
నా అంతరంగ తరంగాలు-27
-మన్నెం శారద
అంతయు నీవే హరి పుండరీకాక్ష
చెంత నాకు నీవే శ్రీ రఘురామా….
నేను చిన్నతనంలో అంతగా భక్తురాలిని కాను. కానీ పండుగలంటే మాత్రం బహు సరదా! ముఖ్యం గా వినాయకచవితి, దసరా అంటే మరీ..
నా చిన్నతనంలో మాచర్లలో అమ్మ ‘పాములు, తేళ్ళు ఉంటాయి ‘వెళ్లొద్దన్నా నేను ఏమాత్రం లెక్కపెట్టకుండా మాయింటికెదురుగా వున్న మండాది రోడ్డులోని పొలాల్లో పడి బోల్డు పత్రి, తంగేడు పూలు తెచ్చేదాన్ని.
ఇంటింటికెళ్లడం, గుంజిళ్ళు తియ్యడం, ప్రసాదాలు తినడం, ఏ విగ్రహాలు ఎలా అలంకరించారో చూడటం… అదో సరదా!
మాచర్లలో పల్నాటి బ్రహ్మయ్య నాయుడు కట్టించిన చెన్నకేశవ స్వామి ఆలయం ఉండేది. ఆఁ గుడిలో ప్రతి వారం ఎవరో ఒకరు భోగం చేయించేవారు. భోగం అంటే మేళతాళాలతో అందరం వెళ్లి స్వామికి పూజ చేయించి ప్రసాదాలు నైవేద్యం పెట్టి అందరకీ పంచేవారు. ఆఁ ప్రసాదాలు చాలా రుచిగా బాగుండేవి.
మొత్తానికి ఏ దేవుడు కాపాడేడో తెలియదు కానీ మేం ఎవ్వరం ఏ విషకీటకం బారిన పడకుండా హాయిగాఆఁ వూరి నుండి బయటపడ్డాం.
అలాగే దసరా పండుగ కూడా! అప్పుడు ఒంగోలులో ఉండేవాళ్ళం. ఇంకా బడిలో చేరలేదు కూడా. అయినా పంతుళ్లు పిల్లల్ని తీసుకుని ఇంటింటికొస్తూ ‘అయ్యవారికి చాలు అయిదు వరహాలు పిల్ల వారికి చాలు పప్పుబెల్లాలు’ అని పాడుతుంటే, పిల్లల చేతిలో బాణాలు చూసి నేను కూడా సరదా పడి బాణం కొనిపించుకుని రంగు రంగుల బుక్కాలు కొడుతూ వీరోచితంగా తిరిగేదాన్ని.
మా ఇంట్లో పూజా మందిరంలో రాములవారి విగ్రహాలు ఉండేవి. అమ్మ పనంతా అయ్యేక మరో సారి స్నానం చేసి చాప పరచుకుని పడుకుని మాకు కొన్ని రాములవారి పద్యాలు చెప్పి నేర్పించేది. అమ్మ పూజలు పడీ పడీ చేసేది కాదు. దీపం పెట్టి అగరు బత్తి వెలిగించి, ఇన్ని పటిక బెల్లం పలుకులు పెట్టి దణ్ణం పెట్టుకునేది అంతే!
ఎక్కువగా గుడులకి వెళ్లే అలవాటు కూడా లేదు. వెళ్తే తిరుపతి, కాళహస్తి తిరుచానూర్… అంతే బాబాలను అసలు నమ్మేది కాదు.
ఇక దీపావళి సందడే వేరు! అది పూర్తిగా పిల్లల పండుగ!
నా తర్వాత చెల్లెలు ఇందిర ( బాగా చిన్నది ) అమ్మ కూచి. ఎప్పుడూ మెప్పు కోసం అమ్మ వెనుకే తిరుగుతూ ‘శారద అలా చేసింది, ఇలా చేసింది ‘ అని చాడీలు చెబుతూ నన్ను తిట్టిస్తుండేది. అది రామ భక్తురాలు. ఎప్పుడూ పూజ గదిలో విగ్రహాలు ముందు కూర్చుని ఏదేదో రాముడితో మాట్లాడుతుండేది. నేను కిటికీలోంచి చూసి ఫక్కున నవ్వి “ఆయనకే బోల్డు కష్టాలు, నీకేం చేస్తాడు, కృష్ణుడికి మొక్కు బోల్డు మాయలు, మహిమలు చేస్తాడు ‘అని చెప్పేదాన్ని.
నిజంగానే అప్పట్లో నాకు సినిమాలు చూసి కృష్ణుడంటే భలే ఇష్టంగా ఉండేది.
పెళ్లయ్యాక మా ఇంట్లోకి పూజలు, పునస్కారాలు వచ్చి పడ్డాయి. చాలా సంవత్సరాలు మా ఇల్లుకలావిడ వల్ల, నాకు ఎదురయినా అనేక సమస్యల వల్ల కూడా నేనూ చాలా పూజలకు అలవాటు పడ్డాను.
పిల్లల పెళ్లిళ్ల విషయంలో నేను చాలా మోసపోయాను. కథలు ఎంతో లౌక్యాన్ని ప్రదర్శిస్తూ రాసే నేను నేను నిజజీవితంలో చాలా అజ్ఞానిని. అనేక రకాల కష్టాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసాయి. మన మంచితనం, దాతృత్వం, సౌమ్యతకు మనలో వున్న ప్రతిభకు ఏ మాత్రం సంబంధం ఉండదని అనేక మంది గొప్పవారి జీవితాలు నిరూపించాయి.
ఇక నాబోటివారెంత?
