నడక దారిలో-63

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువుతో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ చనిపోవడంతో ఆషీని తీసుకుని పల్లవి తిరిగివచ్చేసి ఉద్యోగంలో చేరింది. నేను హెచ్చెమ్ కావటం,రిటైర్ కావటం, పెద్దక్క మరణం,ప్రత్యేకతెలంగాణా ఏర్పాటు, వీర్రాజు గారి పెయింటింగ్స్ ప్రదర్శనలు. సరూర్ నగర్ అపార్ట్మెంట్ కు మారటం. డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయటం . తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు. వీర్రాజుగారికి బోయి భీమన్న,బాపూరమణల పురస్కారాలు- అమృతలతగారి పరిచయం-ఉమ్మడిశెట్టి రాధేయ ప్రతిభా పురస్కారం -చిన్నక్క మరణం, వీర్రాజుగారి పెయింటింగ్స్ ప్రదర్శనలూ,నాకు అమృతలత అపురూప పురస్కారం,ఆషీకి కాలేజీ ఎంపిక ప్రహసనాలూ,ఇంట్లో పెరిగిపోతున్న పుస్తకాలూ, ఆత్మీయ మితృలమరణాలూ తర్వాత—)

***

ఈమధ్య సుమారు పదేళ్ళుగా వీర్రాజుగరు ముఖచిత్రాలు వేయటం మానేసారు. మా పుస్తకాలకు పిల్లలే డిజైన్ చేస్తుంది. కానీ సుశీలమ్మగారి కిన్నెరసాని ఎమ్ ఫిల్, పరిశోధన గ్రంధానికి,’కవిత్వ పరామర్శ’ విమర్శ గ్రంథానికి ఇబ్బంది పడుతూనే ముఖచిత్రం వీర్రాజు గారు వేసారు. అవే ఆయన వేసిన చివరి ముఖచిత్రాలు.

డిసెంబర్ 31, 2019 ప్రపంచమంతా ‘‘న్యూ ఇయర్’’ వేడుకలకు సిద్ధమవుతోంది. ప్రజలంతా కొత్త ఏడాదిని స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నారు. వూహాన్ నగరం కరోనాకు కేంద్రంగా చైనాలోని ఆరోగ్య నిపుణులు కొత్తగా నమోదైన కేసును మొదటగా ‘‘న్యూమోనియా’’గా భావించి కరోనాగా నిర్ణయించారు. అయితే అప్పుడప్పుడే ఒక వైరస్ గురించి టీవీలో కథనాలూ,చర్చలూ మొదలయ్యాయి. ప్రపంచ ప్రజల నరాల్లోకి భయం మెల్లిమెల్లిగా ఒక పురుగులా ప్రవేశించింది.

2020 జనవరి 30 న వుహాన్ నుండి తిరిగి వచ్చిన కేరళ విద్యార్థికి మొదటి పాజిటివ్ కేసు నమోదయింది అని టీవీ గగ్గోలు పెట్టింది. అప్పుడప్పుడు రిటైర్డ్ టీచర్లు అందరికీ మా పాత హెడ్ మిస్ట్రెస్ శిరోమణీ థామస్ గారు వారింట్లో విందులో సహా సమావేశం ఏర్పాటు చేసారు. అక్కడ అందరం కలిసి సందడి చేసాము. ఆ సందర్భంలో వైరస్ గురించి కూడా మాట్లాడుకున్నాము. అంతా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జాగ్రత్తలు చెప్పుకొని సాయంత్రానికి ఇంటికి చేరాము.

మార్చిలో లేఖిని వార్షికోత్సవ మాతృ దినోత్సవ పురస్కారాల సమావేశానికి వెళ్ళాను. కర్పూరం రుమాలులో చుట్టి వాసన చూస్తుంటే వైరస్ తాకదు అని కూడా ఒకరికొకరు చెప్పుకున్నారు. వైరస్ మన వరకూ రాదులే అనే ధీమాతో మార్చిలో కూడా అత్తలూరి విజయలక్ష్మి రాసి ప్రదర్శింపజేసిన నాటకానికి వెళ్ళి వచ్చాను. ఇంతలోనే కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా అనేక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ దేశప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని బయటకు రావద్దని ప్రకటించారు. ఆ ఒక్కరోజు ఇంట్లో వున్నంత మాత్రాన నన్నెవరూ కట్టడి చేయలేరులే అంటూ వైరస్ విజృంభించటం మొదలెట్టింది.

