ద్వీపకల్పం నుంచి ద్వీపం దాకా- న్యూజిలాండ్ & ఆస్ట్రేలియా

-డా.కందేపి రాణి ప్రసాద్

          మా స్నేహితుల కుటుంబాలంతా కలిసి టూరుకు వెళ్లి చాలా రోజులైంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేయడంతో ఎవరికీ ఊళ్లు తిరగాలన్పించలేదు. 2017 లో మా డాక్టర్ స్నేహితులంతా కలసి దక్షిణ ఆఫ్రికా పర్యటనకు వెళ్ళాం. ఆ తర్వాత మరల ఇప్పుడు ఈ 2025 లో న్యూజిలాండ్, అస్ట్రేలియా దేశాలు వెళ్ళాలని అనుకున్నాం. దాదాపు ముప్పై మంది కలసి ఈ ట్రిప్ కు బయల్దేరాం, క్రితం సంవత్సరం మా కుటుంబం మాత్రమే మూడు దేశాలు చూసి వచ్చాం. ఈసారి అందరం కలసి వెళితే బాగుంటుందని వెళ్ళాము. మామూలు సమయాల్లో ఎవరి పేషెంట్లతో వారు బిజీగా గడిపే డాక్టర్లు తమ మనసును స్వాంతన పరచుకోవడానికి ఇలా అప్పుడప్పుడూ వెళ్ళడం బాగుంటుంది.
 
          మేము ఈ నెల 12వ తేదీ నాడు హైదరాబాద్ నుండి న్యూజిలాండ్ బయల్దేరాము. దాదాపు 10,12 గంటల ప్రయాణం తర్వాత న్యూజిలాండ్ చేరాము. న్యూజిలాండ్ లో ఐదురోజులు ఉన్నాం. ఆ తర్వాత ఆస్ట్రేలియా దేశానికి బయల్దేరాం. అక్కడొక ఐదు రోజులు ఉండాలని ప్లాన్ వేశాం. సింగపూర్ ఎయిర్ లైన్స్ లోనూ న్యూజిలాండ్ ఎయిర్ లైన్స్ లోనూ ప్రయాణం చేశాం.
 
          న్యూజిలాండ్ దేశంలోని క్వీన్స్ లాండ్ పట్టణం నుంచి ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరానికి బరులుదేరాం. క్వీన్స్ లాండ్ లో మధ్యాహ్యం 3.00 గం॥లకు ప్లైట్ ఎక్కితే సిడ్నీ నగరంలో దిగే సరికి సాయత్రం 5:30 అయింది. సిడ్నీ నగరం వాన చినుకులతో మాకు స్వాగతం పలికింది. అంతేకాదు బాగా చల్లని గాలులతో వణికిం చింది కూడా! లెదర్ జాకెట్ వేసుకున్నా, కాళ్ళకు సాక్సులు, బూట్లు వేసుకున్నా చలిని తట్టుకోలేక పోయాం. ఎయిర్ పోర్ట్ డోర్ నుండి కాలు బయట పెట్టగానే చల్ల గాలికి కళ్ళు మూసుకు పోతుంటే కళ్ళ జోడు పెట్టుకున్నాం. నెత్తి మీద క్యాప్, చేతులకు గ్లోవ్స్ వేసుకొని మా కోసం వచ్చిన కారు కోసం వెతుక్కున్నాం. కారు ఎక్కాక గానీ చలి తగ్గలేదు. కారులో వార్మర్స్ ఉన్నాయి కాబట్టి బతికి పోయాం.
 
          ఒక గంట ప్రయాణం తర్వాత డార్లింగ్ హార్టర్ లోని నోవాటెల్ హోటల్ కు చేరుకున్నాం. ఇక్కడ 9వ అంతస్తులోని 948 రూమ్ లో దిగాం. రివాల్వింగ్ డోర్స్ తోనూ, ఎస్కలేటర్స్ తోనూ నోవాటెల్ హోటల్ చాలా బాగుంది. దీని చుట్టుపక్కల సోఫీటెల్, ఐబిస్, ఐసిసి హాటుల్స్ కూడా ఉన్నాయి. రూమ్ చాలా పెద్దగా రెండు కింగ్ సైజు బెడ్స్ తో చాలా అందంగా ఉంది. మేము రిఫ్రెష్ అయి దగ్గరలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్ కు వెళ్లి రోటీ తినేసి వచ్చాం.
 
