కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)

                                                                –  ప్రొ|| కె. శ్రీదేవి

వసుంధరాదేవి

ఆధునిక తెలుగు సాహిత్యకారుల్ని పరిశీలిస్తే, వీళ్ళలో కొందరు హేతువును (reason) ఆధారం చేసుకొని రచనలు చేస్తే, మరి కొందరు intuition ని ఊతం చేసుకొని ముఖ్యంగా కాల్పనిక (ఫిక్షన్)సాహిత్యాన్ని సృష్టించారు. ఇందుకు ఉదాహరణలు ఇవ్వాల్సివస్తే, మొదటి తరహా రచనలకు కొడవటిగంటి కుటుంబరావును చూపించవచ్చు. అలాగే రెండవ కోవలో చలాన్ని చూపించవచ్చు. ఈతరహా రచనలు ఇప్పటికీ తెలుగులో కొనసాగుతున్నాయి.

స్త్రీ రచయితలలో ముఖ్యంగా వసుంధరాదేవి కథల్లో  అన్ని భావాలు ఏదో ఒక స్థాయిలో వున్నప్పటికీ, ఆమె కథలు తాత్విక, అస్తిత్వవాద ధోరణిలో నడుస్థాయి. అందువలననే ఈమె కథల్లోintuition కు ప్రాధాన్యత ఎక్కువ. ఈ తరహా కథల్లో కథకులు తాము పరిగణిస్తున్న వాస్తవికతను విశ్లేషణాత్మకంగా చూడటం కాకుండా, అనుభవాత్మకంగా, తమ intuition స్పందనలను ఆధారభూతం చేసుకొని చూడటం జరుగుతుంది. ఈ తరహా కథల్లోని పాత్రలు నిరంతరం అనుభవం అధారంగా జీవించడమే కాకుండా తమ అస్తిత్వాన్ని గురించిన ఆందోళనలో వుంటాయి. ఈ తరహా పాత్రలు వసుంధరా దేవి కథల్లో అనేకం కనిపిస్తాయి.

“చెరువు దగ్గర” అనే కథలో సుశీలమ్మ “నేను ఏ అనుభూతీ లేకుండా ఇలానే వడలిపోతాను” అని ఆందోళన పడుతుంది. ఈ అస్తిత్వ అనుభవ సంబంధిత ఆందోళన సుశీలమ్మ మనసులో వ్యక్తమైన తీరును కథకురాలు చాలా శక్తివంతంగా చిత్రించటం జరిగింది. ఈ కథలో “నిస్పృహతో, ఏమో చెయ్యాలని, దేన్నో పొందాలని ఏదో తపన, ఏమి చెయ్యలేని నిరాశ. తన జీవితం తనది కాదన్నట్లు, ఎవరి బలవంతం మీదనో బతుకుతున్నట్లు బాధ, జీవితంలో ముఫ్పై అయిదేళ్ళు చాలా భాగం గడిచి పోయింది తెలీకుండానే ఇహ చచ్చిపోవడమే తరువాయి. బ్రతక్కుండానే చావు!”. ఈ విధంగా పాత్రల వైయుక్తిక భావనల్ని, అనుభూతుల్ని తాత్వికంగా చిత్రించటం వసుంధరాదేవి కథల్లో చాలా సాధారణాంశం. అలాగే “బదిలీ” కథలో ప్రారంభంలోనే కథకుడు (narrator) నాకు ప్రపంచం లేదు. బదిలీ అయిపోయింది. నాలోకి బదిలి అయిపోయింది. ఇప్పుడు నేనే ప్రపంచాన్ని”అని అన్న మాటలు ఇందుకు ఉదాహరణ. (పుట- 55 ’ఆర్. వసుంధరా దేవి కథలు’)

