నా జీవన యానంలో- రెండవభాగం- 54

-కె.వరలక్ష్మి

          ఆ మే నెలలో పిల్లల సెలవులు సందర్భంగా మా అబ్బాయి వాళ్లూ మళ్లీ కారులో ఇంకో ట్రావెల్ ట్రిప్ పెట్టుకున్నారు. రాజమండ్రిలో ఉన్న మా అబ్బాయి ఫ్రెండ్ సుకుమార్ కుటుంబంతో కలిసి మారేడుమిల్లి అడవులు చూసి జగ్గంపేట వచ్చారు. దారిలో ఒక్కొక్క ఊరూ చూసుకుంటూ కోనసీమ వెళ్లాలని ప్లాన్.

          మర్నాడు ఉయదాన్నే బయలుదేరి వెళ్తూ కట్టమూరు ఊరు పక్కనే ఉన్నా ఎప్పుడూ చూడలేదని రోడ్డు దిగి వెళ్లి చూసాం. మే నెల ఎండల్లో కూడా పచ్చని పాదులు, పూలమొక్కల్తో వాకిళ్లు మెరుస్తున్న చిన్న పల్లెటూరు అది. మళ్లీ మెయిన్ రోడ్డులో కొచ్చి పెద్దాపురంలో మరిడమ్మ అమ్మవారి గుడి దర్శనం చేసుకుని, మా అబ్బాయి చదివిన కాలేజి చూసాం. అవన్నీ తన పిల్లలకి చూపించాలని మా అబ్బాయి తాపత్రయం.

          అక్కడి నుంచి పిఠాపురం వెళ్లాం. కుక్కుటేశ్వరాలయం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన 10వ స్థితపీఠాంబిక లేదా పురుహూతిక దేవి ఆలయాన్ని కుంతీ మాధవస్వామి ఆలయాన్ని దర్శించుకుని. ప్రాచీన కాలం నుంచీ ఊరుమధ్యలో పురుహూతికా గ్రామదేవతగా కొలవబడుతున్న అతి చిన్న ఆలయానికి వెళ్లాం. సామాన్యజనం
కొలిచే ఆ విగ్రహాన్ని ఎప్పుడు, ఎవరు రూపుదిద్దేరో కాని అప్పటివరకూ నేను చూసిన దేవీ మూర్తులలో గొప్ప సౌందర్యరాశి. అక్కడి నుంచి కాకినాడ వెళ్లి సుబ్బయ్య హోటల్లో భోజనాలు చేసి సర్పవరం గుడి, ఇంద్రపాలెం చూసి యానాం బాలయోగి బ్రిడ్జి మీదుగా గోదావరి దాటి కోనసీమలో ప్రవేశించాం. బ్రిడ్జీమీదుగా వెళ్తున్నప్పుడు కుడిఎడమల గోదారి అందాలు, లంకల మీది కొబ్బరి చెట్ల పచ్చని సౌందర్యాలు చూసి తీరాలి. ఆ అందాల ముందు కేరళ చిన్నబోతుంది. అలా చూసుకుంటూ ముమ్మడి వరం చేరి బాలయోగి ఆశ్రమంలో కాస్సేపు తిరిగి, పిల్లలకి అవన్నీ వివరించి చెప్పేం. మే నెల మామిడిపళ్ల రోజులు కావడం వల్ల మేం తిరుగుతూ ఉన్నప్పుడే చెట్లనుంచి బంగినపల్లి, రసాలు లాంటి మామిడిపళ్లు రాలసాగాయి. పండు పడినప్పు డల్లా పిల్లలు పరుగెత్తుకెళ్లి తెచ్చుకునేవారు. ఆశ్రమాన్ని సంరక్షిస్తున్న వారు మాకు అంతా తిప్పి చూపించారు. బాలయోగి నివసించిన నేలమాళిగలాంటి విశాలమైన నివాసం ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడి నుంచి కాట్రేనికోన మీదుగా దొంతికుర్రు వెళ్లేం. మా అబ్బాయికి తన బాల్యంలో మొదటి పుట్టినరోజుకి ముందూ, తర్వాతా కొద్ది నెలలు గడిపిన ఆ ఊరినీ, అక్కడి ఇంటినీ చూడాలని ఆశ. అక్కడికి దగ్గర్లో సముద్రపు వొడ్డున ఉన్న కందికుప్ప హైస్కూల్లో వాళ్ల నాన్నగారి మొదటి పోస్టింగ్ కావడం వలన మేం దొంతికుర్రులో కొన్నాళ్లు ఉన్నాం. ఆ విషయం అక్కడి అనుభవాలు నా ఆత్మకథ తొలి జాడలులో రాసాను.

