
చెరగని చిరునామా
-రామ్ పెరుమాండ్ల
రాత్రి వాహనాలన్ని ఇంటికెళ్ళాయి .కానీ ఫుట్ పాత్ పైకి ఎవరొస్తారో తెలియదు.కడుపులో ఖాళీలను పూరించడానికి ఈ లోకం ఏ ఒక్క అవకాశం ఇవ్వను లేదు .ఆకలిని వెతికి వెతికి అలిసిన కన్నులు కునుకు కోసం దారి వెతుకుతున్నాయి . ఈ దేశం చేసిన సంతకాల చట్టాలు రోజూలాగే తన ఖాళీ సంచిలో నింపుకోవడానికి వెళితే చెత్త కుప్పలో విరివిగా దొరికాయి .అయిన తనకేం తెలుసు బడి లేదు బలపం లేదు . అలా ఆ కాగితాలను పరుపుగా ఇటుక పెళ్లను దిండుగా జేసుకున్నాడు .తన ఖాళీకడుపుపై చేయి తడుముతూ మెల్లగా నిదురలోకి జారుకున్నాడో లేదోలోకమంతా గందరగోళం సాగుతున్నది .అయిన నిదుర బాగానే వచ్చేసింది . మెల్లగా తాను నేరమేమి చేయకుండానే ఒంటినిండా బట్టలు ధరించినట్టుగా ,కమ్మగా అమ్మ తన లేలేత బుగ్గలపై ముద్దులు పెట్టినట్టుగా ,బడిలో గురువు తన భుజాన్ని నిమురుతుంటే చప్పట్లు కురిసినట్టుగా ,సాయంత్రానికి కొన్ని సీతాకోకలు ,తనతోటి దోస్తులందరు ఆకాశానికి వేలాడే ఊయలలో ఊగినట్టుగా ,కల వచ్చేసింది . బహిరంగంగా లోకమేమో కలలు కూడా మా సొంతమే అన్నట్టుగా నిదుర చెడగొట్టేందుకు అరుస్తూనే ఉన్నది .అయిన ఆకలిని మరిపించిన కలతోనే సాగుతున్నది ఆ హృదయం . ఇంతలో అటుగాజీవన తాత్వికతను మోసుకు తిరుగుతున్న ఓ కుక్క పిల్ల వచ్చి మనకు అంత సీన్ లేదని తన పక్కను మెల్లగా తడిపేసింది .లేచి చూస్తే వీధి లైట్ కింద కిటకిటలాడుతున్న కీటకాలు ఎక్కడో చీకట్లో కనపడకుండా లోకాన్ని తిడుతున్న పురుగులు . ఇంతలో తన కళ్ళలోకి చూస్తూ ఆ కుక్కపిల్ల వికటాట్టహసంతో తోకను ఆడిస్తూ దేశం అంటే ఏమిటి ? ఇంతకీ నీది ఏ దేశం అని ప్రశ్నిస్తూ పక్కనే ఉన్న చెత్తకుండీ వైపు తీసుకుపోయింది.ఇంతకీ నాది ఏ దేశం .
*****

నా పేరు రామ్ పెరుమాండ్ల. మాది నాగర్ కర్నూల్ జిల్లా మాధారం గ్రామం. నేను ప్రయివేట్ టీచర్ గా పని చేస్తున్నాను. డి.యడ్, బి.యస్సి , బి. యడ్ చదివాను. నేను పదవ తరగతి నుంచి మా గురువు గారు పెన్నా శివ రామకృష్ణ శర్మ గారి ప్రొత్సహంతో మొదట నాటకాలు రాసేవాడిని ఆ తరువాత కవితలు ,కథలు రాస్తున్నాను . అందులో భాగంగానే 2019 సంవత్సరంలో “మరోకోణం”అనే కవిత సంపుటిని తీసుకొచ్చాను .అలాగే ఉరేనియం , తొండెం బొక్కెన ,వందేళ్ళ తెలంగాణ దళిత కథలు అనే పుస్తకాలలో కథలు రాసాను. నా మొట్ట మొదటి కథ “కన్నీటి కథ “2020లో నవ తెలంగాణ పత్రిక లో ప్రచురితమయ్యింది.సామాజిక అంశాలపై కవితలు ,కథలు రాస్తున్నాను .