తెలుగులో తాత్విక స్పర్శతో కథలు రాసిన రచయితలు చాలా తక్కువ. అందులోనూ స్త్రీ రచయితలు చాలా అరుదు.ఈ అరుదైన రచయితల్లో వసుంధరాదేవి ఒకరు. నిజానికి తాత్విక స్పర్శ ఎక్కువ సంధర్భాలలో readability ని దెబ్బతీయటం జరుగుతుంది. రచయితకు ఎంతో సహనం, సంయమనం వుంటే తప్ప ఆ స్థితిని నుంచి కథను కాపాడుకోగలగడం సాధ్యంకాదు. వసుంధరాదేవికి ఈ సంయమనం చాలా ఎక్కువగానే వుంది. అందువలననే ఆమె తాత్విక కథలు సిద్ధాంత చర్చల్లాగా కాకుండా కథలుగానే మిగిలాయి. అస్తిత్వవాద కథల్లో పాత్రలు తమ చుట్టూ వున్న, తమను నిరంతరం నిర్దేశిస్తున్న సమాజ భారాన్ని భరించలేని స్థితిలో ఆవేదన చెందటం ఆ వేదనను సంభాషణలలో ( ఈ సంభాషణలు ఎక్కువ సందర్భాలలో (monologue) మనోగతం రూపంలో వుంటాయి) వ్యక్తమవుతుంటాయి. సరిగ్గా ఈ ధోరణి వసుంధరా దేవి కథల్లో చాలా ఎక్కువగానే కన్పిస్తుంది. అలాగే తమ బాధను ఫిర్యాదులాగ ప్రపంచానికి మనోగత సంభాషణ రూపంలోనే వ్యక్తం చేయటం జరిగింది. ఉదాహరణకు “బదిలీ కథలోని ఈవాక్యాలు చూడండి. 

“అబ్బ! నా మనసు కదిలిపోతున్నది. అందులోని భరింపరాని వేదననభవిస్తున్నది…. ఈ బాధ నేను భరింపలేనే ………. ఈ నిరాశా సముద్రాన్ని నేనీదలేను. ఆ నిస్పృహ పర్వతాన్ని నేనెక్కలేను.  నేనెక్కలేను నేను వేరుగా వుంటాను. మనసంటే ఏమిటి? ఆశలూ అనుభవాలూ అంటూ దాన్నే పొగేసి ఎంత కొండకట్టాను! ఎంత సముద్రాన్ని సృష్టించాను…… అంతా బూడిదైపోయింది….దాన్ని భరించలేను” (పుట 56,  ఆర్ వసుంధరాదేవి కథలు) 

వసుంధరాదేవి కథలు అస్తిత్వవాద ధోరణికి దగ్గరగా వుంటాయని చెప్పుకున్నాం. ఇక్కడ అస్తిత్వ వాదం అంటే ఏమిటో కొంత నిర్వచించుకుంటే, వసుంధరాదేవి కథలు ఆ తరహాలోకి ఎంతవరకు ఇమిడిపోతాయో తెలుస్తుంది.

Mustaq Ahmad  అస్తిత్వవాదాన్ని ఇలా నిర్వచిస్తాడు. 

 “It is exclusively a man-oriented Philosophical movement propounding that, man. Being alone in the world, has no essence, no fixed nature, and therefore, cannot be redefined. He bestows meaning to the world which is essentially absurd, having no meaning and value. Man’s being is not but is always in the process of becoming” (Existential Aesthetics, New Delhi: Atlantic Publishers 1991,p.73

  ఈ నిర్వచనాన్ని వసుంధరాదేవి యధాతథంగా తన సాహితీ సంస్కారంలో సంలీనం చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే, ఆమె కథల్లోని ఏ పాత్రకూడా ముందే పరుచుకున్న భావాల్లోంచి తన అస్తిత్వాన్ని నిర్వచించుకుని ఆ ప్రకారంగా జీవించటం, సందర్భాలకు స్పందించటం జరగదు. ప్రతి సందర్భంలో అవి రూపొందుతూ వుంటాయి. తమని తాము నిరంతరం రూపొందించుకుంటూ వుంటాయి. పై వాక్యాలలోని  always in the process of becoming అనే దాని అర్థం అదే.

