
ఉరి తీయబడ్డ అక్షరాలు
–శిలాలోలిత
చెంచా గిరీలు నడుస్తున్న కాలమిది
సరిహద్దుల మీద నరుకుతున్న కాళ్లు
గుండె ఒక్కటే మనుషులొక్కటే
మానవత్వం ఒక్కటే అనే
విశ్వ మానవ ప్రేమికులు రచన ద్రష్టలు
అందరూ అందరూ కలగలవలనే కాంక్షా తీరులు(హితులు)
సంకుచిత హృదయాలతో
భూమి నుంచి చీల్చుతున్న
గండ్రగొడ్డల ధ్వనులు
అరమరికలు లేని స్వేచ్ఛ ధోరణలతో
ప్రపంచ కవుల తీరొక్కటే అని ఎలుగెత్తుతుంటే
కీర్తిలు, భుజకీర్తుల కాలమైపోయింది
కొంత _____(?)
కొంత నష్టం
ఎంపిక లోపాలు
లోపాయి కారీతనాలు
ప్రతిభావంతులు కొందరికే సమ్మానాలు
తాలు తప్పులు ఎక్కువై
సాహిత్యం అంటే భజన బృందాల సమూహమని తేలిపోయింది
ఈ మట్టిని ప్రేమించిన వాళ్లను సైతం
మసిచేసే శతృవుల నేపథ్యంలో
కొన్నాళ్ళకు
సాహిత్యమంటే బజారుపాలు కావాలిసిందేనా
ఒకరి మెప్పులకో గొప్పలకో మొక్కులకో అక్షరం ఉరివేయబడుతోంది.
******

1958 జూలై 12 న పుట్టిన శిలాలోలిత అసలుపేరు పి.లక్ష్మి. వీరు కవియాకూబ్ గారి సహచరి.
పుట్టింది, పెరిగింది హైదరాబాద్ కు సమీపంలోని శంషాబాద్. తండ్రిగారు కీ.శే. పురిటిపాటి రామిరెడ్డి హిందీ పండిట్ గా హైదరాబాద్ పరిసరాల్లోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం వల్ల బాల్యమంతా ఇసామియా బజార్,నింబోలిఅడ్డ, మలక్ పేటలలో గడిచింది.
తెలుగుసాహిత్యంలో ఎం ఏ, ఎం ఫిల్, పిహెచ్ డి లు తెలుగు విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలలో పూర్తిచేసి తెలుగు అధ్యాపకత్వంలో స్థిరపడి ఇటీవలే రిటైరయ్యారు.
కవితా సంపుటులు :
పంజరాన్నీ నేనే, పక్షినీ నేనే(1999), ఎంతెంత దూరం(2005), గాజునది(2013), The Inner Courtyard (Prof. Suneetha Rani Translation ; Published Web version in Amazon Books Series)2017
