స్వచ్ఛత పాటిద్దాం

-కందేపి రాణి ప్రసాద్

          ఒకరోజు ఉదయాన్నే గుహ వదిలి బయటకు వచ్చింది మృగరాజు అలా ఆడవంత ఒకసారి తిరిగి వద్దామనుకున్నది.           పక్షుల కుహు కుహులు చెవుల కింపుగా వినిపిస్తున్నాయి. చెట్లన్నీ తలలూపుతూ నాట్యం చేస్తున్నట్లుగా ఊగుతున్నాయి. సింహం సంతోషంగా ముందుకు అడుగులు వేసింది. దారిలో జంతువులన్నీ నమస్కారం పెడుతున్నాయి. వాటిని చిరునవ్వుతో స్వీకరిస్తూ ముందుకు వెళ్ళింది.           కొంచెం దూరం వెళ్ళేసరికి దారంతా అక్కడక్కడ జంతువుల పెంటలతో కంపు కొడుతున్నది. వాటిని చూసి దాటుకుంటూ ఒక్కొక్క చోట గెంతులు వేస్తూ నడుస్తున్నది. ఆప్పుడే ఆ దారంట ఒక గాడిద పోతూ కనిపించింది. మహారాజును చూసి ఆగి నమస్కరించింది.           “ఏమిటి మహారాజా! కాలుకు ఏమైనా దెబ్బ తగిలిందా? గెంతుతూ నడుస్తున్నారు అని కంగారుగా అడిగింది.           సింహం చిరాగ్గా మోహం పెట్టి “అదేం కాదులే కానీ అడవిలో జంతువులన్నీ మల మూత్ర విసర్జనలు ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నాయి నడవడానికి ఇబ్బందిగా ఉన్నది” అన్నది.           గాడిద “తల ఊపుతూ” అవును మహారాజా నిజమే” అన్నది. దానికి సింహం గాడిదతో “ నువ్వు రోజు మనుష్యులుండే ఉళ్ళకు వెళతావు కదా! అక్కడ కూడా ఇలాగే ఉంటుందా” అడిగింది ఆసక్తిగా.           గాడిద ఆలోచిస్తూ గుర్తు చేసుకుని లేదు మహారాజా! మనుష్యులకు ఈ మధ్య మలమూత్ర విసర్జనలకు ఆరు బయటకు రావడం లేదు. వాళ్ళకు ‘టాయిలెట్స్’ అని ఉంటాయి. మనుష్యులు వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆ టాయిలెట్లలోకే వెళతారు” అంటూ ఇంకా చెబుతూ ఉండగానే సింహం మధ్యలో ఆపి తన అనుమానాన్ని వ్యక్త పరిచింది.           “ఊళ్ళోని మనుష్యులంతా ఒక్కచోటే టాయిలెట్లు కట్టుకుంటారా? అదేలా సాధ్యం” అని సింహం ఆశ్చర్యపోతూ అడిగింది.           లేదు ప్రభూ వాళ్ళకు నివసాలుంటాయి. ఎవరి నివాసంలో వాళ్ళు టాయిలెట్లు కట్టుకుంటారు దాని వల్ల ఉళ్లు శుభ్రంగా కంపు లేకుండా ఉంటాయి.           ఇదేదో బాగుంది కదా! మన అడవిలో కూడా ఇలాగే ప్రవేశపెడదామా! మన అడవిని మనం శుభ్రంగా ఉంచుకోవాలి కదా. అసలే ఇప్పుడు వానాకాలం జబ్బులు రాకుండా కూడా ఉంటాయి” అన్నది సింహం.           గాడిద అయోమయంగా చూస్తూ “చిత్తం మహారాజా” అన్నది దానికేమీ అర్థం కాలేదు.           సరే నేను వెళుతున్నాను అంటూ సింహం తిరిగి తన గుహ వద్దకు వెళ్ళి వెంటనే ఏనుగుకు కబురు పెట్టింది. ఏనుగు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడింది.సింహం తనకు వచ్చిన ఆలోచనను గాడిద నుంచి తెలుసుకున్న విషయాన్నీ ఏనుగుకు చెప్పి దీనికి పరిష్కారం వెతకమని చెప్పింది.           