          దొంతికుర్రు ఊరు ఏమాత్రం మారలేదు సరికదా, అప్పటి పెద్ద పెద్ద మండువా లోగిళ్లు శిథిలమై కొన్ని సగం సగం కూలిపోయి ఉన్నాయి. యువత అంతా ఉద్యోగా లకో, వ్యాపారాలకో ఊరు విడిచి వెళ్లేరట. వృద్ధులు మాత్రం ఉన్నారు. అప్పుడు మేమున్న ఇల్లుగలామె బాపనమ్మ కూతురింట్లో వైజాగ్ లో ఉందట. మేం నివసించిన
ఇల్లు లేదు. అదే కొబ్బరితోటలో కొంచెం వెనక రిటైరై తిరిగివచ్చిన వాళ్ల అబ్బాయిలు చిన్న చిన్న డాబా ఇళ్లు కట్టుకొని నివసిస్తున్నారు. అప్పట్లో నాతో స్నేహంగా ఉండి, మా గీత కడుపులో పడి వేవిళ్లతో బాధపడుతున్నప్పుడు నన్నెంతో ఆదుకున్న ఎదురింటి మీనాక్షి బాగా వృద్ధురాలైపోయింది. కూలిపోగా మిగిలిన ఒక్క గదిలోనూ నివసిస్తోంది. నన్ను గుర్తుపట్టలేదు. కాని, ఆ రాత్రికి ఉండి వెళ్లమని మరీమరీఅన్నది. మా గోదారి జిల్లాల మర్యాదలు అవి, పాతజ్ఞాపకాలతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ముందుకెళ్లి కందికుప్ప ఊరును సముద్రాన్ని కూడా చూసి రావాలని అనుకున్నాం కాని అప్పటికే సంధ్య వాలుతూండడం వలన వెనక్కి మరలేం. యానాంలో నది వొడ్డున కాస్సేపు నడిచి, ఇంజరం మీదుగా ద్రాక్షారామం వెళ్లి భీమేశ్వరాలయం చూసి, కాకినాడ మీదుగా తిరిగి రాత్రి పదికి ఇంటికి చేరుకున్నాం.

          మర్నాడు సాయంకాలం మాకు దగ్గర్లో ఉన్న సింగరమ్మచింతకీ, సూదికొండ ఫారెస్ట్ ఆఫీసుకీ వెళ్లేం. ఆ ఆఫీసులో మా అబ్బాయి ఫ్రెండ్ పట్టాభి పని చేస్తున్నాడు. మమ్మల్ని ఆ పరిసరాలన్నిటికీ తిప్పి చూపించాడు. ఎంత చూసినా తనివి తీరని పచ్చని అడవి అది. వచ్చినప్పటి నుంచీ రోజూ పవర్కట్, పిల్లల ఇబ్బంది చూడలేక మా అబ్బాయి వాళ్లూ బయలుదేరేసారు. 

          ఆ జూన్ 7న ప్రఖ్యాత పేరిణి నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ తన 88వ ఏట హైదరాబాద్ లో కాలం చేసారు. 2011 జూన్ 11, 12 తేదీల్లో కాకినాడ జిల్లా పరిషత్ ఆఫీసులో తూర్పుగోదావరి జిల్లా రచయితల సభలు జరిగాయి. జిల్లా పరిషత్ ఛైర్మన్ వేణుగారు లక్షాయాభైవేలు ఇచ్చాడట ఆ సభల నిర్వహణకి, చిరంజీవినీ కుమారిగారి పూనికతో కలెక్టర్ రవిచంద్ర ఆధ్వర్యంలో సభలు నిర్వహించబడ్డాయి. ఆవంత్స
సోమసుందర్, మరికొందరికి సన్మానాలు జరిగాయి. తూర్పు గోదావరిజిల్లా రచయితల కథల్తో ‘కథలు – అలలు అనే సంకలనం వేసారు. 11న రోజంతా కవిత్వం మీద చర్చా కార్యక్రమాలు, తర్వాత కవిసమ్మేళనం జరిగాయి.

