నడక దారిలో-20

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లో తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు దెబ్బతిని అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్య పఠనంతోనూ, సంగీతం నేర్చుకోవటానికి, బాపూ బొమ్మలు చూసి వేయటం చేసాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా పేరు చూసి దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు రాసేదాన్ని. బంధువులు, మిత్రులు కరతాళ ధ్వనులతో, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో వివాహం జరిగింది. పరీక్షలు కాగానే హైదరాబాద్ లో కొత్తకాపురం, నాలుగు నెలల అనంతరం విజయనగరం వెళ్ళాను.  — తర్వాత

***

          ఎలాగైతేనేం మళ్ళా విజయనగరం చేరాను. కనుచీకటి పడుతుండటం వలన సన్నజాజులు పందిరంతా విరబూసి స్వాగతించాయి.”నాలుగునెలలుగా మామయ్య పిల్లలు వచ్చి మొగ్గలు కోసుకెళ్ళేవారు “అందిఅమ్మ. స్నానం చేసి వచ్చి మొగ్గలు ఒడినింపుకొని మాలకడుతుంటే వీర్రాజు గుర్తు వచ్చి పెదాలమీద కూడా సన్నజాజి విరిసింది . ముందుగా ఉత్తరం రాయటం వలన ఉషా మర్నాడు ఉదయమే కాలేజీకి వెళ్ళటానికి ఇంటికి వచ్చింది.
         
          కాలేజీ లో అడుగు పెడుతుంటే మనసంతా ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. మిత్రులు అందరూ నా చుట్టూ చేరి విశేషాలు అడిగారు.”సన్నబడ్డావు కానీ మంచి రంగు వచ్చావు సుభద్రా” అంటూ అందరూ ఆట పట్టించారు.
 
          ఫిజిక్స్ క్లాస్ కి వచ్చిన ప్రిన్సిపాల్ సీతాకుమారి గారు “ నువ్వు చదువు మానేసావేమో అనుకున్నాను “అన్నారు ప్రేమగా కళ్ళల్లోకి చూపులు కలుపుతూ. నన్ను ఎంతో ఎంతగానో ఇష్టపడే మేథ్స్ లెక్చరర్ ఉమాకుమారిగారు నన్ను చూసి” ఓహ్. మొత్తం మీద వచ్చేసావా?” అని ఆత్మీయంగా నవ్వారు. కాలేజీ చదువు కోసం సంసారబంధాన్ని వదిలించుకుని వచ్చాను. కానీ ఈ ఏడాదంతా కాలేజీ సరీగా జరగనే లేదు.
 
          ముల్కీ నిబంధనలు రాజ్యాంగ బధ్ధమేనని 1971 అక్టోబరులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అన్యాయమని, తమ రాష్ట్ర రాజధానిలోనే తాము రెండవ తరగతి పౌరులుగా మారామనే ఆవేదనతో ఆంధ్రా ప్రాంతంలో అంతకు ముందు కేవలం విశ్వవిద్యాలయాల పరిధిలోనే సాగిన జై ఆంధ్రా ఉద్యమం ఇప్పుడు ప్రతీ కాలేజీ దగ్గరా జరిగినట్లే మా కాలేజీ దగ్గరకి కూడా విద్యార్థులు వచ్చి నినాదాలు ఇవ్వటం, వారితో మేము కూడా గొంతు కలపటం జరిగింది. ఒక్కొక్కప్పుడు వారం రోజులు పైగానే క్లాసులు జరిగేవి కావు.
ఈ ఏడాది అక్టోబర్ జ్యోతి సంచికలో నా రెండో కథ ‘ దీపశిఖ’ ప్రచురితం అయ్యింది. మరోసారి మా కాలేజీ లో గొప్పగా చెప్పుకున్నారు. మా తెలుగు లెక్చరర్ ప్రత్యేకంగా నన్ను అభినందించారు.
 