          ఆస్ట్రేలియా దేశమంటే ప్రత్యేకంగా చెప్పుకునే విషయం ‘కంగారూ’. ఇక్కడున్న విశాలమైన ఎడారులు చదునైన ప్రదేశాలు కంగారూలకు నివాసాలుగా ఉంటాయి. ఆస్ట్రేలియా దేశం పసిఫిక్ మహా సముద్రం తీర ప్రాంతాల్లో ఉంటుంది. కాబట్టి అందమైన బీచులున్నాయి. తీర ప్రాంతాల్లో ప్రజలు ఆనందంగా గడుపుతారు. మేము సిడ్నీ నగరంలోని బోండీ బీచ్ కు వెళ్ళినపుడు కూడా చాలా ఈదురు గాలులు వచ్చాయి. కాసేపుండి ఫోటోలు తీసుకుని రావడానికే చలి గాలిని తట్టుకోలేక పోయాం. అంతేగాక విపరీతమైన గాలి వల్ల ఇసుక కూడా పైకి లేచి కళ్ళలో పడుతోంది. కళ్ళజోడు పెట్టుకున్నా కూడా ఇసుక కళ్ళలో పడుతున్నది. పసిఫిక్ మహా సముద్రపు తీరాన బోండీ బీచ్ లో అందంగా ఫోటోలు తీసుకున్నాం.
 
          ఇక్కడ సిటీ టూర్ కోసం టికెట్లు తీసుకుంటే చాలు. ఆ రూట్లలో ఉన్న ఏ బస్సు అయినా ఎక్కవచ్చు. వీటిలో రెడ్ లైన్, బ్లూ లైన్ అనే రెండు రకాల బస్సులు ఉంటాయి. వాటిలో మనకు నచ్చిన చోట ఆగి వాటిని చూడవచ్చు. మా హోటల్ పక్కనే ఉన్న ఐసిసి హోటల్ దగ్గర ఈ బస్సు ఎక్కాము. హాఫ్ ఆఫ్, హాఫ్ ఆన్ అని రాసి ఉన్న బోర్డుల దగ్గర ఈ బస్సులు ఆగుతాయి. మేము అక్కడ బస్సు ఎక్కి “ఆస్ట్రేలియా మ్యూజియం” దగ్గర దిగాము.
 
          ఆస్ట్రేలియన్ మ్యూజియంను సిడ్నీ మ్యూజియం అని, కొలోనియల్ మ్యూజియం అని కూడా పిలుస్తారు. సిడ్నీలోని విలియమ్ స్ట్రీట్ లో ఈ మ్యూజియం ఉన్నది. మేం వెళ్ళిన రోజు చాలా మంది స్కూల్ విద్యార్థులు వచ్చారు. ఈమ్యూజియం ను చూడటానికి ప్రవేశం ఉచితం. మొదటి అంతస్తులో చరిత్రకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి. రెండవ అంతస్తు జంతువులు, అస్థిపంజరాలు, వివరాలు ఉన్నాయి. డైనోసార్ల అస్థిపంజరాలు చాలా పెద్దగా ఉండటం వలన పైన వేలాడ దీశారు. పక్షులు క్షీరదాలు నీటి జంతువులు వంటి చాలా జంతు కళేబరాలున్నాయి. నేను వీటన్నిటినీ చూస్తూ వీడియో తీసుకున్నాను. నేను జంతువుల విషయాలపై చాలా ప్రయోగాలు చేస్తున్నాను కదా! జంతువుల పార్కుల గురించి వ్యాసాలు కూడా రాశాను. జంతువుల బొమ్మలు తయారు చేశాను. ఈ మ్యూజియంను 1827 లో ప్రారంభించారు. 198 సంవత్సరాలు చరిత్ర కలిగిన మ్యూజియంలో చూడడం వల్ల మాకు ఆనందాన్ని కలిగించింది.
 
