
నడక దారిలో-62
-శీలా సుభద్రా దేవి
జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువుతో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,. అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ చనిపోవడంతో ఆషీని తీసుకుని పల్లవి తిరిగివచ్చేసి ఉద్యోగంలో చేరింది. నేను హెచ్చెమ్ కావటం,రిటైర్ కావటం, పెద్దక్క మరణం,ప్రత్యేకతెలంగాణా ఏర్పాటు, వీర్రాజు గారి పెయింటింగ్స్ ప్రదర్శనలు. పల్లవి కొన్న సరూర్ నగర్ లో అపార్ట్మెంట్ కు వెళ్ళటం. డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయటం. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు. వీర్రాజుగారికి బోయి భీమన్న,బాపూరమణల పురస్కారాలు- ప్రరవే సభలకు వెళ్ళటం,అమృతలతగారి పరిచయం-ఉమ్మడిశెట్టి రాధేయ ప్రతిభా పురస్కారం -చిన్నక్క మరణం, వీర్రాజుగారి పెయింటింగ్స్ ప్రదర్శనలూ,నాకు అమృతలూరు అపురూప పురస్కారం,ఆషీకి కాలేజీ ఎంపిక ప్రహసనాలూ తర్వాత—)
***
చిన్నన్నయ్య రాసిన వాటిలో 250 పేజీలకు వచ్చేలా కథల్ని ఎంపిక చేసి పంపమని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు మమ్మల్ని కోరారు. “కొడవంటి కాశీపతిరావు కథలు” పేరుతో వేస్తామన్నారు. ముందుమాట ఎవరి చేత రాయించాలని అడుగుతే అన్నయ్య శిష్యుడే అయిన జగన్నాథశర్మ చేత రాయించమని చెప్పాము. ఆ విధంగా అన్నయ్య కథలు రావటం మాకు చాలా సంతోషం కలిగింది.
“మనం రాసిన ఏ రచనైనా పుస్తకం రూపంలో వుండాలి. లేకపోతే అవి కాలగర్భంలో కలిసిపోతాయి.” అనేది వీర్రాజుగారి నినాదం. అందుకే తనను కలిసిన వారిని పుస్తకాలు వేసుకోమని ప్రోత్సహిస్తూ వుంటారు.
అందుకేనేమో వీర్రాజుగారు వరుసగా తన పుస్తకాలు ప్రచురించుకోవాలనే ఆలోచన మొదలు పెట్టారు. తాను రాసిన నాలుగు నవలలూ కలిపి నవలా కదంబం పేరుతో మూడువందల కాపీలు వేయించారు. అప్పట్లోనే ఎమెస్కో వాళ్ళు వేస్తామని పెర్మిషన్ అడిగారు.
అంతకుముందు శీలా వీర్రాజు కవిత్వం పేరిట సమగ్ర సంపుటి వేసుకున్నారు. అయినా మళ్ళా “శీలావీ ప్రయోగకవితలు” పేరున వచన కథాసంపుటాలు హృదయం దొరికింది, కొడిగట్టిన సూర్యుడు, మళ్ళీ వెలుగు కావ్యం, పడుగుపేకలమధ్య జీవితం, వచన కవిత్వంలో నవల బతుకు బాట ఇవన్నీ కలిపి బృహత్ సంపుటిగా వేసారు ఒక వంద వేయండి అంటే వినకుండా మూడు వందలు వేసారు. నా మాదిరిగా వచనకవిత్వంలో కథా, నవల, కావ్యం , ఆత్మకథ ఇన్ని ప్రయోగాలు చేసినవారు లేరు. అందువలన ప్రయోగ కవితలన్నీ సంపుటిగా వేయటం వలన అందరికీ తెలుస్తుంది అంటూ వాదించారు.