          మొదటి పండుగ అని దీపావళికి వీర్రాజు గారు రెండు రోజుల కోసం విజయనగరం వచ్చారు. ఉన్నది రెండు రోజులు కోసమే అయితేనేం ఆ రెండు రోజులూ మరపురాని విధంగా కథలూ, కబుర్లూ సినీమాలతోనూ గడిపాము. డాబా మీద చిరు చలిగాలితో కలిసి జాజులు మమ్మల్ని పరిమళభరితం చేస్తుంటే, నా ఒళ్ళో తలపెట్టుకుని నేను పాడే లలిత గీతాలు వీర్రాజు వింటూంటే ఈ క్షణం శాశ్వతమైతే బాగుండుననిపించేది. అంతలోనే హైదరాబాద్ లోస్వంత ఇంటిలోనే పరాయివాడిలా నాకు దూరంగా ఉండటం గుర్తు వచ్చి భలే కోపం వచ్చేది.
 
          ఆంధ్ర,తెలంగాణా ఉద్యమం గురించి కొంత ఆందోళన చెందే వాళ్ళం. ఎవరు కలుసుకున్నా ముఖ్య సంభాషణగా చోటు చేసుకునేది ఈ విషయమే. ఎలక్షన్ ఫలితాలను బట్టి ఆంధ్రప్రదేశ్ విభజన ఆధారపడుతుంది అని ప్రజలు భావించారు. 1971 సాధారణ ఎన్నికల్లో, ప్రజలను ఇందిరా గాంధీ ఇచ్చిన ‘గరీబీ హఠావో!’ అన్న నినాదం ఉత్తేజ పరచటంతో ఆ ఎన్నికల్లో ఆమెకు భారీ ఆధిక్యత లభించింది. ఏ కారణం వల్ల నైతేమి ఉద్యమం తాత్కాలికంగా చల్లబడి విభజన విషయం వెనుక బడింది.
 
          డిసెంబర్ 13 రాత్రి శ్రీనగర్ అమృతసర్ ప్రాంతంలో పాకిస్థాన్ బాంబు దాడి జరిగింది. ఆ రాత్రి 12 గంటలకు ఆకాశవాణి లో ఇందిరా గాంధీ ప్రజలతో మాట్లాడారు. యుధ్ధం తీవ్రం అయ్యింది. మర్నాడు విశాఖ జిల్లా కలెక్టర్ ఆకాశవాణిలో బాంబింగ్ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేసారు. విశాఖలో నౌకాశ్రయం, నౌకా నిర్మాణ కేంద్రం ఉండటం వలన ఎప్పుడు యుధ్ధం జరిగినా ఆ ప్రాంతం అప్రమత్తం అవుతూ ఉండేది.
 
          అయితే 13 రోజులు మాత్రమే నడిచిన ఈ యుద్ధాన్ని చరిత్రలోని అతి తక్కువ కాలం జరిగిన యుద్ధాలలో ఒకటిగా అందరూ చెప్పుకునేవారు. 1971 డిసెంబరు 16న లొంగుబాటు అనంతరం, తూర్పు పాకిస్తాన్, స్వతంత్ర బంగ్లాదేశ్‌గా విడిపోయింది.
అప్పట్లోనే అన్నయ్యకు రాజమండ్రి కాలేజీకి బదిలీ కావటంతో బంధువుల ఇంట్లో ఉన్నాడు. వీర్రాజుకి రాజమండ్రి లోని వాళ్ళ ఇంట్లో ఖాళీ ఉందేమో కనుక్కోమని ఉత్తరం రాయమంటే రాసాను. కానీ మళ్ళా ప్రయత్నం మీద కొన్నాళ్ళకే తిరిగి విజయనగరం కాలేజీకి బదిలీ అయింది.
 
