నా జీవన యానంలో- (రెండవభాగం)- 1

-కె.వరలక్ష్మి 

అప్పటికి నాకు ఇరవై ఐదవ సంవత్సరం నడుస్తోంది.

స్కూల్ ఫైనల్ (11 వ తరగతి ) తో నా చదువాగిపోయి పదేళ్లైపోయింది. స్కూల్ ఫైనల్లో నాకొచ్చిన మార్కుల వల్ల హిందీలో ప్రాధమిక, మాధ్యమిక చదవకుండానే డైరెక్టుగా రాష్ట్ర భాషకు అటెండై పాసయ్యాను . అప్పటికి హిందీ అక్కయ్యగారు ట్యూషన్స్ మానేసారని గుర్తు . నేను సొంతంగానే చదువుకునే దాన్ని . రాజమండ్రిలో పుష్కరాల రేవు పక్కనున్న రాణీ మహల్లో గర్ల్స్ హైస్కూల్ ఉండేది . హిందీ పరీక్షలు అక్కడ జరుగుతూండేవి. ఆరు నెలల కొక పరీక్ష కావడం వలన ప్రవీణ వరకూ రాసేసాను.

నాకు పై చదువులకు వెళ్లాలని ఉండేది. స్కూలు బాధ్యత ఓ పక్క , పిల్లలు ముగ్గురూ చిన్న వాళ్ళు కావడం వలన కాలేజ్ కి వెళ్లే అవకాశం లేదు ప్రైవేటుగానే చదవాలి. అప్పటికి ఒక్క సంవత్సరం పి.యు.సి తీసేసి రెండేళ్ల ఇంటర్మీడియట్ పెట్టేరు కాలేజెస్ లో. హైస్కూల్స్ లో 11 వ తరగతి తీసేసారు. చదువుకోవాలనైతే ఉంది కాని , ఎలా ప్రొసిడవ్వాలో తెలీదు. నా జీవిత సహచరుడు మోహన్ కి ఎన్ని సార్లు చెప్పినా ప్రయోజనం లేకపోయింది.

ఆరోజు వేణుగోపాల స్వామి గుడి ముందున్న గ్రంథాలయానికి వెళ్లి వస్తున్నాను. దారిలో వెంకట్రావు మాస్టారి ట్యూషన్ సెంటర్ ముందు బోలెడన్ని చెప్పుల జతలు కన్పించాయి. నా బుర్రలో ఒక బల్బు వెలిగింది. అది ఒక చిన్న కుటీరంలాంటిది. అప్పుడెప్పుడో నా ఫ్రెండ్ మీనాక్షి వెంట ఒకే ఒక్క సారి వెళ్లేను. సంశయిస్తూనే లోపలికి అడుగు పెట్టేను. విషయం విని మాస్టారు “వీళ్లంతా ఇంటర్మీడియట్ కి వెళ్తున్న వాళ్లే. ఈ సంవత్సరానికి ఫీజు కట్టే టైం అయిపోయింది” అన్నారు. అంతలో ఓ అబ్బాయి “ లేదు మాస్టారూ, ఫైన్ తో కట్టడానికి ఇంకా రెండు రోజుల టైముంది” అన్నాడు. అంతే, నేను అప్పటికప్పుడు మాస్టారి దగ్గరున్న అప్లికేషన్ ఫాం ఫిలప్ చేసేసి, ఫీజు కట్టేసాను. ఇంటర్మీడియట్ రెండేళ్ళూ కలిపి ఒకేసారి పరీక్షలు రాసే అవకాశముంది. “కాని, పరీక్షలు మూడు నెలలు కూడా లేవు. చదవాల్సిన సబ్జెక్ట్ వరకూ నేనివ్వగలను. స్కూలు , బాధ్యతల మధ్య నువ్వు చదవగలవా?” అన్నారు మాస్టారు.

