
ఉచితం అనుచితం
-ఆదూరి హైమావతి
అనగా అనగా ఆనందహళ్ళి అనే గ్రామంలో అనంతమ్మ అనే ఒక పేదరాలు ఉండేది.ఆమె కుమార్తె సుమతి. ఆ ఊర్లో ఉండే సర్కార్ స్కూలు అనంతమ్మ చిమ్మేది . సుమతి ఆస్కూల్లోనే ఐదో క్లాసు చదువుతున్నది.ఆమెకు చిన్నతనంలో బురదలో జారిపడి పాదం కాస్త వంకపోయి వంకరగా నడిచేది. పేదతనం వల్ల సమయానికి వైద్యం చేయించలేకపోయింది అనంతమ్మ.
సుమతి అలాగే నడుస్తుంది, బాగా చదువుతుంది. చక్కగా పద్యాలూ, పాడుతుంది. గణితంలో దిట్ట. డ్రాయింగ్ కూడా బాగావేస్తుంది.
అదేతరగతిలో చదివే ధనికుల బిడ్డ ధనలక్ష్మి సుమతిని పంతుళ్ళంతా పొగడ్డంచూసి అనవసరంగా అసూయ పెంచుకుంది. సుమతి లాగా నడుస్తూ ఎగతాళి చేసేది. సుమతి కొత్తల్లో బాధపడి
ఏడ్చేది. రానురానూ పట్టించుకోడం మానేసింది.
ధనలక్ష్మి సుమతి వేసుకునే రంగు వెలసిన పోయిన , పాతబడ్డ, చిరిగితే కుట్టుకుని వేసుకునే పరికణాలనూ, గౌన్లనూ కూడా వెక్కిరిస్తూ చిరిగిన చొక్కలా చిన్నారి అని వెక్కి రించేది.ఆమె ధరించే ఖరీదైన తన బట్టలు అందరికీ గర్వంగా చూపేది. సుమతి పక్కన కూర్చోను చాలా మంది ఇష్టపడే వారుకారు. ఆమె పంతులు గారికుర్చీకి దగ్గరగా వేరే కూర్చునేది. ఎవ్వరి ఎగతాళినీ లెక్కచేయడం మానేసి చదువు మీదే శ్రధ్ధ చూపేది.
సుమతి ఉదయాన్నే వచ్చి , తల్లికి స్కూల్ గదులు చిమ్మటంలో సాయం చేసేది.తల్లి బళ్ళో నాటిన పూలమొక్కలకు నీరు తెచ్చిపోసేది.అన్ని తరగతి గదుల్లోనూ దేశమాత ఫోటోలకు పూలు పెట్టేది .పెద్ద పంతులు గారి గదిలో సరస్వతీ మాత ఫోటోకు పూలమాల అళ్ళి రోజూ వేసేది , సుమతి వాళ్ళ ఇల్లు చిన్న పూరి గుడిసె.స్కూల్ కు దగ్గరే. పది నిముషాలు నడిస్తే స్కూల్ వస్తుంది.
వర్షం వచ్చినపుడు స్కూల్ ముందున్న మట్టి బాట సుమతి ఇంటివరకూ బురద మయ మయ్యేది.ఆబురదలోనే అంతా జాగ్రత్తగా నడచి వెళ్లేవారు . పాపం పెద్ద పంతులు గారు ఎంత ప్రయత్నించినా ఊరివారి సాయంకానీ, ప్రభుత్వసాయం కానీ ఆరోడ్డు బాగుచేయించను అందక బాధ పడేవారు.
ఆఏడాది అధిక వర్షాలు కురిసి స్కూల్ ముందంతా బురద పేరుకుపోయింది.పిల్లలంతా తమ దుస్తులను పైకి ఎత్తి పట్టుకుని నడిచివచ్చి నూతి దగ్గర కాళ్ళుకడుక్కుని తరగతి గదుల్లోకి వచ్చేవారు.