ఆర్. వసుంధరాదేవికి జీవితం వేరు సాహిత్యం వేరు కాదు. సాహిత్యమే జీవితంగా జీవించిన రచయిత్రుల కోవకు చెందుతారు. స్త్రీలు స్త్రీల సమస్యలను మాత్రమే చెప్పగలరు. వీరిది వంటింటి సాహిత్యం తప్ప జీవ్చితపు లోతుల్ని  స్పృశించే శక్తి సామర్థ్యాలు స్త్రీ రచయితలకు లేవు అనే హ్రస్వదృష్టిగల విమర్శలకు వసుంధరాదేవి గట్టి సమాధానాన్ని ఇవ్వగలిగిన తాత్విక కథలను రాయగలిగారు. స్త్రీల జీవితాల్లో వున్న ఖాళీని(vacuum) తాత్వికంగా చెప్పగలిగారు. సాధారణంగా, తాత్వికత అనేది సర్వసుఖాలను అనుభవించడం వలన  పుట్టేది ఒక పార్శ్వమైతే, రెండో పార్శ్వంలో వేదనాభరితమైన జీవితంలో నుండి కలిగే వైరాగ్యం అనుకుంటారు. కానీ వసుంధరాదేవి కథలు పరిశీలించినపుడు, ఈ రెండుకోవలకు కాకుండా నిర్దిష్ట అస్తిత్వ సంబంధిత అనుభవంలో నుంచి జీవితాన్ని తనదైన తాత్వికతతో వ్యాఖ్యానించటం కనిపిస్తుంది. ఈ వ్యాఖ్యానం వెనుక, పైన చెప్పుకున్న అస్తిత్వవాద ఛాయలు అనివార్యంగా వుంటాయి.

పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీల జీవితాలలో కొనసాగుతున్న నియంత్రణా భావజాలం వలన సహజంగా, స్వేచ్చగా వ్యవహరించలేక పోతున్న సామాజిక వ్యవస్థలో వారి జీవితాలలో ఏర్పడుతున్న అసంతృప్తులు, చిన్ని చిన్ని ఆనందాలు ధ్వంసమైన తీరును ఈ కథలు ప్రతిబింబింస్తున్నాయి. అలాగే ఎన్నో కలలతో దాంపత్య జీవితాన్ని ఊహించుకున్న అమాయకపు మనసులు, వాస్తవస్థితిలో దాంపత్య జీవితంలోని డొల్లతనాన్ని అంగీకరించలేని లేదా భరించలేని మానసికస్థితిని కూడా ఈ కథలు చిత్రించాయి. స్త్రీవాద ఉద్యమాలు ఏ మాత్రం లేని సామాజిక సందర్భంలో స్త్రీ జీవితాన్ని చాలా నిశితంగా పరిశీలించడానికి అవసరమైన తాత్వికత జోడించి వసుంధరాదేవి రచనకు పూనుకున్నారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే, స్త్రీల అస్తిత్వ స్పృహను, వారి జీవితాల్లోని సంక్షోభాన్ని చాలా ముందుగానే  గుర్తించి తన కథల్లో ఆవిష్కరించారు.

అమలులో వున్న పితృస్వామిక వ్యవస్థ స్త్రీల సంబధిత అస్తిత్వం మొత్తాన్ని నియంత్రింస్తుంది. ఈ నియంత్రణ ఫలితంగా స్త్రీలు తమ సహజ వాంఛల్ని సహజాతాలను తమకు తాముగా నియంత్రించుకునే స్థితి కలిగిస్తుంది. ఉదాహరణకు, “చెరువు దగ్గర” అనే కథలో చిన్నప్పటి నుండీ ’మనింట్లో ఆడపిల్లలు ఒకరింటికి వెళ్ళరు” అంటూ ముందుగానే ఆంక్షలు విధిస్తున్న నాయనమ్మను ఎదిరించలేక తనకిష్టమైన, తనకు ఆనందాన్నిచ్చే పనులన్నింటినీ తన పుట్టీంటి గౌరవాన్ని నిలబెట్టడానికి, మంచి అమ్మాయిగా పేరు తెచ్చుకోవడానికి త్యాగం చేస్తుంది. ఈ త్యాగం అంతిమంగా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవటానికి ఏ మాత్రం ఉపయోగపడకపోగా, ఆ తర్వాత కాలంలో తాను నిస్సహాయురాలిగా మిగలడానికి  మాత్రమే ఉపకరిస్తుంది. సీతలోని ఈ స్వభావం ఆమె భర్త గోపాల్రావుతోగల సంబంధంలోను ప్రతిఫలిస్తుంది. భర్త గోపాల్రావుకు జబ్బుచేసినా, జ్వరమొచ్చినా ఆమె తల్లడిల్లిపోతుంది. మంచి భార్యగా మన్ననలు పొందుతుంది. గోపాల్రావుకూడా సుశీలలోన్ని ఈ స్వభావాన్ని పెంచిపోషిస్తూ ఆమెను పురాణసీతకు ప్రతినిధిగా భావిస్తూ “సీత అని సంబోధిస్తుంటాడు.    