వీర్రాజుగారి కథల ఆంగ్లానువాదం ప్రచురిస్తే నేనే మార్కెటింగ్ చేస్తాను అని ఒకాయన వచ్చాడు. ఆయన మాటలు నమ్మి “Trio” పేరిట ఐదొందల కాపీలు ప్రచురించారు. “మన దగ్గర వంద వుంచుకుందాం. అనువాదకునికి వంద ఇద్దాం. మూడువందలు మార్కెట్ చేస్తానన్న అతనికి ఇచ్చేద్దాం” అని అన్నారు వీర్రాజు గారు. మరి నేను ఏం మాట్లాడలేదు కానీ భయపడుతూనే వున్నాను. తీరా పుస్తకాలు వచ్చాక అనువాదం చేసిన ఆయన వచ్చి ఒక పుస్తకం మాత్రమే తీసుకొని వెళ్ళారు. మార్కెటింగ్ చేస్తానన్న వ్యక్తి ఫోన్ చేసినా దొరకలేదు. తర్వాత ఫోనుకు దొరికినా ఏవో కథలు చెప్పి అయిపు లేకుండా కనిపించలేదు. దాంతో ఇంటినిండా పుస్తకాలే అయ్యాయి.
అయిదారు అల్మారాలే కాక వార్డ్రోబ్ లలో, అరుదుగా వాడే వంట పాత్రలు పెట్టే అల్మారాల్లో సైతం పుస్తకాలే చేర్చారు. మా బెడ్ రూంలో స్టూలు మీద పుస్తకాల కట్టలు పేర్చి ఒక పెద్ద టేబుల్ లా అమర్చి దానిమీద ఒక టేబుల్ క్లాత్ కప్పారు. పుస్తకాలంటే విపరీతమైన ప్రేమ కలిగినదాన్నే అయిన నేనే చాలా విసిగి పోయి ఆయన మీద కోపగించాను. “ఇలా అందర్నీ నమ్మేస్తే ఎలా? ఈ పుస్తకాలన్నీ ఏంచేస్తాం? తెలుగు అయినా అయితే ఎవరన్నా తీసుకుంటారు”అని చికాకు పడ్డాను.
నావి కూడా అప్పటికే ప్రచురించాల్సిన రచయిత్రుల కథలపై రాసిన వ్యాససంపుటి వుంది, ఒక నవల వుంది. కథలూ, కవితలూ వున్నాయి. వీర్రాజుగారేమో పుస్తకాలు వేసినవే మళ్ళీమళ్ళీ ప్రచురించు కుంటున్నారు. ఇంక నావన్నీ పెండింగ్ లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేసిన పుస్తకాలు కొన్నైనా బయటకు వెళ్ళే వరకూ నేను నా పుస్తకాలు వేయననీ వేసినా వందో నూట ఏభయ్యో మాత్రమే వేయాలని పుస్తకాలు ప్రచురించుకోనని గట్టి నిర్ణయం చేసుకున్నాను.
నవోదయా వంటి పుస్తకాల షాపుల వాళ్ళు పది కన్నా ఎక్కువ పుస్తకాలు తీసుకోవటం లేదు. ఈ పుస్తకాలన్నీ ఎలా బయటకు వెళ్తాయో అర్థం కాలేదు. విజయవాడలో ఎమెస్కో లక్ష్మిగారికి ఫోన్ చేస్తే నవలా కదంబం యాభై పుస్తకాలు పంపమన్నారు. వాటితో పాటూ నా ఇస్కూలు కతలు కూడా ఒక ముప్పై పంపమంటే పంపించాము. అవి మాత్రమే అమ్మకం అయినట్లు. అనుకోకుండా ఆదూరి సీతారామ్మూర్తిగారు అన్ని విశ్వవిద్యాలయాలకు తన పుస్తకాలు పంపించాను అని చెప్పారు. ఆయన దగ్గర అడ్రస్సులు తీసుకున్నాను. అంతేకాక మరి కొన్ని విశ్వవిద్యాలయాల తెలుగు శాఖాద్యక్షుల ఫోన్ నెంబర్లను తెలుసుకుని వాళ్ళకు గ్రంధాలయాలకు మా పుస్తకాలు వితరణ చేయాలనే అభిప్రాయం చెప్పాను. వాళ్ళంతా సానుకూలంగా స్పందించారు.
