
గ్రహింపు
-తోకల రాజేశం
అన్నీ అదుపులోనే ఉన్నాయనుకుంటాం
చేతిలోని గాజు గ్లాసు కిందపడి
భళ్ళున పగిలేదాకా అర్థం కాదు
మనస్సు ముక్కలయ్యాక కానీ
ఏం జరిగిందో బోధపడదు
దారపు ఉండ నుంచి పోగు
తెగినంత సులభంగా ఎలా తెగుతాయో బంధాలు?
అతుకుదామని చూస్తాం కానీ
ముడి తెగిన గాయాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది
అన్నీ అనుకున్నట్టే జరుగుతాయనుకుంటాం
అకస్మాత్తుగా వచ్చి కోసిన పంటనంతా
నీటి నోటితో నమిలి పారేస్తుంది తుఫాను
పిడుగులాంటి వార్త నెత్తిమీద పడిన తరువాత కానీ
కాళ్ళకింది భూమి బద్దలయిన సంగతి తెలియదు
చెట్టు మీది నుంచి పండు
జారినంత సహజంగా ఎలా రాలిపోతారో మనుషులు?
శోక సముద్రంలో దేవులాడుతాం కానీ
మళ్లీ ఎన్నడూ ఆ పలకరింపు గుండెను తాకదు
ఏదో ఘనసమైనదే సాధించామని అనుకుంటాం
బావిలోనుంచి బయటకు దూకే దాకా
లోకమేమిటో తెలిసి చావదు
ప్రపంచాన్ని పాతాళ గరిగెతో
తోడితే కానీ నిజం కనిపించదు
మట్టిలో నుంచి సరాసరి నింగిలోకి
క్షిపణి దూసుకెళ్లినంత గర్వంగా ఎలా ఎదుగుతాడో మనిషి?
కిందపడతాడని భయం నీడలో చేరతాం కానీ
కొన్ని చేతులు నేలమీద నిచ్చెనలల్లుతూనే ఉంటాయి
నా దగ్గర ఏదీ లేదనుకుంటాం
ఏకాంతం ఒడిలో గుండెలోకి తొంగి చూసుకునేదాకా
ఏది నీ జీవితమో స్పష్టం కాదు
అంతరంగానికి ముసురు పట్టినప్పుడు కానీ
నీ కోసం కొందరున్నారని అర్థం కాదు
ఏదీ మనది కాదనుకుంటాం
అన్నీ మనవేనని గ్రహింపులోకిరానంత వరకు
జీవితమేమిటో బొత్తిగా అర్థం కాదు.
*****

తోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు.వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు.ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం(2006),చెమట చుక్కలు(నానీలు-2010),పాతాళ గరిగె(సాహిత్య వ్యాసాలు-2013),అడవి దీపాలు(వచన కవిత్వం-2017),మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర(తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020),కొబ్బరి నీరా! శతకం(పదిమందితో కలిసి-2023),మట్టి విజయం(పద్యకవిత్వం-2024)అనే పుస్తకాలు ముద్రించారు.తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం(2012),సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012),సాహితీ శిరోమణి పురస్కారం(2015),సినారె పురస్కారం(2023),తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.
