
శిఖరంపై “ఆమె”
(నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
– డా.కటుకోఝ్వల రమేష్
శీలాన్ని దునుమాడే అసభ్య పద బంధం
బ్రతుకు పోరులో ధీరైన
ఆమెను ఇసుమంతైనా కృంగదీయదు
ముఖ కవలికల్ని చూడని ఏ చరవాణిలోనో..
మాట పరం పరలు పొడిపొడిగా
వెగటుగా రాలిపోవచ్చు
కానీ……
నిన్ను నిలువునా చీల్చి
నీ అణువణువులో నిండిన
అహంకార అశ్లీల ధ్వని తరంగాల్ని
సరిచేసే శస్త్ర చికిత్స
వెనువెంటనే మొదలవుతోంది
హాలో.. ట్రోలర్
నీ వికృత అవివేక వాక్కులు
శీలం పై శీఘ్ర స్కలన ద్రుక్కులు
ఆమె మనో నిబ్బరాన్ని
ఏ మాత్రం సడలించవు..
నిన్ను ఖండఖండాలుగా ఖండించటానికి
ఏ ఆయుధాలు ఆమెకు అవసరం లేదు
నీ నిర్లజ్జా దూషిత మనో వైకల్యాన్ని
సరితూచటానికి..సరి చేయటానికి
నీ కంఠానికి ఉరి బిగించటానికి
కళ్ళల్లో నిప్పుల్ని బిగించుకుని
ఆమె కసితో అల్లిన
అక్షర శారాలు చాలు కదా…..
వంకర బుద్ధుల వ్యాఘ్రమా
నీకు తలొగ్గని వనితలంతా..
నువ్వూహించి నట్లే బిచ్లై వుండరు
ఎక్కడ భంగపాటుతో
దేహం నేలను తాకుతుందో అక్కడే
మళ్ళీ మళ్ళీ నిటారుగా నిలబడి
సవాలు విసురుతోంది చూడు
గతం కాదు వర్తమానంలోకి రా..
ఆదిమానవుడిలా చేయకు
ఆధునికంగా అడుగులు వేయి
నీ అపవిత్ర వాజకూతతో
కదలాడిన చూపులు మాటలూ..
ఏవీ ఆమెను బజారుకీడ్చవు
నిన్నూ నీ కురూపి తనాన్ని
ఆమె అక్షర గొలుసులు
ఆకాశాన వేళ్ళాడదీసాయి చూడు
ఆమె అందాన్ని ఈర్ష్యతో చూడకు
వ్యక్తిత్వాన్ని నీ త్రాసుతో తూచకు
ఆమె అభివృద్ధిని అక్కసుతో వీక్షించకు
అడుగడుగున నీ బ్రతుకులో
ఆమె సర్వాంతర్యామని గ్రహించు
ఆమె లేని చోటు అస్సలు వెతక్కు
ఆమె వున్నచోట దేవతలు
కొలువయ్యారేమో చూడు
బ్రతుకు బండి సాగే రహదారిపై
ప్రేమలూ ద్వేషాలూ త్యాగాలూ బాధలూ
అన్నీ దేహాన్ని చుట్టుకునే వుంటాయి
నీ వక్ర తలపుల దుష్ట దృక్కులతో
దూషించిన నువ్వే దిగంబర మయ్యావు
కాలగమనంలో కుబుసాలు విడిచి
కొత్త మాటల తోటలవైపు నువ్వు నడవొచ్చు
ఎదురుగా వున్న శిఖరంపై ఆమె
నీకు ఓ దేవతలా కనిపించనూ వచ్చు
అప్పుడైనా ఆమె పాదాల వద్ద మోకరిల్లి
క్షమాపణలు అర్థించు …!
*****

డా.కటుకోఝ్వల రమేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు (మం)లో 30-06-1969 లో పుట్టిన డాక్టర్.కటుకోఝ్వల రమేష్ వృత్తి రిత్యా ఉపాధ్యాయుడైనా ప్రవృత్తి రిత్యా కవి, విమర్శకులు. ప్రస్తుతం ఖమ్మం లో వుంటున్నారు. ఇంటర్ కళాశాల మ్యాగజైన్ లో తన కవిత “జాగృతి చేసేయ్” “మార్పు”కథానికల ప్రచురణతో ఆయన రచనా ప్రస్థానం మొదలయ్యింది. 1986లో స్రవంతి మాస పత్రికలో అన్యాయం పై నా యుద్దం..కవిత అచ్చయ్యింది.ఇప్పటి వరకూ వెయ్యికి పైగా పలు రచనలు పలు దిన,వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. 2018 లో “అగ్నిశిఖ”కవితా సంపుటి వెలువరించారు.దూరదర్శన్,ఆకాశవాణి కెంద్రాల నుంచి ఆయన కవితలు ప్రసారం అయ్యాయి. 2005 “నాయన” సంకలనం మొదలుకొని కవితా-2023 వరకూ పలు ప్రముఖ సంకలనాల్లో రమేష్ కవితలు చోటుచేసుకున్నాయి. ఈయన అగ్నిశిఖ సంపుటికి గిడుగు పురస్కారం, కవి రత్న జాతీయ పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో, కార్డ్ కథల్లోనూ రమేష్ రచనలు చోటుచేసు కున్నాయి. “కకోర” కలం పేరుతో అంతర్జాలంలో వీరు రాసిన “జిందగీ”రచనలు బహుళ ప్రచారం పొందాయి. బహుశా రమేష్ కవిత్యం monotony breck చేస్తుందేమో అంటారు కేంద్ర సాహిత్య అవార్డ్ గ్రహిత కె.శివారెడ్డి గారు. ప్రతీ కవిత్వ నగను అగ్నిపునీతం చేసి మనకు అందిస్తాడు రమేష్ అంటారు ప్రొఫెసర్ జయధీర్ తిర్మల్ రావు గారు. రసవిద్య బాగా తెలిసిన వారు కవి రమేష్ అంటాడు ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశొక్ తేజ. నిద్రమాని కవిత్వం కోసం పలువరించిన గొప్పకవి రమేష్ అంటాడు ప్రజాకవి గోరటి వెంకన్న. ఇలా ప్రముఖుల వాక్యాలు అయన కవిత్వాన్ని ప్రస్పుటం చెస్తుంది. వీరి కవితా రచనల్లో భావశిల్పం, అర్థ వైచిత్రి, శభ్ద వైచిత్రి, కొసమెరుపులు, చక్కటి చిక్కటి మెటాఫర్ లు ప్రత్యేక వస్తువు ఎంపికలు దర్శనమిస్తాయి.
