
పొలం ఒక బంధం
-గవిడి శ్రీనివాస్
కాసిన్ని చినుకులు రాలటం కాబోలు
నాల్గు మడి సెక్కలు
సూర్యుణ్ణి చూసి మురిసిపోతున్నాయి.
ఉత్సాహం ఉత్సవమౌతూ
కళ్ళల్లో వరి కలల కాంతులు
దర్శిస్తున్నాడు రైతు .
గుంపు కొంగల బారులా
వరినాట్లు నాటిన ఆడోళ్ళు.
నిజమే కదా
మట్టిని తాకిన పాదాలు
మొక్కలై ఎదుగుతుంటాయి . నడిచిన మట్టి మీద
మమకారపు పొరలు విప్పుకుంటాయి .
అస్థిత్వాన్ని నెత్తిన ఎత్తుకుని
పంట చేల కోసం
పాట మొలుస్తుంది .
రేపటి భయాలని
తలపాకలో చుట్టిన
ఇప్పటి సౌందర్యం .
రేపటి ఆకలి తీర్చటం లో
ఆర్ద్రత నిండిన అనుభవం ఎదురౌతుంది .
పంట సాగులో
పరిమళాన్ని కళ్ళకు ఎత్తుకుని
సంబరాన్ని ఇంతింతగా
ఈ వర్షాకాలం లో
మోసుకుపోతుంటాడు రైతు .
పక్షుల పలకరింపుల్ని
అలంకరించుకుని
ఆకుపచ్చగా మెరిసే రైతు .
పొలాల మధ్య వికశిస్తూ
పరిమళాన్ని జీవన జ్యోతిగా
పొలం ఒక బంధం గా వెలిగిన రైతు .
*****

గవిడి శ్రీనివాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. కన్నీళ్లు సాక్ష్యం, వలస పాట ప్రచురితమైన కవితా సంపుటులు. 2016లో సాహితీ సమాఖ్య నుండి కవితాసృజన పురస్కారాన్ని, 2017లో పాలపిట్ట మాస పత్రిక నుండి గొట్టిపర్తి లక్ష్మి నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.