అన్నింటికీ మా ఖర్చుతో మా పుస్తకాలు పార్సిల్ చేసి పంపించాను. అయితే అందుకున్న ఒక్కరూ కూడా అక్నాలడ్జ్ మెంట్ అయినా ఇవ్వలేదు. అదీ మన విశ్వవిద్యాలయాలకు తెలుగు భాషమీద గల శ్రద్ధ.
వీర్రాజుగారికి కేటరాక్ట్ అయిన తర్వాత నేత్రాలయలోనే నేను కూడా చేయించుకుందామనుకున్నాను. కానీ కొన్ని అర్జెంటుగా రాయాల్సిన వ్యాసాలు పూర్తిచేయాలని ఆగాను.
“ఈ లోపున 2018,2019 సంవత్సరాలకు 49,50 ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు ఇచ్చేస్తే యాభై అయిపోతాయి. ఈ ఏడాది పూర్తి చేసేద్దాము”అని కుందుర్తి శాంత ఫోన్ చేసింది. ఇన్నాళ్ళూ కేటరాక్ట్ వల్ల వీర్రాజు గారు వాయిదా వేసారు. “ఈ రెండు సంవత్సరాలకూ న్యాయనిర్ణేతలకుపంపి ఫలితాలు వచ్చేవరకూ అంటే ఆలస్యం అవుతుంది. అందుకని మనమే నిర్ణయించేద్దాం. కవిత్వం పుస్తకాలన్నీ సేకరించి చదవటం మొదలుపెట్టాము. కొన్ని పుస్తకాలు నవోదయలో కొని తీసుకు వచ్చాము. 18 సంవత్సరానికి సిరికి స్వామినాయుడికీ, 19సంవత్సరానికి ఇబ్రహిమ్ నిర్గుణ్ కీ నిర్ణయించి ఫోన్ చేసి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుకి ఎంపిక చేసినట్లు చెప్పి, వాళ్ళను అంగీకారం తెలియజేస్తూ ఉత్తరాలు పంపమని చెప్పారు.
ఈ ఏడాది మాకు బాగా సన్నిహితులైన వారిని కోల్పోవటం ముఖ్యంగా వీర్రాజు గారిని కృంగదీసింది అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన కూడా ఎనభైలలోకి వచ్చేసారు.
మే 25 న అబ్బూరి ఛాయాదేవిగారు మరణించారని తెలిసింది. అయితే ఆమె కొండాపూర్ లో సి.ఆర్.ఫౌండేషన్ కి చెందిన వృద్ధాశ్రమంలో వుంటారు. అంతకు ముందు అయిదారు సార్లు ఆమెని కలవటానికి వెళ్ళాము. అయితే ఇప్పుడు హాస్పిటల్ లో వున్నారా, వృద్ధాశ్రమంలో వున్నారో సరిఅయిన సమాచారం తెలియలేదు. అంతదూరం వెళ్ళటానికి వీర్రాజుగారు తయారుగా లేరు. దాంతో ఆగి పోయాము. ఆ తర్వాత తెలిసింది. ఆమె ముందు రోజు కొత్తపేటలోని డా.సూర్యప్రకాష్ గారు నిర్వహిస్తున్న అందరి ఇల్లులోనే వున్నారనీ, అక్కడే ఆ తెల్లవారు జామున కన్నుమూశారనీ, తర్వాత ఆశ్రమానికి తీసుకువెళ్ళి తదనంతరం ఛాయాదేవిగారి కోరిక ప్రకారం మెడికల్ కాలేజీకే ఆమె దేహాన్ని ఇచ్చారని తెలిసింది. అందరియిల్లు మా ఇంటికి దగ్గరలోనే వుంది. అంతేకాక డా.సూర్యప్రకాష్ దంపతులు మా కుటుంబానికి దగ్గర వారు. వారు నిర్వహించే కార్యక్రమాల్లో మేమూ పాల్గొంటూ వుంటాము. ఇంత దగ్గరలో వున్నారంటే ఛాయాదేవిగారిని కలిసి మాట్లాడేవారముకదా అని విచారించాము.
