
నవ్వుల్ని పూయించడం!
-డా. కె. దివాకరా చారి
పసి పాపల నిర్మల నవ్వులు
ప్రకృతికి ప్రతిరూపాలు
కొత్త చిగురులా
కొంగ్రొత్తగా తొడిగే మొగ్గలా
నునులేత కిరణంలా
లేలేత వర్ణాలతో విరిసే
సుకుమారపు పువ్వులా
కొత్తగా మొలిచిన పసరు రెక్కలతో
ఆకాశాన్ని అందుకునేందుకు
ఎగిరే పక్షి కూనలా
ఏ వర్ణనలకు సరితూగని
ఏ కాలుష్యం సోకని
కల్మషం లేని ఆ నవ్వు ఇంకెవరికీ
సాధ్యం కానిది ఈ లోకాన!
కూర్చున్న చోటనుండి కదలకుండానే
అలా అలలా ప్రతిగుండె పై
పన్నీటి జల్లు కురిపిస్తూ
ప్రపంచమంతా పరివ్యాపితమవ్వడం
ఆ నవ్వుకే సాధ్యం !
సునితమైన ఆకుల రెపరెపల
మౌన సవ్వడుల రాగాలు
పక్షుల కువకువల శబ్దాలలో
కలిసిపోయిన నీ నవ్వులను
నాకు కానుకగా ఇస్తావా చిట్టి తల్లీ!
ఈ బాధామయ ప్రపంచంలో
ఎండిన పెదాల కొమ్మలపై
చిరునవ్వును పూయించడం కూడా
ఓ రహస్య రసానంద కళే !
బాధల్ని, బరువుల్నీ
బ్రతుకు పోరులో ఎదురయ్యే
టోకరా దెబ్బలని, కన్నీళ్లనీ
మనకు తెలియకుండానే
మటు మాయం చేసే
మహత్తర బ్రహ్మ మంత్రం
పాపం, పుణ్యం, స్వార్థం సోకని
విరబూసే ఆ చిన్నారి నవ్వులే కదా !
( చిట్టి తల్లి ‘ సియ ‘ నవ్వులకు
మైమరిచి పోయిన క్షణాలలో )
*****

ఉమ్మడి రాష్ట్రం లో వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేశాక, 2007 నుండి ప్రధానాచార్యుడిగా, హిందీ అకాడెమీ సంచాలకునిగా పనిచేసి పదవీ విరమణ చేశాను. ఆంధ్ర మహిళా సభ విద్యాలయాల గౌరవ కార్యదర్శిగా పనిచేస్తూ నా కిష్టమైన సాహిత్య రంగంలో అభిరుచిని తిరిగి పొందుతూ, మంచి సాహిత్యాన్ని, ఇష్టమైన సభలను హాజరవుతూ, మంచి ఆరోగ్యకరమైన సమాజం కోసం తపించటం ప్రస్తుతం చేస్తున్న వ్యాపకం. హృదయాన్ని కదిలించే సంఘటనలపై స్పందించి కవితలను వ్రాయటం ఇష్టమైన పని. ‘ లయ – గతి’ కవితా పుస్తకాన్ని ప్రచురించటం జరిగింది. శ్రీ శ్రీ కవిత్వం నన్ను ఇప్పటికీ కదిలిస్తూనే ఉంటుంది. రావి శాస్త్రి, తిలక్, చలం, శివసాగర్ లు అభిమాన రచయితలు.
