చిత్రం-65

-గణేశ్వరరావు

 
          ఈ చిత్రం పేరు ‘పుష్పాలంకరణ’, 1923 లో సుప్రసిద్ధ చిత్రకారుడు దామెర్ల రామారావు – తన భార్య సత్యవాణి సీమంతం చూసాక – వేసిన చిత్రం ఇది. ప్రసిద్ధి చెందిన తన నవల ‘అతడు ఆమె’ లో డా. ఉప్పల లక్ష్మణరావు ఈ చిత్రం గురించి, చిత్రకారుడు దామెర్ల చిత్రకళ గురించి హీరో హీరోయిన్లు చర్చించటం దీర్ఘంగా రాసారు.  
 
          అందమైన వేడుక కళ్ళకు కట్టే ఈ అద్భుతమైన వర్ణ చిత్రంలో ఉన్నవారంతా స్త్రీలే, సీమంతం స్త్రీలకు స్త్రీలే చేస్తారు. ఇది ఒకప్పుడు తెలుగునాట సంప్రదాయ సిద్ధంగా జరిపే ముచ్చట, పండుగ వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆ నాటి స్త్రీలకు తగిన వస్త్ర ధారణా విధానం, వారి రూపు రేఖా విలాసాలను ఇందులో గమనించవచ్చు. దామెర్ల చిత్రంలోని సన్నివేశాన్ని దుర్భిణీతో వెతకాలి. ఇప్పుడు సీమంతం ఇంత ఘనంగా ఎక్కడైనా ఎవరైనా చేస్తున్నారా!
 
          ఈ చిత్రంలో ఒకామె – తొలి కాన్పు ధరించిన సత్యవాణి తలలో పూలు తురుముతో అలంకరిస్తోంది, ఆమె దామర్ల రామారావు భార్య. తన భర్త చిత్రాలు చాలా వాటికి మోడల్ ఆమె! అనేక లలితకళలలో ఆమెకు ప్రవేశం ఉంది.. ఆ కారణంగా నేనేమో, .ఈ చిత్రంలో వీణకి స్థానం ఇచ్చారు. ( సత్యవాణి గారి చి త్రకళ గురించి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన “అన్నంత పనీ జరిగింది” అన్న కథలో ప్రస్తావిం చారు. _ మరొక పేరంటాలు అతిథి స్త్రీలపై పన్నీరు చిలకరిస్తోంది. డాబా పైన కింద పరచి ఉన్న తివాచీ మీద కూర్చున్న ముత్తైదువులు కబుర్లు చెప్పుకుంటున్నారు. వీణ పక్కనే వుంది. బహుశా వీణ వాయించే ఆమె రావలసి ఉందేమో. తల్లి తన ముందున్న పిల్లాడితో ఏదో చెబుతోంది. తల మీద పళ్లెంలో పూలూ పళ్లతో ఒకామె ప్రవేశిస్తోంది. పేరంటాల్లో తరచూ కనిపించే సన్నివేశం ఇది.
 
          స్త్రీలలో సొగసునూ, నాజూకు తనాన్ని, వయ్యారాలతో వంపులతో చిత్రిస్తారు దామెర్ల. తక్కువ రంగులు వాడుతూ, బాహ్య రూపాలను భావానుగుణంగా చిత్రిస్తారు ఆయన. తెలుగు నాట జరిపే ముచ్చటకు ఈ చిత్రం ప్రతిరూపం అనిపించినప్పటికీ – ఇందులో పాశ్చాత్త్య చిత్ర కళా నేపథ్యం దాగి ఉందని, చిత్రం వెనుకవైపు చిత్రించ బడిన ఆకాశం, మబ్బులు గ్రీకు చిత్రాలను అనుసరించి గీయబడ్డవి అని, చిత్రంలోని ప్రధాన పాత్రలు నిలుచున్న భంగిమలు లార్డ్ లేటోన్ వలన ప్రభావితుడై దామెర్ల గీసినట్లు చిత్ర కళా విమర్శకుల అభిప్రాయం. అయినా దామెర్లది స్వతంత్ర బాణీ. యూరోపియన్ చిత్రకారుల చిత్రాల నుంచి ప్రేరణ పొందినా, ఆయనది సృజనాత్మక కళ, ఆయన బొమ్మలు తెలుగు వాడే వేయగల బొమ్మలు.
 
          Ekphrasis అనే ప్రక్రియ గురించి వేలూరి వెంకటేశ్వర రావు గారు ప్రస్తావిస్తూ, దామెర్ల చిత్రం ‘బావి దగ్గర కబుర్లు’ కు అనుగుణంగా నాటకీయంగా తాను రాసిన ఒక కవితను ఉదహరించారు. ‘సీమంతం ‘ ఇతివృత్తంగా మిస్సమ్మ, శ్రీరామరాజ్యం వగైరా సినిమాల్లో పాటలు ఉండగా లేనిది, కవితలు ఎందుకు ఉండకూడదు?
 
          దామెర్ల చిత్రాలకు సంబంధించిన రెండు విశేషాలు: తూర్పు కనుమల్లో గోదావరి అనే చిత్రాన్ని ఆ నాటి వైస్రాయ్ కొన్నారు. ఆ రోజుల్లో, బ్రిటిష్ పాలనలో, ఒక ఆంగ్లేయ అధికారి స్థానికుడు వేసిన చిత్రాన్ని ముచ్చటపడి కొనడం అపూర్వమైన విషయం. రెండోది: రైల్లో ప్రయాణిస్తూ, దామెర్ల గీసిన ఆఖరి చిత్రం ‘మరణం ‘ , అది గీసిన కొద్ది రోజులకే వారు మశూచికం సోకి మరణించడం – అదీ 28 ఏళ్ల వయసులో – ఒక విషాదం.
 
          రాజమండ్రి చిత్ర కళాశాలలో వారి చిత్రాలు కొన్ని భద్రపరచి వున్నాయి
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.