          రెండవ రోజు కథల మీద చర్చాకార్యక్రమాలు జరిగాయి. చినవీరభద్రడు, వీరలక్ష్మి, పతంజలిశాస్త్రి మొ.న వాళ్లంతా నా కథల గురించి సహృదయంతో బాగా మాట్లాడేరు. సాయంకాలం సూర్య కళామందిర్లో బాలకృష్ణ ప్రసాద్ గారి అన్నమాచార్య కీర్తనా కార్యక్రమం విని ఇంటికి చేరుకున్నాను.

          మా పూనా ప్రయాణానికి (అమరేంద్ర ఆహ్వానం మీద – అమరేంద్ర ఇంటికి) 23 న రిజర్వేషన్లు పూర్తయ్యాక రామతీర్థ, జగద్ధాత్రి కూడా పూనావస్తున్నారని తెలిసి తను రానంది వీరలక్ష్మి గారు. చలం సావనీర్లు వేసే విషయంలో ఏవో గొడవలటవాళ్లకీ ఆమెకీ, అమరేంద్ర సర్దిచెప్పేడట. జూన్ 24 న సికింద్రాబాద్ స్టేషనుకి మా అబ్బాయి రవి కారు తీసుకుని వచ్చాడు. వీరలక్ష్మి గారు అడిగిన మొదటి ప్రశ్న ‘‘కారు సొంతమేనా?’’ అని.

          కొందరి ముఖాల్లో కొన్ని భావాలు దాగవు. తనకోసం ఎవరూ రాలేదు. మేం తీసుకెళ్లాలని అడిగితే ఆవిడ లెఫ్ట్ లో దూరంగా ఉన్న ఏదో కాలనీకి, మేం పూర్తిగా రైట్ లో ఉన్న ప్రగతినగర్ కి. అప్పటికీ మాతో రమ్మని అడిగితే వేరే ఏదో పనుందని చెప్పేరు. రాత్రికి మళ్లీ నాంపల్లి స్టేషనుకొచ్చి రవి దిగబెట్టేడు, ముందుగా నవ్య ఎడిటర్ జగన్నాథశర్మ, ఆయన ఫ్రెండ్ రాంబాబు వచ్చి నన్ను పలకరించి వాళ్ల కంపార్ట్ మెంటు వైపు వెళ్లిపోయారు. అంతలో కుప్పిలి పద్మ ఫోన్ చేసి బండి ఏ ఫ్లాట్ ఫాం మీద ఉంది? కోచ్ నెంబరు అడిగి 5 నిమిషాలటైం ఉండగా వచ్చి బండెక్కింది. నాకు అర్థం కాలేదు, కుప్పిలి పద్మ వస్తున్నట్టు అప్పటివరకూ నాకు తెలీదు. అమరేంద్ర చెప్పిన వాళ్లలో ఈమె పేరులేదు. నేను వీరలక్ష్మిని రికమెండ్ చేసినట్టు ఆమె పద్మను చేసిందట. నిన్న రాత్రంతా కలిసి ప్రయాణం చేసినా వీరలక్ష్మి నాకు చెప్పలేదు. బండి కదలబోతూండగా చివరి నిమిషంలో వీరలక్ష్మి వచ్చి బండెక్కింది, వాళ్లిద్దరూ పక్కపక్క సీట్లలో కూర్చుని కబుర్లు మొదలు పెట్టేరు. వాళ్లిద్దరూ పెద్ద
పెద్ద బేగ్స్ నిండా పుస్తకాలు తెచ్చేరు. ‘ఎందుకబ్బా?’ అనుకున్నాను. పదిన్నరకి ఇక ఆగలేక నిద్రపోయాను. 

          25న మేం ట్రెయిన్ దిగేసరికి అమరేంద్ర ఎప్పటి తన నవ్వుతో ఎదురొచ్చి సాదరంగా ఆహ్వానించేడు. మా ముగ్గుర్నీ తన కారులో, శర్మవాళ్లని టేక్సీలో వాళ్లింటికి తీసుకెళ్లేడు. అందమైన పెద్ద గార్డెన్ మధ్య చాలా పెద్ద ఇల్లు. ఎంతో బావుంది. మా ముగ్గురికీ ఒక పెద్ద రూమ్, పెద్ద బెడ్, నీట్ గా ఉన్న పెద్ద బాత్ రూం ఉన్నది ఇచ్చేరు. అమరేంద్ర భార్య లక్ష్మిగారు కూడా మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి ఎంతో అభిమానంతో మా తిండి ఏర్పాట్లు చూసారు. ఢిల్లీ నుంచి లక్ష్మీరెడ్డిగారు, తిరుపతి నుంచి మధురాంతకం నరేంద్రవచ్చి మరో రూంలో ఉన్నారు. నేను వెళ్లి పలకరించి లక్ష్మీ రెడ్డిగారికి నా ‘అతడు-నేను’ పుస్తకం ఇచ్చాను. జగన్నాథశర్మ వాళ్లకీ ఆకేంపస్ లోనే మరో గెస్ట్ హౌస్ ఇచ్చారట. వెళ్లగానే రిఫ్రెష్షై కేంపస్ అంతా తిరిగి ఆ పచ్చదనం తో, పూల అందాలతో కళ్లు నింపుకొన్నాం.