ఆ తర్వాత ప్రధాన మంత్రి మార్చి 24 నుంచి దేశం మొత్తం 21 రోజులు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించారు. సామాన్య ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అన్ని థియేటర్లు, విద్యాలయాలు,మ్యూజియంలు, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలు, మూసేయాలనీ విద్యార్థులంతా ఇళ్లకే పరిమితం కావాలని, సామాజికంగా ఒకరికొకరు దూరంగా ఉండడమే కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి నివారణకు మంచి మార్గమని నిబంధనలను ఫోన్లలో , ఛానెల్స్ లో వినిపించటం మొదలైంది.

కరోనావైరస్ వ్యాధి (COVID-19) కొత్త వైరస్ వల్ల కలిగే అంటు వ్యాధి . దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో ఫ్లూ వంటిదే కానీ తీవ్రమైన సందర్భాల్లో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. దీని నివారణకు చేతులను తరచూ కడుక్కోవడం, ముఖాన్ని తాకకుండా ఉండడం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించడం ద్వారా మాత్రమే మనల్ని రక్షించుకోవచ్చునని అన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలతో ఊదరగొట్టటం ప్రారంభించారు .

నేను కాటరాక్ట్ చేసుకోవాలనుకున్నది వాయిదా పడింది. పనమ్మాయి లక్ష్మిని లాక్ డౌన్ వున్నంతకాలం రావద్దని చెప్పి ఫస్ట్ రోజున గేటు దగ్గరకి వస్తే జీతం ఇస్తానని చెప్పాను. ఇంట్లో పనులన్నీ మేమే చేసుకోవటంతో బిజీ అయ్యాము. ఆషీకి కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ క్లాసులు మొదలయ్యాయి. మళ్ళీ ఏప్రిల్ 14 న దేశవ్యాప్తంగా లాక్డౌన్ మే 3 వరకు పొడిగించారు కానీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి మే 17 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు చేసింది. మధ్యలో ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్ లైట్లు ఆపేసి దీపాలు , కొవ్వొత్తులు, మొబైల్ ఫ్లాష్ లైట్లు వెలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ చీకటి కాలంలో 130 మంది కోట్ల భారతీయుల మహా సంకల్పాన్ని చాటాలని, ఆ చీకటి వైరస్‌కు వెలుగు శక్తిని పరిచయం చేయాలని ఆయన పేర్కొన్నారు. మరోరోజు గంటలు, కంచాలు వాయించితే కరోనాని తరిమి కొట్టొచ్చని అంటే ఆ పని కూడా వందకోట్లకీ పైగా జనం ఆచరించి తమ దేశభక్తి చాటుకున్నారు. అయితే మంత్రాలకు చింతకాయలు రాలవు కదా కనిపించని ఆ శత్రువు ప్రజలమీద దాడి చేస్తూనే వున్నాడు.

అయితే ఆ సమయంలో జాతీయ దూరదర్శన్ 1990లలో’ సంచలనం కలిగించిన మహాభారతం ,చాణక్య ధారావాహికాలు తిరిగి ప్రసారం చేసింది. అవి అప్పట్లో యథాలాపంగా చూసామేమో కానీ ఇప్పుడు చూస్తుంటే ఎన్నో విషయాలు ఆసక్తిగా అనిపించింది. మాకు ఇష్టమైన చారిత్రక పరిశోధనగా చాణక్యను గమనించాము. అందులో పాత్రల ఆహార్యం అబ్బుర పరిచింది. అవి అజంతా శిల్పాలు, బౌద్ధ కథలలో పాత్రల వస్త్ర, శిరోజాల అలంకరణలకు దగ్గరగా వుంది. చాణక్య పాత్రధారి చంద్రద్వివేది మౌర్య సామ్రాజ్య స్థాపనకు చెందిన అనేక పుస్తకాలు చదివి పరిశోధన చేసి వాటి ఆధారంగా తానే దర్శకత్వం వహించాడు. అందరు పాత్రధారులూ అద్భుతంగా నటించారు. ఆ నాటి రాజ్యం,నగరం,ఇళ్ళూ ఎలా వుండేదో ,ఆనాటి పంటలు, వుపయోగించిన పాత్రలు మొదలైనవన్నీ చాలా సహజంగా తీర్చి తీయటం తప్పక చూడవలసిన ధారావాహికగా అనిపించింది. విద్యార్థులూ,వాళ్ళ రూపం ఆరెస్సెస్ పక్షాన వున్న సీరియల్ అనిపిస్తే అనిపించవచ్చు కానీ ఎక్కడా మతప్రసక్తి ఉండదు. రాజనీతికి చెందిన సీరియల్. అప్పుడప్పడే బౌద్దమతం మన దేశంలోకి వస్తున్న విధం ఇందులో తెలుస్తుంది.

