
చిత్రం-55
-గణేశ్వరరావు
62 ఏళ్ళ ఇటలీ దేశస్థుడు పీయర్ బాల్యం నుంచీ బొమ్మలు వేయడంలో ఆసక్తి కనబరిచే వాడు. తన ప్రతిభను పెంచుకోవలంటే పూర్తిగా కళకే అంకితం అవ్వాలని గ్రహించాడు. ప్రకృతి మధ్య గడపడానికి ఇష్టపడేవాడు, కొండాకోనలను చుట్టివచ్చేవాడు, గుహల్లోని రాళ్ళను పరిశోధించే వాడు. అది అతడి కళ పైన ప్రభావం చూపింది. నిజానికి అతడి చిత్రాల ఉపరితలాలు కొండ రాళ్ళ గరుకుతనాన్ని గుర్తు చేస్తాయి. దాని కోసం అతను తన కాన్వాస్ లపై పాల రాతి పొడినీ.. మట్టిని పూసే వాడు, రంగులని వాటి పై అద్ది ఉపరితలాన్ని తయారు చేసుకునే వాడు. ఆయన చిత్రాలు శాస్త్రీయ మానవ ఆకారాల సున్నితత్వాన్ని సౌందర్యాన్ని కనబరుస్తాయి. అలంకారిక చిత్రకారుడుగా పేరు పొందాడు. ‘body languages’ పేరున లెక్కలేనన్ని స్త్రీమూర్తుల చిత్రాలని గీసి ప్రదర్శనకి పెట్టాడు. అతడిది పూర్తి నైరూప్య కళ కాకపోయినా, కొంత మేరకు ఆ భ్రమను కలగజేస్తా యి, వాటి హావభావాలు మనల్ని దిగ్భ్రమకు గురి చేస్తాయి, పీయర్ చిత్రాలకు అసమాన మైన ప్రత్యేకత వుంది, అవి మాటల్లో వర్ణించలేని వింత అనుభూతులను కలిగిస్తాయి.*****

గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.
