కశ్మీరీ పండితులు భారత్ చేతి ఆయుధాలు కావద్దు

ఎన్. వేణుగోపాల్ 

స్వయంగా కశ్మీరీ పండిత కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కశ్మీరియత్, మానవత్వం, ప్రజాస్వామ్యం ప్రాతిపదికగా కశ్మీరీలకు వర్తమాన విషాదం నుంచి బైటపడే మార్గం సూచిస్తున్నారు నిశితా త్రిసాల్ 

ఈ నెల భారత ప్రభుత్వం ఏకపక్షంగా కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసింది. కశ్మీర్ వివాదానికి శాంతియుత, ప్రజాస్వామ్యయుత పరిష్కారం కనుగొనాలంటూ ఐక్యరాజ్య సమితి భద్రతామండలి చేసిన ఎన్నో తీర్మానాలను ఉల్లంఘిస్తూ జరిగిన చర్య ఇది. కశ్మీరీ ముస్లింల మీద తాను జరుపుతున్న హింసాకాండకు సమర్థన కోసం కశ్మీరీ పండితుల బాధనూ నష్టాన్నీ సాధనంగా వాడుకోవడం అనే పాత వ్యూహానికే ప్రస్తుత ప్రభుత్వం ఈ కనికట్టు చర్యతో మళ్లీ జీవం పోసింది. ఒక కశ్మీరీ పండిత్ గా, అంతకన్న ముఖ్యంగానూ మొదటగానూ కశ్మీరీగా, ఈ వైఖరిని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాను.

కశ్మీరీ పండితులు భారత ఆక్రమణలో ఉన్న ముస్లిం ఆధిక్య ప్రాంతమైన కశ్మీర్ లోని హిందూ మతానికి చెందిన అల్పసంఖ్యాకవర్గం. వారు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన 1989 సాయుధ తిరుగుబాటు సందర్భంలో అక్కడినుంచి తరలివెళ్లారు. అలా ఇతరప్రాంతాలకు తరలిపోయిన కశ్మీరీ పండితుల సంఖ్యను అధికారిక కథనాలు ఒక లక్షా యాబై వేల మంది నుంచి మూడు లక్షల వరకూ భిన్నంగా చెపుతున్నాయి. కాని ఈ విషాదం గురించిన లెక్కల మీద వాదనలు లోతైన వాస్తవాన్ని మరుగు పరుస్తున్నాయి: 1989 నాటి ఘటనలు, తదనంతర పరిణామాలు కశ్మీరీ పండితులకు తమ గురించి తమకు ఉన్న అవగాహనను, కశ్మీరీ ముస్లింలతో వారి సంబంధాన్ని మౌలికంగా మార్చివేశాయి. అవి ఎప్పటికీ పూడ్చిపెట్టడానికి వీలులేని వేదనను సృష్టించాయి. ఇప్పటికైనా పరిష్కరించవలసిన ఆగ్రహాన్ని సృష్టించాయి.

ఆ వేదనా, ఆ ఆగ్రహమూ స్పష్టంగా కనబడుతుండే కుటుంబంలో నేను పెరిగాను. మేం అమెరికాలో నివసిస్తుండినప్పటికీ, మా జీవితాల్లో కశ్మీర్ ఎప్పుడూ ఉనికిలో ఉంటూ వచ్చింది. మేం ఇంగువ వేసి వండుకునే తామరతూళ్ల, నూల్ కోల్ కూరలో కశ్మీర్ జీవించే ఉంది. మాలో ఒకరితో ఒకరిని మాత్రమే కాదు, నేనెన్నడూ చూడని, కేవలం వినికిడిలో మాత్రమే ఉన్న కశ్మీరీ ముస్లింలను కూడ, మాతో సన్నిహితంగా కలిపే సుమధురమైన కొషుర్ భాషలో కశ్మీర్ జీవించే ఉంది. రాజధాని శ్రీనగర్ లో వెలుగులీనే మా స్వగృహం గురించిన మా కుటుంబ కథల్లో కశ్మీర్ జీవించే ఉంది.