అప్పుడు ఏనుగు “ మహారాజా మనుష్యుల్లాగా మనం టాయిలెట్స్ కట్టుకోలెం కాబట్టి వేరే రకంగా ఆలోచిద్దాం. మీరన్నట్లుగా దార్లో నడవటానికి లేకుండా ఎక్కడంటే అక్కడ పెంటలుండటం వల్ల అడవి అపరిశుభ్రంగా ఉన్నది. ఇదే కాళ్ళతో వెళ్ళి చెరువులో నీరు తాగటం వాల్ల చెరువు నీరు కూడా కలుషితమవుతున్నది” అన్నది.           “ఏదైనా ఉపాయం ఆలోచించు మిత్రమా” అంటూ సింహం బాధ్యతను ఏనుగుకు అప్పచెప్పింది. కొద్దిసేపు ఆలోచించాక ఏనుగు సింహంతో ఇలా చెప్పింది. “ప్రభూ ఉత్తరం వైపున మనకు చాలా ఖాలీ స్థలాలున్నాయి. అక్కడ ఏ పంటలు పండడం లేదు. అవన్నీ బంజరు భూములే. ఉదయాన్నే అందరూ వెళ్ళి అక్కడే మల మూత్ర విసర్జన చేయాలనే పద్ధతి ప్రవేశ పెడదాం. ఒకేసారి అలవాటు పడక పోయినా మెల్లగా అలవాటు చేసుకుంటారు”.           మిత్రమా! ఒక నియమం పెట్టాక అది మన ఆరోగ్యానికి మంచిదని తెలిశాక దానికి నిదానంగా నేర్చుకోవటం కాదు. ఖచ్చితంగా పాటించాల్సిందే ఎవరైనా నియమ నిబంధ నలు అతిక్రమిస్తే వారికి జరిమానా శిక్ష కూడా ఉంటుందని చాటింపు వేయండి” అన్నది సింహం ధృడ నిశ్చయంతో. అలాగే మన వైద్యులు ఎలుగుబంటి గారి నివేదిక తీసు కోండి’ అని మళ్ళి చెప్పింది సింహం.           అంతలో ఎలుగుబంటి చెట్టు పై నుండి కిందికి దిగుతూ కనిపించింది. “అదుగో మన వైద్యులు గారు ఇక్కడే ఉన్నారు. అన్నది ఏనుగు. “ఎలుగుబంటికి విషయమంతా వివరించింది.           అంతా విన్నాక ఎలుగుబాటి తలపంకిస్తూ “చల్ మంచి నిర్ణయం మహారాజా! దీని వాల్ల ఎన్నో జబ్బులు మన దరికి రావు. బాక్టీరియా వైరస్ లు దూరంగా ఉంటాయి. విసర్జకా లను కుల్లింప జేసే మట్టిలో కలిపేసేది బాక్టీరియా వైరస్ లే. కాబట్టి మనం ఆరోగ్యంగా జీవించవచ్చు” అన్నది.           “అయితే రేపే ఈ పని ప్రారంబిద్దామా! అన్నది సింహం ఒక కొత్త విషయానికి నాంది పలుకుతున్నానన్న సంతోషంతో.           అంతలో ఎలుగుబంటి “ ఇంకో విషయం కూడా చెప్పాలి మహారాజా! మన మంత్రి ఏనుగు గారి సలహా చాలా చక్కగా ఉన్నది. ఉత్తరాన ఉన్న బంజరు భూముల్లో మల మూత్ర విసర్జనల వలన కొంత కాలం తర్వాత ఆ భూములు బలంగా తాయారు కావచ్చు పంటలు పండే భూములుగా మార్చుకోవచ్చు అన్నది.           సింహం ఆనందంతో చప్పట్లు కొట్టింది “శభాష్ నా ప్లాన్లో ఏనుగు మంత్రి సలాహాలు అధ్బుతం. గాడిద చెప్పిన విషయం వల్ల మనకి ఆలోచన వచ్చింది గాడిదను కూడా అభినందించాలి. రేపటి నుండి ఎవరూ కూడా ఎక్కడ పడితే అక్కడ మల మూత్ర విసర్జనలు చేయరాదు. ఇదే విషయం అడవంతా చాటింపు వెయ్యండి” అన్నది సింహం.“చిత్తం మహారాజా” అంటూ ఏనుగు, గాడిద, ఎలుగుబంటి నమస్కరించి వెనుదిరిగాయి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.