ఆరోజు బాగా వాన కురిసి స్కూల్ అయ్యేసరికి కాస్త తగ్గింది. అంతా వరండాలో నిల్చుని వాన తగ్గాక వెళదామని ఎదురుచూడ సాగారు.పంతుళ్ళూ,కొందరు పిల్లలూ గొడుగులు ఉన్నవారు వేసుకుని వెళ్లారు. సుమతి తల్లితో కలసి ఇంటికి వెళుతుండగా , ధనలక్ష్మి తన స్నేహితులతో కాలసి వెనక వస్తూ సుమతిలా నడుస్తూ నవ్వుతూ ముందున్న బురదలో రాతిని చూడక ముందుకు తూలిపడింది. దుస్తులన్నీ బురదతో తడిసిపోయాయి. ఒళ్ళంతా బురద అంటుకుంది.మిగతా ఆమె స్నేహితులు చూస్తూ ఉన్నారుకానీ ఆమెను లేపలేదు, బురద అంటుతుందని దూరంగానే ఉన్నారు. సూంతి అది చూసి తల్లిని కూడా పిలిచి ధనలక్షిని లేపి తన ఇంటికి తెచ్చి తాము స్నానంచేసే తడికెల గదిలో నీరు ఇచ్చి ఆమె బట్టలు విప్పి బురద కడుక్కోమని చెప్పి, తాము టవలుగా వాడుకునే ఉతికిన పాత చీరముక్కను ఇచ్చి తుడుచుకోమని , తన ఉతికిన తనకున్న నాలుగు జతల్లో మంచిది ఏరితెచ్చి ఇచ్చి ధనలక్షిని కట్టుకోమని ఇంటివరకూ దింపింది సుమతి. మిగతా స్నేహితులంతా ధనలక్ష్మి కోసం ఆగకుండా వెళ్ళిపోయారు.
ధనలక్షికి సుమతి మంచితనం అర్ధమై తన ప్రవర్తనకు సిగ్గేసింది.మరునాడు ఆదివారం, తండ్రిని అడిగి సోమవారానికల్లా మూడు జతల కొత్త బట్టలు తెప్పించి సుమతికి ఇవ్వబోగా సుమతి ” ధనలక్ష్మీ ! ఏమ అనుకోకు నేను ఉచితంగా ఏమీ తీసుకోను, దైవం మాకు ఇచ్చినదేచాలు, ఇప్పుడు ఇవికట్టుకుంటే నిన్ను చూసినపుడల్లా ‘ఈమె నాకు ఇచ్చింది ‘అనే పేద భావన నాకు కలుగుతుంది. అంతేకాక ఇవిధరిస్తే అంతా నీవు ఇచ్చిన బట్టలు వేసుకున్నానని నన్ను చిన్నతనంగా చూస్తారు, నాకు బాధ కలుగుతుంది.
ఇంకా ఇలాంటివికావాలని నేను మా అమ్మను వేధించవచ్చు. కనుక నేను తీసుకోను. ఏమీ అనుకోకు ఎవ్వరినుంచీ ఉచితంగా ఏమి తీసుకున్నా అది అపరిగ్రహం అవుతుంది. నాబట్టలే నాకు చాలు .” అనిచెప్పగానే,ధనలక్షికి సుమతి గొప్పదనం ఇంకా అర్ధమై ఆమెతో స్నేహంగా మెలగ సాగింది. సుమతి పక్కనే కూర్చోసాగింది కూడా.
అలా ధనలక్షి మంచి బాలికగా మారిపోయింది. సూంతి తన మంచితనంతో తనతోటి విద్యార్ధిని మంచిగా మార్చింది.
నీతి- ఉన్నదానితో తృప్తి చెందడం చాలా మంచి అలవాటు.
*****

నేను 40 సం. [యం.ఏ. బియెడ్] ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యా యినిగా పనిచేసి 2004 లో వృత్తి విరమణపొందినాను.
ఆరోజుల్లో ఆకాశవాణి విజయ వాడ కేంద్రం నుండి వ్యాసాలు, నాటకాలు, టాక్స్ ప్రసారమయ్యాయి. ఎక్కువగా బాలవిహార్లో వచ్చాయి.
4 మార్లు జిల్లా స్థాయిలోనూ , 1992లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యా య అవార్డు , 1994 లో జాతీయస్థాయిలో ఉత్తమ జాతీయ స్థాయి ప్రధానోపాధ్యాయినిఅవార్డు, 2003లో కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామీజీచే జాతీయ స్థాయి అవార్డు [ ఇన్నో వేటివ్ టెక్నిక్స్ ఇన్ క్లాస్ రూం టీచింగ్ అనే రిసెర్ఛ్ అంశానికి] గోల్డ్ మెడల్ భగవంతుని కృపతో అందాయి.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు మానవతా విలువలను . భారతీయ సంస్కృతినీ లేతవయస్సులో పిల్లల మమనస్సుల్లో నింపాలనే ప్రయత్నంతో, 1969లో స్థాపించిన బాలవికాస్ అనే ఉచిత మానవతా విలువల బోధనా తరగతులు నిర్వహిస్తూ ,ఒక సేవకురాలిగా 1978 నుండీ వుంటూ, స్టేట్ రిసోర్స్ పర్సెన్గా 1985నుండి రాష్ట్రస్థాయి పర్యటనలు సంస్థ తరఫున సాగిస్తూ ఈ రోజువరకూ జీవిస్తున్నాను. ప్రస్తుతం పుట్టపర్తి ఆశ్రమ ఐఛ్ఛిక సేవలో జీవనం కొనసాగుతున్నది.