కాని ఆ ఇల్లు ఇంకెంతమాత్రం మాది కాదు. ఇక కశ్మీర్ కు తిరిగివెళ్లే సూచనలేమీ కనబడక మా తాతయ్య (అమ్మ తండ్రి) సంకోచిస్తూనే ఆ ఇంటిని 1997లో అమ్మేశాడు. ఆ ఇంటిని ఆయన నలబై ఏళ్ల కింద సొంతంగా నిర్మించాడు. మా అమ్మమ్మ, కొందరు పనివాళ్లు సాయం చేస్తుండగా ఒక్కొక్క కిటికీ చట్రం ఆయనే పేర్చాడు. లెక్కలేనంతమంది ప్రాణాలు కోల్పోయిన, లెక్కలేనంతమంది మాయం చేయబడిన ఆ ఘర్షణలో ఒకానొక ఇంటి ప్రాధాన్యతను అర్థం చేసుకోవడం కష్టం కావచ్చు. కాని 25, బాల్ గార్డెన్ అనే పేరున్న మా కుటుంబ స్వగృహాన్ని కోల్పోవడం అంతకన్న చాల ఎక్కువ నష్టానికి ప్రతీక. అది మా అస్తిత్వాన్ని, చరిత్రను బలవంతాన లాగివేసుకోవడమని మా కుటుంబం అనుకుంటుంది. 

సరిగ్గా ఈ కోల్పోయామనే భావననే, ఈ రద్దు భావననే హిందుత్వ శక్తులు 1989 నుంచి సొమ్ము చేసుకుంటున్నాయి. కశ్మీర్ ను ఒక రాజకీయ వ్యవహారంగా చూసే బదులు, భారతీయ జనతా పార్టీ, దాని మిత్రులు, కశ్మీర్ ను ప్రాథమికంగా ఒక మతోన్మాద అంశంగా, ఆర్థిక అంశంగా మార్చివేశారు. తమకు అన్యాయం జరిగిందనుకునే కశ్మీరీ పండితుల వాస్తవ అనుభవాన్ని ఎగదోసి, పండితుల బాధలనూ ముస్లింల బాధలనూ ఒకదానికి మరొకదాన్ని పోటీ పెట్టారు. 

కశ్మీర్ ను విభజించి పాలించాలనే ప్రస్తుత హిందుత్వ వ్యూహాలు సరిగ్గా సామ్రాజ్యవాద దురాక్రమణ పద్ధతులను ప్రతిధ్వనిస్తున్నాయి. సామ్రాజ్యవాద పద్ధతులు ప్రస్తుతం పెచ్చరిల్లుతున్న మత వాదానికన్న ముందునుంచే ఉన్నాయి. అటువంటి వ్యూహాలు వలసవాద పూర్వ యుగంలోనూ ఉన్నాయి. భారత స్వాతంత్ర్యం తర్వాత కూడ కొనసాగుతున్నాయి. ఇవాళ ప్రతిపక్షంలో భాగమైన కాంగ్రెస్ పార్టీ కశ్మీర్ రాజ్యాంగ స్వతంత్ర ప్రతిపత్తిని పథకం ప్రకారం బలహీనపరచడానికి, ఎన్నికల ప్రక్రియలో అవినీతికి, రాజకీయ రంగాన్ని చీలికలు చేయడానికి తన వంతు ప్రయత్నాలు చేసింది. ఇప్పుడిక భారతీయ జనతా పార్టీ మనను ఒక అంచుకు నెట్టగలిగింది. “అభివృద్ధి” మీద తన వాదనలకు, కశ్మీరీ పండితుల వలసను కలిపి, భారత్ – అదుపులోని జమ్ము కశ్మీర్ పై తన అప్రజాస్వామిక, చట్టవ్యతిరేక ఆక్రమణను సమర్థించుకుంటున్నది. భారత్ సాగించిన ముట్టడులలోకెల్లా దారుణమైన ముట్టడిని స్థాపించుకుంటున్నది. 