          సిటీ టూర్ కోసం బస్సెక్కాము. అని చెప్పాను కదా! బస్సు రూఫ్ ఎక్కి కూర్చున్నాం. చాలా సరదాగా అన్పించింది. పల్లెటూళ్ళలో ప్రయాణీకులు బస్సులు మీద కెక్కి ప్రయాణించడం చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చింది. సిడ్నీ నగర వీధులను, ఆకాశ సౌదాలను బస్సు టాప్ మీదకెక్కి చూడడం తమాషాగా అన్పించింది. బస్సెక్కి కూర్చుని ఆకాశాన్నంటే బిల్డింగులని ఫోటోలు తీయడం, దారి పొడుగునా ఉండే చెట్ల కొమ్మలని తాకుతూ ఉండడం బాగుంది. బస్సు పై భాగంలో కూర్చునే సిడ్నీ ఒపేరా హౌస్ నూ, కార్బన్ బ్రిడ్జినీ చూసి ఫోటోలు తీసుకున్నాం. వర్షం చినుకులు పడుతూనే ఉన్నాయి. తడుస్తూనే ఉన్నాం. ఫోటోలు తీస్తూనే ఉన్నాం. ఒకప్పుడు ప్రపంచపు ఏడు వింతలుగా చెప్పుకునే సిడ్నీ ఒపేరా హౌస్ ను దూరం నుంచి చూస్తూనే ఉద్వేగానికి లోనయ్యాను. ఏడు వింతలలో చైనా వాల్ ,తాజ్ మహల్, ఈఫిల్ టవర్, ఒపేరా హౌస్ ను చూసాము. ఇంకా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, పిసా టవర్, కొలోజియమ్ చూడాలి. బిల్డింగ్ ల వేసిన అద్దాలు సూర్య రష్మి వెలుగులకు వజ్రాల్లా మెరుస్తున్నాయి. బస్సు ఎక్కుతూ, దిగుతూ సాయంకాలం వరకు తిరిగాం. తినటానికి ఇండియన్ ఫుడ్ ఏమీ దొరకక కే.ఎఫ్.సి కి వెళ్లి ఫ్రెంచ్ ఫ్రైస్ తిని కోక్ తాగి పొట్టనింపు కున్నాం.
 
          సాయంత్రానికి సిడ్నీ ఓపెరా హౌస్ కి వెళ్ళాం. తెల్లని తామర పువ్వు రేకుల దూరం నుంచి మురిపిస్తున్నది. నీటి మధ్యలో ఈ ఒపేరా హౌస్ అద్భుతంగా కనిపిస్తు న్నది. 1959వ సంవత్సరంలో ఈ ఒపేరా హౌస్ ను కట్టడం మొదలు పెడితే పూర్తయ్యే సరికి (1973) పధ్నాలుగు సంవత్సరాల కాలం పట్టింది. ఇది ఒక థియేటర్ భవనం. దీనిని నిర్మించిన ఇంజనీర్లు ఎడ్మండ్ హపోల్డ్, ఇయాన్ లిడెల్, ఓవె అరూప్ లు. మోడరన్ ఆర్కిటెక్చర్ తో ప్రత్యేకమైన నిర్మాణ శైలిలో ఉన్నది. డ్రామా, మ్యూజికల్ ప్రొడక్షన్, బ్యాలె సింఫని ఆర్కెస్ట్రా వంటి వాటికి ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ నిర్మాణాలలో సిడ్నీ ఒపేరా హౌస్ పేరుగాంచినది. థియేటర్ దూరం నుంచి చూసినప్పుడు తెల్లగా పెయింట్ వేసినట్టు కనిపిస్తుంది. దీని పై కప్పు భాగం టైల్స్ తో కప్పబడి ఉన్నది. పక్కనున్న గోడలు అద్దాల పలకలతో అమర్చబడ్డాయి. స్వీడన్ లో తయారైన టైల్స్ ను తెచ్చి ఈ భవన నిర్మాణంలో వాడారు.
 
