
తీక్షణ వీక్షణంలోంచి…
-గవిడి శ్రీనివాస్
ఈ క్షణం
తీక్షణంగా నిరీక్షణ చేస్తున్నాను
అక్షరాల దొంతరల్ని పేర్చుకుంటున్నాను.
నిరీక్షణ వీక్షణంలోంచి లేచి
ఏవో క్షణాల్ని ఏరుకుంటున్నాను.
ఏకాంతం రాలుతుందో
ఆక్షరం ఏలుతుందో
మదిలో తుపానులు తరుముతుంటాయి.
మనిషి మనుగడని తురుముతుంటాయి.
అస్తిత్వం ప్రశ్నలు కుదుపుతూ ఉంటాయి.
కాలంతో పోటీ పడటం
సవాళ్ళకు పరిష్కారాలు అన్వేషించడంతోనే
క్షణాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
నాది కాని ప్రపంచంలో
నెగ్గుకు రావాల్సిన సందర్భాలు ఉంటాయి.
ఏం క్షణం నాది కాకపోయినా
తీక్షణంగా పరీక్షణ చేస్తే
ఏదో కొత్త రూపంలో
వెలుగు రేఖలు కన్పిస్తుంటాయి.
*****

గవిడి శ్రీనివాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. కన్నీళ్లు సాక్ష్యం, వలస పాట ప్రచురితమైన కవితా సంపుటులు. 2016లో సాహితీ సమాఖ్య నుండి కవితాసృజన పురస్కారాన్ని, 2017లో పాలపిట్ట మాస పత్రిక నుండి గొట్టిపర్తి లక్ష్మి నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.
