
అనుసృజన
ఈ వ్యాపారికి దాహమెక్కువ
మూలం : ప్రజాకవి,గిరీష్ చంద్ర తివారీ (గిర్దా)
అనుసృజన: ఆర్ శాంతసుందరి
ఒక వైపు ధ్వంసమైన మురికివాడలూ…ఒక వైపు నువ్వూ.
ఒక వైపు మునిగిపోతున్న పడవలూ…ఒక వైపు నువ్వూ.
ఒక వైపు ఎండిపోతున్న నదులూ…ఒక వైపు నువ్వూ.
ఒక వైపు దాహర్తితో ఉన్న లోకం…ఒక వైపు నువ్వూ.
అయ్యా శభాష్ ! ఏం చెప్పను నీ వైభవం?
నీళ్ళ వ్యాపారివి నువ్వు,
ఆటా నీదే ఆటగాడివీ నువ్వే,
పరచి ఉన్న చదరంగం పావులూ నీవే.
నీరంతటినీ పీల్చేస్తున్నావు,
నదులూ సముద్రాలు దోచేస్తున్నావు,
గంగా యమునా గుండెలమీద,
బండరాళ్ళనే బద్దలుచేస్తున్నావు.
అబ్బా !నీ ఈ స్వార్థం
ఎన్నాళ్ళీ నీ దాష్టీకం
ఈ నేల కదిలిన రోజున
నీ తల పొగరంతా దిగిపోదా!
ఇళ్ళూ వాకిళ్ళు కొట్టుకుపోవా
శిధిలాలే ఇక మిగులిపోవా
బొట్టు బొట్టుకీ మొహం వాచి
ఇక ఏం చేస్తావో చెప్పు వ్యాపారీ !
ఇవాళ పండగ జరుపుకుంటున్నావు
నదులనే దాహానికి గురిచేస్తున్నావు
గంగని బురదగా మారుస్తున్నావు
ఈ భూమి కంపిస్తే ఏంచేస్తావు?
వరల్డ్ బ్యాంక్ టోకెన్ పట్టుకొని ఎక్కడికి వెళ్తావ్?
ప్రాజెక్టులు వేస్తూ ఏం చేస్తావు?
అప్పుల పాలై దిక్కులు చూస్తావు
ఒకవైపేమో ఎండిన నదులూ…ఒక వైపు నువ్వూ.
ఒకవైపేమో దాహార్తితో ఉన్న లోకం…మరోవైపు నువ్వూ !
***
గిరీష్ చంద్ర్ తివారీ నాటక రచయిత, దర్శకుడు, గేయ రచయిత, గాయకుడు, సామాజిక కార్యకర్త . 1945 లో ఉత్తరాఖండ్ లో పుట్టాడు.’చిప్కో’ ఉద్యమంలోనూ ,’ఉత్తరాఖండ్ ఆందోలన్’ లోనూ పాల్గొన్నాడు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లోని ‘సాంగ్ అండ్ డ్రామా’ విభాగంలో తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నాడు. తన కవితా రచనకే పూర్తి సమయాన్ని కేటాయించి, వాటిని తానే స్వయంగా పాడేవాడు. 2010 లో అనారోగ్యంతో మరణించాడు.
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