“తప్పకుండా చదవగలను మాస్టారూ, కాని నేను వీళ్లందరిలాగా రోజూ ట్యూషన్ కి రాలేను. ఆదివారం మాత్రం రాగలను, మిగతా రోజుల్లో ఇంటి దగ్గరే చదువుకుంటాను” అన్నాను .

“అయ్యో, అలా అయితే ఎలా?” అన్నారు మాస్టారు .

“నేను రాసుకున్న నోట్సులూ అవీ ఇస్తాలెండి” అన్నాడు అయ్యరుగారబ్బాయి గొట్టి. అప్పటికప్పుడు ఓ నోట్ బుక్ ఇచ్చేసాడు. ముత్యాల్లాంటి అక్షరాల్తో నీట్ గా రాసుకున్నాడు .

ఈ గొట్టి (వెంకటేశ్వర్రావు) మా పెద్ద తమ్ముడి క్లాస్ మేట్. చిన్నప్పుడు తరచుగా మా ఇంటికొచ్చేవాడు. మా తమ్ముడు , చెల్లి , గొట్టి కలిసి స్కూల్ ఫంక్షన్స్ లో బుర్ర కథ చెప్పేవారు. చిన్నప్పుడంతా సుశీల గొంతులాగా ఉండేది వాడి గొంతు. అద్భుతంగా పాడేవాడు. మంచి చురుకైనవాడు .

“టైమెంతో లేదు కాబట్టి మీరు మళ్ళీ రాసుకోవడం పెట్టుకోకండి. టెక్ట్స్ లూ, నోట్సులూ అన్నీ నేనిస్తాను. మీరు చదువుకుని ఇస్తూ ఉండండి” అన్నాడు. అలాగే ఇచ్చేవాడు.

ప్రతీ ఆదివారం మాస్టారు టెస్ట్ పెట్టేవారు. 

పదేళ్ల గేప్ తర్వాత చదువంటూ మొదలు పెట్టింది, ఎలా చదువుతుందో అనే సంశయం ఉండేది మాస్టారికి. నేను చకచకా ఆన్సరు చెయ్యడం చూసి తృప్తి పడ్డారు .

మిగిలిన అందరూ ఎక్కడెక్కడో పరీక్షలు రాసారు. నాకు మాత్రం రాజమండ్రిలో కందుకూరి రాజ్యలక్ష్మి విమెన్స్ కాలేజ్ సెంటర్ వచ్చింది. మొదటి రోజు హాల్ టెకెట్ కోసం వెళ్లినప్పుడు మోహన్ సిగరెట్ కాలుస్తూ ఆఫీస్ రూంలోకి రావడం చూసి తనని బైటికి పంపించేసారు. నేను కొంత అవమానం ఫీలయ్యేను. ఇరవై తొమ్మిదేళ్ల ఆ వయసుకే అతనికి విపరీతమైన స్మోకింగ్ హేబిట్ ఉండేది. చెప్పినా వినేవాడు కాదు. గుడ్డిలో మెల్ల ఏంటంటే ఇంట్లో గదుల్లో కాల్చొద్దు అని చెప్తే వినేవాడు. బైటికెళ్లి కాల్చుకునేవాడు.