          జనవరి సంక్రాంతి సెలవులకు చిన్నన్నయ్య, నేను హైదరాబాద్ బయలు దేరాము. అతను ఓ నాలుగు రోజులు ఉండి తిరిగి విజయనగరం వెళ్ళిపోయాడు. నేను కాపురానికి వచ్చేలోగా కుట్టు మిషను కొనమని వీర్రాజు గారిని కోరటంతో విద్యామిషన్ కొని ఉంచారు. నేను చిరుగు పట్టని పాత చీరలు, దుప్పట్లతో కిటికీలకు, వంటగదికీ హాలుకు మధ్యగల ద్వారానికి కర్టెన్లు కుట్టాను. తలగడలకు గలేబులు కుట్టాను. నాకూ, మా ఆడబడుచుకూ పండుగకి లేస్ బోర్డర్ వేసి చీరల్ని డిజైన్ చేసాను.సెలవులు గడచి పోయినా తిరిగి నా ప్రయాణం సంగతి తెలియలేదు.ఇంట్లో ఎవ్వరికీ నేను చదువు కొనసాగించటం అంతగా ఇష్టంలేదు కానీ వాళ్ళ అన్నయ్య మాటల్ని కాదనలేక మాత్రమే మౌనం వహించారనేది తెలుస్తోంది. వీర్రాజు కూడా ఆ విషయం ఎత్తటం లేదు. మాటి మాటికీ గుర్తు చేయడం ఇష్టం లేక నేనూ మౌనం వహించాను.
 
          నేను పండగ వెళ్ళాక రిపబ్లిక్ దినోత్సవం తర్వాత వరకూ ఉండాల్సి వచ్చింది. నాతో ఉత్తరాల్లో “జనవరి లో జరిగే ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కి మనిద్దరం వెళ్ళి సరదాగా తిరుగుదాం ” అని కబుర్లు చెప్పిన వీర్రాజు గారు తీరా నేను వచ్చాక ఎప్పుడు ఎగ్జిబిషన్ వెళ్ళాలన్నా ఇంటిల్లి పాదినీ ఎప్పటిలాగే బయలుదేరదీసే వారు.
 
          చిన్న మరిదికి ఒక్కోసారి నైట్ షిఫ్ట్ లు ఉంటాయి.పెద్ద మరిది టూర్లు కన్నా వెళ్తాడు. లేదా ఇంట్లో ఉంటాడు. ఎప్పుడూ లేనిది మా ఆడబడుచు “కృష్ణ తాగి వస్తాడు నాకు ఒక్కదాన్నీ పడుకోవటానికి భయం” అనటం మొదలెట్టింది.” చెల్లెలివి నీకే భయం అంటే తర్వాత మరి నేనూ ఒక్కదాన్నే ఉండాలి కదా ” అన్నాను కానీ తప్పని సరి కావటంతో నేను ఆమె పక్కనే ఒక్కొక్కసారి పడుకోవాల్సి వచ్చేది.
 
          ఇక్కడ ఉన్నా నా మనసంతా కాలేజీ మీదే ఉండేది. మాటిమాటికీ కాలేజీ డుమ్మాలు కొట్టటంతో ఈ ఏడాది పాసవుతానన్న ఆశ పోయింది. రత్నం వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళిపోయారు. ఒకరోజు వాళ్ళింటికి నేనూ , ఆడబడుచు వెళ్ళాము. రత్నంతో ” వదిన మళ్ళా వెళ్ళిపోతే ఒక్కదాన్ని అయిపోతాను” అంది మా ఆడబడుచు. మరొక్క మూడు నెలల్లో నా చదువు అయిపోతుంది కదా. అంత వరకూ ఓపిక పట్టలేదా అని మనసులోనే అనుకున్నాను.
 
          నేను తిరిగి విజయనగరం వెళ్ళాలనుకునే సరికి చిన్నాడబడుచు అదే పాట మొదలెట్టే సరికి ఆమెని తీసుకునే బయలుదేరాను. ఓ వారం రోజులైనా తర్వాత మా పెద్దాడబడుచు ఏదో పనిమీద విజయనగరం వస్తే వాళ్ళతో కలిసి భువనేశ్వర్ వెళ్ళింది.
ఈ లోపునే నేను కాలేజీకి వెళ్ళాక అమ్మకూ, చిన్నన్నయ్య కూ నా మీద చాలా ఫిర్యాదులు చేసింది. నా మనస్తత్వం తెలిసిన వారు కావటాన వాళ్ళు నాతోనే చెప్పేసారు.
 
