
కన్నీళ్ళ పంటనూర్పు
-గవిడి శ్రీనివాస్
ఈ పొలం పై నిలిచే వరి దిబ్బలు
కాసేపైనా ఆనందాన్ని ఎగరనీయటం లేదు
వర్షంలో మునిగిన పంట మాదిరి
అప్పుల్లో తడిసిన బతుకు మాదిరి
ఆదుకోని ధరలతో పతనమైన చిరునవ్వు మాదిరి
రైతు కళ్ళల్లో మిరప మంటలు రేపుతూ
ఉల్లికోసి కన్నీళ్ళను తోడుతున్నవి.
పంట నూర్పు పసిడి కల అనుకుంటే
పొరపాటైపోలా
మద్దతు ధర ముంచిపోయాక
తేరుకోవటం తెల్ల ముఖం వేయటం
అలవాటైపోయింది.
పైరు ఎండిపోతే తడబడ్డాం
పురుగు కొరుకుతుంటే దిగులు పడ్డాం
వర్షం ముంచిపోతే
కన్నీళ్ళలో కొట్టుకుపోయాం
బీమా లేని బతుకుల్లో
ధీమా చూడమంటే ఎట్లా
దళారులు పన్నే పన్నాగంలో
దగాకోరులు విసిరే వలలో
విలవిలలాడే రైతులు
ఇప్పుడు సంక్రాంతులు
ఎలా చేసుకోవాలో తెలియదు…
వెన్నెముకకు ఊతమిచ్చే
రాజ్యాధికారం బలంగా నిలబడే వరకూ
పంట నూర్పులు నిట్టూర్పులుగానే
మిగులు తున్నాయి.
*****

గవిడి శ్రీనివాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. కన్నీళ్లు సాక్ష్యం, వలస పాట ప్రచురితమైన కవితా సంపుటులు. 2016లో సాహితీ సమాఖ్య నుండి కవితాసృజన పురస్కారాన్ని, 2017లో పాలపిట్ట మాస పత్రిక నుండి గొట్టిపర్తి లక్ష్మి నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.