మోహన్ కి నేను ఇంటర్ పాసవ్వలేనని ఓ గట్టిధీమా. ఇదేవైనా హైస్కూలు చదువు అనుకున్నావా అని ఎద్దేవా చేసేవాడు . నాక్కూడా లోపల ఒక భయమేదో ఉండేది. “రెండు సంవత్సరాల సబ్జెక్ట్ ని మూడు నెలల్లో చదివి పాసవ్వగలనా” అని. మోహన అప్పటికి ఏలేశ్వరం హైస్కూల్లో చేస్తూండేవాడు. తెల్లవారు ఝామునే లేచి వంట చేసి అతనికి కేరేజ్ ఇచ్చి, పిల్లల్నీ ఇంటినీ చక్కదిద్దుకుంటూ, స్కూల్లో టీచింగ్ ఓ పక్క, ఆఫీస్ వర్క్ మరో పక్క చేస్తూ , రాత్రి పిల్లల్ని నిద్రపుచ్చి నేను పుస్తకం చేతిలోకి తీసుకునే సరికి తొమ్మిదో, పదో అయ్యేది. నాలుగు పేజీలు చదివే సరికి నిద్ర ముంచుకొచ్చేది. తీరా రిజల్ట్స్ వచ్చేక చూస్తే నేనూ, కాలేజ్ లో చదువుతున్న కోమట్ల అబ్బాయి కొత్త నాగేశ్వర్రావు మాత్రమే పాసయ్యాం. నాకోసం నోట్స్ రాసి, టెక్ట్స్ పుస్తకాలు తెచ్చి ఇచ్చిన గొట్టి ఫెయిలయ్యాడు.

నేను చదివేసిన పుస్తకాలు పట్టుకెళ్ళడానికీ,  కొత్త పుస్తకాలు ఇవ్వడానికీ ఆ అబ్బాయి తరచుగా మా ఇంటికి వచ్చేవాడు. తెల్లగా సన్నగా పొట్టిగా కాటుక దిద్దినట్టుండే కళ్ళతో టెన్త్ క్లాస్ చదువుతున్న అబ్బాయిలా ఉండేవాడు. చిన్నప్పటి అతని పాట గుర్తుకొచ్చి ఓసారి ఏదైనా పాడమని అడిగితే జయభేరి లోని ఘంటశాల గారి పాటొకటి అద్భుతంగా పాడేడు. మేమున్న ఇంటికి పెద్ద వాకిలి ఉండేది. అక్కడ కూర్చుని పాడి వెళ్లేవాడు. అతను దేనికైనా నవ్వితే ముందు అతని కళ్ళు నవ్వుతో విచ్చుకునేవి. పన్నుమీద పన్ను తళుక్కున మెరిసేది. అతను హైస్కూల్లో మోహన్ దగ్గర చదువుకోవడం వలన మాపట్ల చాలా గౌరవంగా మసలేవాడు. అతని పాటల వల్ల నాకేమో అతని పట్ల ఒక సుహృద్భావం ఉండేది.

అప్పటికి జగ్గంపేట ఊరు చాలా చిన్నది. ట్యూషన్ లోనో, రోడ్డు మీదో పుస్తకాలు ఇచ్చి పుచ్చుకునే ప్రక్రియ జనానికి వింతగా కన్పించింది. ఆ అబ్బాయికీ నాకూ ఒక అక్రమ సంబంధాన్ని అంటగట్టేసారు. అది తెలిసి పరీక్షల తర్వాత అతను కన్పించడం మానేసాడు. అనుకోకుండా ఎక్కడైనా ఎదురుపడితే నవ్వీ నవ్వనట్టు కళ్లతోనే నవ్వి తప్పుకోనేవాడు. గాయకుడిగా ఎంతో ఎదగాల్సిన వాడు ఈ పల్లెటూరి వాతావరణంలో హోటల్, అక్కడికొచ్చే రకరకాల జనాలతో స్నేహాల వల్ల వెనకబడిపోయి, పదేళ్ల క్రితం అనారోగ్యంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లేడు.

మళ్ళీ వెనక్కెళ్తే అంత తేలికగా ఇంటర్మీడియట్ పాస్ కావడం నాలో ధైర్యాన్ని నింపింది. చదువును కొనసాగించే ఆసక్తి పెరిగింది. వెంటనే డిగ్రీ చదవడానికి ఫీజు కట్టేసాను. సైన్సెస్ తో చదవాలని ఉన్నా ఇంట్లో నుంచి అది వీలు పడదు కాబట్టి స్పెషల్ తెలుగు, హిస్టరీ, సోషియాలజీ తీసుకున్నాను.