          మధ్యాహ్నం నుంచీ ఏమైందో తెలీదు, కుప్పిలి పద్మ నామీద మాటల్తో దాడి మొదలు పెట్టింది. నా మీద, నా కథల మీద, నా సీనియారిటీ మీద పిచ్చి పిచ్చి కామెంట్స్ చెయ్యసాగింది. సాహితీ లోకంలో నాకు అదొక కొత్త అనుభవం. నాకు ఎవరితోనైనా గొడవలు పడడం ఇష్టం లేక కొంతా, బురదలో రాయివేసే ఓపిక లేక కొంతా మౌనంగా ఉండిపోయాను. వీరలక్ష్మి గారేమైనా వారిస్తుందేమో అని చూసాను. వాల్లిద్దరూ చిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టేరు. ఎన్నెన్నో సమావేశాలకి, యూనివర్శిటీ సెమినార్లకి వెళ్లి సీనియర్ రచయిత్రులెందరితోనో ఆహ్లాదంగా గడిపిన నాకు వీళ్ల ప్రవర్తన అర్థంకాలేదు. తను వీరలక్ష్మిని కౌగలించుకోవడం, ముద్దులు
పెట్టుకోవడం, ‘అక్కా’ అని ముద్దుగా అంటూ వొళ్లో పడుకుంటే వీరలక్ష్మి తనకి తల పట్టడం, కాళ్లునొప్పుంటే కాళ్లు పట్టడం. వాళ్లిద్దరికీ అంత స్నేహం ఉంది కాబోలు అని నేను పట్టించుకోలేదు. అదంతా మా రూమ్ లో జరిగింది, సాయంకాలం బైట హాల్లో అందరూ వచ్చి కూర్చున్న టీ టైంలో కాకినాడలో తన ‘మహి’ నవల నాకు
ఇచ్చాననీ, నేను చదివి అబిప్రాయం చెప్పలేదనీ మరోసారి దండెత్తింది. నిజానికి కాకినాడలో తన పుస్తకమేదీ నాకు ఇవ్వలేదు. గొడవపెట్టుకునేటంత నీచంగా బిహేవ్ చెయ్యలేక ఆ మాటే చెప్పేసి లేచి రూంలోకి వెళ్లిపోయాను. సాయంత్రం సభకు వెళ్లే వరకూ తెలీలేదు అక్కడ బుక్స్ సేల్ ఎగ్జిబిషన్ పెడతారని. అమరేంద్ర వాళ్లకి మాత్రమే చెప్పేడట. వాళ్లు తెచ్చిన బుక్సన్నీ అక్కడ పెట్టుకున్నారు. నేను తెచ్చిన రెండు సెట్లు పట్టుకెళ్దామని చూస్తే ఒక సెట్టు మాయం. ఎందుకో డౌటొచ్చి పర్స్ లో చూస్తే మూడువేలు మాయం. నాకర్థమైంది, నామీది ఏదో కక్షతోనే వాళ్లు అదంతా చేస్తున్నారని. రాత్రి నిద్రకు సిద్ధమైనప్పుడు మంచం మీద గోడ వైపు నన్ను పడుకో మన్నారు. వాళ్లిద్దరి కన్నా పెద్దదాన్ని నేను. రోజూ వేసుకునే బి.పి. టేబ్లెట్స్ వల్ల రాత్రుళ్లు ఎక్కువసార్లు బాత్ రూమ్ కి వెళ్లాల్సి వస్తోంది. ఆ మాట చెప్పి, ‘బాత్ రూమ్ కి లేచినప్పుడు కష్టమౌతుంది’ అన్నాను. ‘ఐతే?’ అంది పద్మ. ఆ సమయంలో వాళ్లిద్దరి
