నా జీవన యానంలో- (రెండవభాగం)- 5

-కె.వరలక్ష్మి 

అది 1977 వ సంవత్సరం, ఆ సంవత్సరం జనవరి చివరి తేదీల్లో మా చిన్న చెల్లికీ , ఫిబ్రవరి మొదటి వారంలో మా పెద్ద తమ్ముడికీ పెళ్లిళ్లు జరిగాయి. ‘నేను ఆడ పిల్లలకి కట్నం ఇవ్వను, మగ పిల్లలకి తీసుకొను’ అన్న మా నాన్నమాట మా చిన్న చెల్లి విషయంలో చెల్లలేదు. 5 వేలు ఇవ్వాల్సి వచ్చింది. ఆ డబ్బుల కోసం, పెళ్లి ఖర్చులకీ అప్పు చేసేరు. నేను స్కూలు ప్రారంభించి నాలుగేళ్లు ముగిసినా ఆర్ధికంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది నా పరిస్థితి. అందువల్ల నేనూ ఏమీ సాయం చెయ్యలేకపోయేను. 

మా చెల్లి నా స్కూల్లో l.k.g టీచరుగా చేసేది. ఆ జీతం మాత్రం ఏ నెలకానెల ఇచ్చేసేదాన్ని మా అమ్మ తమ్ముడి కూతుర్ని మా తమ్ముడికి చేసేరు. మా అమ్మ ఎంత అమాయకురాలంటే ‘మాకేమీ కట్న కానుకలు వద్దు కాని మా ఆడపిల్లలు ముగ్గురికీ మూడు స్టీలు బిందెలివ్వండి’ అని అడిగిందట. పెళ్ళిలో మా నాన్న అల్లుళ్లు ముగ్గురికీ బట్టలు కొనుక్కోమని రెండేసి వందలిచ్చేరు. నేను మా చెల్లికొక ఉంగరం, తమ్ముడికొక ఉంగరం చేయించి ఇచ్చేను. మా మరుదులిద్దరూ రెండేసి వందలూ మాట్లాడకుండా తీసుకున్నారు. 

మోహన్ కి ఏం అయ్యిందో తెలీదు “రెండు వందలకేమోస్తాయ్” అని వెనక్కిచ్చేసేడు. పెళ్లి ముగిసి అందరం ఇంటి కొచ్చేసేం. “మీ నాన్నకి కోపం వచ్చింది, ఆ రెండు వందలూ అడిగి తీసుకో” అంటూ మా అమ్మ నాకు పదేపదే చెప్పడం మొదలు పెట్టింది. నిజమే అనుకుని మా నాన్నని అడిగేను. అంతే విపరీతమైన కోపంతో వణికిపోతూ “ముందు మీ కుటుంబం నా గుమ్మం దిగండి, పొండి బైటికి” అంటూ ఒక్క అరుపు అరిచి గేటు వైపు చెయ్యి చూపించేరు. ఇంకా పెళ్ళికొచ్చిన చుట్టాలు వెళ్లలేదు. ఊహ తెలిసినప్పట్నుంచీ మా నాన్న గారాబం తప్ప మరోటి తెలీని నేను ముందు తెల్లబోయాను. ఆ అవమానాన్ని తట్టుకోలేక దుఃఖంతో నా కళ్ళు జలపాతాలయ్యాయి. 

పురాణాల్లో చెప్పిన సతీదేవి అవమానం నాకు అనుభూతిలోకొచ్చింది. పుట్టింటి అవమానాన్ని తట్టుకోవడం ఎంత కష్టమో తెలిసొచ్చింది. నిద్రపోతున్న గీతని, లలితని మోహన్, నేను ఎత్తుకుని, బాబుని రెక్కపట్టుకుని నడిపించుకుంటూ ఆ రాత్రి వేళ ఇంటికి చేరుకున్నాం. 

పగలంతా స్కూలు బాధ్యతల్లో తలమునకలైనా , రాత్రయ్యేసరికి దుఃఖం నన్నావరించేది. రెండు నెలలైనా అదొక మనో వ్యధలాగా నన్ను వదలకుండా అయ్యింది. ‘ఎన్ని కష్టాలు వచ్చినా నా వెనక మా నాన్న ఉన్నారు’ అనే నమ్మకం వమ్మైపోయింది. ఎంత పనిలో ఉన్నా నెలకి ఒక ట్రెండు సార్లు చూడ్డానికి వచ్చేవారు. ఒకోసారి నా కిష్టమైన చేపలు కొనుక్కొచ్చేవారు. నా స్కూలు బిజీ వల్ల ఏనాడు మా నాన్నకి భోజనం పెట్టలేదు. గబగబా బొగ్గుల కుంపటి అంటించి చిక్కటి పాలతో టీ పెట్టి ఇచ్చే దాన్ని. అప్పటికి నేను ఇంటర్మీడియట్ పాసై డిగ్రీ చదువుతున్నాను. అది మానాన్నకి గొప్ప గర్వ కారణం. చదువంటే అంత యిష్టం. ‘అమ్మా లక్ష్మీ’ అని పిలిచే నాన్న అంత మాట ఎందుకన్నారో ! తిండి నోటికి పోయేది కాదు. కంటికి నిద్ర వచ్చేది కాదు.