          చుట్టూ నీళ్ల మధ్యలో విచ్చుకున్న తామర పువ్వులా అనిపించింది. అక్కడ షాపింగ్ కోసం చాలా దుకాణాలు ఉన్నాయి. సావనీర్లు, ఆ దేశపు ఐకాన్లు, బొమ్మలు, బ్యాగులు, టోపీలు ఎన్నో కనిపిస్తున్నాయి. మేం వెళ్లేసరికి వర్షం కురుస్తున్నది. అలాగే తడుచుకుంటూ మెట్లెక్కాం. ఫోటోలు దూరం నుంచి మాత్రమే చక్కగా వస్తున్నాయి. దగ్గరకు వెళ్లేసరికి అద్దాల గోడల అందాలు మురిపిస్తున్నాయి. ఎన్ని ఫోటోలు తీసిన సంతృప్తి అనిపించలేదు. ఒక పక్క తలంతా తడిచిపోతున్నది. జలుబో, జ్వరమో పట్టుకుంటే ఎలా అనే భయం ఒక పక్కా, మళ్లీ మళ్లీ వచ్చి చూసేది కాదు అనే ఆలోచన మరో పక్క మనసులో మెదులుతున్నది. వర్షానికి మెట్లు జారుతాయేమో అని మెల్లగా ఎక్కుతూ, నీళ్లు నిండిన ఫ్లోర్ మీద మెల్లగా నడుస్తూ సిడ్నీ ఒపేరా హౌస్ సందర్శన పూర్తి చేశాము.
 
          బయట ఊరంతా తిరిగి వచ్చి పడుకుంటే మెలకువ ఉండడం లేదు. ఉదయం పూట లేవలేకపోయాం. ట్రావెల్స్ కారు రాకముందే మనం తయారై హోటల్ లాబీలో ఉండాలి లేకపోతే ఐదు నిమిషాలు వేచి చూసి వెళ్ళిపోతుందట. ఈ సమయపాలనకు తల తిరిగిపోయి మేం పది నిమిషాల ముందే కిందికి దిగి వచ్చి రెడీగా ఉన్నాం. హోటల్ రెస్టారెంట్ లో తినడానికి బ్రెడ్, జ్యూస్ తప్ప అన్ని నాన్ వెజ్ పదార్థాలే ఉన్నాయి. నేను డ్రై ఫ్రూట్స్ తో కడుపు నింపుకున్నాను. కాఫీ అడిగితే అప్పటికప్పుడు కాఫీ గింజలు పొడి చేసి డికాషన్ పెట్టి ఇస్తున్నారు. పాలు, పంచదార లేక తాగుతు న్నారు. పాలు పంచదార కావాలని అడిగితే కలిపి ఇస్తున్నారు. ఏమైనా మన కాఫీల రుచి రావడం లేదు.
 
          మరుసటి రోజు ‘బ్లూ మౌంటెన్స్’ కు తీసుకొని వెళతామని చెప్పారు. ఐబిస్ హోటల్ దగ్గర కారు పెట్టారు. రెండు గంటల ప్రయాణం పడుతుందని చెప్పారు. ఇక్కడ కేబుల్ కారు రైడింగులు, స్కై వాకులు, అడ్వెంచరస్ షోస్ ఉంటాయని చెప్పడంతో మా పిల్లలు బాగా ఉత్సాహపడ్డారు. ఇప్పుడూ వర్షం పడుతూనే ఉన్నది. వాళ్ళు చెప్పిన టైమ్ కు మేము రెడీ అవటమే సరిపోయింది. టిఫిన్ తినడానికి టైం దొరకలేదు. అందుకే అక్కడ ఉన్న నాలుగు పనులను చేతిలో పెట్టుకొని వెళ్ళాము. ఫ్లమ్ ఒకటి, కివి ఒకటి పియర్ ఒకటి, గ్రీన్ యాపిల్ ఒకటి తీసుకొని వెళ్ళాము. కారెక్కి కూర్చుంటే ప్రయాణం మాత్రం అద్భుతంగా ఉన్నది. చుట్టూ మసక వెలుతురు, పైనుంచి సన్నపు వర్షపు జల్లులు, జుయ్యి మంటూ చెవిలోకి దూరే గాలి వాతావరణం అపూర్వంగా ఉంది.
 