ఒక సందర్భంలో బ్యాంకు ఉద్యోగి అయిన గోపాల్రావు ఋణగ్రస్థులకు కోర్టు నోటీసులు ఇప్పించడంతో ఋణగ్రస్తులకు వ్యతిరేకంగా తీర్పువస్తుంది. దాంతో గోపాల్రావు పై కక్షపెంచుకున్న ఋణగ్రస్తులు దారికాచి, అతన్ని కొడతారు. గోపాల్రావు ముందే సుశీలపై సామూహిక అత్యాచారం చేస్తారు. తర్వాత అందరూ వేదాంతం వల్లిస్తారు. తప్ప ఆమె  ప్రమేయం లేకుండా ఆమె శరీరంపై జరిగిన దాడిని గురించి ఆమెకు ఎటువంటి నైతికమైన మద్దతు ఇవ్వరు. తనకెటువంటి సంబంధ బాంధవ్యాలు లేని బంట్రోతు ఆమె పట్ల చూపించిన మానవత్వాన్ని ఇంట్లో సభ్యులు గానీ భర్త గాని కన్నతల్లిదండ్రులు కూడా చూపించలేక పోవడంతో సుశీలలో అంతులేని నైరాశ్యం చోటు చేసుకుంటుంది. ఇన్ని రోజులుగా స్త్రీలపై విధించే  ఆంక్షలన్ని పాతివ్రత్యాన్న్ని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలుగా, అవసరమయినపుడు అవన్నీ ఆధారమవుతాయి, ఆదుకుంటాయి, రక్షిస్తాయనే అపోహల్లో జీవింఛే సుశీలలాంటి వారి భ్రమలు ఎలా పటాపంచలవుతాయో ఈ కథ ఆవిష్కరిస్తుంది.

స్త్రీలు తమ జీవితాల్లో ఎక్కువ భాగం ఒంటరితనాన్ని  అనుభవిస్తున్నారు. ఎవ్వరూ వారిని పట్టించుకోరు. అందరి  మధ్యవున్నా స్త్రీ ఒంటరి జీవే. అందుకు కారణం చుట్టూ వున్న వాతావరణం. ఆమె వ్యక్తిత్వాన్నికీ, స్వేచ్చాపూర్వకమైన అభివ్యక్తికీ సమాజంలో, కుంటుంబంలో అవకాశం లేకుండా పోయింది. వారి కోరికలు, ఆశలు, ఆలోచనలూ, సంఘటనలకు ఆమె కేవలం ప్రేక్షుకురాలిగా మాత్రమే మిగిలిపోతుంటుంది. ఈ పై అంశాలతో పాటు స్త్రీల జీవితాలలో అంతర్లీనంగా విషాదం, దైన్యం, అసంతృప్తి మొదలైన అంశాలు వసుంధరాదేవి కథల్లో వ్యక్తమవుతాయి.

చావు పుట్టుక అనే రెండు వాస్తవిక అంశాలు మనిషి అంతరంగాన్ని ఎలా తీర్చిదిద్దుతాయో తెలియజెప్పే కథలు ’బదిలీ’, ’జాన్ పాల్ చేసిన బీరువా’. మనిషిలోని నిరాశ నిస్పృహలకు ఎక్కువ సంధర్భాలలో ఏదోఒకదానికోసం ఎదురుచూడటమే కారణమని, ఆ ఎదురుచూపులు మనిషిని అంతిమంగా నిస్పృహలోకి తీసుకెళతాయని “బదిలీ” కథలో వసుంధరాదేవి ఋజువు చేశారు.  కథలోని ఈ వాక్యాలు ఆ విషయాన్నే సంకేతిస్తాయి.

“ఆశలేకుంటే నిరాశరాదు. నిరాశ నుండి పుట్టేది నిస్పృహ. కావాలన్నది దొరకనపుడు దొరికినదాన్ని సంతృప్తిగా చూడలేం. ఆశ అంటే ఎదురుచూడటం – ఆ ఆశే అన్ని అనర్థాలకు మూలకారణంగా ఉంది. అది ఎంత గొప్ప విషయం. నిజానికి ఎంత చిన్నదిగా వున్నది”(పుట-56, ఆర్ వసుంధరాదేవి కథలు)

“చావుపుట్టుకను సమన్వయం చేసే ఇంకోస్థాయి నుండే రావాలి…

ఎందుకు? ఎందుకు అట్లా జరిగింది?