మొహాల్లో గొప్ప పైశాచికానందం చూసాను. చాలా చలిపెడుతూండగా నేలమీద ఓ దుప్పటి పరుచుకుని పడుకున్నాను. రాత్రి 2, 3 వరకు వాళ్ల కబుర్లతో నాకు నిద్రలేదు. ఆ సాయంకాలం మరాఠీ గాయని ఆరోహి అనే అమ్మాయి మంచి గాత్రంతో ఎంతో బాగా పాడింది. ఆ పాట మరచిపోలేనిది. ఆమెను మెచ్చుకుని అభినందనలు తెలిపేను. అందుకు వీరలక్ష్మి చిన్నబుచ్చుకుందట. ‘మర్నాడు 6 గంటలకే రెడీగా ఉండాలి’ అన్నాడు అమరేంద్ర ముందురోజు. 5 కే లేచి స్నానం చేసి రెడీ అయ్యాను వాళ్లిద్దరూ స్నానాలు వద్దని రాత్రే అనుకున్నారు. కాని, నేను బాత్ రూంలో ఉండగా తలుపులు
దబదబా బాదడం మొదలుపెట్టేరు. ఆ రోజు ఖండాలా, లూనావాలాలు చూడడం అట, మొత్తం మూడు కార్లు. అమరేంద్ర కారులో వాళ్లిద్దర్నీ ఎక్కించుకున్నాడు. నన్ను వాళ్ల ఫ్రెండ్ కారులో నరేంద్ర, లక్ష్మీ రెడ్డి గార్లతో బాటు ఎక్కించాడు. ముందుగా ఖండాలా వెళ్లేం. సన్నని జల్లుల్లో కొండలపై నుంచి కింది లోయల్లోకి పారాడుతున్న మబ్బులు. పచ్చదనం లేని కొండలు గమ్మత్తైన అందం. ఉప్పుకారం రాసి కాల్చిన వేడి వేడి మొక్కజొన్న పొత్తులు తిన్నాం. అక్కడి నుంచి లూనా వేలీకి వచ్చి ఉడిపి హొటల్లో టిఫిన్స్ తిన్నాం. తర్వాత వేలీ అందాలు చూసాం. కొందరు కొండసగం వరకూ ఎక్కితిరిగొచ్చారు. మా కారుగలాయన ఏదో పని ఉందని ఎక్కడా ఆగకుండా మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చేసేడు. మిగిలినవాళ్లు ఇంకా ఏవో చూసుకుని, లూనావాలా చిక్కీలు
అవీ కొనుక్కుని నెమ్మదిగా వచ్చేరు. ఆ రాత్రి పొద్దు పోయేవరకూ చెప్పుకొన్న కబుర్లలో తల్లికన్నా భార్యే ప్రేమించదగింది అని జగన్నాధశర్మ చెప్తే అమరేంద్ర ఆనందంతో షేక్ హేండిచ్చేడు, ఆ రాత్రి కూడా పద్మ, వీరలక్ష్మిల కబుర్లతో తెల్లవారుఝాము వరకూ నిద్రలేదు నాకు. నిద్రలేకపోతే విపరీతంగా నీరసం వచ్చేస్తుంది నాకు. 27 ఉదయాన్నే పూనా యూనివర్సిటీ కేంపస్ చూసాం. వాళ్లిద్దరూ వేరే కారులోనే ఎక్కుతున్నారు. ఆ ‘అతి‘ చేష్ఠలకి నాకు నవ్వూ, బాధా కలిగాయి. ఓషోగార్డెన్ కూడా చూసి ఆగా ఖాన్ పేలస్ కి వెళ్లేం.