          న్యూ సౌత్ వెల్స్ రాష్ట్రంలోని పర్వత ప్రాంతమే ఈ ‘బ్లూ మౌంటెన్స్’. ఈ పర్వతం చుట్టూ నదులు పారుతూ ఉంటాయి. హాక్స్ బరీ, కాక్స్, కోలో నదులచే ఆవరించబడి ఉన్నది. ఈ పర్వతాలలో త్రీ సిస్టర్స్ అనే కొండలు పేరు బాగా పొందినది. ఇవి ఇసుక రాళ్లతో తయారైన పీఠభూమి నేల. ఇక్కడ మేము మూడు స్కైవాక్ లను చూసాము. పెద్ద బస్ ఆకారంలో ఉన్న కేబుల్ కార్ ఎక్కి మొదటగా పర్వతాల మీదికి చేరాము. అక్కడ కూడా షాపింగ్ చేసుకోవడానికి ఎన్నో దుకాణాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కంగారూలు, కోలాల బొమ్మలే కనిపిస్తున్నాయి. మనదేశంలో ఇన్ని నెమలి బొమ్మలు కనిపిస్తాయా అని మనసులో అనిపించింది.
 
          ఇక్కడ మూడు నాలుగు అంతస్తులు ఉన్నాయి. దుకాణాల మధ్యలో నుంచి దారి ఉన్నది. మరొక కేబుల్ కారు ఎక్కితే ఇంకో పర్వత శిఖరం మీదకి చేరుకున్నాం. ఇక్కడంతా అటవీ ప్రాంతమే. చెక్క నేలతో రోడ్డు వేశారు. ఆకాశాన్నంటే చెట్లతో, పొదలతో అడవిని తలపిస్తున్నది. అలా నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన కనిపించే చెట్లకు పేర్లు కనిపిస్తున్నాయి. వాటి శాస్త్రీయ నామాలు ప్రత్యేక లక్షణాలు చదువు తుంటే మేము చదువుకున్న బాటనీ పాఠాలు గుర్తుకొచ్చాయి. నేను ఇంతకుముందు అరుదైన చెట్ల గురించి ఒక పుస్తకం రాశాను. అలాగే కొత్త దేశమో రాష్ట్రమో వెళ్ళిన ప్పుడు తెలుసుకున్న విషయాలు “చెట్లతో చెలిమి” పుస్తకంగా రూపొందాయి. నేను ఎక్కడికి వెళ్ళినా జంతు వృక్షజాతుల్ని పరిశీలిస్తాను. బహుశా అవి నా సబ్జెక్టులు కావడం ఒక కారణం కావచ్చు. ఈ కొండల మీద జీవ వైవిద్యం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఆస్ట్రేలియా దేశంతో మిగతా దేశాలకు రోడ్డు మార్గాలు లేకపోవడం, అంటే అదొక ద్వీపం కావడం కారణంగా ఇక్కడున్న జంతువులు ఇక్కడే ఉండిపోయాయి. వలసలు జరగడానికి ఆస్కారం లేదు. అలాగే వృక్షజాతులు కూడా పరిణామం లేకుండా ప్రాచీనతను ప్రదర్శిస్తున్నాయి వీటిని వివరంగా మరొక వ్యాసంతో తెలుపుతాను.
 