ఒకరోజు సాయంకాలం స్కూలు పిల్లల్ని తీసుకెళ్లడానికి వచ్చిన రిక్షా నాగరాజు “అమ్మా , నాన్నగారికి సోడా పేలి దెబ్బ తగిలిందండి” అన్నాడు. అప్పటికి ఇల్లు గడవడానికి సెంటర్లో కూల్ డ్రింక్ షాపులాంటిది పెట్టేరు. మా పెద్ద తమ్ముణ్ణి కాకినాడలో చదివిస్తూ చిన్న తమ్ముణ్ణి పదో తరగతిలో చదువు మానిపించి సాయంగా ఉంచుకున్నారు. 

అప్పటికి నా నోట్సు తీసుకుని చిన్న తమ్ముడు ఇంటర్మీడియట్ ప్రైవేటుగా చదువుతున్నాడు. సోడాలు పట్టడం మాత్రం మా నాన్నే చేసుకునేవారు. నా గుండె గుభేలుమంది. స్కూలు పిల్లల్తో బాటు అదే రిక్షాలో ఇరుక్కుని షాపు దగ్గరకి చేరుకున్నాను.

ఎదురుగా ఉన్న లలితా క్లినిక్ లోంచి అప్పుడే బైటికి వస్తున్నారు. భుజం మీది టర్కీ టవలు రక్తంతో తడిసిపోయి ఉంది. గబుక్కున వెళ్లి నాన్న చేతిని పట్టుకున్నాను. కుడి చేతి మడమ మీది పెద్ద రక్త నాళం కట్ అయిపోయిందట. ఎంత ఆపుకొన్నా బాధ తట్టుకోలేకపోతున్నారని అర్ధమైంది. భోరుమని ఏడ్చేసేను. నాన్న నా తల మీద చెయ్యి వేసి “ఏడవకు నాన్నా” అన్నారు. డాక్టరు ప్రథమ చికిత్స చేసి కాటన్ తో తేలికపాటి కట్టు కట్టి, కాకినాడ జనరల్ హాస్పటల్ కి వెళ్ళమన్నారు. “నాన్నా, నేను రానా?” అని అడిగేను. “వద్దమ్మా , ఇంటి కెళ్ళు , పిల్లల్ని ఇంట్లో వదిలేసి వచ్చేవు అన్నారు. 

బస్సు వచ్చే లోపల నాన్న పడిన బాధ అంతా ఇంతా కాదు. “అమ్మా, కొంచెం బ్రాందీ తాగితే ఈనొప్పి తట్టుకోగలనేమో” అన్నారు. నాన్న నోటి వెంట మొదటి సారి బ్రాందీ అన్న మాట వినడం. తాగడం గానీ, తాగే వాళ్ళంటే గానీ ఇష్టపడని మనిషి. “వద్దు నాన్నా” అన్నాను నేను. “సరే అమ్మా” అన్నారు. అంతలో బస్సు వస్తే ఎక్కేరు. డాక్టరు పెయిన్ కిల్లర్ ఇచ్చినట్టులేరు. అప్పటికి పెయిన్ కిల్లర్స్ లేవోమరి !

ఒక వారం తర్వాత మా చిన్నమ్మాయికి జ్వరంగా ఉందని లలితా క్లినిక్ కి తీసుకు వెళ్తుంటే ఎదురు పడ్డారు. నేనే దగ్గరకెళ్ళి “ఎలా ఉంది నాన్నా” అని అడిగేను. మా చిన్నమ్మాయి వీపు నిమురుతూ “ఫర్వాలేదమ్మా. వచ్చే వారం కట్టు మార్పించుకోవడాని కెళ్ళాలి. అన్నట్టు మూడో నెల వచ్చింది కదా, చెల్లిని అత్తవారింటికి పంపడానికి, కోడల్ని మన ఇంటికి తీసుకురావడానికి ముహూర్తం పెట్టించేము. నువ్వు రావాలి” అన్నారు . నేను చిన్నగా నవ్వి వచ్చేసాను. ఆరోజు నాన్న అలా అన్నాక నేను ఆ ఇంటికి వెళ్ళలేదు.