          ఆ ఉన్నతమైన భవనం, తోట ఎంతో బావున్నాయి. గాంధీజీ, కస్తూర్బా నివసించిన ఆ భవనాన్ని చూస్తూ ఉంటే నాకళ్లు నీటితో నిండిపోయాయి. ఇదీ అని చెప్పలేని ఒక ఉద్వేగంతో, దిగులుతో నా మనసు నిండిపోయింది. లోపల మరో కాంపౌండ్లో కస్తూర్బా సమాధి దగ్గర చుట్టూ వందేళ్ల నాటి మామిడి చెట్లు  ఆకాశాన్నం టుతూ ఉన్నాయి. వాటి కొమ్మల నుంచి అతి పుల్లని మామిడి పళ్లు క్షణానికొకటి రాలిపడుతున్నాయి. ఆ సమాధిని ఆ భవనం గోడల్ని చేతితో తాకి కళ్లకద్దుకున్నాను. అప్పుడే వర్షం అప్పుడే తెరిపి. ఇంటిదగ్గర నా ఫోన్ ఛార్జింగ్ పెట్టి మరచిపోవడం వల్ల ఫోటోలు తీసుకోలేకపోయాను.

          ఛత్రపతి వంశీయుల కోటబురుజులు, వినాయకాలయాలు చూసి ఇప్పుడు పూనే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ గా మారిన ఒకప్పటి ప్రభాత్ స్టూడియో చూసాం. అట్నుంచటే నరేంద్ర ఢిల్లీ వెళ్లిపోయాడు. అమరేంద్ర ఆఫీసుకి వెళ్లిపోతూంటే చాలా చాలా థేంక్స్
చెప్పేను. ఎందుకంటే అమరేంద్ర పిలిచి ఉండకపోతే ఆ ప్రదేశాలు చూడడం సాధ్యపడేది కాదు. భోజనాలు చేసి స్టేషనుకి చేరుకున్నాం. బేక్ పెయిన్ తో బాధపడే నేను కోట బురుజులు ఎక్కి ఎంత పొరపాటు చేసానో అర్థం కాసాగాంది. స్టేషన్లో గబగబా నడవడం సాధ్యం కాలేదు. స్టేషన్ చాలా రద్దీగా ఉంది. నా పరిస్థితి గమనించి పద్మ
వీరలక్ష్మి చెయ్యి పట్టుకుని లాక్కెళ్లిపోయింది. అప్పటికి నా దగ్గర చక్రాల సూట్ కేస్ లేదు. వాళ్లెక్కడ ఉన్నారో నాకు అర్థం కాలేదు. బేగ్ బరువు మోసుకుంటూ చాలాసేపు తిరిగేను. గాభరాతో చెమటలు పోసేసాయి. అలాంటి గాభరా తట్టుకోలేననే నేను వీరలక్ష్మిని తోడు రమ్మని పిలిచింది. చివరికి బండి వచ్చేక ఎక్కడినుంచో  ఊడి పడ్డారు. ట్రెయిన్ లో అలసట, నడుంనొప్పితో రిక్వెస్ట్ చేసినా బెర్త్ దించలేదు. కళ్లు తిరిగి పడిపోతానేమో అన్పించి పక్కబెర్త్ ఆవిడను రిక్వెస్ట్ చేస్తే ఆవిడ లేచి తన బెర్త్ మీద పడుకోమని చోటిచ్చింది. ఓ పదినిమిషాలు పడుకొని నడుం నొప్పి సర్దుకున్నాక లేచి నా సీట్లోకి వచ్చాను. ఎవరో తెలీని ఆవిడకు చాలా చాలా థేంక్స్ చెప్పుకొన్నాను.

          ఆ రాత్రి పద్మ విన్యాసాల గురించి నేనిక్కడ చెప్పను. అది నాకు సంబంధిం చింది కాదు. కాని, లెక్చరర్ వీరలక్ష్మి అలాంటి సంఘటనను ఎలా అమోదించిందో నాకిప్పటికీ ఆశ్చర్యమే. ఉదయం బేగంపేట స్టేషన్లో దిగి ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్లిపోయేరు. అక్కడి నుంచి బైటికెలా రావాలో, ఆటోనో టేక్సీనో ఎలా పట్టుకోవాలో
నాకంతా అయోమయం అయిపోయింది. అంత తెల్లవారు ఝామున మా రవిని నిద్ర లేపి ఇబ్బంది పెట్టడం ఇష్టంలేదు, మొత్తానికి చాలాపాట్లుపడి ప్రగతినగర్ ఇంటికి చేరుకున్నాను. నాలుగురోజుల నిద్రలేమి, రెస్ట్ లెస్ నెస్ తో చాలా సిక్కైపోయాను. 63 ఏళ్ల వయసులో ఒక వ్యధను, బాధను మిగిల్చిందా ప్రయాణం. స్త్రీల కోసమే రాస్తున్నా మని చెప్పుకొనే రచయిత్రులు నడుచుకొనే తీరు అదేనా? 

          ఆ తర్వాత ఆ విషయాల్ని ఒక సీనియర్ రచయిత్రితో పంచుకున్నప్పుడు ‘‘దాంట్లో అర్థం కానిదేమున్నది, స్పష్టంగా తెలుస్తోందిగా జెలస్తో కూడిన శాడిజం అని’’ అన్నారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.