ఈ చారిత్రక పూర్వరంగంలో, పండితుల వలసకు దారితీసిన పరిస్థితులను ఎప్పుడూ సక్రమంగా పరిశోధించకపోవడం ఆశ్చర్యకరమేమీ కాదు. ఒకదాని తర్వాత ఒకటిగా ప్రభుత్వాలన్నీ తమ స్థితిని ఇలా ప్రదర్శనకు పెడుతుంటే పండితులు కూడ ఆగ్రహం ప్రదర్శించకపోవడం, అసలు గుర్తించకపోవడం కూడ ఆశ్చర్యకరం కాదు. ఒక వేదన శారీరకంగా, మానసికంగా విశ్లేషణకు గురికాకుండా ఉండిపోయినప్పుడు, ఆ బాధ నుంచీ, దుఃఖం నుంచీ బయటపడడం చాల కష్టం. కశ్మీరీ పండితుల విషయంలో జరుగుతున్నదదే. మానవ జీవితాలను, రాజకీయ స్వేచ్ఛను, సమన్వయాన్ని పణంగా పెట్టి భౌగోళిక సార్వభౌమత్వాన్ని సాధించడానికి దుర్మార్గ కార్యకలాపాలు చేస్తున్న ప్రభుత్వాలు అందుకోసం ఆ దుఃఖాన్ని వాడుకుంటున్నప్పుడు, దాని నుంచి బైటపడడం దాదాపుగా అసాధ్యమవుతుంది. కాని తరతరాల కశ్మీరీ పండితుల దుఃఖాన్ని పరిష్కరించే మార్గం కశ్మీరీ ముస్లింలను అణచివేయడం మాత్రం కాదు.

వారసత్వంగా వచ్చిన అభిప్రాయాలను మార్చివేయడమే ఇప్పుడు కశ్మీరీల ముందు ఉన్న కర్తవ్యం. దశాబ్దాలుగా కశ్మీరీ పండితుల, ముస్లింల నష్టాలూ దుఃఖాలూ ఎందుకూ కొరగానివిగా లెక్కించబడుతున్నాయి. ఎప్పటికంటె ఎక్కువగా ఇప్పుడు కశ్మీరీ యువత ఒక కొత్త మార్గాన్ని కనిపెట్టవలసి ఉన్నది. అది ఒకరితో ఒకరికి సమన్వయ మార్గం, సంఘీభావ మార్గం, మైత్రీబంధపు మార్గం. ఒకరి సత్యాలనూ కథనాలనూ మరొకరు తెలుసుకోవడానికి చురుకుగా ప్రయత్నించడంతో ఆ పని మొదలుపెట్టవచ్చు. మన దుఃఖాన్ని వాడుకుని తన పబ్బం గడుపుకోవడానికి రాజ్యం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడం ద్వారా ఆ పని మొదలుపెట్టవచ్చు. సంక్లిష్టమైన కశ్మీర్ చరిత్రను లోతుగానూ, విశాలంగానూ అధ్యయనం చేయడం ద్వారా ఆ పని మొదలుపెట్టవచ్చు. మన మన కుటుంబాల లోపల మత దురభిమానాన్నీ ద్వేషాన్నీ ఎండగట్టడం ద్వారా ఆ పని మొదలుపెట్టవచ్చు. కశ్మీర్ లో భారత అత్యాచారాలను ఖండించడం ద్వారా ఆ పని మొదలుపెట్టవచ్చు. కేవలం పోటీపడే అస్తిత్వ ఆకాంక్షలకు కుదించకుండా, భిన్నత్వాన్ని ఆమోదించే, గౌరవించే కశ్మీరీ రాజకీయ సముదాయాన్ని కలగనడం ద్వారా ఆ పని మొదలుపెట్టవచ్చు.

మన నుంచి మనం దాటి చెయ్యి అవతలికి చాచడం మన సొంత సముదాయం పట్ల ద్రోహం అని అనిపించవచ్చు. కాని కచ్చితంగా కాదు. అది మన సామూహిక చికిత్సకూ స్వేచ్ఛకూ ఏకైక మార్గం.

(రచయిత ఆన్ ఆర్బర్ లోని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ లో సోషియో కల్చరల్ ఆంత్రొపాలజీ శాఖలో పరిశోధక విద్యార్థి)                     

https://www.washingtonpost.com/opinions/2019/08/22/i-am-kashmiri-pandit-india-must-stop-weaponizing-pain-our-past/?fbclid=IwAR35CM_HOXUnCIsYllZImk1n4c8402fLc_0zO1idIdt5pAa3GdfdSNgqAS0  

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.