ఇంకోవారం తర్వాత సాయంకాలం స్కూలు పిల్లల్ని తీసుకెళ్లిన నాగరాజు మరో అరగంటలో మళ్ళీ వచ్చేడు. “ అమ్మాయిగారూ, నాన్నగారు మిమ్మల్ని అర్జెంటుగా తీసుకుని రమ్మన్నారు” అన్నాడు. 

“కాకినాడ వెళ్లి కట్టు మార్పించుకుని వచ్చేసేరా” అన్నాను. 

”ఆ ….వచ్చే సేరండి” అన్నాడు. 

పిల్లలకి స్నానాలు చేయించి, పెద్ద వాళ్ళిద్దర్నీ ముందు పంపేసి, నేను మంచి చీర కట్టుకుని తయారై బయలు దేరేనే కాని, రావద్దన్న ఇంటికి వెళ్ళనా వద్దా అని ఆలోచిస్తూ …మధనపడుతూ …నడుస్తున్నాను.

 “ఏముంది, మా చెల్లిని అత్త వారింటికి పంపించే విషయం గురించై ఉంటుంది”. చిన్నమ్మాయి వచ్చీ రాని కబుర్లేవో చెప్తూంటే నవ్వుతూ నడుస్తున్నాను.

 బొండా రాజులు గారి ఇంటి దగ్గర నుంచీ అందరూ నన్ను పట్టి పట్టి చూస్తున్నారన్పించింది. దారా వారి సందు దాటగానే అందరికీ మంచి నీళ్లు పోసే వాకా వాళ్ల మామ్మ “అయ్యో తల్లోయ్ , ఎంత పని జరిగి పోయిందమ్మో, ఈ పిల్లకి తెలిసినట్టు లేదు” అని ఎవరితోనో అంటూంటే ఎవరి గురించో అనుకున్నాను. 

తోట వారి వీధిలోంచి మా గేటు వైపు అంతా నడవడానికి దారి లేనంత జనం. నన్ను చూసి అందరూ పక్కకి తప్పుకొని దారి ఇచ్చేరు. ఏం జరిగిందో అర్ధం కాకుండా లోపలికెళ్లే సరికి గచ్చు మీద వాకిట్లో ప్రశాంతంగా శాశ్వత నిద్ర పోతున్న నాన్న. ప్రశాంతంగా నవ్వుతున్నట్టున్న మొహం. 

ఊరి అంచుమీదున్న నగరం దగ్గర సపోటా పండు తింటూ, రాబోయే ఎన్నికల గురించి ఎవరో ఏదో జోక్ చెప్తే ఫక్కుమని నవ్వేరట. ఆ నవ్వులోనే పక్కనున్న విలేజ్ గైడ్ గారి భుజం మీదికి తల వాల్చేసేరట. స్పృహ తప్పిందనుకున్నారట. 5 నిమిషాల్లో బస్సు వచ్చి షాపు దగ్గర ఆగితే మా తమ్ముళ్లు రిక్షాలో ఇంటికి తీసుకొచ్చి పెద్ద గదిలో పందిరి మంచం మీద పడుకోబెట్టేరట. డాక్టరు వచ్చి చూసి అప్పటికే ప్రాణం పోయిందన్నారట. రిక్షా నాగరాజు నేను కంగారు పడతానని అబద్ధం చెప్పేడట నాన్న రమ్మన్నారని. ఆ షాక్ తట్టుకోవడం చాలా కష్టమైపోయింది .

పల్లెటూళ్లలో జనాలు అర్ధం లేకుండా కట్టు కథలు అల్లేస్తూ ఉంటారు. నేను ఏడుస్తూనే నాన్న జేబులో ఉన్న డాక్టరిచ్చిన ప్రిస్కిప్షన్ తీసి చూసేను . నా పక్కనే  కూర్చున్న మా పెద్ద నాన్న భార్యకి పోట్టకొస్తే అక్షరం ముక్క రాదు. ఆ చీటీలోకి తొంగి చూసి బైటి కెళ్ళేక మా నాన్న సూసైడ్ చేసుకుంటున్నట్టు చీటీ రాసి పెట్టి చచ్చిపోయేరని అందరికీ చెప్పడం మొదలు పెట్టింది. 

మేమున్న కొత్త వారింట్లో మా భోజనాల గదిలోకి కాకినాడ బస్సు హారన్ విన్పించేది. ఆ సౌండ్ విన్నప్పుడల్లా నా కళ్ళు జలపాతాలయ్యేవి. మోహన్ చాలా విసుక్కునే వాడు “నీ కొక్కదానికే తండ్రి పోయినట్టు ఓవర్ చెయ్యకు” అంటూ కేకలేసేవాడు. ఆ షాక్ నుంచి తేరుకోడానికి చాలా కాలం పట్టింది.