ఇంకా మహా భారత్ కూడా పౌరాణిక గ్రంథంగా కాకుండా ఒక రాజనీతిశాస్త్ర గ్రంథమే అనేలా ఆలోచింపజేసే బలమైన సంభాషణలతో ఆసక్తి దాయకంగా ఉండటంతో ఇంట్లో అందరం కూర్చుని రోజూ చూసాము.

కరోనా భయంతో బిల్డింగ్ అంతా ఎవరికి వారు ఇళ్లలోనే బందీలయ్యారు. అందులోను కొన్ని ఇళ్ళల్లో కరోనా బాధితులు కూడా ఉండటం కూడా ఒక కారణం. బిల్డింగ్ లోనే సూపర్ బజార్ వుండటంతో వెచ్చాలకు కూడా ఇబ్బంది పడలేదు. సూపర్ బజార్ వాళ్ళే కూరలూ, పళ్ళూ తీసుకు రావటంతో వాటిని కడిగి ఆరబెట్టి తుడిచి ఫ్రిజ్ లో సర్దడం వీటితో రోజంతా పనిలాగే వుండేది.

“అందరి ఇల్లు ” డా.వింజమూరి సూర్యప్రకాష్ గారు డెబ్భై రోజుల పాటూ ప్రతీరోజూ సాయంత్రం గంటసేపు ప్రేమా, నిజాయితీ పేరుతో జూమ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. రచయితలతో ,ఆర్థికవేత్తలతో, హోమియో,ఆయుర్వేద,అల్లోపతి డాక్టర్లతో,సంగీతజ్ణులతో ఒక్కొక్క రోజు ప్రసంగాలు చేయించారు. అవి చాలా ఆసక్తికరంగా సాగాయి. ఒకరోజు వీర్రాజుగారు కూడా మాట్లాడారు. తెలంగాణాతో సహా అన్ని రాష్ట్రాలు సరిహద్దులను మూసివేసి రవాణాను నిలిపివేసాయి.. ‘‘కోవిడ్-19’’. మానవ చరిత్రలో ఆధునిక కాలంలో మనిషి ఎప్పుడూ చూడని భయోత్పాతాన్ని సృష్టించింది. ప్రజలందర్ని కేవలం ఇళ్లకే పరిమితం చేసింది. ‘‘లాక్‌డౌన్’’తో జనజీవితం అస్తవ్యస్తమైంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. కడుపు చేత పట్టుకొని ఉపాధికోసం దేశంలో వివిధ ప్రాంతాలకు వలస పోయిన శ్రామికులు తమకు పనులు ఆగిపోవడంతో తట్టాబుట్టా కట్టుకొని కుటుంబాలతో సహా చనిపోతే తమ వూర్లోనే అందరి మధ్యా పోదామనే ఆలోచనతో నడక దారిలో రోడ్లమీదకు బయలుదేరారు. ఒక తీరని విషాదం ప్రపంచాన్ని చుట్టుముట్టింది.

వీర్రాజుగారు సబ్ కాన్షస్ లో కరోనా గురించి భయం, బెంగ పెట్టుకున్నారనుకుంటాను. బహుశా అందువల్లనే అనుకుంటాను యూరిన్ మాటిమాటికీ రావటంతో ఇబ్బంది పడ్డారు. మేము రెగ్యులర్ లా వెళ్ళే హోమియో డాక్టర్ని ఫోన్ లో సంప్రదించగా ఆయన కారులో మా ఇంటివైపు వచ్చి గేటు దగ్గర మందులు అందజేసారు. ఒక రెండు మూడు డోసులు పడగానే వీర్రాజుగారికి యూరిన్ కంట్రోల్ లోకి వచ్చింది. దాంతో వూపిరి పీల్చుకున్నాము. మొదటే బాగా తక్కువ మాట్లాడతారేమో మరింత మౌనమునిలా అయిపోయారు. టీవీలో చాణక్య, మహాభారత్ చూస్తున్నపుడు తప్ప మిగతా సమయంలో తన రూములో ఆలోచనా నిమగ్నులై వుండిపోయేవారు. మామూలుగా వుంచటానికి చాలా ప్రయత్నం చేయాల్సివచ్చేది. బొమ్మలన్నా వేయండి, పుస్తకాలన్నా చదవండి అని అనటంతో శ్రీపాద, మల్లాది, కొకు మొదలైన వారి పుస్తకాలు చదవటం మొదలు పెట్టారు.