ఇది జీవన్మరణ సమస్య. ఏమిటో, ఎందుకో, ఎక్కడో భయం. అర్థంకాని భయం”( పుట-67, ఆర్ వసుంధరాదేవి కథలు)

కథ ప్రారంభం నుంచీ చివరిదాకా జరిగిన సంఘటనలన్నీ పొంతనలేని చింతనగా అనిపించినప్పటికీ రచయిత కథ ముగించే లోపే వీటి మధ్య అంతర్లీనంగా ఉన్న సంబంధాన్ని ప్రతిష్టించటం వలన దీన్ని ఒక మంచి కథగా మలచడానికి ఆస్కారం ఏర్పడింది.

“జాన్ పాల్ చేసిన  బీరువా” అనే కథ కూడా ఒక సాధరణాంశాన్ని అసాధరణ స్థాయిలో చర్చించిన కథ. నిజానికి తాత్వికుడైన ఏకథకుడైనా సాధారణాంశాల వెనుక వుండే లేక సాదా సీదాగా కనిపించే అంశాల అంతస్సారాన్ని విశ్లేషించ గలగాలి. అటువంటి శక్తి వసుంధరా దేవిలో వుందని ఈ కథ రుజువు చేస్తుంది. ఈ కథలో జాన్ మంచి పనిమంతుడు, ధైర్యవంతుడు, బలవంతుడు కూడా. అయితే అతనిలోని సోమరితనం, తాగుబోతు లక్షణం లాంటి వ్యసనాలు అతనిలోని మంచితనాన్ని హరించివేస్తాయి. అతని కొడుకు ఫిలిప్ కూడా సోమరితనంలో బతికేస్తూ హఠాత్తుగా వరదల్లో చిక్కుకొని మరణిస్తాడు. కొడుకు మరణం జాన్ లో మౌలిక మార్పుకు కారణమవుతుంది. తన పూర్వపు ఆస్తిత్వ ఛాయలన్నింటినీ వదిలించుకొని తను ఒక కొత్త వ్యక్తిత్వాన్ని, హుందా తనాన్ని సంతరించుకుంటాడు. జాన్ లో వచ్చిన ఈ పరివర్తనను రచయిత చాలా తాత్వికంగా చిత్రించటం జరిగింది. జాన్ లోని సహజ స్వభావాన్ని అది ధ్వంసమైన తీరును మళ్ళీ అతను నూత్న వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న క్రమాన్ని ఈ కథ చిత్రిస్తుంది.  

వసుంధరా దేవి కథల్లోని స్త్రీ పాత్రలు ఆలోచనా స్రవంతిలో ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. దీనికి తోడు తాత్వికత తోడవటం వలన అవి పాఠకుల్ని గాఢంగా తాకగలుగుతాయి. సమాజంలో అమలవుతున్న ద్వంద్వనీతులు మనుషుల శారీరక, మానసిక ఆవరణాలను ఎలా నియంత్రిస్తూ వుంటాయో  ఆ నియంత్రణ ఫలితంగా వారి ప్రవర్తనా తీరు తెన్నులు ఎలా వుంటాయో వసుంధరాదేవి కథల్లో సజీవ సన్నివేశాల రూపకల్పనతో చక్కగా ప్రదర్శింప బడినాయి. స్త్రీల సమస్యలకు ఏదో ఒక తాత్కాలిక పరిష్కారం చూపడం కంటే, అసలు అలా వుండడానికి గల మూల కారణాలేమిటి? అన్న జిగ్నాసతో వసుంధరా దేవి కథలు సాగినట్లుగా అనిపిస్తాయి.