హాల్ టికెట్ కోసం వెళ్లినప్పుడు రాజమండ్రి విమెన్స్ కాలేజ్ ఇంటర్మీడియేట్ క్లాసులో సౌందర్యానికి మారుపేరు అన్నట్టున్న ఒక అమ్మాయిని చూసేను. అప్పటికి విమెన్స్ కాలేజ్ తాటాకు షెడ్లలో ఉండేది. బెంచికి ఈ చివర పొడవైన జడతో ఉన్న అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోయేను. ఆ అమ్మాయే తర్వాత సినీనటి జయప్రదగా మారిన లలితకుమారి.

జగ్గంపేటలో మొట్ట మొదటి ప్రైవేటు స్కూలు నాదే. ఊళ్ళో అందరూ తెలిసిన వాళ్లే. ఫీజ్ పది రూపాయలే అయినా అడగడానికి చాలా మొహమాటంగా ఉండేది. కొందరు వచ్చి కూర్చుని గంటలు గంటలు కదిలే వాళ్ళు కాదు. వెళ్లమని చెప్పలేకపోయేదాన్ని.

పిల్లల్ని యూనిఫాం వేసి నీట్ గా పంపమని ఇళ్ళకెళ్లి చెప్పినా వినే వాళ్లు కాదు. అలా కాదని మా ఇంగ్లీషు టీచరు నీట్ గా పంపని పేరెంట్స్ ఒక రూపాయి ఫైన్ కట్టాలని స్లిప్పులు పంపింది. అంతే, “ పది రూపాయలు కాకుండా ఇంకో రూపాయి తీసేసుకుంటారా?” అంటూ కొందరు స్కూలు మీదికి గొడవకొచ్చేవారు. ఇంకో పక్క మోహన్ హెరాస్మెంటు. తన జీతమే కాకుండా స్కూల్ ఫీజులు కూడా ఖర్చు పెట్టేసుకునేవాడు. అందుకే టీచర్స్ కి ఒక రోజు ముందే జీతాలు ఇచ్చేసేదాన్ని. జీవితం చాలా డిస్టర్బ్ డు గా ఉండేది.

అటు కలకత్తా లోనూ, ఇటు ఉత్తరాంధ్ర లోనూ నక్సల్బరీ ఉద్యమం ఊపందుకున్న రోజులవి. పేపర్లో చూస్తూండే దాన్ని. అప్పటికి నాకు ఆఫీసు రూమ్ అంటూ వేరుగా లేదు. బైట అరుగు మీదే టేబుల్ ఉండేది . అప్పుడప్పుడూ ఎవరో సోవియట్ లాండ్ మేగ జైన్స్ లో నక్స ల్బరీ సాహిత్యాన్ని, పాంప్లెట్స్ నీ ఉంచి పేపర్ వెయిట్ కింద పెట్టి వెళ్లేవారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఒకబ్బాయి కాకినాడ నుంచి వచ్చి ఉద్యమం గురించి కబుర్లు చెప్పి వెళ్లేవాడు. కాళీపట్నం మాస్టారి కథలు , రంగనాయకమ్మ గారి నవలలు, నవీన్ గారి అంపశయ్య నా మీద ప్రభావాన్ని చూపించడం మొదలైంది. ఒక దశలో ఉద్యమంలో చేరిపోదామా అన్పించసాగింది . కాని, పిల్లలు – వాళ్ల పెంపకం బాధ్యత నన్నుత్త పిరికిదాన్ని చేసి సంకెళ్లతో బంధించేసాయి .

*****

(ఇంకా ఉంది )

 

Please follow and like us:

One thought on “నా జీవన యానంలో- (రెండవభాగం)- 1”

  1. జీవిత కధనాలు మన తెలుగు లో తక్కువ గా వచ్చాయి మీరు ఇలా రాయడం చాలా స్ఫూర్తిని కలిగిస్తుంది పాఠకులకు… అభినందనలు

Leave a Reply to జగద్ధాత్రి Cancel reply

Your email address will not be published.