ఆ తర్వాత భూమిక సత్యవతి ఏర్పాటు చేసిన సంతాపసభకి వెళ్ళడమే కాకుండా అబ్బూరి ఛాయాదేవి ప్రత్యేక భూమిక సంచికలో ఛాయాదేవిగారితో నా సాన్నిహిత్యం రాసాను.
సరిగ్గా మరో రెండు నెలలకే నా ఆత్మీయ స్నేహితురాలు జానకీబాల సహచరుడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు మరణించారని తెలియగానే వీర్రాజుగారితో కలిసి వెళ్ళాను. జీవనసాహచర్యమే కాకుండా సాహిత్యసాహచర్యం వున్నప్పుడు ఒక్కసారిగా వంటరితనం చుట్టుముట్టటం సహజమే. కానీ జానకీ బాల మరింతగా కృంగిపోయి మామూలు కాలేక పోయింది. దానికి తోడూ ఆరోగ్యరీత్యా కూడా తేరుకోలేక పోయింది. తరుచూ స్నేహితులతో సాహిత్యంలో గడుపుతే బాగుంటుంది అనే ఆలోచనతో మరో నెలరోజులకు డి.సుజాతాదేవితో కలిసి మళ్ళా జానకీ బాలను కలిసాను.
నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర్నుంచి కేబీలక్ష్మి యువభారతి వలన పరిచయమే కాకుండా కుటుంబ మిత్రురాలు. కొందరు రచయిత్రులతో కలిసి అనంతపద్మనాభస్వామి ఆలయానికి ఏదో ప్రత్యేక దర్శనాలకని వెళ్ళి తిరుగు ప్రయాణంలో మాసివ్ హార్ట్ ఎటాక్ తో మరణించటం మిత్రబృందాలకు తట్టుకోలేని షాక్. చక్కగా గంజి పెట్టిన చీరని చెక్కుచెదరకుండా అందంగా బొమ్మలా కట్టుకొని, దానికి సరిపడా మేచింగ్ గాజులు గొలుసులను ధరించి, పొడువాటి జడలో అంతే పొడవైన పూలమాల పెట్టుకొని ముఖం నిండా నవ్వుతో అందరితో కలిసిపోయి జోవియల్ గా మాట్లాడుతూ అందర్నీ కలుపుకుంటూ పోయే తత్వం కేబీ లక్ష్మిది. అందుకనే స్నేహితులు ఎక్కువే. ఇప్పుడు ఆమె అలాంటి పరిస్థితిలో చనిపోవటం చాలామందికి షాక్ గా అయింది. అలా షాక్ కు గురైన వారిలో లక్ష్మికి యువభారతిలో వున్నప్పటి నుండీ అంటే సుమారు యాభై ఏళ్ళ నాటి సన్నిహితులూ, లక్ష్మి స్నేహ బృందంలోని వారందరూ చాలా వరకూ అరవై డెబ్భైలవాళ్ళే కావటం అందర్నీ మరణ భయం వెంటాడింది.
వారిలో సుధామగారు బాగా డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళ అబ్బాయి కోకాపేటలో వుంటాడు. ఏ రాత్రో అనారోగ్యం కలిగితే అక్కడినుంచి రావడానికే రెండు గంటలు పడుతుంది. అనే తలంపే సుధామగారి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. దాంతో అబ్బాయి ఇంటి దగ్గరే కోకాపేటలో ఇల్లు కొనుక్కుని మలకపేట నుండి మారిపోవాలనుకున్నారు.
వచ్చే విద్యా సంవత్సరానికి HCU లో మళ్ళా అప్లై చేయాలనుకుంది ఆషీ. అంతకు ముందు ఒక ఇంజినీర్ కాలేజీ సీట్ రిజర్వ్ కోసం ముందుగానే కొంత డబ్బు కట్టమని అన్నారు. కట్టటానికి వెనకా ముందై ఆగిపోయాము. ఆషీ ఇంజనీరింగ్ కాలేజీ పట్ల ఆసక్తి కనబరచలేదు.