          “మీ చిన్నన్నయ్య హైదరాబాద్ లో ఉద్యోగానికి ప్రయత్నం చేస్తే బాగుండు” అని ఒకసారి తను నాతో అన్నప్పుడు ” ప్రస్తుతం ఇక్కడ ముల్కీ గొడవ ఎక్కువ గా ఉంది కనుక ఇక్కడ ఉద్యోగం సంపాదించటం కష్టమేమో” అన్నాను.
 
          ఆ మాటల్నే” మా వదినకు మీరు హైదరాబాద్ లో ఉద్యోగానికి రావటం ఇష్టం లేదు” అని చిన్నన్నయ్య తో చెప్పిందట. నిజానికి వాళ్ళు హైదరాబాద్ కి వస్తే నాకే లాభం కదా అని నవ్వుకున్నాను.
 
          “పెళ్ళి అయ్యేలోపున సత్యవతిని మొండితనం, మంకుపట్టు తగ్గేలా కొంచెం మార్చు” అన్నాడు చిన్నన్నయ్య. ఇన్నాళ్ళ మొండితనాన్ని ఏడాది లో మార్చటం అంత సులువా? ఆ మార్చేదేదో పెళ్ళైయ్యాక నువ్వే మార్చుకో బాబూ అనుకున్నాను.
 
          ఫిబ్రవరి లో మా మొదటి వివాహ వార్షికోత్సవానికి వీర్రాజు విజయనగరం వచ్చారు.పెళ్ళికి పూలజడ వేసుకోలేదు గానీ ఉషా వాళ్ళమ్మ బలవంతంగా నన్ను ఒప్పించి మల్లెపూల జడ వేసారు. ఎప్పుడూ మా పందిరి సన్నజాజుల మాలని జడకి చుట్టు కోవటం నాకు అలవాటే కానీ ఇలా ప్రత్యేకంగా వేసిన మల్లె పూలజడ నాకు ఇబ్బందికరంగానే కాక కాస్త సిగ్గుగా అనిపించింది. వీర్రాజు కూడా నవ్వుతూ” ఇప్పుడు నిజంగా కొత్త పెళ్ళికూతురులా ఉన్నావు. నీ బొమ్మ వేస్తాను అలానే ఉండు” అంటూ స్కెచ్ బుక్ తీసి వేసారు.
 
          ఈ ఏడాది M R కాలేజీ శతవార్షికోత్సవాలు ప్రారంభించారు.ఆ సందర్భంలో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అందులో మా మహిళా కాలేజీ తరపున రామన్ ఎఫెక్ట్ నేపధ్యంలో రంగుల  గురించి ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కి తెలుగు లో నన్నూ, ఇంగ్లీష్ లో ఉషని వివరించటానికి ఎంపిక చేసారు. ఒకరోజు అన్నయ్యా వాళ్ళూ కూడా చూడటానికి వచ్చీ నన్ను వివరించమన్నారు. రెండు రోజులుగా చెప్పి చెప్పి బొంగురు పోయిన గొంతుకతో వివరించటం చూసి అన్నయ్య నవ్వి స్టెప్సిల్ బిళ్ళలు తీసుకువచ్చి ఇచ్చాడు. అది నాకు ఎంతో సంతోషం కలిగించింది.
మరో సంతోషకరమైన విషయం మా కాలేజీ మాగజైన్లో ప్రచురితమైన నా రచనను ఎంపిక చేసుకొని శత వార్షికోత్సవ సావనీర్ లో పునః ప్రచురణకి తీసుకున్నారని తెలిసి ఎంతగా పొంగిపోయానో!! అయితే పరీక్షలు కాగానే హైదరాబాద్ వెళ్ళి పోవటం తో ఆ కాపీ నాకు అందనేలేదు.
 