మా తమ్ముళ్లిద్దరికీ ఇంకా ఏమీ తెలీని వయసు. షాపు చూసుకుంటూనే క్రమంగా నిలదొక్కుకుని నిలబడ్డారు. 

పెద్ద వాళ్లు మన కళ్ళ ఎదుటే ఉన్నారు కదా, ఇంకా ఉంటార్లే అని మన రొటీన్ లో మునిగిపోయి ఉంటాం. వాళ్ళు ఆకస్మికంగా మనల్ని వదిలిపోయాక “అయ్యో, వాళ్ల కోసం ఏమీ చెయ్యలేదే” అని దుఖంలో కూరుకుపోతాం.

 ఊళ్లోనే ఉండడం వల్ల ఒక్క పూట భోజనమైనా పెట్టలేదే అని నాన్న గురించి పదేపదే అన్పించేది. మా నాన్న కాలం చెయ్యడానికి ఏడాది ముందు కడుతూ ఉన్న ఇల్లొకటి అమ్మకానికి వచ్చింది. రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ ఒకాయన రోజూ వాళ్ల మనవడిని స్కూలుకి తీసుకోచ్చేవాడు. ఇక్కడ సెటిలవుదామనే ఉద్దేశంతో వెంకటరత్నం థియేటరు వీధిలో ఇల్లు కట్టడం ప్రారంభించేరు. బోరు వేయించి , కాంపౌండు వాల్ కట్టి, ఇంటికి శ్లాబ్ వేసేక అభిప్రాయం మారిపోయినట్టుంది. ఆయన నాతో “అమ్మా, నాలుగు వందల గజాల స్థలం. పెద్ద గదులు. తూర్పు ముఖం ఇల్లు. మీరుండడానికీ, స్కూలుకీ సరిపోతుంది. ఒక్క పదివేలిచ్చి తీసుకోండి” అన్నాడు. మోహన్ తో చెప్తే “మనకి ఇక్కడ ఇల్లెందుకు?  మనం రాజమండ్రిలో సెటిలవ్వాల్సిన వాళ్లం” అన్నాడు. మా నాన్నతో చెప్పి “ఎక్కడైనా అప్పు ఇప్పించగలరా” అని అడిగితే 

“పూర్తిగా కట్టని ఇల్లు పదివేలెందుకమ్మా, అయినా ఊరికి అంత దూరంలో ఎందుకు” అన్నారు. అది ఇప్పుడు ఊరి మధ్యకైంది. నాక్కూడా అన్పించింది “ఒక్క రూపాయైనా వెనకేసింది లేకుండా అప్పు చేసి ఇల్లు కొనడం రిస్కేమో” అని. తర్వాత ఆ ఇల్లు పోలీసు శంకర్రావు కొని అద్దెలకిచ్చే వాళ్లు. చాలా కాలం దాంట్లో పోస్టాఫీసు నడిచింది. ప్రస్తుతం షాపింగ్ కాంప్లెక్స్ గా మారింది.

ఆ రోజుల్లో కోమట్ల వీధిలో ఒక అలవాటుండేది. సాయం కాలం వంటలు పెందలాడే పూర్తి చేసుకుని ఫ్రెష్ గా తయారై ఆడ వాళ్లంతా వీధి అరుగుల మీదో, మెట్ల మీదో కూర్చుని ఒకళ్లనొకళ్ళు పలకరించుకుని కబుర్లు చెప్పుకొనే వాళ్లు. 

వాళ్లని చూసి నేను కూడా మా పెరటి గుమ్మం మెట్ల మీద కూర్చుని మా పిల్లల చేత హోమ్ వర్క్ చేయిస్తూండే దాన్ని. అప్పటికి ఊళ్లో ఎవరికీ కార్లు , స్కూటర్లు లేవు. పెంకుల ఫేక్టరీ యజమాని ఒకాయన సైకిలు మీద వెళ్తూ మా ఎదురింటి అరుగును గుద్దుకుని పడ్డాడు. అనుకోకుండా “అయ్యో” అన్నాను. అతను లేచి కూర్చుని ఒంటి కంటిన మట్టి దులుపుకొంటూ “మీరిలా వీధిలో కూర్చుంటే యాక్సిడెంట్లు అవ్వకపోతే ఇంకేమౌతాయండి” అన్నాడు నా వైపు చూసి నవ్వుతూ. నేను గతుక్కుమన్నాను. “ఇదొకటా నా ప్రాణానికి ?” ఆ రోజు నుంచీ అలా బైట కూర్చోవడం మానేసేను.

*****

(ఇంకా ఉంది )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.