అంతలో సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా డిగ్రీ కళాశాల వారి ప్రవేశాల గురించి తెలిసింది. శైలజామిత్ర కూతురు అక్కడే చదివించాలని చెప్పిన గుర్తు. ఆమెకి ఫోన్ చేస్తే చాలా మంచి కాలేజీ అనీ, అవసరమైన ఆన్లైన్ కొర్సులు కూడా చదువుతో బాటూ సమాంతరంగా చేయిస్తారనీ చెప్పింది.
ఆ కాలేజీకి మంచి పేరుందని కాలేజీకి వెళ్ళి అడ్మిషన్ గురించి వివరాలు తెలుసుకోవటానికి పల్లవీ, ఆషీ వెళ్ళారు. విదేశీ విద్యార్థులకు అడ్మిషన్ ఓయూ కేంపస్, తార్నాకలో వున్న ఫారెన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRO) ద్వారానే చేర్చుకుంటామని, అక్కడ రిజిష్టర్ చేసుకొని, అక్కడే ఫీజ్ కట్టి రసీదు తీసుకు వచ్చి సబ్మిట్ చేయమని చెప్పారు. మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. రేంకు వచ్చిన వారికి తక్కువఖర్చులోనే అవుతుండవచ్చు. కానీ తామరతంపరగా పెరిగి పోతోన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో డబ్బున్న వారు సరే మాకు తెలిసిన ఉన్నత మధ్యతరగతికి చెందిన వారు కూడా ఇంత ఖర్చు పెట్టి చదువుతున్నారా అని అనుకున్నాము.
పల్లవీ, ఆషీ FRO కి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని వచ్చారు. పాస్పోర్టు, OCI కార్డు అన్నీ సబ్మిట్ చేస్తే అమెరికన్ ఎంబసీకి పంపితే యూఎస్ లోని బర్త్ ప్లేస్ కి వాటిని ఫార్వర్డ్ చేసి నిజంగా అక్కడే పుట్టిందా లేదా అని ఎంక్వైరీ చేస్తారుట. జతపరచిన సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా వున్నాయని యూ.ఎస్ నుండి నిర్థారణ వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడి FRO అడ్మిషన్ కి అంగీకారం తెలియజేస్తారట. ఈ ప్రక్రియకు అంతటికీ ఒక నెల పట్టింది. అప్పటికే కాలేజిలో సిలబస్ మొదలైపోయింది. అయితే ఏం? ఒక సక్రమపద్ధతిలో కాలేజీలో చేరింది కదా. మేము వూపిరి పీల్చుకున్నాము .
మిగతా పిల్లలు కట్టే ఫీజులకు రెట్టింపు విదేశీ విద్యార్థులు కట్టాలని తెలిసింది. విదేశీ విద్యార్థులు ప్రవేశపరీక్షలు రాయనక్కరలేదట. కేవలం FRO లో రిజిస్టర్ చేసుకొని OU పరిధిలోని ఏ డిగ్రీ/ ఇంజనీరింగ్ కాలేజీలోనైనా చేరవచ్చట. మాకు ఇవేవీ ఇంతకాలం తెలియలేదు. అనవసరంగా కష్టపడి అన్ని ప్రవేశపరీక్షలు రాసింది. ఇలా అని తెలిసి ఉంటే హాయిగా ఇంజనీరింగ్ లోనే చేరేది కదా అనీ అనుకున్నాము. అయినా సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ ఆడపిల్లల కాలేజీ కనుక గొడవలు కూడా వుండవు. ఇప్పుడు అవసరం కనుక ఆషీకోసం ఒక లాప్టాప్ కూడా కొనవలసి వచ్చింది .
కమిటీ అంతా కలవటం కుదరక మాడభూషి రంగాచార్య స్మారక కథా పురస్కారం ఎంపిక కాస్త ఆలస్యం అయ్యింది. ఈసారి మానేసి వచ్చే ఏడాది ఇద్దరికి ఒకేసారి వచ్చేద్దాం కమిటి నిర్ణయం తీసుకుంది.