          బ్లూ మౌంటెన్స్ లోని అడ్వెంచర్స్ లోని నాకు బాగా నచ్చిన విషయం రైల్ ప్రయాణం. ఈ రైలు ప్రయాణం మామూలుగా లేదు. రైలు పై భాగమంతా కనిపించే అద్దాలతో కప్పబడి ఉన్నది. ఇదొక సొరంగంలో పోయినప్పుడు చిమ్మ చీకటితో భయం కలిగిస్తుంది. మనం సీట్లలో కూర్చునేటప్పుడు వెనక్కి వాలి వంగిపోయి ఉన్నట్లుగా కనిపిస్తాయి. ఇదేమిటి ఇలా ఉన్నాయి అనుకున్నాను నేను. అప్పుడు మా పిల్లలు చెప్పారు. “రైలు మామూలుగా ప్రయాణించదు, కొండల మీద నుంచి నిలువుగా కిందికి ప్రయాణిస్తుంది. అందుకే ఈ ఏర్పాటు” ఆ మాటతో నాకు చాలా భయం అనిపించింది. “ముందే చెప్పొచ్చు కదా!  నేను ఎక్కకుండా ఉండేదాన్ని” అని మా పిల్లలతో అంటే “అందుకే చెప్పలేదు, నువ్వు ఇప్పుడు డైరెక్టుగా ఎంజాయ్ చేస్తావు” అన్నారు. రోట్లో తల పెట్టాక రోకలి పోటుకు భయపడినట్లుంది నా పరిస్థితి.
 
          రైలు పై భాగం అద్దాల్లా ఉందని చెప్పాను కదా! రైలు బయలుదేరింది. కూర్చున్న వాళ్ళం నిలువుగా ప్రయాణిస్తున్నట్లుగా, కాళ్ళు జారిపోతున్నట్లుగా అనిపించింది. పైన కొండ ఉన్నది అంటే కొండ మధ్యలో రైలు పట్టేంత కన్నం చేసి అందులో నుంచి రైలును పంపిస్తున్నారు. ఏమి ఇంజనీర్ల ఈ ప్రతిభ పని ఆశ్చర్య మేస్తూనే లోపలికి పోతుంటే చీకట్లో భయంతో అరుపులు కేకలతో ప్రతిధ్వనించింది. కొండ భాగం పోగానే దూరంగా కనిపించే పర్వతాలు, కింద లోయలు కనిపించాయి. ఇక్కడే త్రీ సిస్టర్స్ అనే పేరుగాంచిన పర్వతాలు కనిపించాయి. చేతిలో సెల్ ఫోనులు కెమెరాలుగా మారిపోయి క్షణం ఆగకుండా క్లిక్ మనిపిస్తున్నాయి. కిందికి దిగాక రైలు మార్గాన్ని గమనిస్తే నిట్ట నిలువుగా ఉండి భయం గొల్పించేలా ఉన్నది.
 
          బ్లూ మౌంటెన్స్ నుంచి వస్తూ మేం ఇండియన్ రెస్టారెంట్ కోసం మధ్యలో దిగిపోయాం. అక్కడి నుంచి లోకల్ రైలులో తిరిగి ఆనందపడ్డాం. రైళ్లు రోడ్లమీదే నడుస్తున్నాయి. ట్రాంబళ్లను గుర్తుచేశాయి. ఇలా కలకత్తాలో చూశాం. ఈ రైలెక్కి దగ్గరికి వెళ్లి అక్కడ ఇండియన్ రెస్టారెంట్లో భోజనం చేసి మా హోటల్ కి వెళ్ళే దానికి క్యాబ్ బుక్ చేద్దామని చూస్తే 2కి.మీ దూరం అని చెప్తోంది. సరే నడిచిన అనుభవం కోసం ఫోన్ లో మ్యాప్ పెట్టుకొని చక్కగా నడుస్తూ ఫోటోలు తీసుకుంటూ హోటల్ కు చేరాం. ఇవి మా సిడ్నీ టూర్ విశేషాలు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.