అప్పుడప్పుడు ఫోన్లలోనే మిత్రులతో సంభాషణలు. అవికూడా తిరిగి తిరిగి కరోనా కబుర్లతోనే ముగిసేవి. ప్రజాసాహితి మిత్రులు రామకృష్ణగానీ, లక్ష్మి గానీ పదిరోజులకు ఒకసారైనా మా క్షేమసమాచారాలు కనుక్కునే వారు.

పత్రికలన్నీ ఆగిపోయాయి. వార్తాపత్రిక మాత్రం వచ్చేది. టీవీ ప్రసారం చేస్తోన్న దృశ్యాలు చూడాలంటే కనిపించని శత్రువు ప్రపంచంపై చేస్తున్న దాడి, కుప్పకూలుతున్న జనాలు మరింత భయకంపితుల్ని చేస్తున్నాయి. ఇక పుస్తకాలు చదవటం మాత్రమే భయంకర ఆలోచనల్ని మళ్ళించేదిగా మారింది.

కరోనా బారిన పడి ప్రాణాలు విడచిన వాళ్ళు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నృత్య దర్శకుడు శివశంకర్ వంటి సినీప్రముఖులు, శోభానాయుడు లాంటి ప్రముఖ నర్తకీ,ప్రణబ్ ముఖర్జీ, కన్యాకుమారి ప్రాంత ఎంపీ, హరిబాబు,నాయకులూ ఇలా..ఇలా..ఎందరో ఎన్నో రంగాల వాళ్ళు మాయమైపోయారు.డబ్బూ,పదవులూ,అధికారాలూ అన్నీ వున్నా సెలబ్రిటీలే కరోనా కాటు నుండి తప్పించుకోలేక పోతున్నారంటే ఇక సామాన్య ప్రజలు పిట్టల్లా రాలిపోతూనే వున్నారు.

బాలా సుబ్రహ్మణ్యానికి అధికార లాంఛనాలతో సగౌరవంగా తమిళనాడు అంత్యక్రియలు ప్రభుత్వం నిర్వహించారు. జీవితమంతా నాట్యానికి అంకితం చేసిన శోభానాయుడుకి ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వం కాదు కదా కనీసం సామాజిక మాధ్యమాల్లో కూడా ఏమంతగా ఆమెకీ నివాళులు ఎవరూ చెప్పక పోవటం చాలా బాధకలిగించింది. స్వార్థ రాజకీయాలే తప్ప కళాభిరుచి లేదు. బహుశా ఇతరేతర వివక్షలూ కారణం కావచ్చు. ఏమైతేనేం తెలుగువారు నాట్యంలో ఎన్నో ప్రయోగాలు చేసిన గొప్ప నాట్య కళాకారిణిని కోల్పోయారు.

కరోనా నుండి ఆలోచనలు మళ్ళించడానికి కవితల పోటీ నిర్వహిస్తున్నాననీ ఫోన్ చేసీ ఆ కవితల పోటీకి న్యాయనిర్ణేతగా వుండమని కోరారు. కవితలకు కవయిత్రి పేరు తొలగించి నాకు పంపించారు. బాగానే చాలా మంది కవితల పోటీలో పాల్గొన్నారు. నాకు అది సరదాగా అనిపించింది. ఆ కవితల్ని చదివి ఫలితాలు పంపించాను.