మరో వైపు మాడభూషి కథా పురస్కారం కొరకు కథలు పుస్తకాలు వీర్రాజు గారూ, నేను చదవటం మొదలు పెట్టాము. ఈ పర్యాయం రెండు సంవత్సరాలు కలిపి నిర్వహించాలని కమిటీ ఆలోచన చేసింది.
కొత్తగా వచ్చిన పుస్తకాల గురించి కొందరు మిత్రులను సంప్రదించాము. మంచి పుస్తకమేనని తెలిసిన వాటిని రచయితలను సంప్రదించి పుస్తకాల్ని కొన్ని తెప్పించాము. వెంట వచ్చునది, స్పర్శవేది కథలు పుస్తకాలు గురించి ఎవరో చెప్పారు. అతని ఫోన్ నెంబర్ తెలియదని కొందరు చెప్పారు. అతను పనిచేసే రాంకీ ఫౌండేషన్ వెబ్సైట్ కు వెళ్తే ఫోన్ నెంబర్ దొరికింది. SMS ద్వారా పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అని అడిగాను. ఆయన వెంటనే మీ చిరునామా ఇస్తే పంపుతానని మెసేజ్ పెట్టారు. నేను చిరునామా ఇచ్చేసరికి “ఆ దగ్గర లోనే మా ఫ్రెండ్ వుంది. ఆమెద్వారా పంపుతాన”ని మెసేజ్ పెట్టారు.
మరో రెండు రోజుల్లోనే చక్కనినవ్వు ముఖంతో ఒక అమ్మాయి తలుపు కొట్టింది. నేను కోరిన రెండు పుస్తకాలు తీసుకువచ్చింది. ఆ అమ్మాయి కూడా పల్లవి చదివిన పద్మావతి కాలేజీలోనే చదివిందని తెలిసి పల్లవిని పిలిచాను. నేను రాసిన పుస్తకాలు అడిగితే ఆ అమ్మాయికి ఇస్కూలుకతలు, బతుకు పాటలో అస్తిత్వరాగం దీర్ఘ కవిత పుస్తకాలు ఇచ్చాను.
వీర్రాజుగారు నాకూ పల్లవికి తెలిసిన వాళ్ళేమో అనుకొని లోపలే వున్నారు. ఆ వాణిశ్రీ అనే అమ్మాయి ఎమ్మే తెలుగు చేసాననీ, పుస్తకాలు చదవటం ఇష్టమనీ ఆ విధంగానే ఎమ్వీ రామిరెడ్డి గారితో చిరకాలస్నేహాన్నీ వివరించింది. అదే తొలి పరిచయమైనా ఎంతోకాలంగా తెలిసినట్లుగా నాతో, పల్లవితో మాట్లాడింది. అలా పరిచయమై ఇంట్లోకి వచ్చిన వాణిశ్రీ తర్వాత్తర్వాత మా కుటుంబంలో మనిషిలా మా మనసులోకీ వచ్చేసింది.
వాణిశ్రీ తీసుకువచ్చిన రెండు కథలపుస్తకాలూ చదివాక 2020కి ఎండ్లూరి మానస రాసిన మిళింద సంపుటినీ, 2021కి ఎమ్వీ రామిరెడ్డి రాసిన స్పర్శవేది సంపుటినీ ఎంపిక చేసాము.
*****

జన్మస్థలం విజయనగరం.రచయిత,కవి, చిత్ర కారుడు ఐనా శీలా వీర్రాజు గారి తో వివాహానంతరం హైదరాబాద్ లో నివాసం.1970 లో కథారచన తో సాహిత్య రంగంలో అడుగు పెట్టి తొమ్మిది కవితా సంపుటాలు, మూడు కథా సంపుటాలు,ఒక నవలిక వెలువరించారు. వంద మంది కవయిత్రుల కవితల సంకలనం ” ముద్ర” కు డా.పి.భార్గవీరావు తో కలిసి సహసంపాదకత్వం వహించారు.ప్రధానోపాధ్యాయినిగా పదవీవిరమణ చేసారు.