 ఒక్కోసారి స్త్రీలకు జీవితం నిస్సారంగా, నిరర్థకంగా కనిపిస్తుంది. భర్త బిడ్డలు లోకంలోని ప్రతిబంధం అవసరాలకు పరిమితమైనదిగా స్వార్థపూరితంగా తోస్తుంది. మంచితనం, దయ, ప్రేమ అన్నీ మోసం అనుకుంటారు. ఆశించిన ప్రేమ, అప్యాయతలు దూరమవడంతో మనసులో నిస్పృహ నిండిపోతుంది. ఈ అర్థంలేనితనం వారి మానసిక ప్రపంచాలను ధ్వంసం చేసి కృంగదీస్తాయి. అటువంటి సమయంలో స్పష్టత లేకుండా చలించే మనసు ఎప్పుడూ దేని కోసమో వెతుక్కుంటూ వుంటుంది. దేన్నో దొరకబుచ్చుకోవాలన్న నిరంతర ప్రయత్నంలో వుంటారు. ఎవరితో మాట్లాడకుండా, ఏమి చేయకుండా ఒంటరిగా కూర్చొని తమకు చేరువైన దు:ఖ సముద్రం మధ్యన అందకుండా నిలిచిపోయినట్లుగా భావిస్తూ దాన్ని అందుకోవడం కోసం నిరంతరం జ్వలిస్తూ ఉద్వేగంతో వసుంధరాదేవి స్త్రీపాత్రలు చలించి పోతుంటాయి.

“ పెంజీకటి కావల” కథలో జయలక్ష్మి రెండవ కూతురు చంద్రిక మానసిక దౌర్భల్యం కారణంగా తన జీవితంలోని అనందాన్ని కోల్పోతుంది. ఇలా ఎందుకయ్యింది అన్న ఆలోచనలతో సతమతమవుతూ నిత్యం సంఘర్షణకు లోనవుతుంది. అటువంటప్పుడు ఆమె ఎవ్వరితోను పలకదు. వూరికే అర్థంలేని చూపులు చూస్తూ కూర్చుంటుంది. శ్రావ్యంగా, దు:ఖభరితంగా ఆలపించే సంగీతాన్ని ఏ మాత్రం భరించలేక పోతుంది. అది ఆమెను తాత్విక వెతుకులాట నుంచి బలవంతంగా తప్పిస్తున్నట్లుగా ఆమెకు అనిపిస్తుంది. తనలోకి వ్యాపించిన తీయదనాలు, ఎరుగరాని ఆనందానికి సంకేతాలు, అన్నీ ఆ దు:ఖ సాగరంలో లయమైపోతున్నట్లు భావిస్తారు. భరింపరాని బాధావేశంతో ఏ పని చేయనివ్వని నిస్సత్తువ ఆపాత్రలకు ఆవరిస్తుంది. అలాంటి సమయంలో ఎవరు పలకరించినా ఆమెకు పట్టరాని కోపం వస్తుంది. 

“ఎప్పుడూ మీకందరికీ వేళకు తిండి, బట్టలు అందిస్తూ కూర్చోడమేనా నా జీవితానికి పరమార్థం? మీరు నన్ను పీక్కుతినేస్తున్నారు, నారక్తం తాగేస్తున్నారు” ( పుట-71 వసుంధరా దేవి కథలు) అంటూ వారిపైన విరుచుకు పడుతుంది.

కూతురి జీవితం ఏమైపోతుందోనన్న తీవ్రస్పందనలు ఆమెలోని విచక్షణా జ్నానాన్ని చంపేస్తాయి. ఆమె తను చూపినట్లుగా, తన భర్తకూడా పాపపట్ల శ్రద్ధ చూపరని ఆవేశపడుతుంది. పిల్లల పెంపకం, కుటుంబ నిర్వహణాభారం స్త్రీల పైన మాత్రమే రుద్దబడుతున్న స్థితినుండి, ఆ బాధ్యతల  నుండి తమంతకు తాము తప్పు కోలేక పోవడం వలన కలిగే బాధ స్త్రీలను అంతిమంగా ఒకానొక నిస్సహాయ, అయోమయ స్థితికి నెట్టివేస్తున్నాయి. పురుషులు తప్పుకున్నంత సులభంగా స్త్రీలు కుటుంబ బాధ్యతల నుండి తప్పుకోలేక పోవడం అనేస్థితికి అనివార్యంగా వాళ్ళు చేసే ఇతర పనులలో ఆ పర్యవసానాలు వ్యక్తమవుతాయి. స్త్రీలు లోపలున్న వత్తిడిని బయటకు పంపే దారులు కనపడకపోతే, ఒక్కో పరిస్థితుల్లో బయటకి కక్కలేని కోపాన్ని దిగిమింగుకుంటూ వెళ్ళడంతో, ఇక భరించలేని శక్తి వారి  మనుసులకు లేనప్పుడు లోపల పేరుకుపోయిన ఒత్తిడిని పోగొట్టుకొనేందుకు, సేప్టీ వాల్వ్ లాగ బద్ధలై పోతుంటారు. జయలక్ష్మి, రాధ పాత్రలో ఈ విధమైన స్థితి, ఉపస్థితులను వసుంధరాదేవి బట్టబయలు చేయగలిగారు.

