మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 6

-చెంగల్వల కామేశ్వరి

          మా యాత్రలో తొమ్మిదవరోజు నైనాదేవి మందిర్ దర్శనం చేసుకున్నాము.

          భూమికి కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుడికి సమీపం వరకు వచ్చినా అక్కడి నుండి  నూట ఏభై మెట్ల పై చిలుకు ఎక్కాము అంత వరకు చలిప్రదేశాలు తిరిగి ఇక్కడ ఎండలో ఎక్కామేమో ! అందరం తడిసి పోయినట్లు అయ్యాము. 

          ఈ అమ్మవారి విశేషాలు కూడా చెప్తాను తెలుసుకోండి.

***

          నైనాదేవి దేవాలయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ జిల్లాలో కొండ పైన నెలకొని ఉంది. ఈ దేవాలయం జాతీయ రహదారి 21 మార్గంలో ఉంటుంది. ఈ కొండ పై ఉన్న దేవాలయాన్ని చేరుకొనుటకు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి. కొంత పైకి వెళ్ళిన తరువాత చివరి భాగంలో కొంతభాగం మెట్లద్వారా పైకి వెళ్ళవలసి ఉంటుంది. కొండ క్రింది భాగం నుండి పై భాగానికి యాత్రికులు చేరడానికి కేబుల్ కార్ సదుపాయం కూడా ఉంది.

          ఈ దేవాలయ కొండ పైభాగం నుండి గోవింద్ సాగర్ సరస్సు కనబడుతుంది. ఇది భాక్రానంగల్ ఆనకట్ట ద్వారా సృష్టించబడినది.

          ఈ దేవాలయం గూర్చి అనేక పురాణ గాథలు ఉన్నాయి.

          ఇతిహాసాల ప్రకారం దక్షుని యజ్ఞానికి వెళ్ళిన సతీదేవి శివునికి జరిగిన అవమానాన్ని సహింపక ఆ యజ్ఞ గుండంలో దహనం చెందుతుంది. శివుడు క్రోధంలో సతీదేవి దేహాన్ని భుజాలపై ఉంచుకొని శివతాండవం చేస్తాడు. ఈ పరిణామానికి స్వర్గంలోని అందరు దేవతలు భయపడతారు. విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని 51 భాగాలుగా విభజించాడు. సతీదేవి యొక్క కళ్ళు పడిన ప్రాంతమే నైనాదేవి ఆలయ ప్రాంతంగా చెబుతారు.

          వేరొక కథనం ప్రకారం ఈ దేవాలయం ఒక నైనా అనే గుజ్జార్ బాలునితో ముడిపడి ఉంది. ఒకనాడు ఆ బాలుడు పశువులను కాపలా కాస్తున్నప్పుడు ఆ మందలో ఒక తెల్ల ఆవు ఒక రాతి పై తన పొదుగు ద్వారా పాలను కారుస్తున్నట్లు గ్రహించాడు. తరువాత చాలా రోజులు అదే విషయాన్ని గమనించాడు. ఒక రాత్రి ఆ బాలునికి కలలో దేవత కనబడి ఆ రాయి తన ఆసనమని చెబుతుంది. నైనా ఈ స్వాప్నిక వృత్తాంతాన్ని రాజా బీర్ చంద్ కు వివరించాడు. ఈ విషయాన్ని రాజు కూడా స్వయంగా చూసి అక్కడ ఆయన ఒక దేవాలయాన్ని నిర్మించి దానికి నైనా యొక్క పేరును పెట్టాడు.

          నైనాదేవి ఆలయం మహిష పీఠంగా కూడా పిలువబడుతుంది. ఎందుకంటే మహిసాసురుడనే రాక్షసుడిని ఈ ప్రాంతంలోనే సంహరించినట్లు కథనం. పురాణ గాథల ప్రకారం మహిసాసురుడు బ్రహ్మ వల్ల వివాహిత కాని స్త్రీ వల్ల మరణం పొందేటట్లు వరాన్ని పొందుతాడు. ఈ వరం వల్ల మహిసాసురుడు ప్రజలను హింసిస్తుంటాడు. ఈసంఘటనతో మహిసాసురుడిని అంతమొందించుటకు అందరు దేవతలు వారి శక్తులను కలిపి దుర్గ అనే దేవతను సృష్టిస్తారు. 

          ఈ దేవతకు అనేక రకాల ఆయుధాలను దేవతలు బహూకరిస్తారు. మహిసాసురుడు ఆ దేవత యొక్క అందాన్ని చూసి మోహించి తనను వివాహమాడవలసినదిగా కోరుతాడు. ఆమె తన కంటే శక్తివంతుడిని వివాహమాడతానని చెబుతుంది. వారిద్దరికి జరిగిన యుద్ధంలో ఆమె రాక్షసుడిని ఓడించి ఆయన కళ్ళను తొలగిస్తుంది. ఈ చర్య దేవతలకు సంతోషాన్నిస్తుంది. ఆ సంతోషంతో ఆరు “జై నైనా” అనే నినాదాలనిస్తారు. అందువలన ఆ ప్రాంతం నైనాగా స్థిరపడింది.

          ఆవిడని దర్శీంచుకుని కిందకు వచ్చి మేమంతా లంచ్ ముగించుకునేసరికి సాయంత్రం అయిదు గంటలయింది. రాత్రి ఓంటిగంటకు చండీ ఘర్ బ్లిస్ హొటల్ కి చేరాము. అందరికీ ఉత్సాహం రెట్టింపయింది. ఎందుకంటే మరునాడే తిరుగు ప్రయాణం! ఉదయం  బ్రేక్ ఫాస్ట్ చేసి మా లగేజ్ లన్నీ ప్యాక్ చేసేసాము. 

          చండీ ఘర్ లో ఉన్న సుకనా లేక్ రాక్ గార్డెన్ చూసాము.

          లంచ్ కి తిరిగి హొటల్ కి వచ్చి  లంచ్ అయ్యాక  అందరం కలసి యాత్ర చక్కగా కంప్లీట్ అయిందని అంతా బాగా వెహికిల్స్ నడిపిన డ్రైవర్స్ మా సన్నీశర్మ రాకేష్ లకు అందరం  కలిసి ఇచ్చిన డబ్బులు ఇచ్చాము వాళ్లు చాలా హేపీ ! ఇన్ని రోజులు ఇంత మంచి గ్రూప్ తో తిరిగాము అన్న ఆనందం వ్యక్త  పరిచారు. తర్వాత హొటక్ నుండి ఛలో ఎయిర్ పోర్ట్ అనుకుని బయలుదేరాము ఎయిర్ పోర్ట్ లో ఒకరికొకరు వీడ్కోలు చెప్పు కున్నాము. హైదరాబాద్ వచ్చాక అందరం మరో రోజు కలుద్దామనుకుని ఎవరిళ్లకు వారొచ్చేసాము. స్వస్తి!

          వారం రోజులు గా నేను రాసిన ఈ సుధీర్ఘ  మా యాత్రా విశేషాలు చదువుతూ  ప్రోత్సహించిన అందరికీ మా ధన్యవాదాలు

*****

  (సమాప్తం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.