వతి ఇంటికి తీసికొచ్చారు . అతనితో నన్ను లచ్చమ్మ పేటకు పంపారు.
*****

చాగంటి కృష్ణకుమారి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కెమిస్ట్రీలో పరిశొధన చేసి డాక్టరేట్ ను పొందారు. విజయనగరానికి చెందిన ఈమె ప్రముఖ రచయత చాగంటి సోమయాజులు గారి ( చాసో) కుమార్తె. 36 సంవత్సరాల ఉపన్యాసక వృత్తిలో ఆరు సంవత్సరాలు విజయనగరం మహారాజా మహిళాకళాశాలలో, మిగిలిన సంవత్సరాలు సింగరేణి మహిళా కళాశాలలోనూ పనిచేసారు.1993లో ఆసోసియేట్ ప్రొఫసర్ గా పదోన్నతి పొందారు. తెలుగు అకాడమి లో డెప్యుటేషన్ పై రసాయన శాస్త్ర పుస్తక, పదకోశాల ప్రచురణవిభాగంలో పనిచేసారు. వీరు రాయల్ సొసైటి ఆఫ్ కె మిస్ట్రి (RSC)లండన్. సభ్యురాలు.
ఇండియన్ కెమికల్ సొసైటి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కెమిష్ట్రి, ఇండియన్ సైన్స్ రైటర్స్ అసోసియేషన్,ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ వారి కన్వె న్షన్ ల లోనూ వర్క్ షాపుల్లోనూ పత్రాలను సమర్పించి రెండుసార్లు సర్వోత్తమ పత్ర సమర్పణా అవార్డులను పొందారు.ఆకాశవాణి కేంద్రాలనుండి, ఇందిరాగాంధి సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి GYAN VANI కార్య క్రమాలలో వైజ్ఞానిక అంశాలపై సుమారు 80 ప్రసంగాలను ఇచ్చారు. RSC IDLS వారు, స్థానిక విద్యా సంస్థల వారు నిర్వహించిన సెమినార్లు, వర్క్ షాప్ లలో పాల్గొని సుమారు 50 జనరంజన వైజ్ఞానిక ఉపన్యాసాలను ఇచ్చారు.
ఈవిడ మంచి ఉపన్యాసకురాలు, పరిశోధకురాలు, అనువాదకురాలు. క్లిష్ట మైన వైజ్ఞానిక విషయాలను చక్కని తెలుగులో ఆసక్తి దాయకంగానూ, సుబోధకంగానూ, సరళంగానూ ఆద్యంతం ఆకట్టుకొనే శైలి లో చెప్పగల రచయిత్రి. ఎం.ఎస్ సి; పి.హెచ్.డి డిగ్రీలను ఆంద్రా యునివర్సిటి నుండి పొందారు. డిగ్రీ స్థాయిలో ప్రతిస్ఠాత్మక బార్క్ (BARC) స్కాలర్ షిప్, ఎం.ఎస్.సి.లో మెరిట్ స్కాలర్షిప్, పిహెచ్ డి ప్రోగ్రామ్లో యు.జి.సి.ఫెలోషిప్ ని పొందారు.
2000 లో లోహ జగత్తు. 2001 లో వైజ్ఞానిక జగత్తు. 2010 లో మేధో మహిళ , భూమ్యాకర్షణకి దూరంగా.. దూర దూరంగా… సుదూరంగా…. 2012 లో రసాయన జగత్తు. 2016 లో వైజ్ఞానిక రూపకాలు. 2017 లో జీవనయానంలో రసాయనాలు 2018 లో వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి ? 2019 లో కంటి వైద్యంలో ప్రాచీన భారత దేశ జ్ఞాన సంపద ( నిజానిజాలపై అమెరికా వైద్యనిపుణుల విశ్లేషణ) వంటి వైజ్ఞానిక శాస్త్ర గ్రంధాలను ప్రచురించారు. వీరు రచించిన పుస్తకాలను నేషనల్ బుక్ ట్ర ష్ట్ ,న్యూ ఢిల్లి; తెలంగాణ అకాడమి ఆఫ్ సై న్స స్ ,హైదరా బాద్; వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వంటి ప్రతిష్టాత్మక ప్రచురణ సంస్థలు ప్రచురించాయి.
ఈమె రాసిన భారతీయ సాహిత్య నిర్మాతలు:చాగంటి సోమయాజులు(చాసో)మోనో గ్రాఫ్ ని సాహిత్య అకాడమి 2014 ప్రచురించింది