 అంతే కాదు, వసుంధరాదేవి కథలు దు:ఖితుల పట్ల పేదల పట్ల అంతులేని సానుభూతి ప్రకటిస్తారు. మనుషుల్లో సాటిమనిషి బాధ,దు:ఖాల పట్ల వుండే నిర్లిప్తతను ప్రశ్నిస్తాయి.

“ఎక్కడో సర్కస్ లో పాప క్రింద పడుతుందేమోనని నీవెందుకు  బాధపడుతుంటావు. నీలో ఈ విపరీత ధోరణేంటి? అందరూ ఆ పాప తీగమీద నడుస్తుంటే ఆనందంతో చప్పట్లు కొడుతుంటే, నువ్వు మాత్రం ఎందుకు బాధపడుతున్నవ్” అంటూ  భార్యపైన కేకలేస్తాడు. నీవు బాధపడే దానికి లోకంలో ఏదో ఒక అంశాన్ని తీసుకొని బాధధపడుతూ వుండటమేనా” అని అరిచే భర్త “ ఎక్కడికి వెళ్ళినా దు:ఖపడడానికి ఒక కారణం కనబడుతుంది అమ్మకి (పుట:౧౪౦  ‘వసుంధరాదేవి కథలు’) అంటూ నవ్వే తన కూతురు రాధిక ఇద్దరూ కూడా ఆమెలోని మానవీయ అంశాన్ని గుర్తించకపోగా హేళన చేస్తారు. అయితే ఆమె మాత్రం తన సహజ సిద్ధమైన స్వభావంతో తన చుట్టూ వున్న వాళ్ళ ఉదాసీనతను ప్రశ్నించడమే కాకుండా, వాళ్ళ ఉదాసీనత వెనుక వున్న కారణాలను ప్రతిఫలిస్తూ వసుంధరాదేవి పాత్రలు సామాజిక  బాధ్యతతో వ్య్వహరిస్తాయి. అలా వ్యవహారించడంలో వ్యక్తమయ్యే ఆ పాత్రల చిత్తశుద్ధికి నిదర్శనంగా క్రింది వాక్యాలను గమనించవచ్చు.

“ఒక శరీరంలోని సహజమైన కోణాలన్నింటి మధ్యనా ఒక ప్రాణం, ఒక నియమం, ఒక సంబంధం వుంటుంది. సంబంధం తప్పిపోయినవి అసహజమైన కాన్సర్ కణాలై వూరికే అస్తవ్య్స్తంగా పెరిగిపోయి శరీరాన్ని నాశనం చేస్తాయి. ఈ మానవజాతి కూడా ఎదుటి మనిషిలోని అతని సుఖదు:ఖాల లోని కష్టనిష్ఠూరాలతోను, సంబంధం కోల్పోవడంతో రోగగ్రస్తమై పోతున్నది!…. స్వామి! మానవ జాతిని క్యాన్సర్ ఉండగా మార్చకు. ఏడ్చే, నవ్వే మనుషులుగా ఎదుటి వాళ్ళను అర్థం చేసుకునే వాళ్ళుగా వుండనీ!” అంటూ మూర్తీభవించిన మానవత్వంతో స్పందించిన అమ్మ పాత్ర వెనుక వసుంధరా దేవి లోతైన అవగాహన వుంది. మొత్తానికి స్త్రీల జీవితాల చుట్టూ అల్లుకున్న ద్వంద్వ నీతిని, సమాజంలో ఉన్న అన్యాయ ప్రవర్తన మనుషులుగా ఏమాత్రం స్పందించకుండా అతిమామూలుగా సాగిపోయే సగటు ప్రపంచానికి వసుంధరా దేవి కథలు నిలదీసే నిలువెత్తు సవాళ్ళుగా నిలుస్తాయి.                   

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.