వరంగల్ నుండి అనిశెట్టి రజిత ఫోన్ చేసి కరోనా సందర్భంలో కథలసంకలనం చేస్తున్నానని , నన్ను ఒక కథరాసి పంపమని అడిగింది. సరేనని ఆలోచించి రాస్తానన్నాను. రాయాలని అనుకోగానే కవిత గానీ, కథగానీ రాయలేను. ఫేస్బుక్ లోనూ వాట్సాప్సమూహాలలోనూ పుంఖానుపుంఖాలుగా కవితలు వెల్లువెత్తుతున్నాయి. అయినా నా ఒక్క అక్షరం మెదలలేదు. దానికి తోడూ వ్యాసాలు కోసం రచయిత్రుల కథలు చదువుతున్నానేమో అసలే కథలూ, కవితలూ రాసే మూడ్ కలగలేదు.

కరోనా కాలంలో భార్యా,భర్తా,భర్త తమ్ముడూ,ఒక పని అమ్మాయి కరోనా రేపిన ఆలోచనల్ని” నాలుగు గోడల మధ్య నలుగురు “అనే కథ రాసి పంపించాను. అదేకాకుండా నాలుగైదు కవితలీ కూడా రాసాను.

మా బిల్డింగ్ లో ఒక ఆమె కూతురు డెలివరీ కోసం వచ్చి తిరిగి వాళ్ళూరు వెళ్ళటానికి ప్రయాణానికి కరోనా నాకాబంది వలన ఇక్కడే వుండిపోయింది. తీరా ఆమెకు వైరస్ వలన సీరియస్ అయ్యి హాస్పిటల్ పాలై చనిపోయింది. ఆమె కొడుకులు విదేశాల్లో వుంటారని. ఎలాగో ఒక కొడుకు వచ్చి కర్మకాండలు చేయగలిగాడు. ఈ సంఘటన కొంత మనసును కలవరపెట్టింది. ఇదొక్కటే కాదు. వ్యాధితో పోయిన వారి భౌతికకాయాల్ని హాస్పిటల్ వారే అంత్యక్రియలు జరిపారు.

ఈ విధంగా అనేక కుటుంబాలు పిల్లలు పోతే తల్లిదండ్రులూ, తల్లిదండ్రులు పోతే పిల్లలూ రాలేకపోవటం,ఆఖరుకు భార్యాభర్తలు కూడా చూసుకోలేక పోవటం. కలలో కూడా వూహించని మహమ్మారి చుట్టుముట్టి ప్రపంచాన్ని అతలాకుతలం  చేసింది .

మెల్లిమెల్లిగా ఆ వుధృతం తగ్గింది. కానీ పూర్తిగా సామాన్య స్థితిలోకి రాలేదు.

ఆ సమయంలో శిఖామణిగారు ఈ ఏడాది శిఖామణి పురస్కారం వీర్రాజు గారికి ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు . అయితే కోవిడ్ నిబంధనల వలన మా ఇంటికే శిఖామణి గారు. వచ్చి జూమ్ సమావేశం ద్వారా బహుమతి ఇస్తానన్నారు. కె.శివారెడ్డి గారిని మా ఇంటికి తీసుకు వచ్చి వీర్రాజుగారికి ఘనంగా శిఖామణి అవార్డు ప్రదానం చేసారు. ఇంతవరకూ శిఖామణి గారి పురస్కారం వరుసగా సీనియర్లుకే ఇస్తూ వస్తున్నారు. అనేక మంది జూమ్ సమావేశంలో వీర్రాజు గారి సాహిత్యం,చిత్రలేఖనం గూర్చి మాట్లాడారు. వీర్రాజుగారు కూడా సంతోషించారు.

కోవాక్జిన్,కోవీషీల్డ్ అనే టీకా మందు దీనికి పరిష్కారంగా ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఇది నాలుగు వారాలకు ఒకటిచొప్పున మూడు డోసులు వేసుకోవాలట. మార్చిలో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగింది. మా బిల్డింగ్ లోనే హెల్త్ వర్కర్ ఉండటంతో  ఇంటికే వచ్చి నలుగురికీ వేసారు.

క్రమక్రమంగా జనం వీధుల్లోకీ వెళ్ళటానికి నిబంధనల మేరకు అలవాటు పడుతున్నారు. పబ్లిక్ పరీక్షలు కూడా కోవిడ్ నిబంధనలతోనే జరపటానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంక్రాంతికి బొమ్మలకొలువు కాస్త సింపుల్ గానేపెట్టి తక్కువ మందికి మాత్రమే చెప్పాలని అనుకుని అదేవిధంగా చేసాము.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.