          శత వార్షికోత్సవాల సందర్భంగా సంగీతం, సాహిత్యం, నృత్యం కి చెందిన కార్యక్రమాలు వారం రోజుల పాటు జరిగాయి. బాలమురళీకృష్ణ, టి.ఆర్ మహాలింగం ఫ్లూట్ కచేరీలకు అక్కయ్యతో కలిసి వెళ్ళాను. నేను మరింత ఆసక్తి గా హాజరైంది ఆరుద్ర, కృష్ణశాస్త్రి పాల్గొన్న సాహిత్య కార్యక్రమం. అప్పటికే కృష్ణశాస్త్రికి గొంతు మూగ పోయింది. ఆయన ఉపన్యాసాన్ని నాయని కృష్ణకుమారిగారు చదివి వినిపించారు. అప్పుడు వాళ్ళచేత ఆటోగ్రాఫ్ చేయించు కోవడానికి పుస్తకం లేక చేతిలో నోట్బుక్ ఉంటే అందులోనే చేయించుకున్నాను. ఆ తర్వాత నాయని కృష్ణకుమారి గారితో అనేక సమ్మేళనాలలో పాల్గొనడమే కాక , ముఖచిత్రాలకు ఆమెరావటం వలన కావచ్చు , స్నేహం పెరిగి అనేక సార్లు రాకపోకలతో మేము దగ్గరయ్యాము.
 
          ఎమ్మార్ కాలేజీ శతవార్షికోత్సవాలు పూర్తికాగానే మాకాలేజీ వార్షికోత్సవం జరిగింది. నా సహాధ్యాయి సత్యవతి అనే అమ్మాయి నెమలి నృత్యం అద్భుతంగా చేసింది. ఆ అమ్మాయి తర్వాత సత్యప్రియ పేరుతో సినీతారగా చాలా తెలుగు, తమిళ సినీమాలలో నటించింది.
 
          ఇలా అనేక కారణాలతో క్లాసులు సరీగా జరగక పోవడంతో ప్రైవేటు క్లాసులు ప్రతీ ఆదివారం పెట్టేవారు. అమ్మకి ఏమీ సాయం చేయటానికి కుదరక పోవటంతో అమ్మకూడా అలసిపోయి అప్పుడప్పుడు విసుక్కునే సరికి నాకు చదువు కోసం ఇక్కడ ఉంటున్నందుకు చిన్నబుచ్చుకునేదాన్ని, మళ్ళా అమ్మ పరిస్థితి అర్థం చేసుకుని సరిపుచ్చుకునే దాన్ని.
 
          మొత్తం మీద పరీక్షలు ఏదోలా పూర్తి చేసాను. ప్రాక్టికల్స్ మేనెల మొదటి వారంలో ఉన్నాయి. వీర్రాజు ముందే వచ్చేసారు. నా ప్రాక్టికల్ పరీక్షలు అయ్యేలోపున ఒకసారి శ్రీకాకుళం లోని బాల్యమిత్రుని ఇంటికీ, అక్కడి నుంచి బరంపురం లో ఉప్పల లక్ష్మణరావు గారి అధ్యక్షతన జరిగే వికాసం అనే సాహిత్య సంస్థ సమావేశాలకు వెళ్ళి వచ్చారు.
 
          నా పరీక్షలు అయ్యాక మేమిద్దరం విజయనగరం నుంచి హైదరాబాద్ బయలుదేరాము. ఇక పై విజయనగరం వస్తే నేను ఇక్కడ అతిథినే కదా అనుకుంటూ కదులుతున్న రైలు నుండి దూరమౌతోన్న ఊరికి వీడ్కోలు చెప్తూ కళ్ళ నీళ్ళతో పరికించాను.

*****

Please follow and like us:

4 thoughts on “నడక దారిలో(భాగం-20)”

  1. చదువు మధ్యలో పెళ్లిళ్లు కావడముతో ఎంతో మంది అమ్మాయిలు పూర్తి చేయలేక జీవితం అంతా badha పడే vaarendaro..మీ పట్టుదల శ్లాఘనీయం madam

    1. మీ ఆత్మీయ స్పందన ఆనందం కలిగించింది గౌరిలక్ష్మీ

  2. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టుదలగా మీరు చదువును కొనసాగించడం గురించి చదువుతుంటే చాలా ఆనందం కలిగింది సుభద్రగారు. మీ జీవితకథ ఎందరికో స్ఫూర్తి.
    మీకు నమస్సులు.

Leave a Reply

Your email address will not be published.