
అనుసృజన
సూఫీ కవిత్వం
అనుసృజన: ఆర్ శాంతసుందరి
సూఫీ కవిత్వంలో భగవంతుడితో కలయిక, ప్రేమ, మానవ చైతన్యంలోని అతి లోతైన భావాలు కవుల హృదయాలలో నుంచి పొంగి పొరలి, వారి కలాలలో నుంచి కవితలుగా జాలువారాయి. ఈ కవితలు పర్షియన్, టర్కిష్ భాషలలో మొదట రాసేవారు. కాని, ఈ రోజుల్లో ఉర్దూ, హిందీ భాషలలోనూ రాస్తున్నారు – అవి అనువాదాలుగా కూడా దొరుకు తాయి. ఆంగ్లంలో కూడా సూఫీ కవితలు రాస్తున్నారు. కొంతమంది ప్రముఖ సూఫీ కవుల కవితలని తెలుగులో స్వేచ్ఛానువాదంగా పరిచయం చేసే ప్రయత్నమే ఇది…. 1. ఫరీద్ ఉద్దీన్ అత్తర్ (1145-1221) సాధువు , మోక్షగామి. పర్షియన్ సాహిత్యంలో మతపరమైన విషయాలను తీసుకుని ఎక్కువ రచనలు చేసినవారిలో ఒకరు అత్తర్. ఆత్మ పరమాత్మలో ఐక్యమవటం అనేది వీరి కవితలలో ప్రధానమైన విషయం. 1.మన దృష్టిలో మనం చనిపోనంత కాలం,ఒక మనిషి వల్ల గాని, వస్తువువల్ల గాని గుర్తింపు పొందినంత కాలంమనకి విముక్తి లభించదు.బాహ్య ప్రపంచంతో ముడిపడి జీవించేవారికి ఆధ్యాత్మిక మార్గం పనికిరాదు. 2.జీవితం చేజారిపోకముందే దాని మార్మికతని తెలుసుకునేందుకు ప్రయత్నించండిజీవించి ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకోలేకపోతే, అర్థం చేసుకోలేకపోతేచనిపోయిన తరవాత మీ అస్తిత్వం గురించిన రహస్యాన్ని ఎలా తెలుసుకోగలుగుతారు? 3.ప్రేమ అనే మధువుతో మత్తెక్కి ఉన్నానుప్రేమ అందరి నుంచీ ఒక మార్మికమైన నిశ్శబ్దాన్ని కోరుతుంది.అందరూ అంత నిజాయితీగా కోరేదేమిటి? అదే , ప్రేమ.ఒకరితో ఒకరు రహస్యంగా చెప్పుకునేదేమిటి? ప్రేమ.వాళ్ళ హృదయపు లోతుల్లో మెదిలే భావమే ప్రేమ.ప్రేమలో ‘నీవు’ , ‘నేను’ అనేదే ఉండదు.నువ్వు ప్రేమించే వ్యక్తిలో విలీనమైపోతావు.ఇక ప్రేమ కప్పుకున్న ముసుగు తొలగిస్తాను,నా ఆత్మలోని అంతరంగ మందిరంలోమిత్రుడున్నాడు చూడు; సాటిలేని ప్రేమే అది.రెండు లోకాల రహస్యమూ తెలిసినవాడుఆ రహస్యాన్ని, ప్రేమని పొందగలడు. 4.అర్ధరాత్రి చీకట్లో ఒక సూఫీ విలపిస్తున్నాడు.అతనన్నాడిలా, ఈ లోకం మూసిన శవపేటికలా ఉందిదానిలో మనం బందీలై అజ్ఞానంతోమూర్ఖంగా , శూన్యంలో జీవితం గడిపివేస్తాం.ఆ శవపేటిక మూత తెరిచేందుకు మృత్యువు వచ్చినప్పుడురెక్కలున్న ప్రతి ఒక్కరూ ఎగిరిపోతారు అనంతలోకాలకిఅవి లేనివాళ్ళు మాత్రం శవపేటికలో ఉండిపోతారు బందీలై.అందుచేత మిత్రులారా,ఈ శవపేటిక మూత తెరుచుకునేలోగామారండి భగవంతుడివైపు ఎగిరిపోయే పక్షిలా;చెయ్యగలిగిందంతా చెయ్యండి రెక్కలనీ,ఈకలనీ మొలిపించుకునేందుకు.” 5.తెలుసుకోవలసిన నాలుగు విషయాలు :హాతిమ్-అల్-అసమ్ ఇలా అన్నాడు ,” నేను తెలుసుకునేందుకు నాలుగు విషయాలనిఎంచుకున్నాను. మిగిలినవన్నీ వదిలేశాను. మొదటిది : నాకు ప్రతిరోజూ కొంత ఆహారమే నిశ్చయింపబడిందని తెలుసు. దాన్ని తగ్గించటమో, పెంచటమో సాధ్యం కాదు. అందుచేత నేను దానికి అదనంగా చేర్చటం మానివేశాను. రెండోది : నేను భగవంతుడికి రుణపడి ఉన్నానని తెలుసు. నా తరపున దాన్ని మరెవరూతీర్చలేరు, అందుచేత నేనా పనిలో తలమునకలుగా ఉన్నాను. మూడోది : నన్ను ఎవరో వెంబడిస్తున్నారని తెలుసు… మృత్యువు…దాన్ని తప్పించుకోలేను, అందుకే దాన్ని కలుసుకునేందుకు సన్నద్ధం అవుతున్నాను. నాలుగోది : భగవంతుడు నన్ను గమనిస్తున్నాడని తెలుసు. అందుకే చెయ్యకూడని పని చేసేందుకు సంకోచిస్తున్నాను..
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
