
ఔర్ చాలీస్ బాకీహై-
-డా||కె.గీత
ఇక ఆ తలుపులు ఎంత బాదినా తెరుచుకోవు-
తలపులు మాత్రం ఇటువైపు రోదిస్తూ
ఇక ఆ ఫోను మోగదు-
పాతవేవో సంభాషణలు చెవుల మోగుతూ
ఆ వేళ్ల నించి మెసేజీ రాదు-
దు:ఖం ఇంకిపోయిన బాధాత్మకవేర్లు
గుండెలోతుల్లో పాతుకుపోతూ
ఔర్ చాలీస్ బాకీహై-
ఔర్ చాలీస్ బాకీహై-
ఇంకా వినిపిస్తూనే ఉంది..
అరవయ్యేళ్ళకే తనువు
పరిమితం కాదంటూ
అనేవారుగా
ఔర్ చాలీస్ బాకీహై-
నిజమనిపించేంత
ఆశాపాశం-
తల్చుకున్నప్పుడల్లా
ఎంత బావుండేదీ-
ఎప్పుడో ఒకప్పుడు
ఒక్కసారే చేరాలనుకున్న
వృద్ధాశ్రమం-
ఎప్పుడో ఒకప్పుడు
భూగోళానికివతల
కలిసి చెప్పుకోవాలనుకున్న
కబుర్లు-
తొందరేముంది
ఔర్ చాలీస్ బాకీహై-
ఎప్పుడో ఒకప్పటికి
మిగలని భవిష్యత్తు
నిర్దాక్షిణ్యంగా
క్రూరంగా
అన్యాయంగా
చిత్తు చిత్తుగా
చితిలో బూడిదవుతూ-
అవునూ..
ఇప్పుడు మీరు అబద్ధం చేసిన
ఔర్ చాలీస్ కా బాకీ కహా హై-
మీరు విగతజీవిగా
భూగోళానికవతల
గాజుపెట్టెలో దీర్ఘంగా నిద్రిస్తుంటే
మేం ఇక్కడ చుట్టూ
గాజులేని పెట్టెల్లో
అవిశ్రాంతంగా శ్వాసిస్తున్నాం
మీరు అక్కడ
కణకణ కాలే కట్టెల్లో
కపాలమోక్షం చెందుతుంటే
మీరు లేని ప్రపంచంలో
మోక్షమెప్పుడా
అని ఎదురుచూస్తూ
బతుకునీడుస్తున్నాం
మీ కానుకగా
అందుకున్న
దేవగన్నేరులేవో
మీరిక లేరని తెలిసీ
విరబూస్తున్నాయి
మీరు
పంచిన
అపురూప ఫలాలేవో
మీరిక ఆస్వాదించరని తెలిసీ
నోరూరిస్తున్నాయి
మీరు
వెలిగించమన్న
వేల ఒత్తుల
కార్తీక పౌర్ణమి చంద్రుడు
మీ దాకా చేరవని తెలిసీ
వెలుగులు విరజిమ్ముతూనే ఉన్నాడు
మీకిష్టమైన
కవితలు
మీరిక అందుకోరని తెలిసీ
అక్షరాలుగా మారి
జీవితాంతం
ఎదురుచూస్తూనే ఉన్నాయి
ఔర్ చాలీస్ బాకీహై-
జీవించిన క్షణాల
చెదరని జ్ఞాపకాల
తడి ఆరని కన్నీళ్ల
సాక్ష్యంగా-
బాధాత్మక గుండెని
కుదుపుతూ-
రగులుతూ-
ఓ అబద్ధపు వాక్యం
పొద్దు పొడిచిన దగ్గరనించి
పొద్దు వాలే వరకూ
ఔర్ చాలీస్ బాకీహై-
—-
(మోహన రెడ్డి గారి స్మృతిలో-)
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