భరించలేని నిరాశ నన్ను ఆవరించింది. రచనలు మానేసాను. ఎవరెవరో కర్మ సిద్ధాంతాలు చెప్పేవారు రకరకాల పూజలు చెయ్యమన్నారు. మతం మారమన్నారు… ఏదీ నాకు రుచించలేదు. దేనికి ఇవన్నీ చేయాలి???
ఎంతోమంది ఎన్నెన్నో అకృత్యాలు చేసినవారు ముందు వరసలో నిలబడి దైవ దర్శనాలు పొందుతుంటే… ఈ దేవుళ్ళని ఏమని నమ్మాలి… ఎందుకు నమ్మాలి… అని పూజలు మానేసాను.
అప్పుడొక స్నేహితురాలు నాకు శ్రీరామారక్షాస్తోత్రం గురించి చెప్పి చేయమని ప్రాధేయ పడింది.
కుదరదన్నాను.
ఆమె స్వయంగా రామ పట్టాభిషేకం పటం, రామ రక్షా స్తోత్రం పుస్తకం తెచ్చి ఇచ్చి గడ్డం పట్టుకుని బ్రతిమలాడింది. అయిష్టంగానే మొదలు పెట్టాను. ఏదో శాంతి లభించినట్లయింది.
ఈషా పుట్టి 22ఏళ్లయింది. వాళ్ళమ్మని CS (company secretary course ) చేయడానికి విజయవాడ పంపించి నేనే ఈషాని పెంచాను. నేను చేస్తుంటే ఈషా వినికిడితోనే నేర్చేసుకుంది.
ఆలా కొన్ని రోజుల తర్వాత రాముల వారి విగ్రహాలు మా అమ్మాయి లేపాక్షిలో కొనితెచ్చి మా డ్రాయింగ్ రూమ్ లో అమర్చింది. రోజూ నా దినచర్య ఆఁ విగ్రహాలకు, పూజా మందిరంలోని రామ పట్టాభిషేకం పటానికి పూల మాలలు కట్టి అలంకరిస్తాను.
ఎంతో భక్తి భావంతో మా పార్క్ లో తరచు ప్రవచనాలు చెప్పే చాగంటి గారి ఉపన్యాసాలు శ్రద్ధ గా విని కూడా ఒక కొక్కెమ్ వున్న కర్ర తెచ్చి మేంపెంచిన చెట్ల పూలు దొంగతనంగా కొమ్మలు విరిచి మరీ పట్టుకు పోయేకా మిగిలినవి మా వాచ్మాన్ మాకు తెచ్చిస్తాడు.
పూజలు అమ్మాయికి వదిలేసాను.
రాముడు మన తెలుగు వారి దేవుడే కదా! ఆయన మీద ఎన్నెన్ని సినిమాలు , ఎన్నెన్ని పాటలు మన సినిమాల్లో. రాముడి పాట లేని సినిమా ఉందా మనకు!
ఆయన గుడి లేని ఊరు ఉందా తెలుగు రాష్ట్రల్లో! సాక్షాత్తు అపర భక్త శిఖామణులైన త్యాగరాజు, రామదాసులు కూడా తెలుగు వారే కదా! ఆయన కళ్యాణం చేయని వాకిలి వుందా మనకు! శ్రీరామ నవమి మన వూళ్ళల్లో ఎంత భక్తితోనో నిర్వర్తిస్తారు! పందిళ్ళు వేసి పానకం, వడపప్పులు పంచి,అన్న దానం చేసి నాటికలతో,హరికథలతో ఆర్భాటంగా చేస్తారు తెనాలిలోనయితే.
ఒంగోలులోని ఘంటాపాలెంలో ఒక రామాలయం ఉండేది. దాని నిర్వహణ మాతాత గారే చూసేవారట. మా చిన్నాన్నల పేర్లు, సుందరరామయ్య, వేంకట్రా మయ్య, మా నాన్న గారి పేరు సీతారామయ్య, మా ఒక మేనత్త పేరు సీతారామమ్మ.
మాతాత గారి పేరు సుబ్బయ్య. ప్రఖ్యాత నటి భానుమతి గారి తండ్రి పేరు కూడా సుబ్బయ్య గారే! ఆయనకు మా తాతగారికి మంచి స్నేహం ఉండేదట! అది వేరే ప్రహసనం.
శ్రీరామచంద్రుడు నడయాడిన మన గోదావరీ తీరం పరమ పూనీతం! భద్రాద్రి వెళ్లి రెండుసార్లు గోపన్న కట్టిన గుడిని సందర్శించాను.. ఒకసారి అతిచిన్నతనంలో మా పెదనాన్నతో కలిసి… రెండోసారి అయిదారేళ్ళ క్రితం!
గోల్కొండ ఫోర్ట్ లో ఆయన్ని ఖైదు చేసిన జైలుచూసాను. ఆఁ గోడలు ఇంకా ఆయన పాటలతో ప్రతిధ్వనిస్తున్న భావన కలిగి వళ్ళు జలదరించింది.
ఆయనెప్పుడూ నేను దేవుడినని చెప్పుకోలేదు. సుఖాలని కోరుకోలేదు. అందుకే సకల జనకోటికి ఆరాధ్యుడయ్యాడు.
ఆఁ భక్తి భావంతోనే నేను ఆఁ పురుషోత్తముడు, ప్రజారంజపాలకుడయిన శ్రీరామచంద్రులవారి బొమ్మలు నా వూహ కొద్దీ వేసి నా భక్తినలా చాటుకునే ప్రయత్నం చేసాను .
*****
(సశేషం)

నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.